19 నుంచి రుతుపవనాల తిరోగమనం
దేశ వ్యవసాయరంగానికి ఆయువుపట్టైన నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19-25 మధ్య నుంచి ప్రారంభం కావచ్చని జాతీయ వాతావరణ విభాగం గురువారం వెల్లడించింది. దేశ వాయవ్య ప్రదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జులై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలను అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నుంచి తిరోగమిస్తూ అక్టోబరు 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈసారి నైరుతి రుతుపవన కాలంలో దేశంలో 836.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 772.5 మి.మీ. కంటే ఎనిమిది శాతం ఎక్కువ. అయినప్పటికీ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశ వాయవ్య (4 శాతం) మధ్య (19 శాతం), దక్షిణాది (25 శాతం) ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురిశాయి.










