చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు (ఖరిజిజిలిశిరీ) ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. ఇందులో ప్రాముఖ్యత సంతరించుకున్నవి 5 సిరిధాన్యాలు. అవి…
1. కొర్రలు
2. అరికలు
3. సామలు
4. ఊదలు
5. అండుకొర్రలు
సిరిధాన్యాల విశిష్టత:

సహజ పీచు పదార్థం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం (ప్రతీ మానవుడికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకు కూరల నుండి పొందవచ్చు. ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తిని కలిగి ఉన్నాయి.
వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.
1. కొర్ర బియ్యం – సమతుల్యమైన ఆహారం. 8 శాతం పీచుపదార్థంతో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్ఛలు వస్తాయి, అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి
వాటిని పోగొట్టగలిగే లక్షణం వీటికి ఉంది, నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్మా (అరికెలతో పాటుగా) నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
2. అరికల బియ్యం – రక్త శుద్ధికీ, ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, క్లోమ గ్రంధులు, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి, అధికంగా చక్కెర వ్యాధి వారికి కూడా అరికలు మేలు చేస్తాయి. డెంగ్యు, టైఫాయిడ్, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.
3. సామ బియ్యం – మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకరణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.
4. ఊద బియ్యం – థైరాయిడ్, క్లోమ గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం,మూత్రాశయం, గాల్ బ్లాడరు శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి.
5. అండుకొర్ర బియ్యం – మొలలు, మూలశంక, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సకు బాగాఉపయోగపడతాయి.
చిరుధాన్య పంటలకు ఎలాంటి ఎరువులు వాడాలి?
మెట్ట భూముల్లో రసాయన ఎరువుల వాడకుండానే చిరుధాన్య పంటలు బాగా పెరుగుతాయి. అందువలన చిరుధాన్యాలను పండించే రైతులు పర్యావరణ పరిస్థితులలో పశువుల ఎరువునుపయోగించి వీటిని పండిస్తారు. ఇటీవలి కాలంలో రైతులు తమ పెరటిలో స్వయంగా తయారు చేసుకున్న వర్మికంపోస్టు తదితర జీవన ఎరువులను, పంటల పెరుగుదలను పెంచే పంచగవ్య, అమృతపాని మొదలగు వాటినుపయోగించి చిరుధాన్య పంటలను పండిస్తున్నారు.
చిరుధాన్యాల పంటల సరళి : సంప్రదాయ పద్ధతుల్లో పండించే చిరుధాన్య పంటలు కేవలం పంటలేకాక, ఈ చిరుధాన్య క్షేత్రాలలో జీవవైవిధ్యముంటుంది. ఒకే పొలంలో ఒకేసారి 6 నుండి 12 పంటలను సాగు చేస్తారు. దక్షిణ భారతదేశంలో పన్నెండు పంటల పద్ధతిలో చిరుధాన్య పంటలను ఆపరాలు, నూనెగింజల పంటలతో కలిపి సాగు చేస్తారు.
ఆహార భద్రత : వరి, గోధుమ వంటి పంటలు భారతదేశానికి ఆహారభద్రత అందిస్తే, చిరుధాన్యాలు ఆహారం, పోషకాలు, పశుగ్రాసాలు, పీచు, ఆరోగ్యం, జీవనాధారం, పర్యావరణం వంటి అనేక భద్రతలనందిస్తాయి. అనేక చిరుధాన్య పంటల కాండాలను పశువులు ఇష్టంగా తింటాయి. అనేకసార్లు జొన్న, సజ్జ వంటి పంటలను పశుగ్రాసాలుగానే సాగు చేస్తారు. పశుగ్రాసాలగానే కాక, చిరుధాన్య పంటలు పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి. సహచర పంటలుగా పండించే లెగ్యూమ్ జాతి పంటలు ఆకులను రాల్చి సహజ ఎరువుగా భూసారాన్ని వృద్ధి చేస్తాయి. ఆ విధంగా చిరుధాన్య పంటలు భూసారాన్ని ఉపయోగించుకోడమే కాకుండా భూమికి తిరిగి అందిస్తాయి.
ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది?
1. కొర్రలు: నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ద్రయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుంచి విముక్తి.
2. అరికలు: రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబిటిస్, మలబద్ధకం, మంచినిద్ర.
3. ఊదలు: లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంథులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.
4. సామలు: అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి, సంతానలేమి సమస్యల నివారణ
5. అండుకొర్రలు: జీర్ణాశయం, ఆరయిటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.
ఆరోగ్య ప్రయోజనాలు
* అందుబాటులో ఉన్న ధాన్యాలలో చిరుధాన్యాలు అతి తక్కువ అలర్జి కలిగించి, జీర్ణశక్తిని పెంచే ధాన్యాలు.
* చిరుధాన్యాలలోని నీటిలో కరుగని పీచు పదార్థం ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తుంది.
* చిరుధాన్యాలలో నరాల వ్యవస్థకు మంచి కలిగించే లెసితిన్ అధిక పరిమాణాలలో ఉంటుంది.
* చిరుధాన్యాలలో ఉండే మెగ్నీషియం మైగ్రెన్, అధిక రక్తపోటును, గుండెపోటులను తగ్గిస్తుంది.
* చిరుధాన్యాలు టైప్2 డయాబెటీస్ను తగ్గిస్తాయి.
* చిరుధాన్యాలలో జన్యుకోడ్ నిర్మాణానికి ముఖ్యమైన న్యూక్లిక్ యాసిడ్లలో ఉండే భాస్వరం ఎక్కువగా ఉంటుంది.
* చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే స్త్రీలలో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, పిల్లల్లో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి.
* మెనోపాజ్ తర్వాత స్త్రీలలో గుండె సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించి చిరుధాన్యాలు లాభం కల్గిస్తాయి.
* చిరుధాన్యాలలో ఉండే బహుళ పోషకాలు కలిగిన లిగ్నాన్లు రొమ్ము క్యాన్సర్తో పోరాడి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
చిరుధాన్యాలను ఏ భూముల్లో పండించవచ్చు
అనేక చిరుధాన్యాలను అతితక్కువ సారవంతమైన భూముల్లో పండించవచ్చు. కొన్నింటిని ఆమ్లభూముల్లో, కొన్నింటిని చౌడుభూముల్లో సాగు చేయవచ్చు. సజ్జను ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. నిజానికి రాగిని చౌడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. వరి పంట పండని భూముల్లో కూడా ఊదలు పండుతాయి. సమస్యాత్మక భూములను సరిచేయడానికి కూడా చిరుధాన్య పంటలు సాగు చేయవచ్చు
మెట్ట ప్రాంతాలలోని భూములు ఎక్కువగా సారం లేని భూములే. మెట్ట ప్రాంతాలలో వ్యవసాయాన్ని సుస్థిరపరచే పంటలు చిరుధాన్యాలే. చిరుధాన్య పంటలు సగటు వర్షపాతం 500 మి.మీ. కన్నా తక్కువ వున్న ప్రాంతాలలో, ఇసుక, ఆమ్ల నేలల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని దిగుబడులనివ్వగల సమర్థవంతమైన పంటలు
బి. నవ్య (గృహ విజ్ఞాన శాస్త్రవేత), డా. కిరణ్ పిల్లి, (మృత్తిక శాస్త్రవేత్త), డా. వినోద్ కుమార్ (విస్తరణ విభాగం శాస్త్రవేత్త), డా. ఎ. శ్రీనివాస్ (ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అండ్ హెడ్), కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా, పెద్దపల్లి జిల్లా

