తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతః మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో నిర్వహించిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ మరియు వ్యవసాయ అభివృద్ధి విధానాల ఫలితంగా తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని, పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

ఉత్పత్తి పెంపుతోపాటు రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడం, కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను అంతర్ౙాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం మాత్రమే సరిపోదని, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ మరియు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కూడా అత్యంత అవసరమని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్ పార్క్ ద్వారా ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించిందని వివరించారు. దీని ద్వారా రైతుల పంటలకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉద్యానవన పంటల ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరైన సరఫరా వ్యవస్థలు, ప్యాక్ హౌసులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తే రాష్ట్రం అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ముందుకు వెళ్లగలదని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదే సమయంలో రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా ఎంతో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ మరియు వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాలు దేశీయ రైతులపై ప్రభావం చూపే అవకాశముందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అలాగే అమెరికా వంటి దేశాలతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం అవసరమైనదే అయినా, అది దేశీయ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) వ్యవసాయ ఎగుమతులను విస్తరించడంలో కీలక పాత్ర పోషించగలవని మంత్రి చెప్పారు. రైతుల ఉత్పత్తులను సమీకరించడం, నాణ్యతను నిర్ధారించడం మరియు రైతులను నేరుగా ఎగుమతిదారులతో అనుసంధానం చేయడం ద్వారా చిన్న రైతులు కూడా ప్రపంచ మార్కెట్లలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. ఓఆంలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి మరియు ఇతర పరిశ్రమల సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రైతులు మరియు పారిశ్రామికవేత్తలలో అవగాహన పెంచేందుకు పలు శిక్షణ కార్యక్రమాలు మరియు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్-2047 వ్యవసాయం మరియు ఉద్యానవన రంగాల దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో ఉత్పత్తి పెంపుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహం మరియు రైతుల ఆదాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ముందంజలో నిలిచే పూర్తి సామర్థ్యం ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు మరియు రైతులు-పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ విస్తరణ మరియు వ్యవసాయ ఎగుమతుల పెంపుకు పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు నిర్వహించిన ఈ సెమినార్ వంటి కార్యక్రమాలు రైతులు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు మరియు విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయని మంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో, కొత్త ఎగుమతి అవకాశాలను గుర్తించడంలో మరియు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు. ఈ సెమినార్‌లో ఎఫఐసిసి ప్రతినిధులతో పాటు ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి మరియు ఎగుమతి రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

లక్ష ఎకరాలకు సాగు నీరు అందించగల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు

తెలంగాణాలోని నారాయణపేట- కొడంగల్ సాగునీటి ఎత్తిపోతల పథకానికి (ఎన్‌కేఎలఐఎస్) కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎసఈఐ ఏఏ) పర్యావరణ అనుమతులు (ఈసీ) మంజూరు చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టు ప్రభావిత రెండు మండలాల్లో కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖలు ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాయి. వీటి నివేదికలను ఎసఈఐఏఏకు అందజేయగా ఆ సంస్థ మదింపు చేసి.. పర్యావరణ అనుమతులకు పచ్చజెండా ఊపింది.
ఈ ఎత్తిపోతల పథకం కింద నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 10 మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రూ.4,885 కోట్లతో మూడు దశల్లో జూరాల నుంచి 7 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు. పది జలాశయాల్లో 4 టీఎంసీలు నిల్వ చేస్తారు. దారి మధ్యలోని 123 గ్రామాలకు తాగునీరు అందిస్తారు.
ప్రాజెక్టు నిర్మాణాల వెంట రూ.3.92 కోట్లతో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తారు. 55.85 హెక్టార్లలో 54,500 మొక్కలు పెంచుతారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే పది సంవత్సరాలలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళిక ఇది.
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ డి. రాజిరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్‌ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది.
వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్‌ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు.
ప్రణాళికలోని ప్రధాన అంశాలు
విస్తీర్ణం పెంచడం: పండ్లు, కూరగాయలలో విస్తీర్ణం పెంచడానికి అనువైన జిల్లాలను నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. పండ్ల పంటలలో జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌ (కమలం పండు). ద్రాక్ష, ఖర్జూరం అంజీర్‌, నేరేడు, ఉసిరి మరియు సీతాఫలం 1.32 లక్షల ఎకరాలలో 2030 వరకు అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో విస్తీర్ణం పెంచుకోవచ్చు. కూరగాయలలో 2030కు 2.45 లక్షల ఎకరాలలో అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో టమాటో, వంగ, క్యారెట్‌, క్యాబేజ్‌, దోస, కాలిఫ్లవర్‌, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర మరియు చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఆఫ్‌ సీజన్‌ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలుపరచాలి. సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్యతకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్‌ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలి.
ఉత్పాదకత పెంచడం: ఉద్యాన విశ్వవిద్యాలయం పెంపొందించిన సాంకేతికతను పండ్లు, కూరగాయలు, ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పంటలలో అమలుపరిచి అధిక దిగుబడి పొందేందుకు ప్రయత్నం చేయాలి. పంట నష్టాలను తగ్గించడానికి వాతావరణ ఆధారిత సూచనలు సమయానుకూలంగా విడుదల చేయాలి. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్రాల కొరకు కనీసం ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు సకాలంలో సాగు పనులు పూర్తి చేయగలిగి నష్టాలను తగ్గించు కోగలుగుతారు. ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి.
కోతానంతర పంట యాజమాన్యం: కోత అనంతరం పంట నష్టం తగ్గించడానికి కావలసిన శీతల నిల్వ గిడ్డంగులు, పండ్లను మాగబెట్టే కేంద్రాలు, నిల్వ వసతులతో మార్కెటింగ్‌ యార్డ్‌, శీతల రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఉల్లి పండించే ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో నిల్వ సదుపాయాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించడానికి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తగిన మౌలిక సదుపాయాలతో సమీకృత ప్యాక్‌ హౌస్‌ ఏర్పాటు చేయాలి. నాణ్యత పెంచడం, నిల్వ మరియు కోతానంతర పంటల నిర్వహణ, పురుగుమందు అవశేషాలు లేని ఉత్పత్తి, నిల్వకాలం పెంచడం, విలువ జోడింపు పై పరిశోధనలు విస్తృతం చేయాలి.
మార్కెటింగ్‌: రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సామూహిక క్రయవిక్రయాలను, పంట సాగు మరియు కోతానంతర పంట యాజమాన్యంలో సామూహిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలను సక్రమంగా అమలుపరిచేలా చర్యలు చేపట్టాలి, ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కలిసి నిర్వహించేలా శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలో నెలకొల్పాలి. ఈ సూచనలు రైతులకు సకాలంలో అందాలి.


ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్‌ డి. రాజి రెడ్డి, డాక్టర్‌ ఎ. భగవాన్‌, డాక్టర్‌ జి.పి. సునందిని రూపొందించారు.

Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ

  • దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం
  • ఫ్యాక్టరీలో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణ
  • ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
  • త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల

నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్‌ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్‌ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.

Read More

ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నర్మెట్ట ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ

రూ.300 కోట్ల వ్యయంతో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ పరిశ్రమను ఆగస్టు నెలాఖరుకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అశ్వారావుపేటలో మాత్రమే ఆయిల్‌పామ్‌ శుద్ధి పరిశ్రమ ఉంది. ఆ తర్వాత మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నర్మెట్టలో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 62 ఎకరాల్లో చేపట్టిన పనులు తుది థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

Read More

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల

  • దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్‌ స్టాప్‌ సెంటర్‌’గా మారాలి
  • ఎఫ్‌.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి
  • ఎన్‌.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్‌.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్‌.సి.డి.సి. మరియు కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్‌డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్‌ మెంట్‌ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్‌.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్‌.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్‌.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్‌ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్‌.సి.డి.సి. రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్‌ రవీందర్‌ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read More

81 గ్రామాలలో అన్ని ఇళ్లపై, వ్యవసాయ బోర్లకు సౌర ఫలకాలు

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో పూర్తిగా సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పుపై, వ్యవసాయ బోర్లకు, ఇతర కరెంటు కనెక్షన్లన్నింటికీ సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.1,273 కోట్లతో సౌర ఫలకాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ రెడ్కో ప్రకటన జారీచేసింది. ఇందులో రూ.400 కోట్లను రాయితీగా కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నెల 24లోగా టెండర్లను దాఖలు చేయాలని సూచించింది. ఈ గ్రామాల్లో 16,840 బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సౌర విద్యుత్‌ ఏర్పాటు అనంతరం అక్కడ వచ్చే కరెంటును బోరుకు వాడుకోగా మిగిలింది సాధారణ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. అలా సరఫరా చేసినందుకు బోరు యజమానికి యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల వారికి పంటల సాగుతోనే కాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ధరల్లో 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.4.50 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లించనుంది.

Read More