రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More

‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం: సుభాష్‌ పాలేకర్‌

పర్యావరణ సమతుల్యానికి యూరియా, రసాయన ఎరువుల వాడకంతో ఏర్పడుతున్న సమస్యల కారణంగా గ్రామాల నుంచి పెద్దఎత్తున నిధులు బయటకు వెళ్తున్నాయని, ‘మారిన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో పండించిన పంటలే ఇందుకు కారణమని, గ్రామాల నుంచి ఇంతలా నిధులు బయటకు వెళ్తుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రకృతి వ్యవసాయమే దీనికి పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారం వల్ల క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు దరిచేరవు. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణం సమతుల్యమవుతుంది’ అని నిన్న హైదరాబాదులో జరిగిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాల సభలో పాల్గొన్న సుభాష్‌ పాలేకర్‌ అన్నారు.

Read More

నెల రోజులపాటు పాలేకర్‌ సాగు విధానంపై అవగాహన

సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్పీకే) విధానంలో పంటలు సాగు చేయాలనే ఔత్సాహికులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయనున్నట్లు సేవ్‌ సంస్థ ప్రతినిధి విజయరామ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి నలుగురు ప్రతి నిధులు సెప్టెంబరు 2న హైదరాబాద్‌ దోమలగూడలోని శ్రీరామచంద్రమిషన్‌లో ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల ప్రతినిధులు, యోగా గురువులు, విశ్రాంత ఉద్యోగులు వంటి వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు.

Read More