ఉద్యాన విద్యార్థులకు అంకుర శిక్షణ
తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు అంకురాలపై శిక్షణ ఇచ్చి వాటి స్థాపనకు సహకరిస్తామని ఉపకులపతి దండా రాజిరెడ్డి తెలిపారు. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్)లో శుక్రవారం వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అంకురాల యుగం నడుస్తోందని, ఉద్యానవన విద్యార్థులను నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అంకురాలపై ప్రోత్సహించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. సమావేశంలో నార్మ్ జేడీ గోపాలాల్, ఐడియా సీఈవో సెంథిల్ వినాయగం, మోజెర్ల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ సైదయ్యలు పాల్గొన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహం: రాష్ట్రం నుంచి ఉద్యాన పంట దిగుబడుల ఎగుమతులను ప్రోత్సహిస్తామని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో దృక్పథ ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యాన పంటలు రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.










