తెలంగాణాలోని నారాయణపేట- కొడంగల్ సాగునీటి ఎత్తిపోతల పథకానికి (ఎన్కేఎలఐఎస్) కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎసఈఐ ఏఏ) పర్యావరణ అనుమతులు (ఈసీ) మంజూరు చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టు ప్రభావిత రెండు మండలాల్లో కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖలు ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాయి. వీటి నివేదికలను ఎసఈఐఏఏకు అందజేయగా ఆ సంస్థ మదింపు చేసి.. పర్యావరణ అనుమతులకు పచ్చజెండా ఊపింది.
ఈ ఎత్తిపోతల పథకం కింద నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 10 మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రూ.4,885 కోట్లతో మూడు దశల్లో జూరాల నుంచి 7 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు. పది జలాశయాల్లో 4 టీఎంసీలు నిల్వ చేస్తారు. దారి మధ్యలోని 123 గ్రామాలకు తాగునీరు అందిస్తారు.
ప్రాజెక్టు నిర్మాణాల వెంట రూ.3.92 కోట్లతో గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేస్తారు. 55.85 హెక్టార్లలో 54,500 మొక్కలు పెంచుతారు.

30 Jan, 2026
