– వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌

వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమగ్ర పరిష్కారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లాల్లో మూడు రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయటాన్ని అభినందించారు. ఈ సమావేశంలో రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. రసాయనాల వాడకంతో ఆహారంలో పోషకాలు తగ్గుతున్నాయని తెలిపారు. భూసారం పెరగడానికి, రైతు శ్రేయస్సుకు ప్రకృతి వ్యవసాయం అవసరమని వివరించారు. దీనిలో సత్ఫలితాలను సాధిస్తున్న గుంటూరు జిల్లా నూతక్కి రైతు శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా వీరపనేనిగూడెం రైతు హేమలత విజయాలను అధికారులు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు, రైతు సాధికార సంస్థ సీఈఓ బి. రామారావు పాల్గొన్నారు.