పంట వ్యర్థాలు పోషకాల గనులు

పంట వ్యర్థాలు… నేలకు జీవం. పొలంలో కలిపితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. పంట దిగుబడులూ పెరుగుతాయి. తగలబెడితే నేలకు నష్టం, భూమి వేడెక్కుతుంది. అందులోని సూక్ష్మజీవులూ చనిపోతాయి. పైగా కాలుష్యం మరో అతి పెద్ద సమస్య. టన్ను వరి గడ్డిని నేలలో కలిపేస్తే… 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల గంధకంతోపాటు సేంద్రియ కర్బనం లభిస్తుంది. టన్ను మొక్కజొన్న గడ్డిలో 9.16 కిలోల నత్రజని, 2.08 కిలోల ఫాస్పరస్, 15.78 కిలోల పొటాషియంతోపాటు 5.17 కిలోల కాల్షియం, 3.62 కిలోల మెగ్నీషియం, 1.54 కిలోల సల్ఫర్ ఉంటుంది.

గతంలో వరి కోతల తర్వాత నూర్పిడి చేసి గడ్డిని పశువుల మేతగా ఉపయోగించేవారు.. మిరప, పత్తి, కంది తదితర పంటలు వ్యర్థాల్ని మండెలుగా పేర్చి వంట చెరకుగా వినియోగించేవారు. ఇప్పుడు అధికశాతం రైతులు యంత్రాలతోనే వరి కోయిస్తున్నారు. ఎల్పీజీ అందుబాటులోకి రావడంతో వంట చెరకు అవసరమూ తగ్గిపోయింది. దీంతో పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. మొక్కజొన్న గడ్డి తగలబెట్టే సమయంలో మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తెలంగాణలోని హన్మ కొండ, ఏపీలోని పల్నాడు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి. వ్యర్థాల్ని కాల్ౘ్డం కంటే నేలలో కలిపి దున్నేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.

మొక్కజొన్న సాగు బాగా పెరిగింది
దేశంలో ఏటా 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% వాటా.. వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలకు సంబంధించినవే. ఒక్క వరి పంట వ్యర్థాలే 34% ఉన్నాయి.. ఈ ఏడాది రబీలో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 12.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 4.2 టన్నుల నుంచి 6.2 టన్నుల పంట వ్యర్థాలు వస్తాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున చూసినా.. ఒక్క మొక్కజొన్న నుంచే 62.75 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తాయి. తెలంగాణలోనూ 2024 సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు పెరిగింది. రబీలో 17.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పంట వ్యర్థాల్ని బయోమాస్ ప్లాంట్లకు తరలించవచ్చు. బయోచార్, ఇతర ఉత్పత్తులకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.

చాలా నష్టం

  • నేల పైభాగం నుంచి 15 సెం.మీ. లోతు వరకు వేర్లు అభివృద్ధి చెందుతాయి. అక్కడుండే నత్రజని, కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఈ పోషకాలు తగ్గిపోతాయి. మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
  • పంట వ్యర్థాల్ని తగలబెడితే.. అందులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రసఆక్సైడ్, ఇతర హైడ్రోకార్బన్లు అందులో ఉంటాయి.
  • వరిగడ్డిని కాల్ౘ్ివేస్తే అందులో 70% కార్బన్‌డైఆక్సైడ్, 7% కార్బన్ మోనాక్సైడ్, 0.66% మీథేన్ విడుదలవుతాయి. గడ్డిలోని నత్రజని నైట్రస్ ఆక్సైడ్‌గా వెలువడుతుంది.
  • పొగ నుంచి వెలువడే కాలుష్యం ద్వారా క్యాన్సర్ కారకాలు వెలువడుతున్నాయని అనుమానిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
    ప్రోత్సాహం తప్పనిసరి
  • 2021 సంవత్సరంలో ఏర్పాటైన ‘వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కాలుష్య నివారణకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలతో సమగ్ర విధానాన్ని పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను ఉచితంగా అందుబాటులో ఉంచాలని గతేడాది ఈ కమిషన్ ఆదేశించింది.
  • విద్యుత్ కేంద్రాలు పంట వ్యర్థాలతో చేసిన గుళికలను కనీసం 5% వాడాలని స్పష్టం చేసింది. అలా చేయ కుంటే.. అవి ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుపై పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
  • మరోవైపు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసే ఘటనలను కేంద్రం ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను రాయితీ ద్వారా అన్నదాతలకు అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట వ్యర్థాల నిర్వహణపై రైతులను చైత న్యపరచాలి. పలు ప్రోత్సాహకాలు అందిస్తే వారు మొగ్గుచూపుతారు.
Read More

రైతులు యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి

యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులు అనుసరించాలని ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు నానోయూరియా, పచ్చిరొట్ట ఎరువులు, జీవన, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్నారు. సోమవారం వర్సిటీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “గల్ఫ్ యుద్ధ ప్రభావం వలన ఒకవేళ యూరియా సరఫరా తగ్గినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. నానోయూరియా మార్కెట్‌లో కావలసినంత పరిమాణంలో అందుబాటులో ఉంది. నానోయూరియా మొక్కలకు కావాల్సిన నత్రజని అందించటంతో పాటు దిగుబడులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ పొందిన జీవన ఎరువులు కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాలను రైతాంగం సేకరించి తొలకరి వర్షాలు రాగానే పొలాల్లో చల్లి, విత్తిన 40 రోజుల్లో ఆయా పంటలను పొలంలో కలియదున్నితే సేంద్రియ కర్బనం పెరిగి నేల ఆరోగ్యం బాగుంటుంది” అని జానయ్య తెలిపారు.

Read More

సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర

సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా విజయవాడకు చెందిన వనఎర్త్ వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ వాట్సప్ గ్రూప్) సభ్యులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. హ్యాపీసండేలో భాగంగా నగర పాలక సంస్థ సహకారంతో స్థానిక ఇందిరా గాందీ స్టేడియంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి ఆదివారం నేరుగా రైతులే విక్రయించేలా ఏర్పాటు చేశారు. దీని ద్వారా అటు రైతులకు ఆదాయం వస్తుండగా.. ఇటు ఉదయపు నడకకు వచ్చే వారికి రసాయనాలు వాడని కూరగాయలు, ఆకుకూరలు లబిస్తున్నాయి. మిద్దెతోటలు పెంచే ఔత్సాహికుల ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. నాలుగు వారాల కిందట ఈ కార్యక్రమం మొదలు పెట్టగా మంచి స్పందన వస్తోందని సభ్యులు చెబుతున్నారు.

Read More

హైడ్రోపోనిక్ విధానంలో క్యాప్సికం సాగు

రాజస్థాన్‌లోని అల్వర్ నగరానికి చెందిన యువ ఐఏఎస్ అధికారి ప్రేమ్ ప్రకాశ్ మీనా పాలీహౌస్‌లో మట్టి లేని సాగు (హైడ్రోపోనిక్) విధానంలో చేపట్టిన క్యాప్సికం సాగు, సాధించిన విజయం ఆ చుట్టుపక్కల రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వీడియో చూసి ప్రేమ్ ప్రకాశ్ ఈ హైటెక్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దిల్లీ, గురుగ్రామ్ వంటి మెట్రోపాలిటన్ నగరాల మార్కెట్లకు దిగుబడులను సరఫరా చేస్తున్నారు. అల్వర్ నగర సమీపంలో ప్రేమ్ ప్రకాశ్ కుటుంబానికి అయిదెకరాల పొలం ఉంది. ప్రస్తుతం సాగు బాధ్యతలను ఆయన తండ్రి కదురాం మీనా పర్యవేక్షిస్తున్నారు. ఒక పాలీహౌస్‌తో ప్రారంభించిన ఈ సాగు డిమాండు పెరడగంతో మూడు పాలీహౌస్‌లకు చేరింది. పాలీహౌస్‌ల మీద ఉద్యాన శాఖ ఇస్తున్న 70 శాతం రాయితీ పెట్టుబడి భారాన్ని తగ్గించింది. జైపుర్ నుంచి నాణ్యమైన ఎరుపు, పసుపు క్యాప్సికం విత్తనాలు తెప్పించారు. మొత్తం 18,000 మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గతేడాది 32 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 40 టన్నులు అంచనా వేస్తున్నారు.

Read More

వృథా నీటితో వరి పంటకు జీవం

నిర్మల్ జిల్లా మామడ మండలం పరి మండల్‌కు చెందిన రైతు సంతోష్ రెండెకరాల వరి చేతికొచ్చే పరిస్థితిలో బోరులో నీరు అడుగంటింది. గట్టెక్కడం ఎలా అని మధనపడుతుంటే… ఎగువ పొలాలు తడవగా.. పొర్లి దిగువకు వృథాగా పోతున్న నీరు కనిపించింది. దాన్ని కల్వర్టు దగ్గరే ఆపి మళ్లించాలనుకున్నారు సంతోష్. ఇసుక బస్తాలు, టార్పాలిన్‌తో అడ్డుకట్ట వేసి.. చిన్న బావిలా మార్చారు. మోటారు, పైపుల సాయంతో ఆ నీటిని 300 మీటర్ల దూరంలోని తన పొలానికి అందిస్తున్నారు.

Read More

సేంద్రియ రైతుల కోసం ‘ఏలూరు రైతు సంపద’

‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌ను ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉంచేందుకు ఈ ప్రత్యేక ప్లాట్‌ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి తీసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…

సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందు బాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.
ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని సోమవారం పీజీఆర్ఎస్‌కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

Read More

ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు తెలిపారు. విస్సన్నపేట మండలంలోని కొండపర్వలో కృష్ణ సుధ వ్యవసాయ పర్యావరణ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి- భారతీయ నూనె గింజలు పరిశోధనా సంస్థ తెలంగాణ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఆర్కే మాథుర్, భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి- భారతీయ నూనె గింజలుపరిశోధనా సంస్థ, హైదరాబాద్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ హరి ప్రకాష్ మీనా, జాతీయ సేంద్రియ, సహజ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ మాజీ సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్ యాదవ్, కృష్ణ సుధ వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం సంచాలకులు డాక్టర్ సుబ్బా రాయుడు, డాక్టర్ బసవరాజు అతిథులుగా పాల్గొని తమ సందేశాలను అన్నదాతలకు అందించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఆదర్శ, ఉత్తమ రైతులు, పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

భూమి రసాయనమయంగా మారుతుంది

అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.

Read More

పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More

మూడు ఎకరాలకు 391 టన్నుల చెరకు దిగుబడి

కర్ణాటకలోని బెళగావి జిల్లా కల్లోళి గ్రామానికి చెందిన 72 ఏండ్ల అభ్యుదయ రైతు బాళప్ప బసప్ప బెళకోడ మూడెకరాల్లో పండిన మొత్తం 391 టన్నుల చెరకును మిల్లుకు తరలించి రూ.12,90,300 బిల్లును పొందారు. ‘సీఓ 86032’ రకం చెరకును నాటుకున్నారు. ‘నాటే ముందు మట్టి పరీక్షలు చేయించా. ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాల కోసం సేంద్రియ, పరిమితంగా రసాయనిక ఎరువులను డ్రిప్‌ ద్వారా తోటకు అందించా. ఎకరానికి రూ.65 వేల చొప్పున ఖర్చు వచ్చింది. చెరకు ఎదిగే వరకూ అంతర పంటలుగా మినుము, శనగ, టమాటా, ఉల్లి పండించా. వాటి ఫలసాయం అందాక ఆ మొక్కలను తోటలోనే తొక్కి, ఎరువుగా మార్చా. జీవామృతం, సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టును స్వయంగా చేసుకుంటున్నా. సాగు విధానాలు తెలుసుకునేందుకు చైనా, ఇజ్రాయెల్‌, జపాన్‌లకు వెళ్లి వచ్చా. ఎకరానికి 200 టన్నుల దిగుబడి సాధించే దిశగా ఈసారి ఐదెకరాల్లో చెరకు సాగు చేయాలనుకుంటున్నా’ అని బాళప్ప వివరించారు.

Read More