అర ఎకరం పొలంతో ఆనందంగా జీవించవచ్చు
ఈ భూమండలంలో జీవనాన్ని కొనసాగించే అనంతకోటి జీవరాశులలో మనము కూడా ఉన్నాము అనే విషయం అక్షర సత్యం. మిగతా జీవరాశులతో పోల్చుకుంటే మనిషికి తెలివితేటలు ఉన్నాయి అంతే. అంతకు మించి ఏమీ తేడా లేదు. మిగతా జీవరాశుల లాగానే మనక్కూడా ఆకలి, నిద్ర లాంటివి సహజం. ఏ జీవికి సంబంధించిన నిత్యకృత్యాలు అవి పాటిస్తూ ఉంటాయి. కానీ మనిషికి మాత్రం తెలివితేటలు ఉండటము వలన మిగతా జీవులకంటే భిన్నంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన తెలివి తేటలను మంచి కొరకు కంటే చెడు కొరకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. తన తెలివితేటలతో కొత్త కొత్త వస్తువులను, ఉత్పత్తులను తయారు చేసుకుని తమ కోరికలను పెంచుకుంటూ, అవసరాలను ప్రక్కకు నెట్టి అనుకరణలకు ప్రాముఖ్యతను పెంచుకుంటూ పోతూ తమ జీవితాలలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఆర్థికంగా బలపడుతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, ఆనందం లేని జీవితాలలో ఆర్థికబలం ఎంత ఉన్నా అది వృథా అనే విషయం తమ తెలివి తేటలతో తెలుసుకోగలిగినా కూడా తమకు ఉన్న వివిధ రకాల బలహీనతల వలన తెలిసిన మంచి విషయాలను అమలు పరచటములో చాలా చాలా వెనుకంజ వేస్తున్నారు అనే విషయం ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ విషయం కరోనా సమయంలో ఇంకా బాగా అర్థం అయ్యింది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్కు భయపడి ఇంటి నుంచి బయటకు రాకుండా ముక్కుకు, మూతికి గుడ్డ కట్టుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నైజీరియా, టాంజానియా, యుగాండా లాంటి దేశాలకంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినది అనుకుంటున్న అమెరికా లాంటి దేశాలలోనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందనే విషయం వాస్తవం. కరోనాతో అందరికీ ఇమ్యూనిటీ యొక్క విలువ తెలిసి వచ్చింది. ఇన్కం కంటే ఇమ్యూనిటి ముఖ్యం అనే విషయం తెలుసుకోగలిగారు. ఇమ్యూనిటి ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే జీవితాలలో ఆనందం ఉంటుంది. ఇమ్యూనిటి పెరగాలంటే సరైన వ్యాపకం వ్యవసాయం. అందుకే ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనోబు ఫకుఓకా ఏమన్నారంటే ”మనిషి ఆనందంగా బతకాలంటే అర ఎకరం పొలం చాలు, అర ఎకరం పొలంతో మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు” అని అన్నారు. ఈ విషయాన్ని నిజమే అని నిరూపిస్తున్నారు గుంటూరు సమీపములోని పెదపలకలూరు గ్రామంలో కేవలం 70 సెంట్ల స్థలంలో వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు కొన్ని గేదెలను పోషిస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు పోలయ్య.

పోలయ్యది వ్యవసాయ నేపథ్యం. గుంటూరు సమీపములోని పెదపలకలూరులో తమకు ఉన్న 70 సెంట్ల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని పశువులను కూడా పోషిస్తూ పాలు మరియు వానపాముల ఎరువుతో పాటు కూరగాయలు అమ్ముకుంటూ 70 సెంట్ల భూమిని జీవనోపాధిగా చేసుకుని ఆనందకర జీవనాన్ని కొనసాగిస్తూ అర ఎకరం పొలం ఉన్నా కూడా ఆనందంగా జీవించవచ్చు అని నిరూపిస్తున్నాడు.
తమ భూమి బాగుపడడముతో పాటు పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా సేంద్రియ సాగే సరైన దారి అని నమ్మి సేంద్రియ సాగు పద్ధతులను అమలు పరుస్తున్నారు. ఒక ఆవు మరియు దూడలతో కలిపి 12 గేదెలను పోషిస్తున్నాడు. వాటి ద్వారా వచ్చిన పాలను అమ్మకం చేస్తున్నాడు. పశువుల పేడను వానపాముల ఎరువుగా తయారు చేస్తూ తమ పంట పొలానికి ఉపయోగించడంతోపాటు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇంటి పంటను నిర్వహించే వారికి కిలో 8 నుంచి 10/-ల వరకు అమ్మకం చేస్తూ ఆదాయం గడిస్తున్నాడు. పశువులకు మేత కొరకు ఎండుగడ్డిని అందించడంతో పాటు సూపర్ నేపియర్ గడ్డిని పెంపకం చేస్తూ అందిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో పెంచిన సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని మేపడము వలన పాలు రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు.
పండ్ల విషయానికొస్తే పోలయ్య తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ రకాల పంటలు సాగు చేయకుండా కేవలం ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలతో పాటు కొన్ని రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పాలకూర, పొదీన, చుక్కకూర, గోంగూర, కరివేపాకు, వంగ, సొర, టమాట, చిక్కుడు, పొట్ల మొదలగు కూరగాయలు అర ఎకరంలో సాగు చేస్తూ నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. వాటితో పాటు సపోటా, తినే ఉసిరి, బత్తాయి, సీతాపలం, దబ్బకాయ, మునగ, నిమ్మ, జామ, పారిజాతం, శంఖుపువ్వులు, మందార, మల్లె, తులసి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు.

పశువుల ఎరువు మరియు సొంతంగా తయారు చేసుకున్న వానపాముల ఎరువు భూమికి అందిస్తూ పంటలు సాగు చేయడం వలన ఆ భూమిలో పెరిగే మొక్కలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటూ పెరుగుతున్నాయి కాబట్టి వీరు సాగు చేసే పంటలను చీడపీడలు పెద్దగా ఆశించటం లేదు. వంగ పంటను ఉదాహరణగా తీసుకుంటే రసాయన పద్ధతిలో సాగు చేసే వంగలో చీడపీడల ప్రభావం విపరీతంగా ఉండడము వలన విచక్షణా రహితంగా రసాయనాలను ఉపయోగిస్తూ వంగ పంటను పండిస్తుంటారు. కాని భూమిలో సేంద్రియ పదార్థం సక్రమంగా ఉండడముతో పాటు తగినంత సేంద్రియ ఎరువులను అందిస్తూ పంటలను సాగు చేసినట్లయితే విపరీతంగా రసాయనాలు అవసరమయ్యే వంగ లాంటి పంటలను కూడా రసాయనాలు ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్దతులు పాటిస్తూ చీడపీడలు ఆశించని వంగ దిగుబడిని తగినంత పొందవచ్చు అని పోలయ్య నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9666460129 కి ఫోను చేసి తెలుసుకోగలరు.


















