కర్ణాటకలోని బెళగావి జిల్లా కల్లోళి గ్రామానికి చెందిన 72 ఏండ్ల అభ్యుదయ రైతు బాళప్ప బసప్ప బెళకోడ మూడెకరాల్లో పండిన మొత్తం 391 టన్నుల చెరకును మిల్లుకు తరలించి రూ.12,90,300 బిల్లును పొందారు. ‘సీఓ 86032’ రకం చెరకును నాటుకున్నారు. ‘నాటే ముందు మట్టి పరీక్షలు చేయించా. ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాల కోసం సేంద్రియ, పరిమితంగా రసాయనిక ఎరువులను డ్రిప్‌ ద్వారా తోటకు అందించా. ఎకరానికి రూ.65 వేల చొప్పున ఖర్చు వచ్చింది. చెరకు ఎదిగే వరకూ అంతర పంటలుగా మినుము, శనగ, టమాటా, ఉల్లి పండించా. వాటి ఫలసాయం అందాక ఆ మొక్కలను తోటలోనే తొక్కి, ఎరువుగా మార్చా. జీవామృతం, సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టును స్వయంగా చేసుకుంటున్నా. సాగు విధానాలు తెలుసుకునేందుకు చైనా, ఇజ్రాయెల్‌, జపాన్‌లకు వెళ్లి వచ్చా. ఎకరానికి 200 టన్నుల దిగుబడి సాధించే దిశగా ఈసారి ఐదెకరాల్లో చెరకు సాగు చేయాలనుకుంటున్నా’ అని బాళప్ప వివరించారు.