‘యాక్సెస్‌ అండ్‌ బెనిఫిట్‌ షేరింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం పండిస్తున్న 198 మంది రైతులతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బిఏ) ప్రకటించింది. ఎర్రచందనం పరిమాణాన్ని బట్టి ఇందులో ఒక్కో రైతుకు రూ. 33 వేల నుంచి రూ. 22 లక్షల దాకా అందుతుందని తెలిపింది. జీవవైవిధ్య సంరక్షణ కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక అటవీ శాఖలు, ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండళ్లకు రూ.48 కోట్లు, తమిళనాడు రైతులకు రూ.55 లక్షలు విడుదల చేసినట్లు ఎన్‌.బి.ఏ. వెల్లడించింది. ప్రస్తుతం ఏపీకి విడుదల చేసిన రూ. 3 కోట్ల మొత్తం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 48 గ్రామాల్లో ఉన్న 198 మంది రైతులకు వెళ్తుందని తెలిపింది.