తులసి సాగుతో రైతుకు ‘సువాసన’

మిరప, వరి, చెరకు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటి పంటలతో పాటు రైతులు ఔషధ మొక్కల సాగు కూడా చేపడుతున్నారు. ఔషధ మొక్కలలో ప్రధానంగా కలబంద, తులసి, దూలగొండి, అశ్వగంధ లాంటి వాటిని రైతుల స్థాయిలో పండించి అమ్ముకుంటున్నారు. ఔషధ మొక్కలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా మార్కెటింగ్‌ అవకాశాలను చూసుకొన్న తరువాతనే కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతనే పంటల సాగు మొదలు పెట్టాలేగాని ఏలాంటి కొనుగోలు ఒప్పందాలు లేకుండా సుగంధ మరియు ఔషధ మొక్కల లాంటివి సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయం రైతుల అనుభవాల సారం. ఈ పంటలు కూడా ఏ నేలలలో పడితే ఆ నేలలలో సరైన దిగుబడులు రావు కాబట్టి పంట లక్షణాన్ని బట్టి నేలలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ తమకు సమీపంలో అనుకూలమైన నేల లేనట్లయితే అనుకూలమయిన నేల అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వలసపోయి సాగు చేపట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి తాము ఉండే ప్రాంతంలో నేల తాము అనుకున్న పంటల సాగుకు ఉపయోగపడదు కాబట్టి ఆ పంట సాగుకు అనుకూలమైన నేల అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు చేస్తున్నారు అన్నదమ్ములు శ్రీనివాసరావు మరియు నాగేశ్వరరావు.

వీరిది గుంటూరు సమీపములోని పుల్లడిగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలోని నేలలు నల్లరేగడి నేలలు. వీరు తులసి పంటను సాగు చేయాలనుకొని పుల్లడిగుంట ప్రాంతంలోని నల్లరేగడి నేలలు తులసి సాగుకు అనుకూలం కావు అని తెలుసుకున్నారు. తులసి సాగుకు ఇసుక నేలలు, ఎర్రనేలలు అనుకూలం. కాబట్టి అలాంటి నేలలు అందుబాటులో ఉన్న ప్రకాశం జిల్లా ఆకివీడు ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు మొదలు పెట్టారు. నల్లరేగడి నేలలో తులసి సాగు చేసినట్లయితే నూనెదిగుబడి తక్కువగా వచ్చి పంట గిట్టుబాటు కాదు. ఇసుక లేదా ఎర్ర నేలల్లో నూనె దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి తులసి సాగును నల్లరేగడి నేలలలో చేపట్టవచ్చు అని వీరు సూచిస్తున్నారు.

గత సంవత్సరం మే నెలలో తులసి పంట సాగును 30 ఎకరాలలో చేపట్టారు. ఇందుకుగాను అవసరమైన విత్తనాలను హైదరాబాదులో సిఎంఏపి వద్ద కొనుగోలు చేసికుని నారు పోసుకున్నారు.  దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువును అందించారు. 35 నుంచి 40 రోజుల వయస్సు ఉన్న నారుని లైనుకి లైనుకి 27 అంగుళాలు మొక్కకు మొక్కకు 15 నుంచి 16 అంగుళాల దూరం పాటించి నాటించారు.  అవసరాన్ని బట్టి నీటిని అందిస్తూ వస్తున్నారు. తులసి ఔషధగుణాలు ఉన్న మొక్క కాబట్టి ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. ఒకవేళ చీడపీడలు ఆశించినా కూడా ఎలాంటి సస్యరక్షణా చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు అని వీరు వివరిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే నారు నాటిన 60 రోజులకు మొదటి కోత వస్తుంది. తరువాత 50 రోజులకు ఒక కోత చొప్పున కోసుకోవచ్చు. సంవత్సరానికి 5 నుంచి 6 కోతలు కోయవచ్చు. పంట కోత విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణములో తేమ తక్కువగా ఉన్నప్పుడే తులసి పంటను కోయాలి. పంట కోతకు ముందు కనీసం వారం రోజులు నీటితడిని ఆపి మొక్క బాగా వాడుబడిన తరువాత కోత కోయవలసి ఉంటుంది. వర్షాకాలంలో పంట వాడుపడదు కాబట్టి వాడుపడకుండా కోత కోసి నూనెను తీసినట్లయితే నూనె నాణ్యత తగ్గుతుంది కాబట్టి పంట వాడు పట్టిన తరువాతనే కోసి నూనెను తీస్తున్నారు. పంట ఎదుగుతూ పూత పూర్తిగా వచ్చి విత్తనాల తయారీ మొదలు కాకుండానే పంటను కోయాలి. విత్తనాల తయారీ మొదలయితే నూనె శాతం తగ్గుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితేనే నాణ్యమయిన నూనె దిగుబడి పొందవచ్చు.

నూనె తీయడానికి సిద్ధంగా ఉన్న పంటను కట్టెతో సహా కోసి నూనె తీసే యంత్రంలో వేసి నూనె తీస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే మొదటికోతలో ఎకరానికి 9 లీటర్ల నూనె దిగుబడి పొందవచ్చు. రెండవ కోత నుంచి నూనె దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. ప్రస్తుతం తులసి నూనె లీటరు ధర 6700/- నడుస్తుంది. చెన్నై, బెంగుళూరు, బొంబాయిలలో ఈ నూనెకు గిరాకి ఉంది. విత్తనాలు, నారు, కూలీ ఖర్చులు అన్నీ కలిపి మొదటి కోత వరకు ఎకరానికి 30000/- వరకు ఖర్చు అవుతుంది. రెండవ కోత నుంచి కోతకు 10000/- వరకు ఖర్చు అవుతుంది. ఒకసారి నాటుకుంటే 3 సంవత్సరాలలో 15 నుంచి 16 కోతలు కోసుకోవచ్చు అని వీరు వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు 9441928521 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఉల్లి సాగులో మెలకువలు

ఉల్లిగడ్డ అలియేసీ కుటుంబానికి చెందిన ద్వి వార్షిక మొక్క అధిక ఔషధ గుణములు మరియు కొన్ని రకాల చికిత్సలకు ఉపయోగ పడుతుంది. ఇది సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే మొక్క కానీ ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా పెరుగును. దీర్ఘకాలిక పగటి కాంతి ఉల్లిపాయలో లశునము ఊరడానికి సహకరిస్తుంది కానీ ఉష్ణోగ్రత మొక్క పుష్పించడానికి దోహదపడుతుంది. ఉల్లిపాయను దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల ప్రజలు వంటలలో నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది వంటకి రుచి, సువాసనని అందిస్తుంది. దీన్ని సలాడ్‌ రూపంలో కూడా తీసుకుంటారు. ఉల్లిపాయలో వివిధ రకాల విశిష్ట రసాయన పదార్థాలున్నాయి. అవి ఫ్లవోనోయిడ్స్‌, ఆంథోసైయానిన్స్‌, ఫ్రక్టో ఒలిగో శకరైడ్‌, ఆర్గానో-సల్ఫర్‌లు ఔషధంగా ఆరోగ్యాన్ని పెంచి రుగ్మతలు, డయాబెటిస్‌ నుండి కాపాడతాయి. భారతదేశం నుండి వివిధ దేశములకు ఎగుమతి అయ్యే ఫలములు, కూరగాయలలో ఉల్లిగడ్డ ద్వారా వచ్చే ఆదాయపు వాటా శాతము 26%. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలు అధికంగా పండే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలమైనవి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం, తెగుళ్లు, చీడల బెడద, ఉల్లిపాయను సాగుచేసే విస్తీర్ణం తక్కువ ఉండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయ దిగుబడి ఆశించినంత స్థాయిలో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, నూతనంగా విడుదల అయిన ఉల్లి వంగడాలు, ఉత్పత్తిలో మెలకువలు సంక్షిప్త కీటక, వ్యాధి నివారణ, సాగులో మెలకువలు పాటించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చు.

సాగు చేయు ప్రాంతాలు, సమయం

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిపాయను ఖరీఫ్‌ (ఆగష్టు – నవంబర్‌) మరియు రబి (ఏప్రిల్‌ – జూన్‌) రెండు కాలములలో సాగు చేస్తారు కాని అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలోనే. తెలంగాణలో ఉల్లిని సాగుచేసే ప్రాంతాలు వరుసగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌. ఉల్లిగడ్డ లశుణం సరిగ్గా పెరగకపోవడానికి గల కారణాలు ఉల్లిగడ్డ లశునము సరిగ్గా ఎదగక ముందే పుష్పించడం, దుంప పగుళ్లు వచ్చుట, సరైన ఉల్లిగడ్డ విత్తన రకమును ఎంచుకోవడములో తప్పిదం, నిస్సారమైన భూమి, ప్రతికూల పర్యావరణ కారకములు, ఉల్లిగడ్డ నిల్వచేయడంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం.

నేలలు, వాతావరణం

భూ సారము అధికంగా ఉండి, సరి అయిన మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు మరియు చల్లని వాతావరణము ఉల్లిపాయలో సరయిన పెరుగుదలకు దోహదపడే అంశాలు. దీర్ఘకాలిక కాంతి ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దుంప ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఉష్ణమండల తెలంగాణ ప్రాంతాలలో దీర్ఘకాల కాంతి వంగడాలను పెంచుకోవడానికి అనుకూలమైనవి. అధిక ఉష్ణోగ్రత స్వల్ప ఆర్ద్రత ఉండే వాతావరణంలో దుంప త్వరగా ఎదుగుతుంది. ఉల్లిగడ్డ శీతకాలాపు పంట, దుంపల కోసం, ఆకు కోసం సాగు చేస్తారు. 

సరైన వంగడాలు: N 2-4-1, ఆర్కా నికేతన్‌, అగ్రి ఫౌండ్‌ లైట్‌ రెడ్‌, పూస రెడ్‌, భీమా రాజ్‌ మరియు భీమా రెడ్‌ అనేవి రబి సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకాలు.

విత్తనం ఎంపిక, నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, లేదా చిన్న దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి నారు మొక్కలను ముందుగా నిర్మించుకున్న నారుమడిలో విత్తనాలను తగినంత దూరములో విత్తుకోవాలి. బెడ్‌లను భూమి నుంచి 10-15 సెం.మీ. ల ఎత్తులో నిర్మించుకోవాలి ప్రతి రెండు బెడ్‌ ల మధ్య కనీస నిడివి 50సెం.మీ. లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అంతరకృషి సులభతరమగును రెండు విత్తన వరసల మధ్య దూరము 4-5 సెం.మీ.లు ఉండేట్లు చూసుకోవాలి. నారుకుళ్లు తెగులును అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని 4-6 వారాల వయసున్న నారు మొక్కలను ప్రధాన నాటుకోవాలి. 

నీరు, యాజమాన్యం

ఉల్లిమొక్క నీటి ఎద్దడిని దుంప ఊరే దశ, దుంప అభివృద్ధి చెందే దశలో అస్సలు తట్టుకోలేదు. పంట పరిపక్వత దశకు చేరుకున్న తరవాత అధిక నీరు ఇచ్చినట్లయితే ద్వితీయ వేర్లు వస్తాయి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కోసే రెండు వారాల ముందు నుండి నీటి సరఫరా ఆపి వేయాలి. ఉల్లి సాగులో నీటిని తుంపర సేద్యము, బిందు సేద్యము ద్వారా అందించినచో సంప్రదాయ పద్ధతి లో సాధించే దానికన్నా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బిందు సేద్యము ద్వారా నీటిలో కరిగే పోషకాలను వాడటం సరైన లాభాలను ఆర్జించవచ్చు. పశు సంబంధిత వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పచ్చి రోట్ట ఎరువులను వాడటం, పంట మార్పిడి, మృత్తికా పరీక్ష అనంతరం సూచించిన మోతాదులో నియమిత ఫర్టిలైజర్‌ ను అందించటం మేలైనది. ఒక హెక్టార్‌ భూమికి సుమారు 40 టన్నుల పశవుల ఎరువు వాడటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. 

కలుపు నివారణ: ఉల్లి మొక్క వేరు వ్యవస్థ చిన్నధి అందువల్ల కలుపు ను అస్సలు తట్టుకోలేదు. సరైన సమయములో కలుపు ను నియంత్రన చర్యలు చేపట్టాలి. 

అంతర పంటల సాగు

ఒకే  సంవత్సరంలో వరసగా కేవలము ఉల్లిగడ్డ ను సాగు చేయకూడదు. దీనివల్ల భూమి యొక్క సారము తగ్గిపోవును, చీడ పీడల ఉధృతి అధికమగును. రసాయనిక ఎరువులు వాడటానికి బదులుగా ఇతర జాతి పంటలను పండించడం ద్వారా నేల సారవంతంగా మారును. ఉల్లి స్వల్పకాలపు పంట కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంట సాగు చెయ్యవచ్చు. బెండి, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అన్నిటికంటే బీట్‌రూట్‌తో ఉల్లిని 15 సెం.మీ.ల వ్యవధితో సాగు చేసినప్పుడు అధిక లాభాలు గణించవచ్చు.

పంట పరిపక్వత దశ,  కోయు విధానం

నిల్వ చేసే ఉల్లిపాయలను కోత కోయడానికి మెడ విరుపు దశ,అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 75% పై ఆకులు నేలకు ఒరగడం ఇది మొక్క పూర్తిగా కోతకు వచ్చిందని సూచిస్తుంది. కోతకు 2-3 వారాల సమయం ముందు నీరు అందించడం ఆపాలి. కోత కోసే సమయం లో సమయంలో దుంపలను భూమి నుండి లాగి ఆకుల చివరలను కత్తిరించాలి. కోసిన దుంపలను వ్యవసాయ భూమి లోనే 2-3 వారాలు దుంపల పై ఉన్న పొలుసులు పూర్తిగా పొడిగా అయ్యే అంత వరకు ఆరనివ్వాలి.  ఆకు పచ్చని ఉల్లి పాయల కోసం దుంపలను భూమి నుండి లాగి కాడలను 15 సెం.మీ. లు ఉండే విధంగా కత్తిరించాలి.

చీడ పీడలు, తెగుళ్లు నివారణ

ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు కూడా అధికమే, కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. తామర పురుగులు పొడిగా వేడిగా ఉండే వాతావరణంలో అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఇవే కాకుండా మొక్కలకు నీరు పెట్టేటప్పుడు, ఆచ్ఛాదన, నాటుపెట్టే సమయం వల్ల  కూడా తామర పురుగుల ఉధృతి పెరుగును. వివిధ రకాల సేంద్రియ కషాయాలు మరియు ద్రావణాలతో తామర పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు బవేరియా బస్సియానా అనబడే శిలీంద్రంను వాడటం ద్వారా అనేక రకాల చీడలను అరికట్ట వచ్చు. అస్పెర్గిల్లస్‌నైజర్‌ మరియు ఫ్యూసేరియం అనే శిలీంద్ర జాతులు విత్తనము ద్వారా దుంపలలో కూడా వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఆర్థ్రత వున్న పరిస్థితులలో నారుకుళ్ళు తెగులు ద్వారా 75-80 శాతము నష్టం కలుగును. ఎదుగుదల థలో అధిక నీటి వల్ల నారుకుళ్లు, ఊదారంగు మచ్చ  వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తగిన మోతాదులో నీటిని అందించడం వలన అరికట్టవచ్చు.              

డా. బి. అశోక్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వెజిటబుల్‌ సైన్స్‌, మల్లారెడ్డి యూనివర్సిటి, బి. గౌతమి, పిహెచ్‌.డి. స్కాలర్‌, ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ. 

Read More

వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో  పశువులకు   సంపూర్ణ సమీకృత ఆహార తయారీ

మనదేశంలో వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివద్ధికి పశుసంపద పాత్ర చాలా ముఖ్యమైనది. మన దేశంలో పశుసంపద సమృద్ధిగా ఉంది. సన్నకారు రైతులు, భూమిలేని నిరుపేదలు సంవత్సరం పొడవునా ఆదాయం పొందాలంటే, పశువులకు ఆహారం సంవత్సరం పొడవునా లభించాలి. మనదేశంలో పశుగ్రాసాల సాగు 4 శాతం భూవిస్తీర్ణంలో మాత్రమే జరుగుతుంది. దీనివలన సంవత్సరం పొడవు పశుగ్రాసాలు దొరకడం లేదు. మన దేశంలో ఉన్న పశుసంపదకు కావలసిన దానికి 43 శాతం దాణా దినుసులు, 44 శాతం ఎండుమేత, 38 శాతం పచ్చిమేత తక్కువగా లభ్యం అవుతూన్నాయి. దీనికి కారణాలేమిటంటే, దేశ జనాభా పెరగడం, పశువుల సంఖ్య పెరగడం, పంట భూముల విస్తీర్ణం పెరగడం, ఉన్న పంటభూముల మీద ఆహారధాన్యాల ఉత్పత్తి కొరకు వత్తిడి పెరగడం, అధిక లాభం కొరకు వాణిజ్య పంటలు పండించటం మొదలగునవి.

పై కారణాలవల్ల పచ్చిక బయళ్ళ విస్తీర్ణం మరియు పశుగ్రాసాల సాగు తగ్గాయి. అందే సమయంలో ఆహార పంటలు, వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం వల్ల వ్యవసాయ వ్యర్థ పదార్థాల ఉత్పత్తి ఎక్కువ అయ్యింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారుగా 50 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థ పదార్థాలు లభ్యమవుతున్నాయి. వీటినే సాంప్రదాయేతర ఆహార పదార్థాలు అని కూడా అంటారు. తగ్గిన పచ్చిక బయళ్ళు, పశుగ్రాసాల సాగు వల్ల సాంప్రదాయేతర ఆహార పదార్థాలను పశువుల మేతగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప, కంది కట్టె, ప్రత్తి కట్టె, మొక్కజొన్న కండెలు, ప్రొద్దు తిరుగుడు కట్టె, గింజలు తీసిన ప్రొద్దు తిరుగుడు పూలు మొదలగునవి మనకు సాధారణంగా వ్యవసాయంలో లభించే వ్యర్థ పదార్థాలు.

ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను పశువుల ఆహారంలో సంపూర్ణ సమీకృత ఆహారంలో నిర్ధిష్ట పరిమాణంలో ఇచ్చి పాలు, మాంసాన్ని చౌకగా ఉత్పత్తి చేయవచ్చు.

వ్యవసాయ వ్యర్థ పదార్థాలను, సాంప్రదాయేతర పదార్థాలను ఒక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే దాణాలో వినియోగించాలి. ఎందుకంటే వాటిలో పీచుపదార్థాన్ని లిగ్నిన్‌ ఎక్కువగా ఉండి పశువు తినడానికి ఇష్టపడదు. వాటిలో పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయి. కొన్నింటిలో విషపదార్థాలు ఉండి వాటి వినియోగాన్ని తగ్గించడం కాకుండా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

వాటిని పశువుల ఆహారంగా మార్చడానికి వివిధ పద్ధతులు కలవు. అందులో ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను కత్తిరించి మేపడం గాని, పొడి చేయడం ద్వారా గాని, గుళికల రూపంలో అందించవచ్చు. ఈ పద్ధతులే కాకుండా వ్యర్థ పదార్థాలను సుపోషకం చేయడానికి వివిధ పద్ధతులున్నాయి. అందులో భాగంగా సోడియం హైడ్రాక్సైడ్‌ రసాయన ద్రావణంతో పిచికారి చేసి మగ్గనివ్వడం ద్వారా గాని, మరొక పద్ధతిలో 4 శాతం యూరియా ద్రావణంతో పిచికారీ చేసి, 30 రోజులు గాలి చొరబడకుండా మగ్గనివ్వాలి. దీని వల్ల వ్యర్ధపదార్ధాలు సులభంగా జీర్ణమవడమే కాకుండా, నత్రజని శాతం పెరుగుతుంది. ఈ పద్ధతి శాస్త్రీయ పరంగా మంచి పద్ధతి అయినా, అంతగా ప్రాచుర్యం పొందలేదు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యర్ధ పదార్థాలను ఈ పద్ధతిలోని లోపాలను అధిగమిస్తూ, సులభంగా సంపూర్ణ సమీకృత ఆహారంగా మార్చుకోవచ్చు. ఈ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్ధ పదార్థాలను, సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ బద్ధంగా శక్తిని మరియు మాంసకృత్తులనిచ్చే దాణా దినుసులను నిర్ణీత పరిమాణంలో లేదా నిష్పత్తిలో కలిపి పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలను చాలినంతగా లభించేటట్లు తయారు చేయవచ్చు.

ఈ ఆహారం తయారీలో, ఎండుమేతతో సహా, అన్ని దాణా దినుసులను పొడిగొట్టే యంత్రంతో పొడిచేసి, మిశ్రమం చేసే యంత్రంలో పంపుతారు. కొద్ది మోతాదులో వాడే దినుసులను ప్రిమిక్సుగా తయారు చేస్తారు. ప్రిమిక్స్‌తో పాటు 70 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకు వేడి చేసిన మొలాసిస్‌ (బెల్లపు మడ్డి)ను కూడా తగిన మోతాదులో మిశ్రమ యంత్రంలో వేసి 10 నిమిషాల పాటు అన్ని పదార్థాలు బాగా కలియునట్లు కలుపుతారు. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమ ఆహారాన్ని సంపూర్ణ సమీకృత ఆహారం అని అంటారు. పొడి రూపంలో తయారైన ఆహారాన్ని పశువులకు పెట్టవచ్చు లేదా గుళికల రూపంలోకి మార్చి కూడా ఆహారంగా అందించవచ్చు.

సంపూర్ణ సమీకృత ఆహారం వల్ల ఉపయోగాలు

  • సాంప్రదాయేతర, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వినియోగం పెంచడానికి వీలవుతుంది.
  •  పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలు సరియైన పాళ్ళలో లభిస్తాయి.
  • మేత వృథా కాదు.
  • మేతను తేలికగా జీర్ణం చేసుకోగలుగుతాయి.
  •  పశువు తీసుకునే ఆహారం 10 నుంచి 20 శాతం పెరుగుతుంది.
  •  రవాణా చేయడం, నిల్వ చేయడం చాలా తేలిక.
  • పశువులు తమంతట తాముగా ఆహారాన్ని వెదికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు.
  • వేసవి కాలం, వరదలు, అనావృష్టి పరిస్థితుల్లో ఇవి సరైన ప్రత్యామ్నాయ ఆహారం.
  • పాల దిగుబడి రోజుకి పెరుగుతుంది.
  • గొర్రెలలో 10-15 శాతం ఎక్కువ పెరుగుదల వస్తుంది.
  • దాణా ఖర్చు 15-20 శాతం తగ్గుతుంది.
  • గొర్రె పిల్లల్లో 100-140 గ్రా. వరకు ప్రతిరోజు పెరుగుదల పొందవచ్చు.
  • మాంసం నాణ్యత కూడా పెరుగుతుంది.
  • దూడలు రోజుకు సగటున 500 నుండి 700 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు.

సంపూర్ణ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థపదార్థాల పాళ్ళ వివరాలు

  • జొన్నచొప్ప / మొక్కజొన్న 50
  • ప్రొద్దుతిరుగుడు కట్టె 40
  • ప్రొద్దుతిరుగుడు పూలు 50
  • గోధుమ చొప్ప 50
  • ఎండిన చెట్ల ఆకులు 50-70
  • వరిగడ్డి 50
  • ప్రత్తి కట్టె 45
  • సోయా కట్టె 50
  • ఆయిల్‌ పామ్‌ పీచు 30
  • చెరకు పిప్పి 20

పెరిగే దూడలకు సంపూర్ణ ఆహారం

ఆహార పదార్థం                సంపూర్ణ దాణా (కిలోలు)

                                1          2        3        4

మొక్కజొన్న కంకులు40
ప్రొద్దుతిరుగుడు పువ్వులు40
చెరకు పిప్పి40
పత్తి కట్టె40
మొక్కజొన్న గిoజలు15102330
వేరుశనగ గానుగ చెక్క10101014
పత్తి గింజల గానుగ చెక్క5.0
నూనె తీసిన వరి తవుడు22.528.59.0
మొలాసిస్‌1010108
యూరియా1.01.00.5
గోధుమ తవుడు4.5
ఖనిజ లవణాల మిశ్రమం1.01.01.02.0
ఉప్పు0.50.51.01.0
విటమిన్ల మిశ్రమం10గ్రా.10గ్రా.10గ్రా.10గ్రా.
మొత్తం100100100100
     

దూడలు రోజుకు సగటున 500 నుంచి 700 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి.

పాడి పశువులకు సంపూర్ణ ఆహారం

ఆహార పదార్థం                సంపూర్ణ దాణా (కిలోలు)

                                          1          2          3          4

మొక్కజొన్న కంకులు28.5
ప్రొద్దుతిరుగుడు పువ్వులు40
 పత్తి కట్టె30
 చెరకు పిప్పి28.5
మొక్కజొన్న గిoజలు19.019.024.024.0
వేరుశనగ గానుగ చెక్క13.013.012.59.0
పత్తి గింజల గానుగ చెక్క5.06.0
నూనె తీసిన వరి తవుడు26.026.08.05.0
మొలాసిస్‌12.012.08.010.0
యూరియా0.50.5
గోధుమ తవుడు9.06.5
ఖనిజ లవణాల మిశ్రమం1.01.02.02.0
ఉప్పు0.50.51.01.0
విటమిన్ల మిశ్రమం10గ్రా.10గ్రా.10గ్రా.10గ్రా.
మొత్తం100100100100
     

పాల దిగుబడి రోజుకు 8 నుంచి 10 లీటర్లు.

పై విధంగా తయారు చేసుకున్న సంపూర్ణ సమీకృత ఆహారాన్ని దూడలకు వాటి శరీర బరువులో 3-4 శాతం మరియు పాడి పశువులకు 2.5-3.0 శాతం మేపినట్లయితే పైన సూచించిన విధంగా వాటి బరువు పెరుగుదల, పాల దిగుబడి పొందవచ్చు. అలాగే రైతులు వ్యవసాయ వ్యర్థాలను వాడుకొని పశుపోషణ ఖర్చు తగ్గించుకోవచ్చు.  

డా|| రమేష్‌బాబు పి., అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, & హెడ్‌, యానిమల్‌ న్యూట్రిషన్‌ విభాగం,

పశువైద్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,

ప్రొద్దటూరు – 516 360.

ఇ-మెయిల్‌:drrameshbabu4u@gmail.com

Read More

గొర్రెల దాణాలలో బైపాస్‌ ప్రొటీన్స్‌ వల్ల లాభాలు

గత నాలుగు థాబ్దాల కాలంలో పాలు – పాడి పశువుల ధరలు పదిరెట్లు, కోడిగ్రుడ్లు, కోడిమాంసాల ధరలు     12-13 రెట్లు మాత్రమే పెరగగా, జీవాలు, జీవాల మాంసం ధరలు మాత్రం ఏకంగా సుమారు 50-60 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం పొట్టేలు మాంసం ధర కిలో 750-800 వరకు పలుకుతూ ఉంది. ఇందుకు జీవాల పోషణ-నిర్వహణ వ్యయాలు కూడా గణనీయంగా పెరగటమేకాక, వాటి నిర్వహణ కూడా అనేక సమస్యలతో కూడుకున్నది కావటం కూడా మరో ముఖ్య కారణం. పూర్వం జీవాల జీవనాధారమైన విశాలమైన పచ్చికబీళ్లు, బీడుభూములు, అటవీభూములు, తోటలు, ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలు, జీవాలమేతకు అందుబాటులో ఉండు మెట్ట సాగు భూములు కాలక్రమంలో మూడు పంటలందించే మాగాణీ భూములుగా మారిపోవటం మరియూ సాంప్రదాయ జీవాల పెంపకం కులాలలో జీవాలతో పాటు సంచార జీవితాల పట్ల ఆసక్తి తగ్గిపోవటం వంటి ఎన్నో కారణాలు కూడా సాంప్రదాయ జీవాల పెంపకానికే అవరోధంగా మారాయి. మారిన ఈ పరిస్థితులలో జీవాల పెంపకం లాభదాయకంతో పాటు నిర్వహణ సులభతరం కావడానికి సాంద్రపద్ధతిలో దాదాపుగా పూర్తి చేతిమేతతో పెంచడమే మంచిదని అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో యజమాని ప్రతి జీవంపై వెచ్చించే ప్రతి రూపాయి పెట్టుబడికి తగినట్లు మాంసం రూపంలో అదనపు రాబడిని పొందే ప్రయత్నం చేయకతప్పదు. శాస్త్రీయ సాంద్ర పద్ధతులలో జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు (ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం) జీవాల పెంపకాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే విధ్యాధికులు, యువత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులెందరో కూడా జీవాల పెంపకాన్ని చేపట్టి ఆధునిక శాస్త్రీయ విధానాలను పాటిస్తూ మంచి ఆదాయాలను పొందుచున్నారు. ఈ పరిశ్రమ రాబోయే రోజుల్లో ఒకబలమైన గ్రామీణ ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇటీవల హైదరాబాదులోని మెట్టసాగుభూములు పరిశోధనా కేంద్రం (క్రీడా) శాస్త్రజ్ఞులు కొందరు గొర్రెల పోషణపై జరిపిన పరిశోధనల ద్వారా ఎంతో విలువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించారు. పాలు విడిచిన తర్వాత అంటే 130 రోజుల వయస్సు నుండి మరో 100 రోజుల వరకు (మాంస కేంద్రాలకు తరలించే థ వరకు) పొట్టేలు పిల్లలకు సాధారణ దాణాలలో జీవానికి 50 గ్రాముల ఉలవల పిండిని కలిపి మేపితే రోజుకు సుమారు 50 గ్రాముల మేరకు అదనంగా శరీర బరువు పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన జొడిపి జాతి గొర్రెల మీదనే జరగటం విశేషం. ప్రస్తుతం జీవాల (జీవన బరువు)కు కిలోకు సుమారు 400 రూపాయల చొప్పున మార్కెట్లో ధర పలుకుతోంది. అంటే ఈ ఉలవలు మేసిన వంద రోజుల్లో ప్రతి జీవం తినే సుమారు 5 కిలోల ఉలవల ఖర్చు రూ. 70þ5 కిలోలు = 350 రూపాయలు కాగా అదనంగా పెరిగే శరీర బరువు 50 గ్రా.þ100 రోజులు = 5 కిలోల నుండి (5þ400) = రూ. 2000/- అదనపు ఆదాయాన్ని ఆశించవచ్చు. అంటే ఒక్కొక్క జీవంపై సగటున సుమారు 1650 రూపాయల వరకు నికరలాభం ఉంటుంది. ఇంతేకాక బలిష్టంగా కండపుష్టితో పెరిగిన ఈ జీవాలకు మార్కెట్‌లో గిరాకి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పోతు గొర్రెల నుండి నికర మాంసం దిగుబడి కూడా 3 నుండి 5 శాతం అధికంగానే ఉండవచ్చు.

గొర్రెలు-మేకలు నెమరువేసే జంతువులని మనందరికీ తెలుసు. మూడు నెలల వయస్సు దాటిన ఈ జీవాల పెద్దపొట్ట (రూమెన్‌)లో సహజంగానే ఉండే అనేక బ్యాక్టీరియా, ఇతర ఏకకణ పరాన్నజీవులు, ఇవి మేసిన మేతల్ని జీర్ణం చేసుకొనడంలో సహాయపడటంతోపాటు, ఆమేతలలో ఉండే కొన్ని నాణ్యమైన, విలువైన మాంసకృత్తుల్ని సంగ్రహించి, అభివృద్ధి చెంది తాము కూడా అంతర్గత ఆహారంగా జీవం చేత జీర్ణం కాబడి జీవాల మనుగడకు, ఉత్పాదకతను ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

అయితే విలువైన, ఖరీదైన పోషక పదార్థాలను ధ్వంసం చేసే రూమెన్‌లోని ఈ బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల దాడి నుండి తప్పించుకుని నేరుగా చిన్న ప్రేగులలో ప్రవేశించి, జీవానికి పూర్తి సహజ పోషక స్వభావంతో జీర్ణమయ్యే మేతల వల్ల జీవం తన పూర్తి పోషక అవసరాలను ఎక్కువ సమర్ధవంతంగా తక్కువ ఖర్చుతో తీర్చుకోగలదు. ఈ విధంగా రూమెన్‌లోని మార్పులను తప్పించుకుని (బైపాస్‌) ప్రేగులలో ప్రవేశించి జీవానికి ఉపయోగపడే పోషకాలను బైపాస్‌ పోషకాలుగానూ, అందులోని మాంసకృత్తులను బైపాస్‌ ప్రొటీన్లుగానూ వ్యవహరిస్తారు. 

ఉలవ గింజలలో ఉండే టానిన్‌ అనే పదార్థం వల్ల వీటికి, వీటితో కలిసిన ఇతర ముడిపదార్థాలలోని మాంసకృత్తులకు కూడా బైపాస్‌ స్వభావం ఏర్పడుతుంది. ఉలవలలోనే కాక ప్రత్తి చెక్క (కాటన్‌ సీడ్‌ కేక్‌)లో కూడా బైపాస్‌ ప్రొటీన్ల శాతం గణనీయంగానే ఉంటుంది.

ఉలవలలో 17.94 శాతం మాంసకృత్తులు, 14.94 శాతం క్రూడ్‌ ఫైబర్‌, 48.93 శాతం క్రొవ్వు సంబంధిత పదార్థాలు (ఈథర్‌ ఎక్ట్రాక్ట్‌), 14.4 శాతం సెల్యులోజ్‌తో పాటు జీవాలకు అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉలవలలో ఉండే అనేక పోషక విలువలతో పాటు, వీటి వల్ల జీవాల జీర్ణశక్తి పెరగటంతో పాటు, విసర్జితాల ద్వారా జరిగే పోషకాల నష్టం తగ్గుతుందని కూడా కనుగొనబడింది. రోజుకు 31/2 నుండి 4 కిలోల సూపర్‌ నేపియర్‌, హెడ్జ్‌లూసర్న్‌, స్టైలోహమాటో ముఖ్యంగా చిలగడదుంప (స్వీట్‌ పొటాటో) వంటి పచ్చి గ్రాసాలతో పాటు మొక్కజొన్న, వరితవుడు, గోధుమ తవుడు, మినరల్‌ మిక్చర్‌, ఉప్పుతో పాటు ఉలవల పిండిని 25-30 శాతం వరకు కలిపి మేపవచ్చును. ఉలవల ధర ఎక్కువ అనిపిస్తే దానిని 15-20 శాతానికి తగ్గించి ఆ మేరకు చౌకగా లభించే ప్రత్తి చెక్క పిండిని కలిపి, 130 రోజులు దాటిన ప్రతి గొర్రెపోతు పిల్లకు పచ్చి మేతల లబ్యత నాణ్యతను బట్టి 150 నుండి 200 గ్రాముల వరకు మేపి మంచి ఫలితాలను పొందవచ్చును.

ఇటీవల హైదరాబాదు, విజయవాడ, గోదావరి తదితర జిల్లాలో ఉలవచారు తయారీ మంచి లాభదాయక పరిశ్రమగా వృద్ధి చెందుతోంది. అక్కడ ఉపఉత్పత్తిగా చౌకగా లభ్యమయ్యే ఉడికిన ఉలవపప్పును కూడా జీవానికి 150-200 గ్రాముల వరకు (ఉడికినపప్పులో తేమ శాతం 70 వరకు ఉంటుంది కాబట్టి) మేపి కూడా మంచి ఫలితాలు సాధించవచ్చును. ఉలవలు ఉడికించి పని పశువులకు, పందెపు గిత్తలకు అనాదిగా మేపుతూనే ఉన్నారు.

వాణిజ్యపరంగా సాంద్రపద్ధతిలో నిర్వహించే గొర్రెల పెంపకందారులు, బక్రీదు, రంజాన్‌, క్రిస్ట్‌మస్‌, దసరా, సంక్రాంతి వంటి వేట మాంసానికి అత్యధిక డిమాండు వుండే రోజులకు మూడు నెలల ముందు నుంచి ఉలవలు లేదా ప్రత్తి చెక్క కలిపిన దాణాలు మేపి తమ ఆదాయాలను మరింతగా పెంచుకోగలరు.                    

డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611

Read More

యువతకు స్ఫూర్తి

చదువుకున్న వాడికీ ఇతరులకు ఎంత తేడా ఉంటుందంటే బతికి ఉన్నోడికి, చచ్చిన వాడికీ ఉన్నంత తేడా ఉంటుందని అరిస్టాటిల్‌ చెబుతారు. దీనికి సరిగ్గా సరిపోతారు డాక్టర్‌ జీఆర్‌ చింతల. కొందరు తెలివైన వాళ్లు భూమిపై ఎంత ఎత్తు ఉంటారో, భూమి లోపల కూడా అంతే ఉంటారంటుంటారు పెద్దలు. దానికి ప్రత్యక్ష తార్కాణం ఆయన. గురిపెట్టి ఊరుకుంటే చాలదు, తుపాకీ గుండు పేల్చాలన్న సామెతను నిజం చేసి చూపుతాడు. ఉన్న ఆస్తులు ఊడ్చుకుపోయినా, కనిపించని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని మనస్థత్వంతో ముందడుగు వేశారు. చదువు తప్ప మరేదీ తనను కాపాడలేదని నిర్ణయించుకున్నారు. చదువు, కష్టపడే మనస్తత్వం, చిత్తశుద్ధి, నలుగురికి మేలు చేయాలనే తపనతో నిచ్చెనమెట్ల వ్యవస్థలో పైమెట్టుకు చేరినవారు డాక్టర్‌ చింతల. డాక్టర్‌ కావాలనుకుని వ్యవసాయంలో పట్టా తీసుకుని ఎక్కడైతే చేరారో ఆ సంస్థకే ఛైర్మన్‌ అయిన ఖ్యాతి చింతల గోవిందరాజులుది. పుట్టింది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు. ఈ ఊరుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు, శక్తులకు వేదిక ఆ ఊరు. ఇక్కడ పుట్టిన ఓ వ్యక్తి పి. కోదండ రామయ్య కాఫీ బోర్డ్‌ ఛైర్మన్‌, టొబాకో బోర్డ్‌ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అదే ఊరికి చెందిన జీఆర్‌ చింతల నాబార్డ్‌ చైర్మన్‌ పదవిని అలంకరించడం విశేషం. ఈ ఊరికి చెందినవాళ్లు ఇంటికొకరైనా అమెరికా సహా వివిధదేశాల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. రామినేని ఫౌండేషన్‌ పేరిట అవార్డులు ఇచ్చే కుటుంబం ఈ ఊరిదే. ఫుడ్‌ టెక్నాలజీలో పేరుగాంచిన మోడరన్‌ ఫుడ్స్‌ చైర్మన్‌గా పని చేసిన ఎం. మురళీకృష్ణ ఈ ఊరివారే. కోదండరామయ్య, మురళీమోహన్‌లు కూడా బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధులు కావటం విశేషం. కమ్యూనిస్టుగా ఉంటూ మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ తరగతుల (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ఎదిగి ఇటీవలే కన్నుమూసిన ఊసా సాంబశివరావు అనే ఉద్యమకారుడు ఈ ఊరి వారే కావడం గర్వకారణం.

బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఎదిగివచ్చిన అన్ని ముత్యాలలో మేలయిన ముత్యం జి ఆర్‌ చింతల. ఆయనది అరుదయిన వ్యక్తిత్వం. జీవితంలో ప్రతి అంశమూ ఆయనకు ఒక అవకాశమే. జీవిత వాస్తవాలను అంగీకరిస్తూ ఆ పరిధిలోనే సమాజ వృద్ధికి, తన ఎదుగుదలకు గల అవకాశాలను అన్వేషిస్తూ, పరిమితులను గుర్తిస్తూ, ఆ మార్గాన విజయాలు సాధిస్తూ సాగుతున్న ఆయన జీవన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. నాబార్డులో దాదాపు 35 ఏళ్ళు పనిచేసి ప్రతి మలుపును అవకాశంగా మలచుకొని ఆ సంస్థ చైర్మన్‌గా ఎదిగి దేశానికి సేవలందిస్తున్నారు. ఆయన జీవన రేఖలు – క్లుప్తంగా…

గురి పెట్టి కొట్టారు… నాబార్డ్‌ ఛైర్మన్‌ అయ్యారు
నాబార్డ్‌ చైర్మన్‌గా దేశప్రజల మన్ననలు అందుకొంటున్న జి.ఆర్‌ చింతల గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామంలో 1962 సంవత్సరం జులై 15వ తేదీన జన్మించారు. వారి తాత చింతల పుల్లయ్య పెద్ద భూస్వామి, అంతకుమించి వితరణశీలి. ఆయన చేసిన దానధర్మాలకు అంతేలేదు. ఆయనకున్న 100 ఎకరాల మాగాణి భూమిలో దానధర్మాలకు పోయిందిపోగా, సంతానానికి పది ఎకరాలు మాత్రమే మిగిల్చారు.

వారి తండ్రి చింతల బుచ్చయ్య. ఆయన విద్యార్థి థలో మంచి ప్రతిభావంతుడు. ఆయనకు 1940 థకంలోనే గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ చదివే అవకాశం వచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా డాక్టర్‌ చదవలేకపోయారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేసి విద్యాశాఖలో ఉద్యోగంలో చేరారు. తరువాత అక్కినేని కృష్ణకుమారిని వివాహం చేసుకొన్నారు. వారి కుమారుడు చింతల గోవిందరాజులు. ఆయనే జి ఆర్‌ చింతల.

బ్రాహ్మణకోడూరు గ్రామంలోనే మాగాణి పొలాల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగాడు చింతల. చిన్నతనంలో తాతయ్య, పెదనాన్నలు, బాబాయిలతో తరచుగా పొలం వెళ్ళేవాడు. ఏడేళ్లు వయస్సు వచ్చేవరకు అక్కడే పెరిగాడు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి బకింగ్‌హామ్‌ కాలవ ద్వారా 1856 నుంచే సాగు నీటి వసతి వుండేది. ఆ గ్రామంలో100 ఏళ్లకు పూర్వం నుంచే హైస్కూల్‌ ఉండేది. నాలుగోతరగతి వరకు గోవిందరాజులు చదువు అక్కడే సాగింది. వారి తండ్రి చింతల బుచ్చయ్య ఉద్యోగరీత్యా గుంటూరుకు నివాసము మార్చారు. గుంటూరుకు చేరేవరకు గోవిందరాజులు, ఆయన సోదరుడు చదువులోనూ, లోకజ్ఞానంలోనూ బాగా వెనుకబడి ఉండేవారు. వారి తండ్రి బుచ్చయ్య ఆరు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి పిల్లలకు చదువుచెప్పారు. ఆయన పెద్దబాలశిక్ష, ఇంగ్లీష్‌ అక్షరాలు, ఎక్కాలు నేర్పేవారు. తన తండ్రే తన తొలి గురువని చెబుతారు చింతల. తన తండ్రి నేర్పిన తొలిపాఠాలు ఇప్పటికీ తనకు మార్గదర్శకంగా ఉంటాయంటారు. గుంటూరులోని పానయ్య బడి, కాసు సాయమ్మ హైస్కూల్‌, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో అయన చదువు కొనసాగింది. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌, గుంటూరు జేకేసీ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసాడు. క్లాసులో ఫస్ట్‌ ర్యాంకర్‌. సహవిద్యార్థులు (ప్రస్తుతం ప్రముఖ సర్జన్లు, న్యూరాలజిస్టులు, అంకాలజిస్టులుగా ఉన్నారు.) మెడిసిన్‌కు వెళ్లినా చింతల అటు వెళ్లాలనుకోలేదు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరారు.

తన జీవితంలో అది ముఖ్యమైన మలుపుగా చెప్తారు చింతల. ఆ కాలేజీ జీవితం, నాటి అనుభవాలు తరచుగా గుర్తు చేసుకొంటుంటారు. బాపట్ల కాలేజీ తల్లిలాగా తనను అక్కున చేర్చుకొన్నదని, సహజీవనం నేర్పిందని, జీవితకాలం కలసిఉండే మంచి మిత్రులను కల్పించిందని అంటారు. నాటి స్నేహితులను వీలయినప్పుడల్లా పలకరిస్తుంటారు. ప్రతిభావంతులయిన అధ్యాపకుల మార్గదర్శకత్యంలో, 168 మంది సహాధ్యాయులు, స్నేహితుల ఆప్యాయత, అనురాగాలతో కోలాహలంగా, ఉత్సాహంగా నాలుగేళ్ల అగ్రికల్చర్‌ కోర్సు అట్టే గడచిపోయింది. ఆ రోజుల్లో గోవిందరాజులుకు అయన సహాధ్యాయి, మిత్రుడు కె ఉదయభాస్కరరెడ్డి అందించిన తోడ్పాటు మరువలేనిది, పాఠ్యాంశాలు, సమకాలీన పరిస్థితులను అర్ధం చేసుకొనేందుకు ఇతరత్రా కూడా ఆయన ఎంతగానో సహకరించారు. అప్పుడు ఉదయ భాస్కరరెడ్డి కళ్ళతో తాను ప్రపంచాన్ని చూచానంటారు చింతల. అంతగా ఉండేది వారి మైత్రీ బంధం. నాలుగేళ్ళ డిగ్రీ పూర్తయ్యాక బాపట్ల అగ్రికల్చరల్‌ కాలేజీలో ఆయేడాదే ప్రారంభమయిన ఎంఎస్‌సి అగ్రానమిలో చేరాడు. కాని తృప్తిగా అనిపించలా. ఏదో అసంతృప్తి. ఇంకేదో చెయ్యాలనే ఆలోచన ఉండేది. ఎందరో శాస్త్రవేత్తలను రూపొందించిన, అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న, వ్యవసాయ విద్య, పరిశోధనలలో అగ్రగామి అయిన ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైపు ఆయన మనసు మళ్ళింది. ఇష్టమైన బాపట్ల కాలేజీని, అప్పటికే ఒక సంవత్సరం పూర్తయిన ఎంఎస్‌సి చదువును వొదిలిపెట్టి ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI)లో ఎంఎస్‌సి (Seed Science & Technology) మొదటి సంత్సరంలో చేరారు. ఇది ఆయన జీవితంలో మేలి మలుపు.
(IARI)లో చేరేందుకు ఆయనపడ్డ ఆరాటం, చేసిన యోచన తరువాత కాలంలో గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని ఫలితాలను చేకూర్చింది. IARI ఆయనలోని జిజ్ఞాసను పెంపొందించింది. సృజనాత్మకతను, నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను అలవర్చింది. గొప్పవ్యక్తుల పరిచయాలను కల్పించింది. దేశానికి బహుముఖ ప్రజ్ఞాశాలిని అందించింది. ఆయనకు గొప్ప భవిష్యత్ను కల్పించింది.

ఏంతో ఉత్సాహం, ఉద్వేగంతో IARI లో చింతల ఉన్నత విద్యాభ్యాసం సాగింది. IARI లో ప్రొఫెసర్‌ శ్రీమతి మాళవిక దద్లాని జిఆర్‌ చింతలను ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పటికి చింతల గొప్ప విజయాలు సాధించినపుడు ఆమె భుజంతట్టి అభినందిస్తుంటారు. డాక్టర్‌ చంథ్రేఖర్‌ (సిటిఆర్‌ఐ రాజమండ్రి) డాక్టర్‌ ఎస్‌విఎస్‌ఎస్‌ ప్రసాద్‌ (ఇన్‌కంటాక్స్‌) డాక్టర్‌ అర్జ శ్రీకాంత్‌ తదితరులు మంచి స్నేహితులు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇన్‌సర్వీస్‌ విద్యార్థి యాదగిరినాగ్‌ చింతలకు తోడుగా ఉండేవారు. డాక్టర్‌ అంచా శ్రీనివాసన్‌, అంచా అయ్యేశ్వరరావు చింతల వారి మిత్ర బృందానికి మార్గదర్శకంగా ఉండేవారు. డాక్టర్‌ వేణుగోపాల ముఖోపాధ్యాయ తనకు రోల్‌ మోడల్‌ అని జి ఆర్‌ చింతల చెప్తారు. డాక్టర్‌ వేణుగోపాలముఖోపాధ్యాయ విజ్ఞాన గని లాంటివారు. నిరంతర అధ్యయనశీలి. అయన కూడా నాబార్డ్‌లో చేరి సిజిఎంగా 2017లో రిటైర్‌ అయ్యారు.

ఐఎఆర్‌ఐలో ఎంఎస్‌సి చివరి సంవత్సరంలో ఉండగానే నాబార్డ్‌వారు క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌కు వచ్చారు. క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌ అనేది ఐఎఆర్‌ఐలో గతంలో ఎన్నడూ లేదు, ఆఏడాదే కొత్తగా మొదలయింది. చింతల ఆప్లికేషన్‌ని అయన క్లాసుమేట్‌ రవీందర్‌సింగ్‌ (ప్రస్తుతం హూస్టన్‌లో ఉంటున్నారు) నింపి సబ్మిట్‌ చేశారు. విద్యార్థులంతా వేడుకగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. నాబార్డ్‌ అధికారులు దాదాపు నాలుగొందలమంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి జిఆర్‌ చింతలతో సహా పదమూడు మందిని ఎంపిక చేసారు.

బొంబాయిలోని నాబార్డ్‌ కేంద్ర కార్యాలయంలో 1985 అక్టోబర్‌ ఒకటో తేదీన జిఆర్‌ చింతల రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ విభాగంలో ఉద్యోగంలో చేరారు. అలా చేరిన వాడు 2020 మే 27వ తేదీన ఆ సంస్థకు చైర్మను అయ్యాడు. కోవిడ్‌ మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉన్న కష్టకాలంలో కూడా దేశమంతా పర్యటిస్తూ సంస్థ, దేశాభివృద్ధికి కృషిచేస్తున్నారు. 2020లోనే ఎపిఆర్‌ఎసిఎ అధ్యకక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాబార్డ్‌లో ఆయన సుదీర్ఘ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. సమున్నత ప్రమాణాలతో, సంతోషకరమైన జీవనం ఆయన విధానం. సామాజిక బాధ్యతలు నిర్యహిస్తూ, పనిచేసే సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ అందులోనే తానుఎదుగుతూ సాగిన జిఆర్‌ చింతల జీవితం ఈనాటి యువతకు ఆదర్శం. ఏపదవిలోఉన్నా ఎలాంటి భాద్యత నిర్వర్తించాల్సి వచ్చినా దీక్షగా, మనస్ఫూర్తిగా చేయటం ఆయన నైజం. ప్రతి బాధ్యతను ఒక అవకాశంగా మార్చుకొనే నేర్పరి. వృత్తి, ఉద్యోగంపట్ల ఆయనకున్న నిబద్ధత కర్తవ్య నిర్వహణలో కనపరచే అకుంఠిత దీక్ష, సమయస్పూర్తి, నిర్ణయాలు తీసుకోవడంలో కనపరచే వొడుపు, పనిలో వేగం, నిర్దిష్టత ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

నాబార్డులో చేరినవెంటనే నేషనల్‌ కెమికల్‌ లాబొలేటరీ వంటి ప్రముఖ సంస్థలతో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం వచ్చింది.
సిఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన డాక్టరు మషేల్కర్‌ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చించే అవకాశం కలిగింది. 1987లో స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక విధానాలను రూపకల్పన చేసేందుకు నాబార్డ్‌ ఏర్పాటు చేసిన అధికారుల బృందంలో జి.ఆర్‌ చింతల పనిచేశారు. ఆ తరువాతి కాలంలో స్వయం సహాయక గ్రూపులు (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు) దేశ వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. 2001లో దేశంలో స్వయం సహాయక గ్రూపులు పదిలక్షలు దాటిన సందర్భంగా నాబార్డ్‌కు ఐరాస అవార్డు లభించింది.

ఐదేళ్ళు నాబార్డ్‌ కేంద్ర కార్యాలయంలో పనిచేసాక జిఆర్‌ చింతల హైద్రాబాదుకు బదిలీ అయ్యారు. హైద్రాబాదులో ఉద్యోగం ఆయన జీవితంలో అనేక సానుకూల మార్పులకు అవకాశం కల్పించింది. 23 జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. రైతులను, అధికారులను తరచుగా కలిసి మాట్లాడేవారు. ఇదే కాలంలో నాబార్డులో సహోద్యోగి సుశీలతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నాబార్డ్‌ అనుబంధ సంస్థ అయిన NAB KISAN సిఇఒ & మేనేజింగ్‌ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. హైద్రాబాద్‌లోనే వారికి ఒక పాప కూడా పుట్టింది.

అదేకాలంలో బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులలో చాలామందిని మళ్ళీ కలుసుకున్నారు చింతల. వారిలో దయాకర్‌, ఎస్‌వి ఎస్‌ఎస్‌, జె సత్యన్నారాయణ, వై వి ఆర్‌, మురళి, మైనర్‌ రమణ, వలేటి గోపీచంద్‌ (రమణ, గోపీచంద్‌ కాలేజీలో ఆయనకు జూనియర్లు అయితే వారు చూపే ఆప్యాయత మరువలేనిదని, తన సోదరుడు సివివి సాగర్‌తోపాటు వారు సోదర సమానులని చింతల పేర్కొంటారు) తదితరులున్నారు. పాత స్నేహాలు చిగురించాయి. ఆ ఆప్యాయతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
దాదాపు ఎనిమిది సంవత్సరాలు హైద్రాబాదులో పనిచేసాక డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొంది ఛండీగడ్‌కు బదిలీఅయ్యారు. అక్కడ నాబార్డ్‌ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేస్తూ పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. బ్యాంక్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కాంట్రాక్టు వ్యవసాయ పద్దతులను, గ్రామీణ సహకార బ్యాంకుల పనితీరును అధ్యయనం చేశారు.

ఆ తరువాత లక్నోలోని బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (BIRD)లో ఫ్యాకల్టీ సభ్యునిగా పనిచేసే అవకాశం కలిగింది. ఐదేళ్లు అక్కడ పనిచేయడం వల్ల వివిధ రంగాలలో నైపుణ్యం పెంపొందించుకొన్నారు. మంచి వక్తగా, కన్సల్టెంటుగా ఎదిగారు. తరువాతకాలంలో అదే సంస్థకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. BIRDలో వున్నపుడు దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, కెన్యా, పెరూ, బొలివీయా బ్రెజిల్‌, నేపాల్‌, యూకే, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ జర్మనీ, సౌత్‌ఆఫ్రికా, తదితర దేశాలలో పర్యటించారు. Swarna Jayani Swarojgar Yojana పథకానికి కన్సల్టెంట్‌గా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలలో దాదాపు లక్షమంది లబ్దిదారులను ఇంటర్వ్యూ చేశారు. దీనివల్ల ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నులు, దేశంలో పేదిరికం స్థాయి తదితర అంశాలపై విస్తృతమైన అవగాహన కలిగింది.

తరువాత జనరల్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌ పొంది అండమాన్‌దీవులలో రెండేళ్లు పనిచేశారు. ఇలాంటిచోట పనిచేయడానికి చాలామంది ఇష్టపడరు. కాని జిఆర్‌ చింతల ఎలాంటి సంకోచము లేకుండా పనిచేశారు. దేశంలోని వేరే ప్రాంతాలనుంచి వ్యవసాయం, ప్రాసెసింగ్‌ రంగాలకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించారు. పోర్టుబ్లెయర్‌లో నాబార్డ్‌ కార్యాలయం, సిబ్బంది నివాసగృహాల నిర్మాణం చేపట్టారు.

అండమాన్‌లో అయన చూపిన చొరవ, ఉత్సాహం గమనించిన నాబార్డ్‌ యాజమాన్యం ఆయనకు ఢిల్లీ కార్యాలయ బాధ్యతలను అప్పగించింది. కేంద్రప్రభుత్వంతో లైజాన్‌ నిర్వహించడమే ఢిల్లీ కార్యాలయం ప్రధాన బాధ్యత. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌లతోపాటు సంబంధిత అధికారులతో సత్సంబంధాలు నెరపుతూ నాబార్డ్‌ పనులు చక్కబెట్టడం ద్వారా అటు ప్రభుత్వంలోనూ ఇటు నాబార్డ్‌లోను మంచి పేరు, గుర్తింపు పొందారు.

ఆతరువాత లక్నోలోని బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (BIRD) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆసంస్థ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో జిఆర్‌ చింతల పిన్న వయస్కులు. ఆయనకు 50 ఏళ్లకే ఆ పదవి దక్కింది. అక్కడనుంచి బెంగళూరు వెళ్లారు. కర్ణాటకలో నాబార్డ్‌ కార్యకలాపాల ఇంఛార్జిగా. రెండేళ్లలో కర్ణాటకలో నాబార్డ్‌ లావాదేవీలను ఏడువేలకోట్ల రూపాయలనుంచి 18000 కోట్ల రూపాయలకుపెంచారు.

బెంగళూరు నుంచి నాబార్డ్‌ కేంద్ర కార్యాలయానికి 24 ఏళ్ళ తరువాత మళ్ళీ వెళ్లారు. ఈసారి మైక్రో ఫైనాన్స్‌ విభాగాధిపతి. 25 ఏళ్ళ క్రితం దేశంలో రూపుదిద్దుకున్న స్వయం సహాయక గ్రూపులు ఇప్పుడు పరివర్తన థకు చేరుకొన్నాయి. ఆనాడు స్వయం సహాయక గ్రూపుల విధివిధానాల రూపకల్పనలో పనిచేసిన జిఆర్‌ చింతల ఇప్పుడా గ్రూపుల వివరాలు డిజిటైజ్‌ చేసేపని చేపట్టారు. దీనివల్ల స్వయం సహాయక గ్రూపుల పరపతి విధానం మెరుగవుతుంది. మూడేళ్లు తలమునకలుగా ఆ బాధ్యత నిర్వహించారు. ఆ కాలంలో దేశంలోని 100 జిల్లాలలో డిజిటైజేషన్‌ కార్యక్రమం సాగింది.

అక్కడనుంచి నాబార్డ్‌లో ప్రధాన విభాగమైన రీఫైనాన్సుకు ఆయన అధిపతి అయ్యారు. అదేసంస్థలో 25 ఏళ్ళు వివిధ విభాగాల్లో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించిన తరువాతనే ఆయనకు ఆ విభాగంలో పనిచేసే అవకాశం లభించింది. ఆవిభాగంలో అప్పటిదాకా 10 నుంచి 15 శాతం వరకు ఏటా వృద్ధి ఉండేది. దాన్ని నూరుశాతానికి పెంచుదామని మొదటి సమావేశంలోనే జిఆర్‌ చింతల చెప్పగా సిబ్బంది నివ్వెరపోయారు. సాధ్యం కాదని అన్నారు కూడా. కాని కార్యసాధకుడైన చింతల ఎలా సాధ్యమో వారికి వివరించి, అందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పది నెలల్లో లక్ష్యం సాధించారు. 50,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యాపారం పదినెలల్లో 98,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆయన ఆపదవిలో ఉన్నంతవరకు కొనసాగింది.
ఆ తరువాత నాబార్డ్‌ అనుబంధ సంస్థ NABFINS (Micro Finance)కు సిఇఓగా బెంగళూరు వెళ్లారు. అక్కడ బాధ్యతలు స్వీకరించిన రోజునే నాబార్డ్‌ డిఎండి పదవికి నోటిఫికేషన్‌ వచ్చింది. ఆపదవికి జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఎంపికయ్యారు. బెంగళూరు వెళ్లిన 55 రోజులకే నాబార్డ్‌ డిఎండిగా పదోన్నతి పొందారు. ఆ ఫలితాలు వెలువడ్డ ఆరు రోజులకే నాబార్డ్‌ చైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ వెలువడింది. మూడు రోజులు, మూడు ప్యానెళ్లు జరిపిన ఇంటర్వ్యూలలో జిఆర్‌ చింతల తీవ్రమైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచారు. నాబార్డ్‌ ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కూడా దేశమంతటా పర్యటిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.

తల్లితండ్రులు: చింతల బుచ్చయ్య, అక్కినేని కృష్ణకుమారి.
పుట్టిన స్థలం / తేదీ: 1962 జూలై 15, బ్రాహ్మణ కోడూరు, గుంటూరు జిల్లా
విద్యాబుద్ధులు: బ్రాహ్మణ కోడూరులో ప్రాధమిక విద్య, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలులో ఉన్నత విద్య, జేకేసీ కళాశాలలో ఇంటర్మీడియేట్‌. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ, ఎమ్మెస్సీ (అగ్రీ). భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ.
గత, వర్తమాన హోదాలు: నాబార్డ్‌ ఛైర్మన్‌, 1985లో నాబార్డ్‌ చేరి అదే సంస్థకు ఛైర్మన్‌ అయిన ఖ్యాతి
ప్రస్తుత నివాసం/ చిరునామా: ముంబయి
సకుటుంబ సపరివార సమేత: భార్య సుశీల (నాబార్డ్‌ సహోద్యోగి కూడా), ఓ కుమార్తె.
ఇ-మెయిల్‌: grchintala@gmail.com
ఫోన్‌ నెంబర్‌: 9739150762

Read More

Organic Mela 2021

Organic Mela 2021

ప్రియ నేస్తం, సుస్థిర వ్యవసాయం, అన్నదాతల సంక్షేమం, ఆరోగ్య జీవనం లక్ష్యంగా రైతు నేస్తం పనిచేస్తోంది. రైతులని సుశిక్షితులని చేసే క్రతువులో భాగంగా సేంద్రియ, సహజ సేద్య విధానాలు, 

Read More