ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల వినియోగం తగ్గుతోంది. హైదరాబాదు నగరంలో చాలామంది రోజుకు 250 గ్రాములకు మించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తినడం లేదని నిపుణులు చెబుతున్నారు. అది కూడా రోజూ ఏదో ఒక రకం పండు లేదంటే ఆకుకూరకు పరిమితమవుతున్నారు. రోజూ 250 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలుంటే మరో 150 గ్రాముల వరకు పండ్ల శాతం ఉండాలంటున్నారు.
ప్రయోజనాలు..
పండ్లు, కూరల్లో మేలు చేసే విటమిన్లు, పోషకాలు, ఫోలిక్ యాసిడ్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో పీచు ఎక్కువ. పండ్లలోని సాల్యుబుల్ పీచు వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. పీచు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉన్న భావనతో చిరుతిళ్ల జోలికి పోరు. ఫలితంగా ఊబకాయం రాదు. పండ్లు, ఆకుకూరల్లో ఉన్న పీచు వల్ల మలబద్దకం దరిచేరదు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. పండ్లు, కూరల్లో పొటాషియం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజితం చేస్తాయి. జుట్టు రాలటం, చర్మం ముడతలు, వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తాయి.
మంచి బ్యాక్టీరియా పెరుగుతంది : డాIIలక్ష్మయ్య మాజీ శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ
నగరంలో జంక్ ఫుడ్స్ వినియోగం పెరిగి చాలామంది పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలకు ఆహారపుటలవాట్లే కారణం. పండ్లు, ఆకుకూరలు విరివిగా తీసుకుంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జబ్బులకు అడ్డుకట్ట వేయవచ్చు. నిత్యం పెద్దలు 400 గ్రాములు, 18 ఏళ్లలోపు పిల్లలు 250 గ్రాముల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో మిళితం చేసుకోవాలి.

19 Jan, 2026
