తేనెటీగలు కుట్టకుండా కాపాడుకోవడం ఎలా?

వివిధ జాగ్రత్తలు తీసుకొనినప్పటికిని తేనెటీగలను పెంచుకునేవారు, తేనెటీగల కాట్లకు (stings) అలవాటు పడిపోతారు. అయినప్పటికిని, పరిశ్రమలోవున్న వారందరును, వీటినుండి తప్పించుకొనుట ఎలా అను విషయమును తెలుసుకొనవలెను. కొన్ని సామాన్య నియమములు వున్నవి. వీటిని పాటించి కనీసము, కుట్టు సమయములను తగ్గించుకొనవచ్చును.

• తేలిక రంగు, మృదువుగా గల వస్త్రములను ధరించుకొనవలెను. ఇలాంటి వస్త్రములు ధరించుకున్నపుడు కుట్టే అన్నికీటికములు కూడా తక్కువగా కుడతాయి.

• తలకు రాసుకునే హెయిర్ ఆయిల్, గడ్డము గీచుకున్న తరువాత వాడు లోషన్లు (after shaves) పరిమళాలు (perfumes) మరియు ఇతర ఇంపైన సువాసనలు (sweet smellings) వెదజల్లు పదార్ధములను వాడరాదు. ఇవి కుట్టే కీటకములను ఆకర్షిస్తాయి. తీయటి వాసనలుగల, సువాసనలు వెదజల్లు పుష్పములమీద ఆహారము సేకరించుకునే కీటకములు, పరిమళములు పూసుకున్న వ్యక్తి వద్దకు పొరపాటున ఆహారమూలమని (food) ఆకర్షించబడతాయి.

• ప్రతిదినము స్నానము చేయవలెను. శుభ్రమైన వస్త్రములను ధరించవలెను. కుట్టేకీటకములకు చెమట, చికాకును కల్గిస్తుంది. తేనెటీగల పెంపకదారులు గమనించినదేమనగా తేనెటీగలు చాల తరచుగా, చెమటతో నిండిన చేతిగడియారము ప్రాంతములో కుట్టడము.

• శరీరమును సాధ్యమైనంత పూర్తిగా కప్పుకొనవలెను. పొలములో నడిచేటపుడు మోకాళ్ళ వరకు వుండే బూట్లు ధరించడము మంచిది. లేక తెలుపు కాటన్ సాక్సులు ధరించవలెను. తలను, వెంట్రుకలను గడ్డిటోపీతో (straw hat) లేక తేలికరంగులో వున్న చేతి రుమాలుతో కప్పుకొనవలెను. ఇలా చేసినట్లయితే కుట్టే తేనెటీగలు తలవెంట్రుకలలో చిక్కుకొనకుండా ఆపుచేయవచ్చును.

• వెచ్చని దినములలో కొత్త స్థలములో కూర్చొని, భూమిమీద మరియు చెట్లపైన కందిరీగల గూళ్ళు వున్నవేమోనని, ఎగురుచున్న కందిరీగలను గమనించవలెను. వసంత కాలములో సాంఘిక జీవనము చేయు కందిరీగలు వాటి గూళ్ళను కట్టుకుంటాయి. వర్షానంతరము కల్లా ఒకేఒక అడకీటకము ప్రారంభించిన గూటిలో అనేక వేల కందిరీగలు వుండవచ్చును. సంఖ్య పెరిగేకొలది ఎగిరే కీటకముల సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కసారి వెచ్చని వాతావరణము వచ్చిన తోడనే పెద్దసంఖ్యలో కందిరీగలను కనిపెట్టవచ్చును. మరియు నాశనము చేయవచ్చును.

• వదిలివేయబడిన ఆహారమును, చెత్తను తొలగించవలెను. లేనిచో కందిరీగలు వాటిని ఆహారముగా తీసుకుంటాయి. అనేక సాంఘిక జీవనము చేయు కందిరీగలు పట్టణాలలో నివసిస్తాయి. వయోజన కందిరీగలు, సోడా, పాలు, జామ్ మొదలగువాటిని ఆహారముగా తీసుకుంటాయి. ఇవి రొట్టెను, ఇతర వదిలివేయబడిన ఆహారములను వాటి లద్దెపురుగుల కొరకు సేకరించుకుంటాయి.

• ఒక వ్యక్తి అనేక కుట్టే కీటకములచే ఒకేసారి దాడిచేయబడినప్పుడు పరుగెత్తవలెను. ఒక పట్టును కలవరపరచినపుడు లేక విరుగగొట్టిన సమయములో మాత్రమే ఇలాంటి దాడి మనుషుల మీద వుంటుంది. తలుపులు మూసివున్నగదిలోనికి గాని లేక ఇతర ఏస్థలము కనబడని పక్షములో నీటిలోనికి దుమకవలెను. అవకాశముంటే బహిరంగస్థలముకంటే గూడ నీడగల ప్రదేశములోనికి పరుగెత్తుట ఉత్తమము. కోపముతో నిండిన కుట్టే కీటకములకు పొదలలోగాని అరణ్యములోనికిగాని వెంటబడి తరుముట కష్టము.

• ఒకే ఒక కుట్టే కీటకము వెంబడిస్తూ వున్నట్లయితే మఖమును క్రిందకు పెట్టుకొని నేలమీద పడుకొనవలెను. కందిరీగలు మరియు తేనెటీగలు కళ్ళు, ముక్కు మరియు చెవుల చుట్టూ కుట్టడానికి ఎక్కువ అవకాశములుంటాయి. ఎందుకనగా వీటిని కదులుతూ లేక కదులుతూవున్న ఛాయచిత్ర రూపములుగా తేనెటీగలు కనుగొంటాయి.

• కారు అద్దం గుండా కుట్టే ఈగ ప్రవేశించినట్లయితే కారును ఆపుచేయవలెను. కందిరీగగాని లేదా తేనెటీగ గాని, కదిలే కారులోనికి ప్రవేశిస్తే, అది కుట్టడం కన్నా, కారు నుండి తప్పించుకొనడానికే ప్రయత్నిస్తుంది. అలాంటపుడు కారును నెమ్మదిగా ఆపి, రోడ్డు మార్జిన్లో దించి, సాధ్యమైనంతవరకు కదలకుండా వుండవలెను. కారును ఆపిన తరువాత అన్ని అద్దాలను తెరవవలెను. ఆ కీటకము త్వరగా తప్పించుకొనుటకు మార్గమును కనుగొంటుంది.

First aid for bee stings – తేనెటీగల కాటుకు ప్రాధమిక చికిత్స
ఒక కూలిఈగ కుట్టినపుడు, దాని యొక్క ఉదరపు (tip of the abdomen) కొన తన మిగతా శరీరభాగములకు సమాంతరముగా ఉండి తన శత్రువును కుట్టినపుడు ముల్లు (sting) యొక్క పొడవులో కనీసము సగభాగము, శత్రువు శరీరములోనికి దించి తిరిగి వెనుకకు లాగుకుంటుంది. భౌతికముగా ముల్లు శరీరంలోకి దిగినందు వలన మరియు తేనెటీగలో ఉన్న విషం వలన నొప్పి వెను వెంటనే కలుగుతుంది.

ప్రాధమిక చికిత్సలో భాగముగా శరీరము నుండి ముల్లును వెంటనే తీసి వేయవలెను. ఎక్కువ మంది తేనెటీగల పెంపకము దారులు ముల్లును శరీరము నుండి వదిలించు కొనుటకుగాను, హైవ్ టూల్ లేదా గోటితో తీసివేస్తుంటారు. కొంత సమయం తీసుకొని కత్తికొరకు వెదకి ముల్లును తీసివేయుట కొరకు సమయాన్ని వృధా చేయడం అనవసరము. తేనెటీగలను పట్టుకొని బలవంతముగా ముల్లును బయటకు లాగి గోరుమీద ఉంచినట్లయితే విషమంతా వెంటనే వేగముగా దాదాపు బయటకు రావడము కన్పిస్తుంది. తేనెటీగ విషము అనేక సంక్లిష్ట పదార్దములు అనగా నొప్పిని, వాపును మరియు దురదను, అనేక దినముల వరకు కలుగజేయు విధముగా రూపొందించబడింది. ఒక్కసారి విషము శరీరములోనికి ప్రవేశించినపుడు దానిని తొలగించు మార్గము లేదు, విషప్రభావమును తొలగించు పదార్ధములు గాని విరుగుడు గాని లేదు. ప్రాధమిక చికిత్సలో భాగముగా, శరీరంలో కలిగే నొప్పిని ఉపశమనం పొందుటకును గాయమునకు సూక్ష్మజీవులు సంక్రమించకుండా (Infection) గురికాకుండా చేసికొనవలెను.

తేనెటీగ కుట్టినపుడు మంచుగడ్డ (ice)ను ఆ భాగము మీద ఉంచినట్లయితే బాగా ఉపశమనము పొందవచ్చును, ఇతర ఏ రకమైన చికిత్సల కంటే కూడ, ఆల్కహాల్ ను రుద్దడము ద్వారా ఆల్కహాలు ఆవిరయ్యి చల్లదనమును శరీరము మీద కలుగజేస్తుంది. దీనిని కూడా ప్రాధమిక చికిత్సలో భాగంగా చెప్పుకొనవచ్చును. వ్యాపార పరంగా తేనెటీగలను పెంచుకొనువారికి దాదాపుగా ప్రతిరోజు తేనెటీగలు కుడుతూనే ఉంటాయి. వారు తేనెటీగల విషానికి తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటారు.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.

Read More

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక విషపూరిత మొక్కలు, వాటి యొక్క ప్రబావం

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం కొంతమంది రైతులకు ముఖ్యమైన ఉపాధి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే పశుపాలనగా ఇది గుర్తింపు పొందింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల తగ్గుదల, పచ్చిక కొరత, పశుపోషణ లోపాల వల్ల గొర్రెలు, మేకలు తినరాని కొన్ని స్థానిక మొక్కలను తిని విషబాధకు గురవడం మన రాష్ట్రంలో తరచూ కనిపిస్తోంది. ఈ సమస్య వల్ల జంతువులు అనారోగ్యానికి గురై, కొన్నిసార్లు మరణించడమూ జరుగుతుంది. అందుకే రైతులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

విషపూరిత మొక్కలు అంటే ఏమిటి?
గొర్రెలు, మేకలు సాధారణంగా పచ్చిక, ఆకులు, కొమ్మలు తింటాయి. కానీ కొన్ని మొక్కల్లో సహజంగానే విషపదార్థాలు ఉంటాయి. అలాంటి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఆ విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ, నరాలు, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దీనినే మొక్కల వల్ల వచ్చే విషబాధ అంటారు.

ఈ విషబాధ ఎక్కువగా:
• వేసవిలో పచ్చిక కొరత ఉన్నప్పుడు
• కరవు పరిస్థితుల్లో
• అడవుల్లో మేపేటప్పుడు
• పొలాల అంచుల్లో నిర్లక్ష్యంగా మేపినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.

తెలంగాణలో సాధారణంగా కనిపించే విషమొక్కలు

లంతెన (గండ్ల పూల చెట్టు)

ఈ మొక్క తెలంగాణ అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. దీని ఆకులు, పువ్వులు తిన్న గొర్రెలు, మేకల్లో:
• ఆకలి తగ్గిపోవడం
• నోరు పచ్చగా మారడం
• కడుపు ఉబ్బడం
• బలహీనత
• క్రమంగా చనిపోవడం కనిపిస్తాయి.

తుమ్మ చెట్టు

తుమ్మ ఆకులు ఎక్కువగా తింటే:
• నోటిలో గాయాలు
• మేత తినకపోవడం
• జీర్ణక్రియ లోపించడం వంటివి వస్తాయి

కందగడ్డి / అడవి కంద

ఇవి తిన్నప్పుడు:
• వాంతులు
• విరేచనాలు
• నడవలేకపోవడం
• అకస్మాత్తుగా పడిపోవడం కనిపిస్తాయి.

నల్ల ఉసిరి / అడవి ఉసిరి

ఇది తినడం వల్ల:
• కాలేయానికి నష్టం
• కళ్లు పసుపు రంగులో మారడం
• మూత్రం ముదురు రంగులో రావడం వంటివి కనిపిస్తాయి.

అడవి పొగాకు

ఈ మొక్క తిన్న మేకల్లో:
• నరాల బలహీనత
• వణుకు
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
• చనిపోవడం కూడా జరుగుతుంది.

విషబాధకు కారణాలు

  1. పచ్చిక కొరత వేసవిలో పచ్చిక దొరకకపోవడంతో జంతువులు దొరికిన మొక్కలన్నీ తింటాయి.
  2. ఖనిజాల లోపం ఉప్పు, ఖనిజాల లోపం ఉన్నప్పుడు జంతువులు అసాధారణంగా ఇతర మొక్కలను తింటాయి.
  3. అడవుల్లో నిర్లక్ష్య మేపకం అడవుల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా మేపితే విషమొక్కలు తినే ప్రమాదం ఎక్కువ.
  4. పొలాల్లో రసాయనాల ప్రభావం మందులు పిచికారీ చేసిన తర్వాత మేపడం వల్ల విషబాధ వస్తుంది.

లక్షణాలు (గుర్తించే విధానం)
విషమొక్కలు తిన్న గొర్రెలు, మేకల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి:
• మేత తినకపోవడం
• ఎక్కువగా నోరు నుంచి నురుగు రావడం
• కడుపు నొప్పి, ఉబ్బరం
• విరేచనాలు లేదా మలబద్ధకం
• నడవలేక కూలిపోవడం
• శ్వాస వేగంగా తీసుకోవడం
• అకస్మాత్తుగా మరణం

లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి.
చికిత్స (ప్రాథమిక చర్యలు)

  1. వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి
  2. అనుమానాస్పద మొక్కలు తినకుండా జంతువులను వేరుచేయాలి
  3. శుద్ధమైన నీరు ఇవ్వాలి
  4. డాక్టర్ సూచన మేరకు:
    o యాంటీడోట్ మందులు
    o గ్లూకోజ్ డ్రిప్
    o కాలేయ రక్షక మందులు ఇవ్వాలి

గమనిక: ఇంటి చిట్కాలు వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.

నివారణ చర్యలు (అత్యంత ముఖ్యమైనవి)
• పశువులకు సరిపడా పచ్చిక, ఎండుగడ్డి అందించాలి
• ఉప్పు, ఖనిజ మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి
• పొలాల అంచుల్లో, అడవుల్లో విషమొక్కలను తొలగించాలి
• మందులు పిచికారీ చేసిన పొలాల్లో మేపకూడదు
• రైతులకు విషమొక్కలపై శిక్షణ ఇవ్వాలి

సారాంశం
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక మొక్కల వల్ల వచ్చే విషబాధలు రైతులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ సరైన అవగాహన, జాగ్రత్తలు, సమయానికి చికిత్స ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు ఆర్థికంగా ముందుకు సాగగలడు. అందుకే ప్రతి పశుపోషకుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

ఔషధమొక్క… వస

వస మొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేమ ప్రదేశంలో బహువార్షిక మొక్క. ఆకులు దళసరిగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. ఈ మొక్క దుంప నేలలో ఉంటుంది. లేత పసుపు రంగు పూవులు ఒక దొప్పలో అమరిఉంటాయి. గోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలోను, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే ఇది సాగు చేయబడుతుంది. ఈ మొక్క వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఆకులను, దుంపలను వ్యవసాయంలో కీటకనాశనిగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క వేర్లలో ఎకోరిన్, కెలామిన్, యూజినాల్, ఆల్ఫాఎసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి.

సాధారణ నామం : స్వీట్ ఫ్లాగ్ శాస్త్రీయ నామం : అకోరస్ కలామస్ కుటుంబం : అకోరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేరును ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగిస్తారు.
  • వ్యవసాయంలో కీటకనాశనిగా, తెగుళ్ళ నివారిణిగా….
  • ఆకులు, వేర్లలో ఉన్న రసాయనాలకు కీటకనాశని లక్షణాలు ఉన్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులు, తెగుళ్ళ నివారణలో ఈ రసాయనాలెంతగానో ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • విత్తన నిల్వలలో ఆశించే పురుగులు : విత్తన నిల్వలలో ఆశించే పురుగుల నియంత్రణకు 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి ఉంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాలను పురుగులబారినుండి కాపాడుకోవచ్చు. వరి ధాన్యాన్ని ఆశించే ముక్కుపురుగు, పప్పుధాన్యాలను (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు. వస దుంపల పొడికి ఉండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
  • పేనుబంక, ఆర్మివర్మ్, కాటన్ స్టెయినర్, పెద్దక్యాబేజి వర్మ్, ఆవాల రంపపు ఈగ, విత్తన నిల్వలో ఆశించే పురుగులను వస దుంప కషాయం నివారిస్తుంది.
  • దుంప కషాయం తయారు చేసే పద్ధతి (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
  • ఎండిన దుంపలను దంచి 20 గ్రాముల పొడిని కుండలోని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజు నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి 8 మి.లీ. సబ్బు నీరు కలిపి మరుసటి రోజు ఉదయం పంటపై పిచికారి చేయాలి.
  • విత్తన శుద్ధి (విత్తనాల నాశించే పురుగులు, తెగుళ్ళ నివారణ) (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1998)
  • ఒక మట్టి కుండలో 2.5 లీటర్ల నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత 1 లీటరు ఆవుమూత్రం 50 గ్రా. దుంపపొడి కలిపి కర్రతో త్రిప్పాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కలపాలి. పైకి తేలిన విత్తనాలను తొలగించి 15 నిమిషాలు ఉంచి ఆరబెట్టి విత్తాలి.
Read More

పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు

కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.

తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.

  • చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
  • ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
  • పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
  • చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.

పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు

పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.

Read More

వండని వంట… పప్పు పచ్చడి

పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.

దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.

ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.

  • శ్రీమతి లతా కృష్ణమూర్తి
Read More