గత నాలుగు థాబ్దాల కాలంలో పాలు – పాడి పశువుల ధరలు పదిరెట్లు, కోడిగ్రుడ్లు, కోడిమాంసాల ధరలు     12-13 రెట్లు మాత్రమే పెరగగా, జీవాలు, జీవాల మాంసం ధరలు మాత్రం ఏకంగా సుమారు 50-60 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం పొట్టేలు మాంసం ధర కిలో 750-800 వరకు పలుకుతూ ఉంది. ఇందుకు జీవాల పోషణ-నిర్వహణ వ్యయాలు కూడా గణనీయంగా పెరగటమేకాక, వాటి నిర్వహణ కూడా అనేక సమస్యలతో కూడుకున్నది కావటం కూడా మరో ముఖ్య కారణం. పూర్వం జీవాల జీవనాధారమైన విశాలమైన పచ్చికబీళ్లు, బీడుభూములు, అటవీభూములు, తోటలు, ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలు, జీవాలమేతకు అందుబాటులో ఉండు మెట్ట సాగు భూములు కాలక్రమంలో మూడు పంటలందించే మాగాణీ భూములుగా మారిపోవటం మరియూ సాంప్రదాయ జీవాల పెంపకం కులాలలో జీవాలతో పాటు సంచార జీవితాల పట్ల ఆసక్తి తగ్గిపోవటం వంటి ఎన్నో కారణాలు కూడా సాంప్రదాయ జీవాల పెంపకానికే అవరోధంగా మారాయి. మారిన ఈ పరిస్థితులలో జీవాల పెంపకం లాభదాయకంతో పాటు నిర్వహణ సులభతరం కావడానికి సాంద్రపద్ధతిలో దాదాపుగా పూర్తి చేతిమేతతో పెంచడమే మంచిదని అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో యజమాని ప్రతి జీవంపై వెచ్చించే ప్రతి రూపాయి పెట్టుబడికి తగినట్లు మాంసం రూపంలో అదనపు రాబడిని పొందే ప్రయత్నం చేయకతప్పదు. శాస్త్రీయ సాంద్ర పద్ధతులలో జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు (ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం) జీవాల పెంపకాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే విధ్యాధికులు, యువత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులెందరో కూడా జీవాల పెంపకాన్ని చేపట్టి ఆధునిక శాస్త్రీయ విధానాలను పాటిస్తూ మంచి ఆదాయాలను పొందుచున్నారు. ఈ పరిశ్రమ రాబోయే రోజుల్లో ఒకబలమైన గ్రామీణ ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇటీవల హైదరాబాదులోని మెట్టసాగుభూములు పరిశోధనా కేంద్రం (క్రీడా) శాస్త్రజ్ఞులు కొందరు గొర్రెల పోషణపై జరిపిన పరిశోధనల ద్వారా ఎంతో విలువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించారు. పాలు విడిచిన తర్వాత అంటే 130 రోజుల వయస్సు నుండి మరో 100 రోజుల వరకు (మాంస కేంద్రాలకు తరలించే థ వరకు) పొట్టేలు పిల్లలకు సాధారణ దాణాలలో జీవానికి 50 గ్రాముల ఉలవల పిండిని కలిపి మేపితే రోజుకు సుమారు 50 గ్రాముల మేరకు అదనంగా శరీర బరువు పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన జొడిపి జాతి గొర్రెల మీదనే జరగటం విశేషం. ప్రస్తుతం జీవాల (జీవన బరువు)కు కిలోకు సుమారు 400 రూపాయల చొప్పున మార్కెట్లో ధర పలుకుతోంది. అంటే ఈ ఉలవలు మేసిన వంద రోజుల్లో ప్రతి జీవం తినే సుమారు 5 కిలోల ఉలవల ఖర్చు రూ. 70þ5 కిలోలు = 350 రూపాయలు కాగా అదనంగా పెరిగే శరీర బరువు 50 గ్రా.þ100 రోజులు = 5 కిలోల నుండి (5þ400) = రూ. 2000/- అదనపు ఆదాయాన్ని ఆశించవచ్చు. అంటే ఒక్కొక్క జీవంపై సగటున సుమారు 1650 రూపాయల వరకు నికరలాభం ఉంటుంది. ఇంతేకాక బలిష్టంగా కండపుష్టితో పెరిగిన ఈ జీవాలకు మార్కెట్‌లో గిరాకి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పోతు గొర్రెల నుండి నికర మాంసం దిగుబడి కూడా 3 నుండి 5 శాతం అధికంగానే ఉండవచ్చు.

గొర్రెలు-మేకలు నెమరువేసే జంతువులని మనందరికీ తెలుసు. మూడు నెలల వయస్సు దాటిన ఈ జీవాల పెద్దపొట్ట (రూమెన్‌)లో సహజంగానే ఉండే అనేక బ్యాక్టీరియా, ఇతర ఏకకణ పరాన్నజీవులు, ఇవి మేసిన మేతల్ని జీర్ణం చేసుకొనడంలో సహాయపడటంతోపాటు, ఆమేతలలో ఉండే కొన్ని నాణ్యమైన, విలువైన మాంసకృత్తుల్ని సంగ్రహించి, అభివృద్ధి చెంది తాము కూడా అంతర్గత ఆహారంగా జీవం చేత జీర్ణం కాబడి జీవాల మనుగడకు, ఉత్పాదకతను ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

అయితే విలువైన, ఖరీదైన పోషక పదార్థాలను ధ్వంసం చేసే రూమెన్‌లోని ఈ బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల దాడి నుండి తప్పించుకుని నేరుగా చిన్న ప్రేగులలో ప్రవేశించి, జీవానికి పూర్తి సహజ పోషక స్వభావంతో జీర్ణమయ్యే మేతల వల్ల జీవం తన పూర్తి పోషక అవసరాలను ఎక్కువ సమర్ధవంతంగా తక్కువ ఖర్చుతో తీర్చుకోగలదు. ఈ విధంగా రూమెన్‌లోని మార్పులను తప్పించుకుని (బైపాస్‌) ప్రేగులలో ప్రవేశించి జీవానికి ఉపయోగపడే పోషకాలను బైపాస్‌ పోషకాలుగానూ, అందులోని మాంసకృత్తులను బైపాస్‌ ప్రొటీన్లుగానూ వ్యవహరిస్తారు. 

ఉలవ గింజలలో ఉండే టానిన్‌ అనే పదార్థం వల్ల వీటికి, వీటితో కలిసిన ఇతర ముడిపదార్థాలలోని మాంసకృత్తులకు కూడా బైపాస్‌ స్వభావం ఏర్పడుతుంది. ఉలవలలోనే కాక ప్రత్తి చెక్క (కాటన్‌ సీడ్‌ కేక్‌)లో కూడా బైపాస్‌ ప్రొటీన్ల శాతం గణనీయంగానే ఉంటుంది.

ఉలవలలో 17.94 శాతం మాంసకృత్తులు, 14.94 శాతం క్రూడ్‌ ఫైబర్‌, 48.93 శాతం క్రొవ్వు సంబంధిత పదార్థాలు (ఈథర్‌ ఎక్ట్రాక్ట్‌), 14.4 శాతం సెల్యులోజ్‌తో పాటు జీవాలకు అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉలవలలో ఉండే అనేక పోషక విలువలతో పాటు, వీటి వల్ల జీవాల జీర్ణశక్తి పెరగటంతో పాటు, విసర్జితాల ద్వారా జరిగే పోషకాల నష్టం తగ్గుతుందని కూడా కనుగొనబడింది. రోజుకు 31/2 నుండి 4 కిలోల సూపర్‌ నేపియర్‌, హెడ్జ్‌లూసర్న్‌, స్టైలోహమాటో ముఖ్యంగా చిలగడదుంప (స్వీట్‌ పొటాటో) వంటి పచ్చి గ్రాసాలతో పాటు మొక్కజొన్న, వరితవుడు, గోధుమ తవుడు, మినరల్‌ మిక్చర్‌, ఉప్పుతో పాటు ఉలవల పిండిని 25-30 శాతం వరకు కలిపి మేపవచ్చును. ఉలవల ధర ఎక్కువ అనిపిస్తే దానిని 15-20 శాతానికి తగ్గించి ఆ మేరకు చౌకగా లభించే ప్రత్తి చెక్క పిండిని కలిపి, 130 రోజులు దాటిన ప్రతి గొర్రెపోతు పిల్లకు పచ్చి మేతల లబ్యత నాణ్యతను బట్టి 150 నుండి 200 గ్రాముల వరకు మేపి మంచి ఫలితాలను పొందవచ్చును.

ఇటీవల హైదరాబాదు, విజయవాడ, గోదావరి తదితర జిల్లాలో ఉలవచారు తయారీ మంచి లాభదాయక పరిశ్రమగా వృద్ధి చెందుతోంది. అక్కడ ఉపఉత్పత్తిగా చౌకగా లభ్యమయ్యే ఉడికిన ఉలవపప్పును కూడా జీవానికి 150-200 గ్రాముల వరకు (ఉడికినపప్పులో తేమ శాతం 70 వరకు ఉంటుంది కాబట్టి) మేపి కూడా మంచి ఫలితాలు సాధించవచ్చును. ఉలవలు ఉడికించి పని పశువులకు, పందెపు గిత్తలకు అనాదిగా మేపుతూనే ఉన్నారు.

వాణిజ్యపరంగా సాంద్రపద్ధతిలో నిర్వహించే గొర్రెల పెంపకందారులు, బక్రీదు, రంజాన్‌, క్రిస్ట్‌మస్‌, దసరా, సంక్రాంతి వంటి వేట మాంసానికి అత్యధిక డిమాండు వుండే రోజులకు మూడు నెలల ముందు నుంచి ఉలవలు లేదా ప్రత్తి చెక్క కలిపిన దాణాలు మేపి తమ ఆదాయాలను మరింతగా పెంచుకోగలరు.                    

డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611