పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్‌1/ఎల్‌2/ఎల్‌ జిన్నింగ్‌ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్‌ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.

Read More

కేంద్ర విత్తన చట్టంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల చట్టాన్ని చేర్చాలి

తెలంగాణ ఉద్యాన నర్సరీల నమోదు (నియంత్రణ) చట్టం-2010ని కేంద్ర విత్తన చట్టం-2025లో చేర్చాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖను కోరింది. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి నేతృత్వంలో కేంద్ర విత్తనచట్టం ముసాయిదా కోసం రూపొందించిన ప్రతిపాదనలను గురువారం కేంద్రానికి పంపింది. ‘ప్రైవేటు కూరగాయల విత్తనాలు, పండ్ల నర్సరీలను నియంత్రించడంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్‌ నియంత్రణ చట్టం విజయం సాధించింది. రైతులు ప్రయోజనాల పరిరక్షణతో పాటు లైసెన్సును తనిఖీ చేయడం, నిలిపివేయడం, రద్దు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. దీనిని నమూనాగా తీసుకొని భారతదేశ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర విత్తన చట్టం రూపొందించాలి’ అని ఉద్యాన వర్సిటీ కేంద్రాన్ని అభ్యర్థించింది.

Read More

నవంబరు 1 నుండి ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ 20.01 శాతం

తెలంగాణాలో ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అంగీకరించకపోయినా అధికారులు, రైతు సంఘ ప్రతినిధులు పట్టుబట్టడంతో ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌- నూనె దిగుమతి శాతం) 20.01 శాతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెలల నుంచి వచ్చే నూనె దిగుమతిపై 20.01 శాతం, గింజల బరువుపై 10.08 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్‌ యాస్మిన్‌ బాషా, సంయుక్త సంచాలకులు సరోజ, ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, రైతు సంఘ ప్రతినిధులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, మహేశ్‌, బండి భాస్కర్‌, ప్రభాకరవర్మ, జ్యోత్స్న పలువురు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గెలలు, గింజలపై నుంచే కాక.. కెర్నల్‌ ఆయిల్‌పై కూడా రైతులకు వాటా చెల్లించాలని రైతు సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. నూతన ఓఈఆర్‌ 20.01 శాతం 2025 నవంబరు 1 నుంచి.. 2026 అక్టోబరు 31 క వరకు అమలులో ఉంటుందని, ఈ రేటు దేశంలోనే అత్యధికమని టీజీ ఆయిల్‌ ఫెడ్‌ జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత టమాటో వాల్యూచైన్‌ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టి.జి. భరత్‌ కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ను ఆయన దిల్లీలో కలిసి సమీకృత టమాటో వాల్యూ చైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాల పైనా ఆయనతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. ”రాష్ట్రంలోని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పివో)లను ప్రోత్సహించేందుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్ర్‌ప్రైజెన్‌ పథకం కింద స్టార్టప్‌లు, సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు వీలుగా తిరుపతి, బాపట్ల, లాం, పులివెందుల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి యూనిట్లను బలోపేతం చేయడంలో కేంద్రం సహకరించాలి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు” అని వెల్లడించారు.

Read More

నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ

  • ఎర్త్‌ సమ్మిట్‌ స్టార్టప్స్‌కు బాటలు వేయాలి
  • రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు ధన్యవాదాలు
  • ఎర్త్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ ఎడిషన్‌ కార్యక్రమంలో మంత్రి తుమ్మల

గ్రామీణ భారతావణి అభివృద్ధికి సంస్కరణలు నూతన ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారంనాడు హైదరాబాద్‌ హైటెక్స్‌లో నాబార్డ్‌ మరియు ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల ఎర్త్‌ సమ్మిట్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు, గ్రామీణ భారతదేశంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్న నాబార్డ్‌ సేవలు అభినందనీయమన్నారు.

వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌కు సమ్మిట్‌ బాటలు వేయాలనీ సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నామనీ ఎఫ్‌.పీ.ఓ లు స్టార్టప్స్‌ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. మారిన వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆవిష్కరణలు జరగాలి, అందుకోసం మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌తోపాటు అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు మంత్రి తుమ్మల.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు పాలనా సంస్కరణలతోనే సాధ్యమని, భారత రైతాంగానికి మరియు నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా నాబార్డ్‌ చేపట్టిన ఎర్త్‌ సమ్మిట్‌కు ప్రభుత్వపక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల.

ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ షాజీ కేవీ డిప్యూటీ ఎండీ గోవర్ధన్‌ సింగ్‌ రావత్‌ మరియు డి. ఎండీ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌ పాల్గొన్నారు.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

రైతుల సంక్షేమం కోసం నాబార్డు భాగస్వామ్యం అవసరం – మంత్రి తుమ్మల

రాష్ట్ర రైతుల ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో నాబార్డు సీజిఎం ఉదయ్‌ భాస్కర్‌తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్‌ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (M-PACS) ఏర్పాటు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ మద్దతు అందిస్తోందని ఇదేంతో ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఇందుకోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్‌) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో (ప్రస్తుతం 4.25%) అందిస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 2025 ముగిసేలోపు కొత్త ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్‌ఐడిఎఫ్‌ కింద రూ. 41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రూ. 1811 కోట్ల డ్రాయబుల్‌ గ్యాప్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్‌ఐడిఎఫ్‌ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి మైక్రో ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎంఐఎఫ్‌) కింద రూ. 144 కోట్ల నిధులను ఆమోదించినట్టు, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 197 కొత్త ఖ-ఆజ్పుఐల ఏర్పాటుకు నాబార్డ్‌ అనుమతి ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఐ్పుఈ్పు) ద్వారా త్వరితగతిన ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రిగారు వీటన్నిటిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామార్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామార్థ్యం, రైతుల ఉత్పత్తి సామార్థ్యానికి అనుగుణంగా లేదని అన్నారు. గతంలో నాబార్డు వారు తక్కవ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని గుర్తుచేశారు. అదే ప్రక్రియను తిరిగి కొనసాగించి గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలని ఈ సందర్భంగా నాబార్డు అధికారులను కోరారు.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

ఎర్రచందనం రైతులకు రూ.3 కోట్లు

‘యాక్సెస్‌ అండ్‌ బెనిఫిట్‌ షేరింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం పండిస్తున్న 198 మంది రైతులతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బిఏ) ప్రకటించింది. ఎర్రచందనం పరిమాణాన్ని బట్టి ఇందులో ఒక్కో రైతుకు రూ. 33 వేల నుంచి రూ. 22 లక్షల దాకా అందుతుందని తెలిపింది. జీవవైవిధ్య సంరక్షణ కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక అటవీ శాఖలు, ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండళ్లకు రూ.48 కోట్లు, తమిళనాడు రైతులకు రూ.55 లక్షలు విడుదల చేసినట్లు ఎన్‌.బి.ఏ. వెల్లడించింది. ప్రస్తుతం ఏపీకి విడుదల చేసిన రూ. 3 కోట్ల మొత్తం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 48 గ్రామాల్లో ఉన్న 198 మంది రైతులకు వెళ్తుందని తెలిపింది.

Read More