రైతు ప్రయోజనాల పరిరక్షనే చట్టం పరమావధి కావాలి.

  • ప్రస్తుతం ఉన్న చట్టంలో నష్టపరిహారం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
  • వివిధ రాష్ట్రాలలో విత్తనచట్టం 1966కు అదనంగా అమలు అవుతున్న చట్టాలపై చర్చ
    1966లో తీసుకొచ్చిన విత్తన చట్టం మారిన పరిస్థితుల దృష్ట్యా మరియు స్థానిక అవసరాల దృష్ట్యా వాటిలో కొన్ని అదనపు రూల్స్‌ లేదా క్లాజ్‌లను కలపాల్సి ఉంటుందని, మరీ ముఖ్యంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల ఆర్‌ అండ్‌ డి వసతులపై నిరంతర నిఘా అవసరమని, ఎవరైనా కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే తీసుకొనే చర్యలు కఠినంగా రూపొందించాలని, అదేవిధంగా విత్తనోత్పత్తి రైతులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విత్తనచట్టం 1966లో కొన్ని మార్పులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన జరిగిన సమగ్ర విత్తన చట్టం, ఆవశ్యకత, చట్టంలో అదనంగా చేర్చాల్సిన అంశాలు, మున్నగువాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మార్పులు కూడా చట్టాల పరిధిలోకి లోబడి తీసుకొచ్చేవిధంగా ముసాయిదా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి సమావేశంలో సభ్యులు వెల్లిబుచ్చిన అభిప్రాయాలు అన్నిటినీ పరిగణలోనికి తీసుకోవాలని ఆదేశించారు. 3 నుండి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలో 3 నెలలలో ముసాయిదా సిద్ధం అయ్యేట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయకమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, డైరెక్టర్‌ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
    ఛైర్మన్‌ కోదండరెడ్డి మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో విత్తనచట్టంలో మార్పుల కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ప్రయత్నం వల్లనే బి.టి కాటన్‌ విత్తనం ధర రూ.1800 నుండి రూ. 650కి రావడం జరిగిందని తెలిపారు.
    సునీల్‌ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాల వివరాలు ముఖ్యంగా మహారాష్ట్రలో అమలవుతున్న పరిహారం చెల్లింపు వంటివి పరిశీలించవచ్చని తెలిపారు.
    వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉందని, విత్తన రైతుల ప్రయోజనాలు కూడా కాపాడేవిధంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.