ANGRAU వైస్‌ఛాన్స్‌లర్ (ఇన్‌ఛార్జి )గా డా. పాలడుగు సత్యనారాయణ

ఆంధ్రా రైస్‌మాన్‌గా పేరొందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ (ఇంఛార్జి)గా నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు 1983 బ్యాచ్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. వీరి కృషితో 40కు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలు వరి పంటలో రావటం జరిగింది. దేశంలో దాదాపు 7 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో వీరు అభివృద్ధి చేసిన వంగడాలు సాగులో ఉండటం వీరి ప్రత్యేకత. వీరికి డా. ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారంతో పాటు 2012లో రైతునేస్తం పురస్కారం, మరెన్నో ఇతర పురస్కారాలు లభించాయి. వీరి మార్గదర్శనంలో విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, రైతుల హృదయ స్పందన కావాలని, ఆ ప్రయత్నంలో విజయవంతం కావాలనీ మనఃపూర్వకముగా ‘రైతునేస్తం’ కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తోంది.

Read More

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

గుడ్లు తలసరి వినియోగం 103 నుంచి 106కి పెరిగింది

మన దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ (చైనా తర్వాత) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి (2024-25 లో) తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంతకుముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉంది. ప్రధానంగా 2024-25 లో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పశు సంవర్ధకశాఖ సోమవారం ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు…
2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (18.37%), తమిళనాడు (15.63%), తెలంగాణ (12.98%), పశ్చిమ బెంగాల్ (10.72%), కర్ణాటక (6.67%) నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలే 64.37% వాటాను కలిగి ఉన్నాయి. 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే సగానికి (50 శాతానికి పైగా ఉత్పత్తి అవుతుండటం విశేషం.
2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగం ఏడాదికి 79 నుంచి 106 గుడ్లకు పెరిగింది. గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు (106) ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (516), తెలంగాణ (510), తమిళనాడు (302), హరియాణా (299), పంజాబ్ (164) తలసరి వినియోగంలో ముందున్నాయి.

పురోగతికి దోహదపడిన అంశాలు..
దేశంలో పౌష్ఠికాహారం పై అవగాహన పెరగడంతో పాటు ఆధునిక కోళ్ల ఫారాల్లో శాస్త్రీయ విధానాలు, మెరుగైన దాణా, వ్యాధి నిరోధక టీకాలను వినియోగించడం వల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
మాంసం, ఇతర ప్రొటీన్ ఆహారాలతో పోలిస్తే, గుడ్డు సామాన్యులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. గుడ్లలోని అద్భుత పోషక విలువల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు గుర్తిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించడం... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేయడం గుడ్ల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి.
Read More

పశు పోషకులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్

ఆంధ్రప్రదేశ్ పభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (పీకేసీసీ) పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులు వారి వద్దనున్న పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీ కత్తూ లేకుండా 7శాతం వడ్డీపై రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తారు. అంటే 4 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ పథకానికి అరుÝలని పశు సంవర్ధకశాఖ సంచాలకుడు టి.దామోదరనాయుడు సోమవారం తెలిపారు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు పెంచే రైతులు ఎవరైనా ఈ పథకం కింద రుణాలు పొందవచ్చని సూచించారు. సమీప బ్యాంకులకు వెళ్లి పీకేసిసీ దరఖాస్తు పొందవచ్చు. భూమి పత్రాలు, ఆధార్, పశువుల వివరాలు, సంబంధిత పశు వైద్యాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, రైతు ఫొటో సమర్పించాలి. బ్యాంకు నిబంధనల ప్రకారం రుణాన్ని మంజూరు చేస్తారు.

Read More

విడుదలైన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు

రైతుభరోసా రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో విడుదలైన వెంటనే జమ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుభరోసాపై ఆదివారం తన నివాసంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో సోమవారం సీఎం చేతుల మీదుగా 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం రూ.2,206.06 కోట్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ సహా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తెలియజేయాలని సూచించారు. సీఎం నిధులను విడుదల చేయగానే ఆ నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో వెంటనే జమ కావాలన్నారు. మొదటి విడతలో కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను నిలిపివేయడం వల్ల వారికి నిధులు అందలేదని, ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.

శనగ, పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేయాలి*మొక్కజొన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘పంటలకు మద్దతు ధరల ప్రకటనకే కేంద్రం పరిమితమవుతోంది. మద్దతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొనుగోలులో కొత్త విధానంతో పత్తి రైతులను నష్టపరిచేందుకు పథకం వేస్తోంది. శివరాజ్‌సింగ్ ఈ వ్యవహారాలను సమీక్షించి రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి’ అని తుమ్మల లేఖలో కోరారు.

Read More

90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More

రేపు తిరుపతిలో ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళన కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో రేపు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ప్రథమ ప్రోత్సాహకులు డాక్టర్ కోటపాటి గంగాధరం అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్, విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్, ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ సావల రేవద్దత్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హాజరవుతారన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అయ్యపనాయుడు, రాంజీ, జయరాం, పరమేశ్వరి పాల్గొన్నారు.

Read More

నకిలీ విత్తనాల వలన రైతులకు పరిహారం

హైదర్‌గూడలోని శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ధన్య సీడ్స్ సంస్థలను నకిలీ మిరప విత్తనాల విక్రయం కేసులో నష్టపోయిన రైతులకు రూ.16.80 లక్షలు చెల్లించాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన ఎనిమిది మంది రైతులు 2017లో వేర్వేరుగా దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అనంతరం ఒక్కో రైతుకు రూ.2 లక్షల పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేల చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఏ. వీరన్న, జి. వెంకన్న, ఎం. ముఖేష్, రామ్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్, టి.వెంకట్‌రెడ్డి, వి. యాకుబ్ రెడ్డి 2016 జులైలో శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి ‘ధన్య మిరప విత్తనాలు’ కొనుగోలు చేశారు. టాటా సంస్థ ఉత్పత్తిగా ప్రచారం చేసిన ఈ విత్తనాలు తెలంగాణ వాతావరణానికి సరిపోతాయని డీలర్ హామీ ఇవ్వడంతో ఒక్కొక్కరు రూ.300కి ఒక ప్యాకెట్ చొప్పున అవసరమైనన్ని కొనుగోలు చేశారు. వీటిని పొలంలో చల్లగా నవంబరు నాటికి మొక్కలు ఏపుగా పెరిగినా పూత, దిగుబడి రాలేదు. దీంతో 2016 నవంబరు 29న మహబూబాబాద్ ఏఈవోకు ఫిర్యాదు చేయగా.. డిసెంబరు 17న జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారి పొలాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా రైతులంతా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విత్తనాలు నాణ్యమైనవే అని నిర్ధారించే ల్యాబ్ రిపోర్టులున్నాయని ప్రతివాదులు కమిషన్‌కు తెలుపగా… ఆ రిపోర్టుల్లో తేదీల వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఇనెస్పెక్షన్‌కు కంపెనీ ప్రతినిధి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం రైతులకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Read More