రైతు క్షేత్ర మరియు గృహ సంబంధిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి బయోగ్యాస్ (గోబర్ గ్యాస్)

భారత దేశం బలమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ ఖ్యాతి పొందినది. కారణం భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా మరియు పరోక్షం గాను వ్యవసాయ ఆధారిత ఉత్పతుల ఎగుమతులు, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ మూలధనం అందేది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద ఎప్పుడూ స్ధిరంగా ఉండేది. ఇటు రైతులు మరియు వ్యవసాయ అనుబంధ కార్మికుల ఆర్థికపరమైన ప్రగతి పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కర్మాగారాలు ప్రారంభించి పెట్టుబడి పెట్టి ఇటు ఉపాది కల్పనతో పాటు మంచి ఆర్ధిక ప్రగతిని సాధించేవారు. అంతే కాకుండా వ్యవసాయానికి పశు సంపదకు సంబందం వీడదీయలేనిది. కావున పాల ఉత్పత్తుల సంస్దలను ఏర్పాటు చేసి పాడి రైతులకు చేయూత అందించి ఇటు పశు పోషణలో గణనీయమైన అభివృద్ది సాధించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యంలో చిక్కుకొని పోయి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఆర్ధిక పురోగతి దెబ్బ తిని ఆ దేశాల ప్రజలు విల విల లాడారు. అటు వంటి సమయంలో భారత ఆర్ధిక వ్యవస్ద దెబ్బ తినకుండా నిల్చొని ప్రపంచదేశాలకు ధీటుగా జవాబు ఇచ్చింది. దానికి ప్రధాన కారణాలు పైన పేర్కొన్న అంశాలే కానీ ప్రస్తుతం అంతా విరుద్ధంగా మారింది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించి ఎక్కువమంది పట్టణాల వైపు తరలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ వ్యయo పెరగడంతో పాటు నష్టాలు పెరగడంతో అధిక శారరిక శ్రమ, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారడం వల్ల పూర్తిగా విఫలమయింది. దీనికి తోడు రైతుకు చేదోడు వాదోడు వుండే పశుపోషణ వ్యవస్దను పూర్తిగా నిర్లక్ష్య పరచడం కూడా ఒక ప్రధాన కారణం. నేల ఫల శక్తికి మూల కారణం అయిన సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కేవలం పశుపోషణ ద్వారా సాధ్యం అయ్యేది, ఈ పశుపోషణ ద్వారా వచ్చే సేంద్రియ పదార్దం నేలను సుదీర్గకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. కానీ ప్రస్తుత రైతులు సేంద్రియ ఎరువులు పూర్తిగా వదిలేసి కేవలం వాణిజ్య రసాయనిక ఎరువుల పైనే చొరవ చూపడం వల్ల నేలలో సేంద్రియ పదార్దం స్థితిగతులు పూర్తిగా తగ్గిపోయి నేల జీవ శక్తి క్షీణించి రసాయనిక ఎరువుల వల్ల నేల కలుషిత మై బీడు భూములుగా మారి పోయాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు నిమిత్తం వృక్ష సంపద పైన మాత్రమే ఆధారపడే వారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతవాసుల వలే వంట గ్యాస్ కు పూర్తిగా అలవాటు పడినారు. ఒక వైపు శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే గ్యాస్ వాడుక వల్ల వాటి ధరలు పెరగడంతో పాటు ప్రక్క దేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్థితికి చేరగా శిలాజ ఇంధనాల తరుగుదల వలన, వివిధ దేశాల మధ్య యుద్ద వాతవరణాల వలన వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అందేలా మారి ఇటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు అదనపు భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అభివృద్దికి సహకరించే సేంద్రియ ఎరువుల అవసరాన్ని తీర్చి నేల సారాన్ని పెంచే అధిక ఖర్చులతో కూడిన గ్యాస్ వంట బదులుగా పంట సంబంధిత వ్యర్దాలను, మరియు పశు వ్యర్ధాలతో అవాయు పరిస్దితులలో కుళ్ళింప చేసి అటు వంటకు గ్యాస్ మరియు ఇటు పోలానికి సేంద్రియ ఎరువును అందించవచ్చు. ఏమిటి ఆ పక్రియ అంటే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారీ విదానం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమగు అవాయు పరిస్దితుల్లో పని చేసే డైజెస్టర్ 1859లో ముoబై నగరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ విదానం మొట్టమొదట జర్మన్ శాస్త్రవేత్తలు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బయోగ్యాస్ విధానాన్ని ఆధునికరణం చేసి సులభంగా వాడేలా చేశారు. ఒకప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తిలో అగ్ర స్ధానంలో జెర్మనీ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చైనా దానిని అధికమించి అగ్రగామిగా ముందుకు వెళుతుంది. దానికి కారణం ఆ విధానంలో వున్న అధిక ఉపయోగాలే. మన దేశంలో కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం బయోగ్యాస్ అభివృద్దికి అనేక పరిశోధనలు చేసి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంస్ద ద్వారా ప్రజలకు సలహలు, సూచనలు, అవగహన కల్పిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు.

  1. బయోగ్యాస్ ప్లాంట్ మొత్తం అన్నీ విభాగాలను చూపించే నమూనా పటం

బయోగ్యాస్ తయారీ విధానం మరియు ముఖ్య విభాగాలు : బయోగ్యాస్ తయారీలో ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాలు కలవు అవి ఒకటి వ్యర్ద పదార్థాలను సంగ్రహించే విభాగం, రెండవది వ్యర్ద పదార్థాలను అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేసి బయోగ్యాస్ ఉత్పత్తి జరిపే డైజెస్టర్

కలిపే విభాగం (సంగ్రహణ విభాగం) :  ఈ విభాగం డైజెస్టర్ కు ప్రక్కన ఉండే భాగం. ఈ విభాగం ద్వారా బయోగ్యాస్ తయారీ కి అవసరం అగు వివిధ వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్దలను లోపలకి వేసి అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేయడానికి పశువుల పేడ నాలుగు భాగాలు మరియు  ఐదు భాగాలు నీరు (4 : 5) కలిపి లోపలికి పోయాలి . ఈ విధంగా పోసిన (4 : 5)  నిష్పత్తి కలిపిన పశువుల పేడ మరియు నీరు డైజెస్టర్ల లో స్టార్టర్ పదార్దంగా పనిచేసి లోపలి వ్యర్ద పదార్థాలు మిధనోకోకస్, మిధనో బాసిల్లాస్ వంటి బ్యాక్టిరియా సూక్ష్మజీవుల వలన  అవాయు పరిస్ది తుల్లో కిణ్వవణ పక్రియ ద్వారా కుళ్ళింపజేసి మీథేన్ (బయోగ్యాస్)  విడుదల అగును. 
  1. ఒకటవ రకమైన కదిలే ఢ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  2. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  3. మూడవ రకమైన దీన బంధు బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం

డైజెస్టర్ : బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) తయారీలో ముఖ్యమైన ప్రధాన విభాగం డైజెస్టర్ లేదా పేర్మెంటర్. బయోగ్యాస్ విభాగంలో ఇది మధ్యన ఉండి బయోగ్యాస్ తయారీకి సహకరించే అత్యంత కీలక విభాగం. సాధరణంగా బయోగ్యాస్ తయారీలో వాడే డైజెస్టర్ లేదా పేర్మెంటర్ ను మూడు రకాలుగా వర్గీకరించారు, అవి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ అభివృద్ది పరిచినది. ఈ రకపు డైజెస్టర్ ముడి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడి పరిమాణం పరంగా మధ్యస్థంగా ఉండును. సాధారణంగా భారత దేశంలో ఈ రకపు డైజెస్టర్లు ఎక్కువగా వాడుకలో కలవు. ఈ డైజెస్టర్ కు ఉన్న గొప్ప లక్షణం ఎటువంటి నష్టం లేకుండా మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు.
సాధారణంగా ఈ డైజెస్టర్ నేలలో 3.5 నుంచి 6.5 మీటర్ల లోతు మరియు 1.2 నుంచి 1.6 మీటర్ల వ్యాసార్దం గుంతను తవ్వి అందులో అమర్చాలి. పైన పేర్కొన్న కొలతలు సామాన్యంగా వాడేవి. ఈ కొలతలను బయోగ్యాస్ పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బయోగ్యాస్ డైజెస్టర్ లో రెండు గదులు కలవు. అవి మిశ్రమ విభాగం ద్వారా వేసే వ్యర్ద పదార్థాలు, వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్థాలను కుళ్ళింప జేసె డైజెస్టర్ . రెండవ గది డైజెస్టర్ ను రంద్రాలు కలిగిన గోడ ద్వారా వేరు చేయబడి కిణ్వన పక్రియ పూర్తి అయి బయోగ్యాస్ విడుదల జరిగిన తరువాత మిగిలిన పదార్దం ఆ రంద్రాల ద్వారా బయటకు వచ్చి చేరుకొనును. దీనిని మనం సేంద్రియ ఎరువుగా పాడి పంటలకు వాడుకోవచ్చు. డైజెస్టర్ పై భాగం కొద్దిగా వంపుగా వుండి ప్రెజర్ వాల్వుని కలిగి ఉండి వాలు కలిగిన పైపు ద్వారా వంట గదికి అమర్చుకొని వంట గ్యాస్ గా వాడుకోవచ్చు. ఈ పక్రియలో మొదట మిశ్రమ విభాగం ద్వారా వేసిన వ్యర్ద పదార్థాలు 4: 5 నిష్పత్తిలో వేసిన పేడ మరియు నీరు మిశ్రమం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి అవాయు పరిస్దితుల్లో మీథేన్ వాయువు అణువులు విడుదల అయి వంపు కలిగిన డైజెస్టర్ పై భాగాన్ని డీ కొని తడనం చెందడం ద్వారా పీడనం పెరిగి అన్నీ అణువులు ఒకదానికొకటి కలిసి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ను విడుదల చేయును. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన జనతా రకం దీనిని చైనా దేశం వాళ్ళు అబివృద్ది పరిచినారు. దీనిని సాధరణంగా ఇటుక మరియు కాంక్రీట్ మిశ్రమంతో నేల లోపల నిర్మిస్తారు. ఇది పరిమాణం పరంగా పెద్దది ఎక్కువ బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును. దీని జీవన కాల పరిమితి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మూడవ డైజెస్టర్ రకం దీనబంధు బయోగ్యాస్ దీనిని 1984లో ఎ. ఎఫ్. పి. ఆర్. ఓ అను నూడిల్లీకి చెందిన ఒక స్వచ్చంధ సంస్ద అభివృద్ది పరిచింది. ఇది కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చితే సగం ధరలో తయారీ అగును. నిరుపేద ప్రజలకు భాగా అనుకూలం అగు డైజెస్టర్

బయోగ్యాస్ వలన కలిగే ఉపయోగాలు:

  • పశువుల పేడ మిశ్రమ ద్రావణం మరియు విచ్ఛిన్నం అగు వివిధ పదార్ధాల ద్వారా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను ఇంటి వంటకు వాడుకోవచ్చు
  • కాంతి కోసం వాడే లాంతర్లలో నింపుకొని వాడుకోవచ్చు
  • రైతులకు సేంద్రియ ఎరువు లోటుని తీర్చి కావలసినంత సేంద్రియ ఎరువును సమకూర్చి ఆర్ధిక భారాన్ని తగ్గించి నేల ఆరోగ్యానికి కాపాడుటలో సహయపడును
  • పశుపోషణ అభివృద్దికి ప్రత్యక్షంగా ఉపయోగపడును. ఎలా అనగా బయోగ్యాస్ తయారీకి వాడే వ్యర్ధ పదార్ధాలలో అధిక భాగం పశువుల వ్యర్ధాలను వాడుతున్నారు. అంతే కాకుండా స్టార్టర్ పదార్ధంగా కూడా పశువుల పేడను వాడుట గమనించదగ్గ విషయం
  • విచ్చిన్నం అగు వ్యర్ధ పదార్ధాలను కుళ్ళింపజేయుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుటలో ఉపయోగపడును
  • సాధారణ పశువుల ఎరువుతో పోల్చుకుంటే బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో ఎక్కువగా పోషకాలు ఉండును. అందులో నత్రజని (2-2.5 %), భాస్వరం ( 1.5%), పోటాషియం (1 %) .
  • బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో అధికంగా సేంద్రియ కర్బనం మరియు హ్యూమస్ ఉండి నేలలో వివిధ జీవరాశుల అభివృద్దికి దోహదపడును.
  • ఎటువంటి నష్టం లేకుండా ఉష్ణశక్తి మరియు విద్యుత్ శక్తి పునరుద్దరణకు సహకరించును.
  • శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి వాటి స్ధానంలో బయోగ్యాస్ వాడుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడును.
  • వాయు కాలుష్యాన్ని తగ్గించి హరితగృహ వాయువుల ఉద్గారాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించును.
  • మిగతా సేంద్రియ ఎరువులలాగా కాకుండా చెడు వాసన లేకుండా వుండును,
  • బయోగ్యాస్ ఈగలు మరియు దోమల పునరుత్పత్తిని తగ్గించును

బయోగ్యాస్ తయారీలోన అధిగ మించవలసిన సవాళ్లు :

  • బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అనగా డైజెస్టర్ మరియు సంగ్రహణ విభాగం తయారీ అధిక ఖర్చులతో కుడికున్నది.
  • ప్రతి రోజు పశువుల పేడ మరియు ఇతర విచ్ఛిన్నం అయ్యే వ్యర్ధాలు సేకరణ శ్రమతో పాటు స్వల్ప ఆర్ధికపరమైన ఇబ్బందితో కూడుకున్నది.
  • సాధారణ వంట గ్యాస్ తో పోల్చుకుంటే బయోగ్యాస్ తక్కువ శక్తి కలిగిన ఇంధనంగా ఉపయోగపడును
  • ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్లయితే బయోగ్యాస్ తయారీకి చాలా ఎక్కువ సమయం తీసుకొనును.
  • బయోగ్యాస్ ను తయారీ దగ్గర మాత్రమే వాడుకోవాలి. దీని నిల్వ మరియు రవాణా అధిక వ్యయంతో కూడుకున్న అంశాలు
  • బయోగ్యాస్ తో పాటుగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్పేట్ వంటి వాయువులను వాడుకకు ముందు తొలగించాల్సిన అవసరం తప్పనిసరి
  • బయోగ్యాస్ ప్లాంట్ కు తగిన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల మీధేన్ వాయువు బయటకు విడుదల వలన హరిత వాయువుల మోతాదును పెంచడంతో పాటు మండే లక్షణం ఉండుట వలన అగ్ని ప్రమాదాలకు కారణం అగును
  • నైపుణ్యం కలిగిన వ్యక్తుల పర్యవేక్షణ మరియు శిక్షణ కలిగిన వ్యక్తులు ఉండి తగిన యాజమాన్య పద్దతులు పాటించుట వలన బయోగ్యాస్ తయారీలోని అవరోధాలను అధిగమించవచ్చు.

బయోగ్యాస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. 60 ఘనపు అడుగులు లేదా 2 మీటర్3 పరిమాణం కలిగిన బయోగ్యాస్ తయారీకి రోజుకి కనీసం 45-55 కేజీల పేడ అవసరం అంటే దీని కోసం 5 ఆవులు లేదా 5 గేదెలు అవసరం
  2. మానవ విసర్జన పదార్ధాలను (నైట్ సాయిల్) రోజుకి 60 కేజీలు హోటల్స్ మరియు హాస్టల్స్ , ప్రజల మరుగుదొడ్డి నుంచి సంగ్రహించి కూడా బయోగ్యాస్ తయారు చేయవచ్చు.
  3. ఒక పశువుల పేడే కాకుండా పందుల, కోళ్ళ విసర్జక పదార్దలను కూడా బయోగ్యాస్ తయారీలో వాడవచ్చు.
  4. బయోగ్యాస్ తయారికీ వాడే డైజెస్టర్ కి సూర్యరశ్మి సరిపడ తగిలేలా చూసుకోవాలి దీనివలన డైజెస్టర్ అంతర భాగంలో కిణ్వన ప్రక్రియ త్వరగా జరిగి ఇటు మీధేన్ వాయువు తయారీలో మరియు సేంద్రియ ఎరువు తయారీలో ఎంత గానో ఉపయోగపడును,
  5. బయోగ్యాస్ ప్లాంట్ కు మరియు వంట గదికి మధ్య దూరం 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
  6. బయోగ్యాస్ ప్లాంట్ ను మరియు వంట గదిని కలిపే పైపును కొద్దిగా వాలుగా వుండేటట్లు చూసుకోవాలి.
  7. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు గట్టిగా ఉండే నేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
  8. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు వాడే నేలలో నీటి ముంపు లేకుండా చూసుకోవాలి.
  9. బయోగ్యాస్ డైజస్టర్ ఇనుముతో తయారీ చేసినది అయితే అది త్రుప్పు పట్టకుండా రంగును వేసుకోవాలి.
  10. శీతకాలంలో డైజస్టర్ లో ఉష్ణ నష్టం జరగకుండా నివారించుటకు పైన వరి గడ్డి వేసుకోవాలి.
  11. పేడ ద్రావణం మరియు ఇతర పదార్థాల ద్వారా డైజెస్టర్లోనికి ఇసుక చేరకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
  12. భాగా కుళ్లిన ఎక్కువ మొలాసిస్ ను శీతకాలంలో వేయరాదు, ఎందుకు అనగా దీని వలన సరిగా మండని బయోగ్యాస్ విడుదల అగును.
  13. అరటి మరియు గుర్రపు డెక్కలను 5 – 10 సెం,మీ కత్తిరించుకొని సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  14. నీలగిరి లేదా యూకలిప్టస్ ఆకులను 5 రోజులు నీటిలో నానబెట్టిన మిశ్రమాన్ని పేడ ద్రావణం వేయడానికి ముందుగా వేసుకోవాలి.
  15. విచ్ఛిన్నం అగు గృహ మరియు ఇతర వ్యర్ధ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికుని, వరి మరియు అరటి కాండం ముక్కలను పశువుల పేడ ద్రావణంతో కలిపి సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  16. పశువుల పేడ ద్రావణం మిట్ట మధ్యాహ్నం డైజస్టర్ లోకి సంగ్రహణ విభాగం ద్వారా పంపుకోవాలి.
  17. ఉదయం మరియు సాయంత్రం బయోగ్యాస్ విడుదల అగు గొట్టం ద్వారా దేని సహయంతో నైనా డైజస్టర్ లోపలి భాగంలోని చెత్తను 50 సార్లు బాగా కలుపుకోవాలి. దీనివలన డైజెస్టర్ లో పేరుకు పోయిన తెట్టును సులభంగా తొలగించి బయోగ్యాస్ విడుదలకు సహకరించును. పై విధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు బయోగ్యాస్ తయారీ విధానాన్ని అనుసరించుట వలన ఇంటికి కావలసిన వంట గ్యాస్ అందించుట తో పాటు రైతుకు కావల్సిన సేంద్రియ ఎరువు అందించుట వలన నేల ఆరోగ్యాన్ని కాపాడుటతో పాటు బయోగ్యాస్ తయారీకి పశువుల ఎరువు పశువుల నుంచి సంగ్రహించుట ద్వారా పశుపోషణ ప్రోత్సహించి రైతులు ఆర్ధికంగా ప్రగతికి ఉపయోగపడుతూ పరిసరాలలో వ్యర్ద పదార్దాల కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఈ విధంగా రైతుకు అన్నీ రకాలుగా చేయూతను ఇవ్వడం వలన బయోగ్యాస్ ను రైతు క్షేత్ర మరియు గృహ సంబందిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి అని పిలవడంలో అతిశయోక్తి లేదు.

టి. రాజశేఖర్, సిహెచ్. సీత రామ లక్ష్మి, ఎ. శీరిష, ఎమ్. చారుమతి, ఎన్ . భారతి, టి. శ్రీలత, ఎమ్. ముకుందరావు
వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి
ఫోన్: 6304852859

Read More

ఔషధ మొక్క… కసివింద

కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
  • ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
  • కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
  • కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
  • కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
  • మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
  • కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
  • క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
  • చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పార్థీనియంను నిర్మూలిద్దాం

పార్థీనియంను శాస్త్రీయంగా పార్థేనియం హిస్టరోఫోరస్ అని పిలుస్తారు. ఇది మెక్సికో ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం భారతదేశం అంతటా విస్తరించి, వ్యవసాయం, పర్యావరణం మరియు ప్రజారోగ్యానికి తీవ్రమైన సమస్యగా మారింది. 1950లలో దిగుమతి సరుకుల ద్వారా ఇది అనుకోకుండా భారతదేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. దేశంలోకి వచ్చిన తరువాత ఇది వేగంగా వ్యాపించి పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 21 వ పార్థీనియం అవగాహన వారోత్సవం 16 ఆగష్టు నుండి 22 ఆగష్టు,2026 వరకు నిర్వహించబడింది.

పార్థీనియం దేశంలో అత్యంత సమస్యాత్మకమైన కలుపు మొక్కలలో ఒకటి. ఇది సుమారు 3.5 కోట్ల హెక్టార్ల భూమిలో వ్యాపించినట్లు అంచనా. తేలికపాటి నుంచి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వరకు వివిధ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సమస్య ఎక్కువగా ఉంది. మొదట రహదారులు, కాలువలు మరియు ఖాళీ ప్రదేశాల్లో కనిపించిన ఈ కలుపు, తరువాత పంట పొలాలు, అటవీ ప్రాంతాలు మరియు రక్షిత ప్రాంతాలకు కూడా వ్యాపించింది. జాతీయ ఉద్యానవనాల్లో గడ్డి కొరతకు కారణమై శాకాహార జంతువుల మనుగడను ప్రభావితం చేస్తోంది. పశుగ్రాస భూములను ఆక్రమించడం ద్వారా పశువులకు లభించే మేతను కూడా తగ్గిస్తోంది.

  1. పర్యావరణంపై ప్రభావాలు
  • వేగవంతమైన వ్యాప్తి: పార్థీనియం వేగంగా పెరిగి వివిధ వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలదు. అందువల్ల వ్యవసాయ భూముల నుంచి నీటి వనరుల పరిసరాల వరకు వివిధ ప్రాంతాలను ఆక్రమిస్తుంది.
  • జీవ వైవిధ్య నష్టం: స్థానిక మొక్కలతో పోటీ పడి వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. దీని వల్ల సహజ ఆవాసాల్లో జీవ వైవిధ్యం తగ్గుతుంది.
  1. వ్యవసాయంపై ప్రభావాలు
  • పంటలతో పోటీ: పార్థీనియం పంటలతో పోటీ పడి నీరు, పోషకాలు మరియు సూర్యకాంతిని వినియోగిస్తుంది. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది.
  • అల్లెలోపతి ప్రభావం: ఇది విడుదల చేసే కొన్ని రసాయనాలు ఇతర మొక్కల విత్తనాలు మొలకెత్తడం మరియు పెరుగుదలను అడ్డుకుంటాయి.
  1. ఆరోగ్య సమస్యలు
  • అలెర్జీ: పార్థీనియం పుప్పొడి తీవ్రమైన అలెర్జీని కలిగించవచ్చు. శ్వాసకోశ సమస్యలు, చర్మ అలెర్జీలు మరియు ఉబ్బసం వంటి సమస్యలు రావచ్చు.
  • వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదం: పార్థీనియం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం లేదా చెత్త తొలగింపు వంటి పనులు చేసే వారికి దీర్ఘకాలికంగా ఈ కలుపుతో సంబంధం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
  1. పశువులపై ప్రభావాలు
  • విషపూరిత ప్రభావం: పార్థీనియం పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కలుషితమైన మేతను తినడం వల్ల చర్మ సమస్యలు, సూర్యకాంతికి అధిక సున్నితత్వం మరియు శ్వాసకోశ ఇబ్బందులు కలగవచ్చు.

పార్థీనియం నియంత్రణ
పార్థీనియం వేగంగా పెరగడం మరియు వివిధ పరిస్థితులకు తట్టుకోవడం వల్ల దీని నియంత్రణ సవాలుగా ఉంటుంది. అందువల్ల ఒకటి కంటే ఎక్కువ నియంత్రణ పద్ధతులను కలిపి ఉపయోగించడం ఉత్తమం.

  1. చేతితో తొలగింపు
  • చేతితో పీకడం: చిన్న స్థాయిలో ఉన్న పార్థీనియం మొక్కలను వేర్లతో సహా చేతితో పీకడం సమర్థవంతమైన పద్ధతి. ఇది శ్రమతో కూడుకున్నప్పటికీ స్థానికంగా ఉన్న కలుపును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
  1. జీవ నియంత్రణ
  • కీటకాల ద్వారా నియంత్రణ: పార్థీనియంను తినే కొన్ని ప్రత్యేక కీటకాలను ఉపయోగించడం ద్వారా దీని పెరుగుదలను తగ్గించవచ్చు. ఉదాహరణకు, పార్థీనియం ఆకులను తినే Calligrapha bicolorata అనే బీటిల్ను జీవ నియంత్రణలో ఉపయోగిస్తారు.
  1. సాంప్రదాయ పద్దతులతో నియంత్రణ
  • పంట మార్పిడి: పంటలను మారుస్తూ సాగు చేయడం ద్వారా పార్థీనియం జీవచక్రాన్ని భంగపరచి వ్యవసాయ భూముల్లో దాని వ్యాప్తిని తగ్గించవచ్చు.
  • పోటీ పంటలు: పార్థీనియంతో పోటీ పడగల మరియు వేగంగా పెరిగే పంటలను ప్రోత్సహించడం ద్వారా ఈ కలుపు పెరుగుదలను తగ్గించవచ్చు.
  1. నివారణ చర్యలు
  • నిర్బంధ చర్యలు: పార్థీనియం కొత్త ప్రాంతాలకు వ్యాపించకుండా కలుషితమైన సరుకులు మరియు వాహనాల ద్వారా విత్తనాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
    పరిశుభ్రమైన వ్యవసాయ పద్ధతులు: వ్యవసాయ యంత్రాలు మరియు పరికరాలను పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా పార్థీనియం విత్తనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపించకుండా నివారించవచ్చు.
  1. యాంత్రిక పద్దతులతో నియంత్రణ
  • కోత మరియు తుంచడం: పార్థీనియం మొక్కలను క్రమం తప్పకుండా కోయడం లేదా తుంచడం ద్వారా వాటి ఎత్తును నియంత్రించి విత్తన ఉత్పత్తిని తగ్గించవచ్చు. అయితే దీనివల్ల కలుపు పూర్తిగా నిర్మూలించబడకపోవచ్చు.
  1. ప్రజల్లో అవగాహన
  • అవగాహన కార్యక్రమాలు: పార్థీనియం వల్ల కలిగే హానికర ప్రభావాలు మరియు దాని నియంత్రణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దీని వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
  1. పరిశోధన మరియు పర్యవేక్షణ
  • నిరంతర పరిశోధన: పార్థీనియం కోసం కొత్త మరియు మరింత సమర్థవంతమైన నియంత్రణ పద్ధతులను అభివృద్ధి చేయడానికి నిరంతర పరిశోధన అవసరం.
  • పర్యవేక్షణ కార్యక్రమాలు: పార్థీనియం వ్యాప్తిని గమనించడం మరియు అమలు చేస్తున్న నియంత్రణ చర్యల ప్రభావాన్ని అంచనా వేయడం సమర్థవంతమైన నిర్వహణకు అవసరం.

పార్థీనియం అవగాహన వారోత్సవం
భారతదేశంలో పార్థీనియం విస్తరణ సమస్యను పరిష్కరించడంలో ICAR–Directorate of Weed Research (DWR) ముందంజలో ఉంది. పార్థీనియంపై విస్తృత అవగాహన మరియు సమష్టి చర్యల అవసరాన్ని గుర్తించి, DWR 2004లో ‘పార్థీనియం అవగాహన వారోత్సవం’నిర్వహణను ప్రారంభించింది. ఈ వారోత్సవం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ICAR సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), వ్యవసాయ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs) మరియు ఇతర సంస్థలను ఒక వేదికపైకి తీసుకువస్తుంది.

పార్థీనియం అవగాహన వారోత్సవం లక్ష్యాలు

  • సమాజంలో అవగాహన కల్పించడం: పార్థీనియం వల్ల వ్యవసాయం, పర్యావరణం మరియు ప్రజారోగ్యంపై కలిగే హానికర ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేయడం. దీని ఆక్రమణ స్వభావం, జీవ వైవిధ్యంపై ప్రభావం మరియు ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన పెంచడం.
  • సమగ్ర కలుపు నిర్వహణ (IPM)ను ప్రోత్సహించడం: ప్రాంతానుసారంగా చేతితో తొలగింపు, రసాయన, జీవ మరియు సాంస్కృతిక నియంత్రణ పద్ధతులను సమన్వయంతో ఉపయోగించాల్సిన అవసరాన్ని తెలియజేయడం.
  • సమష్టి సహకారాన్ని పెంపొందించడం: పార్థీనియం సమస్యను పరిష్కరించడానికి పరిశోధనా సంస్థలు, వ్యవసాయ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక ప్రజల మధ్య సహకారాన్ని పెంచడం.
  • ఉత్తమ పద్ధతులను ప్రచారం చేయడం: పార్థీనియం నియంత్రణలో సమర్థవంతమైన పద్ధతులు, నివారణ చర్యలు మరియు పరిశుభ్రమైన వ్యవసాయ పద్ధతులను ప్రజలకు చేరవేయడం.

డా. కే. శేఖర్, సహాయ ఆచార్యులు (సేద్య విభాగం), వ్యవసాయ కళాశాల, హైద్రాబాద్
ఫోన్ : 9032128124

Read More

వరి ధాన్యం మిల్లింగ్ – నాణ్యతపై ప్రభావం

ధాన్యం పైన ఊక పొర, లోపల గోధుమరంగు పొరలు గల తెల్లటి బియ్యాన్ని కలిగి ఉంటుంది. ధాన్యంలో 20 శాతం ఊక, 80 శాతం దంపుడు బియ్యం ఉంటాయి. రబ్బరు రోల్ షెల్లర్ ధాన్యం నుంచి ఊక వేరుచేసిన తర్వాత దంపుడు బియ్యం వస్తుంది. దీనిని పాలిష్ చేయడం ద్వారా గోధుమరంగు పొరలను (తౌడు) తొలగించి తెల్లటి బియ్యాన్ని పొందవచ్చు వడ్ల శారీరక లక్షణాలను పట్టికలో చూడవచ్చు.

వడ్ల శారీరక లక్షణాలు:
శారీరక లక్షణం శాతం
వరి (ధాన్యం) 100
ఊక 20
దంపుడు బియ్యం 80
గోధుమ రంగు పొరలు (తౌడు ) 8-10
తెల్లటి బియ్యం 70-72

ధాన్యం మిల్లింగ్ చేసే పద్ధతిని గమనిస్తే:
ధాన్యం (100 కిలోలు)

⬇️
షెల్లింగ్ ➔ ఊక (20 కి.)
⬇️
దంపుడు బియ్యం (80 కి.)
⬇️
పాలీషింగ్ ➔ తవుడు (8-10 కి.)
⬇️
తెల్లటి బియ్యం (70-72 కి.)

వడ్ల నాణ్యతను నిర్ణయించు లక్షణాలు:
1) వడ్లలో తేమ శాతం
2) స్వచ్ఛత శాతం
3) వరి రకం
4) రంగు మారిన ధాన్యం
5) పగిలిన ధాన్యం
6) అపరిపక్వ ధాన్యం

వడ్ల నాణ్యత లక్షణాలను వాతావరణ పరిస్థితులు, పంట ఉత్పత్తి పద్దతులు, మట్టి పరిస్థితులు, పంట కోత పద్ధతులు, పంట కోత అనంతర నిల్వ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి.

వడ్లలో తేమ శాతం:
వడ్లలో తేమ బియ్యం నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మిల్లింగ్ లో అత్యధిక బియ్యం దిగుబడి పొందడా నికి సరైన తేమ అవసరం. సాధార ణంగా 12-14 శాతం తేమ గల వడ్లను మిల్లింగ్ చేసినప్పుడు ఎక్కువ బియ్యం, తక్కువ నూకలు పొంద వచ్చు. అధిక తేమ గల ధాన్యం మిల్లింగ్ సమయంలో ఒత్తిడిని తట్టు కోదు. తక్కువ తేమగల ధాన్యం పెళుసుగా ఉండటం వల్ల విరిగిపోయి బియ్యం ఉత్పత్తి తగ్గి, నూకల ఉత్పత్తి పెరుగుతుంది.

స్వచ్ఛత శాతం:
రాళ్లు, కలుపు విత్తనాలు, మట్టి, గడ్డి మొదలైన మలినాలు సాధార ణంగా ధాన్యం కోత సమయంలో లేదా ఆరబెట్టే ప్రదేశంలో కలుస్తాయి. శుభ్రం చేసిన ధాన్యం బియ్యం నాణ్యతను పెంచుతుంది మిల్లింగ్ అరుగుదలను తగ్గిస్తుంది.

వరి రకం: ధాన్యం పరిమాణం (పొడవు, వెడల్పు) బట్టి షెల్లర్ లో రబ్బరు రోలర్ల మధ్య దూరాన్ని సరిచేసుకో వాలి. ధాన్యం రకాన్ని బట్టి వాటి పరిమాణం మారుతుంది. వివిధరకాల ధాన్యాన్ని కలిపి మిల్లింగ్ చేయడం వల్ల షెల్లర్ ని సరిచేసుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల బియ్యం ఉత్పత్తి తెల్లదనం తగ్గుతాయి.

రంగుమారిన ధాన్యం: ధాన్యాన్ని తడి వాతావరణంలో ఎక్కువ సమయం ఉంచడం వల్ల పసుపు రంగుకు మారుతాయి. సాధారణంగా కోత సమయంలో వర్షాలవల్ల ధాన్యం రంగు మారుతుంది. రంగు మారిన ధాన్యం మిల్లింగ్ ద్వారా వచ్చిన బియ్యo దాని ఆకర్షణీయమైన తెల్లదనాన్ని కోల్పోతుంది. తడిచిన ధాన్యాన్ని వెంటనే డ్రయ్య ర్లో ఎండబెట్టటం ద్వారా ధాన్యం రంగుమారడాన్ని నివారించవచ్చు.

పగిలిన ధాన్యం:
ధాన్యాన్ని నిలకడలేని ఉష్ణోగ్రత, తేమ పరిస్థితుల్లో నిల్వచేయడం వల్ల బియ్యం లో పగుళ్ళు అభివృద్ధి చెందుతాయి. పగిలిన బియ్యం ఉన్న దాన్యాన్ని చేయడం ద్వారా బియ్యం దిగుబడి తగ్గుతుంది.

అపకరిపక్వ ధాన్యం:
ధాన్యo నమూనాలో అపరిపక్వ ధాన్యం శాతం మిల్లింగ్ పై ప్రభావం చూపు తుంది. అపరిపక్వ ధాన్యం చాలా సన్నటి, మరీ తెల్లటి బియ్యాన్ని కలిగి ఉంటుంది. ధాన్యం నమూనాలో అపరిపక్వ శాతం పెరిగేకొద్ది బియ్యం ఉత్పత్తి తగ్గుతుంది. ధాన్యాన్ని 20-24 శాతం తేమ ఉన్నప్పుడు పూత వచ్చిన 30 రోజుల తర్వాత కోత కోయాలి. పంట కోయడంలో అలస్యం జరిగితే కోసేటప్పుడు గింజలు పొలంలో రాలిపోయే ప్రమాదముంది.

బియ్యం నాణ్యత నిర్ణయించు అంశాలు:
బియ్యం నాణ్యత నిర్ణయించు లక్షణాలు తెలుసుకుందాం.
ధాన్యo =వడ్లు (ఊక పొర కలిగిన బియ్యం)
దంపుడు బియ్యం = ఊక తొలగించిన ధాన్యం
ఊక, తవుడును తొలగించిన ధాన్యం = మిల్లిoగ్ చేసిన బియ్యం (తెల్ల బియ్యం)

మిల్లింగ్ శాతం:
మిల్లింగ్ శాతం గోధుమరంగు గల దంపుడు బియ్యం బాహ్య పొరలను (తవుడు) తొలగించటాన్ని సూచిస్తుంది. మిల్లింగ్ శాతం బియ్యం రంగును, ఉడికే లక్షణాలను ప్రభావితం చేస్తుంది. దంపుడు బియ్యం ఉడకడానికి తెల్లటి బియ్యం కన్నా ఎక్కువసమయం పడుతుంది. తక్కువ నీటిని గ్రహిస్తుంది. 5-6 శాతం మిల్లింగ్ చేసిన బియ్యంలో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి. కాని మార్కెట్లో లభించే తెల్లబియ్యం 10 శాతం కన్నా ఎక్కువగా మిల్లింగ్ చేసినవే.

నూకలు లేని బియ్యం:
సాధారణంగా మార్కెట్లో నూకల ధరలు బియ్యం ధరలో సగం కన్నా తక్కువగా ఉంటాయి నూకలు లేని బియ్యానికి మార్కెట్ లో ధర ఎక్కువగా పలుకుతుంది. 75-80 శాతం పొడవు కలిగిన బియ్యాన్ని నూకలు లేని బియ్యంగా పరిగణిస్తారు.

తెల్లదనం:
బియ్యం తెల్లదనం దంపుడు బియ్యాన్ని పాలిష్ చేసే తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మిల్లింగ్ శాతం పెరిగేకొద్ది బియ్యం తెల్లదనం కూడా పెరుగు తుంది. పాలిషింగ్ లో దంపుడు బియ్యం గోధుమరంగు పొరలు (తవుడు) తొలగిస్తారు.

బియ్యం నాణ్యత నిర్ణయించుట:
బియ్యం పొడవు/ వెడల్పు నిష్పత్తి ద్వారా నాణ్యతను నిర్ణయించవచ్చు.
కింది పట్టికలో దంపుడు బియ్యం తెల్లటి బియ్యం, తవుడు పోషక విలువ లను చూడవచ్చు. ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా దాని పోషక విలువలు తగ్గినప్పటికీ నిల్వచేసే సమయం పెరుగుతుంది. రైతులు ధాన్యాన్ని 18-25 తేమ శాతం వద్ద కోత కోసి 12-14 శాతం తేమ శాతం వరకు ఎండబెట్టి ధాన్యాన్ని సరైన ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం వద్ద నిల్వచేసి మిల్లింగ్ చేయడం ద్వారా అధిక బియ్యం దిగుబడులు పోoడవచ్చు.

బియ్యం నాణ్యత (ఐ.ఎస్.ఓ వర్గీకరణ)
ఆకారం పొడవు/ వెడల్పు-నిష్పత్తి
సన్న బియ్యం 3 కన్నా అధికం
మధ్యస్థ బియ్యం 2.1-3
బోల్డ్ బియ్యం (దొడ్డు బియ్యం) 1.1-2
రౌండ్ బియ్యం 1 కన్నా తక్కువ

-N. స్వప్న, Ch. ప్రగతి కుమారి, వి. శ్రీ రమ్య, కె.శ్రవంతి, భానుశ్రీ, Dr. వి.అనిత
వ్యవసాయ కళాశాల, పాలెం.

Read More

ANGRAU – DAATTC MOBILEAPP

ANGRAU – DAATTC MOBILE APP – రైతులు, వ్యవసాయ అధికారులు, విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, తెగుళ్లు – పురుగుల నివారణ, పోషక యాజమాన్యం, వాతావరణ ఆధారిత సూచనలు మరియు విశ్వవిద్యాలయం అందించే తాజా సాంకేతిక వేదిక.

పరిచయం:
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని సకాలంలో అందించడం అత్యంత అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొనిఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Acharya N.G. Ranga Agricultural University – ANGRAU) పరిధిలోని District Agricultural Advisory and Transfer of Technology Centre (DAATTC) ఆధ్వర్యంలో ANGRAU DAATTC App అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ ను డా.పి.బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త (Transfer of Technology) & కోఆర్డినేటర్, DAATTC, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా రూపొందించారు.
ఈ మొబైల్ యాప్ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, విస్తరణ సిబ్బంది మరియు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సమగ్ర డిజిటల్ సమాచార వేదికగా పనిచేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన తాజా సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సిఫార్సులు మరియు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు సులభంగా చేరవేయడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ లో పంటల వారీగా శాస్త్రీయ సాగు విధానాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు, విత్తనాల ఎంపిక, భూమి తయారీ, విత్తే సమయం, విత్తన మోతాదు, నాటే దూరం, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నియంత్రణ, సమగ్ర పురుగుల మరియు తెగుళ్ల నివారణ పద్ధతులు వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలకు తక్షణమే శాస్త్రీయ పరిష్కారాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రధాన ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఎంతో అవసరం. ఈ యాప్ ద్వారా పంటల వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాభావం లేదా అధిక వర్షాల సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలను రక్షించుకునే మార్గాలు వంటి విలువైన సూచనలు అందించబడతాయి. దీని ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే అవకాశం
ఉంటుంది.

ANGRAU DAATTC_App ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పూర్తిగా ANGRAU శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు అధికారిక సమాచారం సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. అందువల్ల రైతులకు విశ్వసనీయమైన, శాస్త్రీయమైన మరియు ప్రామాణికమైన సమాచారం అందుతుంది. అదనంగా రైతుల శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ ప్రదర్శనలు, సాంకేతిక వీడియోలు, ప్రచురణలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఈ యాప్ కేవలం రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులకు, రైతు సేవా కేంద్రాల (RSKs)సిబ్బందికి, కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs)శాస్త్రవేత్తలకు, వ్యవసాయ పాలిటెక్నిక్ మరియు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కూడా ఒక ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్స్ వేదికగా ఉపయోగపడుతుంది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో, రైతు సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు సాంకేతిక సలహాలు అందించే సందర్భాల్లో ఈ యాప్ సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.

ఈ యాప్ యొక్క మరో ముఖ్యమైన విశేషం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో సులభమైన వినియోగాన్ని అందించడం. గ్రామీణ ప్రాంత రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా సరళమైన రూపకల్పన (User-Friendly Interface) కలిగి ఉండటం వల్ల ప్రతి రైతు తన మొబైల్లోనే వ్యవసాయ సమాచారాన్ని పొందగలుగుతున్నాడు. దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం నేరుగా రైతుల చేతికి చేరుతుంది.

డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు శాస్త్రీయ సమాచారం, సకాలంలో వ్యవసాయ సూచనలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే వేదికలో అందించే ANGRAU DAATTC Appనేటి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరమైన మొబైల్ అప్లికేషన్ గా నిలుస్తుంది. రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత వృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల విస్తరణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రధాన ప్రయోజనాలు:
• రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా అందిస్తుంది.
పంటల వారీగా సమగ్ర సాగు యాజమాన్య సమాచారాన్ని అందిస్తుంది.
• పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాల నివారణకు నిపుణుల సూచనలు అందిస్తుంది.
• వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులకు ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్ గా పనిచేస్తుంది.
• శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు తోడ్పడుతుంది.
డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తుంది.

ముగింపు:
ANGRAU DAATTC App అనేది కేవలం ఒక మొబైల్ యాప్ మాత్రమే కాదు, రైతులకు శాస్త్రీయ వ్యవసాయ జ్ఞానాన్ని అందించే డిజిటల్ విజ్ఞాన వేదిక. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరవేసి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, లాభదాయకత మరియు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఒక వినూత్న ప్రయత్నంగా ఈ యాప్ నిలుస్తోంది. ప్రతి రైతు, వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త మరియు వ్యవసాయ విద్యార్థి తమ మొబైల్లో ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును.

డా. పి. బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త &కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా – 531024
డా.డి.ఆదిలక్ష్మీ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ph: 9550506498
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా– 531111

Read More

సూక్ష్మ జీవుల వృద్ధి కోసం… ఇ.ఎం. ద్రావణం

కావలసిన పదార్థాలు : మగ్గిన అరటి పండ్లు : 3 కిలోలు; బొప్పాయి పండ్లు (గింజలు తీసినవి) : 3 కిలోలు; గుమ్మడి పండ్లు (తొక్క తీసిన) : 3 కిలోలు; లేత కొబ్బరి నీరు : 300 మి.లీ.; కోడిగ్రుడ్లు : 2; నీరు : 10 లీటర్లు.

తయారు చేయు విధానం

  • పైన తెలిపిన పదార్థాలను (1, 2, 3) బాగా ముద్దగా చేసి ఒక కుండలో వేయాలి.
  • దానికి 10 లీ. నీటిని, 300 మి.లీ. లేత కొబ్బరి నీటిని మరియు 2 కోడిగ్రుడ్ల సొనని చేర్చాలి.
  • ఈ మిశ్రమాన్ని ఉంచిన కుండను గుడ్డతో కప్పి 45 రోజుల వరకూ నీడలో ఉంచాలి.
  • మధ్య మధ్యలో పై మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి. కషాయానికి 5 లీ. నీటిని చేర్చి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది?

  • పై ద్రావణంలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి భూసారం పెంచడంలో ఉపయోగపడతాయి.
  • ఈ ద్రావణంలో ఉన్న పోషకాల వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.
Read More

ఎల్‌నినో ప్రభావం: పంటలపై కీటకాల ఉధృతి — రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

వాతావరణ మార్పులతో మారుతున్న కీటకాల ప్రవర్తనను అర్థం చేసుకొని, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంతో నష్టాలను నివారిద్దాం

పరిచయం
వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. విజయవంతమైన పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం, సకాలంలో వర్షాలు, సరైన ఉష్ణోగ్రతలు, తగిన నేల తేమ వంటి అంశాలు అత్యంత కీలకం. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు (Climate Change) వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, దీర్ఘకాలిక కరువు, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, వడగాడ్పులు (Heat Waves) వంటి పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు దోహదపడే ప్రధాన కారణాల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి. ఎల్‌నినో ప్రభావం పంటల పెరుగుదలపైనే కాక, పంటలను ఆశించే కీటకాల జీవన చక్రం, సంతానోత్పత్తి రేటు, వ్యాప్తి, హానికారకత్వంపై కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. కొన్ని కీటకాలు అసాధారణంగా విజృంభించి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తే, మరికొన్నింటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.

కాబట్టి “ఎల్‌నినో సంవత్సరాల్లో ఏ కీటకాలు ఎక్కువగా విజృంభిస్తాయి? ఏ పంటల్లో ఎక్కువ నష్టం సంభవించే అవకాశం ఉంది? రైతులు ఎలాంటి ముందస్తు, సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి?” అనే అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండటం నేటి పరిస్థితుల్లో అత్యవసరం.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 0.5°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగి, ఆ పరిస్థితి కనీసం ఐదు వరుస నెలలపాటు కొనసాగినప్పుడు నిర్ధారించే ఒక సహజ సముద్ర-వాతావరణ దృగ్విషయం (ENSO వ్యవస్థలో వెచ్చని దశ).
సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు (Trade Winds) వెచ్చని ఉపరితల జలాలను ఇండోనేషియా వైపుకు నెట్టివేస్తాయి. ఎల్‌నినో సమయంలో ఈ గాలులు బలహీనపడటం వల్ల వెచ్చని నీరు మధ్య-తూర్పు పసిఫిక్‌లోనే పేరుకుపోయి, ప్రపంచ వాతావరణ ప్రసరణ మార్గాల్లో మార్పులకు కారణమవుతుంది.

ఈ మార్పుల ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై, ముఖ్యంగా భారత ఉపఖండంపై స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో ఈ కింది పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ:
• సాధారణం కంటే తక్కువ, అనిశ్చిత వర్షపాతం
• నైరుతి రుతుపవనాల బలహీనత లేదా ఆలస్యం
• పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు
• నేల తేమ తగ్గుదల
• దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు

గమనిక: ఇవి సంభావ్యతలు మాత్రమే — ఎల్‌నినో ఉన్న ప్రతి సంవత్సరం భారతదేశంలో కరువు తప్పనిసరిగా వస్తుందని కాదు; స్థానిక భౌగోళిక అంశాలు, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి ఇతర అంశాలు కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో కీటకాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
కీటకాలు శీతల రక్త జీవులు (Poikilothermic/Cold-blooded organisms) — వాటి శరీర ఉష్ణోగ్రత పరిసర వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణంలో స్వల్ప మార్పులు కూడా వాటి పెరుగుదల రేటు, జీవిత చక్రంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు:
• గుడ్లు వేగంగా పొదుగుతాయి
• లార్వా దశ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది
• ప్యూపా దశ కాలం తగ్గుతుంది
• పెద్ద పురుగులు త్వరగా లైంగిక పరిపక్వత చెంది సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి
• ఒకే పంట కాలంలో ఎక్కువ తరాలు (generations) అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది

తక్కువ వర్షపాతం వల్ల:
• భారీ వర్షాల ద్వారా సహజంగా కొట్టుకుపోయే పురుగుల మరణాల రేటు తగ్గుతుంది
• ఆకులపై నివసించే చిన్న, మృదుకాయ కీటకాలు సులభంగా మనుగడ సాగిస్తాయి
• అధిక తేమ అవసరమయ్యే కీటక-పరాన్నజీవి శిలీంధ్రాలు (entomopathogenic fungi వంటివి) సమర్థంగా వృద్ధి చెందక, కీటకాల సహజ మరణాల రేటు తగ్గుతుంది
ఫలితంగా కొన్ని కీటక జాతుల జనాభా వేగంగా పెరిగి, ఆర్థిక నష్టపు గరిష్ఠ స్థాయిని (Economic Threshold Level) దాటే అవకాశం ఏర్పడుతుంది.

ఎల్‌నినో పరిస్థితుల్లో ఎక్కువగా విజృంభించే కీటకాలు
ఎల్‌నినో ప్రభావంతో అన్ని కీటకాలు ఒకేలా పెరగవు. ప్రధానంగా వేడి, పొడి వాతావరణానికి అనుకూలంగా ఉండే జాతులు మాత్రమే వేగంగా విస్తరిస్తాయి.

  1. రసం పీల్చే పురుగులు (Sap-Sucking Insects)
    ఎల్‌నినో పరిస్థితుల్లో అత్యధికంగా పెరిగే కీటక సమూహం ఇదే. ఇందులో తెల్లదోమలు, తామర పురుగులు (Thrips), పేనుబంక (Aphids), జాసిడ్లు, మీలీబగ్స్, స్కేల్ కీటకాలు ప్రధానమైనవి. ఇవి మొక్కల ఆకులు, లేత కొమ్మలు, పూతలు, పిందెల నుండి కణరసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తాయి.
    ఎక్కువగా పెరగడానికి కారణాలు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాపేక్ష ఆర్ద్రత, వేగవంతమైన జీవితచక్రం, అధిక సంతానోత్పత్తి సామర్థ్యం.
    కలిగించే నష్టం: మొక్కల పెరుగుదల మందగించడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం, పూత-పిందె రాలిపోవడం, దిగుబడి తగ్గుదల, వైరస్ వ్యాధుల వేగవంతమైన వ్యాప్తి.
  2. తామర పురుగులు (Thrips)
    ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో సంవత్సరాల్లో అధికంగా నమోదయ్యే కీటకాల్లో ఇవి ముఖ్యమైనవి. మిరప, ఉల్లి, వేరుశెనగ, పత్తి, ద్రాక్ష, పూల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి. త్రిప్స్ ఆకు ఉపరితలాన్ని గీరి కణరసాన్ని పీల్చడం వల్ల ఆకులపై వెండి-బూడిద రంగు మచ్చలు/గీతలు (silvering) కనిపిస్తాయి. తీవ్ర ఉధృతిలో ఆకులు ఎండిపోయి పంట పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. మిరపలో ఇవి “ఆకుముడత” (leaf curl) వ్యాధి వ్యాప్తికి కూడా దోహదపడతాయి.
  3. తెల్లదోమ (Whitefly)
    తెల్లదోమ అనేక మొక్కల వైరస్ వ్యాధులకు (ముఖ్యంగా బిగోమోవైరస్‌లకు) ప్రధాన వాహకం. ఎల్‌నినో పరిస్థితుల్లో వీటి జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పత్తి, టమాట, బెండ, మిరప, సోయాబీన్ పంటల్లో అధిక నష్టం కలిగిస్తుంది — ప్రత్యక్ష రసం పీల్చడం ద్వారానే కాక, వైరస్ వ్యాప్తి ద్వారా కూడా.
  4. పచ్చ నల్లి / స్పైడర్ మైట్స్ (Spider Mites)
    సాంకేతికంగా మైట్స్ కీటకాలు (Insecta) కాదు — ఇవి అష్టపాద జాతికి (Arachnida) చెందినవి. అయినప్పటికీ వ్యవసాయ సస్యరక్షణలో వీటిని హానికర కీటకాలతో పాటే పరిగణిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణంలో వీటి అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. పత్తి, మిరప, వంకాయ, కూరగాయలు, పండ్ల తోటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి.
  5. మీలీబగ్స్ (Mealybugs)
    మామిడి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పత్తి వంటి పంటల్లో ఎల్‌నినో సంవత్సరాల్లో మీలీబగ్స్ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటి తీపి విసర్జనం (honeydew) మీద నల్లటి బూజు తెగులు (Sooty mold) ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
  6. ఫాల్ ఆర్మీవార్మ్ మరియు స్పోడోప్టెరా జాతులు
    ఫాల్ ఆర్మీవార్మ్ (Spodoptera frugiperda) మరియు టుబాకో కాటర్‌పిల్లర్ (Spodoptera litura) వంటి ఆకుతినే పురుగుల తీవ్రత ఎల్‌నినో ఒక్క కారణం వల్లనే పెరుగుతుందని చెప్పడం శాస్త్రీయంగా సరికాదు. అయితే దీర్ఘకాలిక పొడి వాతావరణం వల్ల మొక్కలపై ఒత్తిడి (Plant stress) పెరగడం, సహజ శత్రు కీటకాల (parasitoids, predators) సంఖ్య తగ్గడం, ఆలస్యంగా వచ్చే వర్షాలు వంటి పరోక్ష కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న, వేరుశెనగ, సోయాబీన్, కూరగాయల పంటల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.

రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌నినో సంవత్సరాల్లో కీటకాల ఉధృతిని పూర్తిగా నివారించలేకపోయినా, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం (Integrated Pest Management – IPM) ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు
    • తట్టుకునే/తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవడం
    • విత్తనశుద్ధి తప్పనిసరిగా చేపట్టడం (సిఫారసు చేసిన శిలీంధ్రనాశక/కీటకనాశక మోతాదులతో)
    • భూసార పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల
    • పంట మార్పిడి (Crop rotation) పాటించడం
    • పంట చుట్టూ ట్రాప్ పంటలు (marigold, castor వంటివి) వేయడం
  2. పంట పెరుగుదల దశలో నిరంతర పర్యవేక్షణ
    • ప్రతి వారం పొలాన్ని పరిశీలించి కీటకాల ఉనికిని గుర్తించడం
    • పసుపు/నీలం రంగు జిగురు అట్టలు (Yellow/Blue sticky traps) – తెల్లదోమ, తామర పురుగుల పర్యవేక్షణకు
    • లింగాకర్షక బుట్టలు (Pheromone traps) – ఆకుతినే పురుగుల ముందస్తు హెచ్చరికకు
    • ఆర్థిక నష్టపు స్థాయి (Economic Threshold Level – ETL) దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం — ముందుగానే మందులు వాడకపోవడం
  3. నీటి యాజమాన్యం
    • అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుతూ, డ్రిప్/స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా క్రమం తప్పకుండా తేమ నిర్వహణ
    • తేలికపాటి తుంపర్లు (light irrigation/sprinkling) ఇవ్వడం ద్వారా ఆకులపై పేరుకున్న కొన్ని రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు
    • నీటి ఎద్దడి (moisture stress) లేకుండా చూసుకోవడం, ఎందుకంటే ఒత్తిడికి గురైన మొక్కలు కీటకాలకు మరింత లోబడతాయి
  4. జీవ నియంత్రణ (Biological Control) ప్రోత్సాహం
    • క్రైసోపెర్ల, లేడీబర్డ్ బీటిల్స్ వంటి సహజ శత్రు కీటకాలను సంరక్షించడం
    • NPV, బ్యూవేరియా బాసియానా వంటి జీవ కీటకనాశకాలను తగిన పరిస్థితుల్లో వినియోగించడం
  5. సమగ్ర రసాయన యాజమాన్యం
    • స్థానిక వ్యవసాయ శాఖ / కృషి విజ్ఞాన కేంద్రం సిఫారసులను పాటించడం
    • పురుగుల, తెగుళ్ల నిరోధకత (resistance) ఏర్పడకుండా జాగ్రత్త పడటం
    • పిచికారీకి ముందు వాతావరణ సూచనలు పరిశీలించడం — ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న వేళల్లో పిచికారీ మానుకోవడం
  6. సమాచార వినియోగం
    • భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర వ్యవసాయ శాఖల ముందస్తు హెచ్చరికలను నిరంతరం అనుసరించడం
    • సమీప కృషి విజ్ఞాన కేంద్రం (KVK) నిపుణుల సలహాలు తీసుకోవడం
    • తోటి రైతులతో అనుభవాలు పంచుకుంటూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం

ముగింపు
ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు రైతుల నియంత్రణలో లేనప్పటికీ, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, తగిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నిర్ణయాలు, జీవ-రసాయన నియంత్రణ పద్ధతుల సమతుల్య వినియోగం ద్వారా రైతులు ఎల్‌నినో సంవత్సరాల్లో కూడా తమ పంటలను సురక్షితంగా కాపాడుకోగలరు.

ఈ వ్యాసంలోని సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. నిర్దిష్ట పంట, ప్రాంతం, తెగుళ్ల తీవ్రతను బట్టి స్థానిక వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

డా. టి. నరేష్, సహాయ ఆచార్యులు (కీటక శాస్త్రం) మరియు డా. హరీషా ఎన్. , సహాయ ఆచార్యులు (వ్యవసాయ విస్తరణ శాస్త్రం), విజ్ఞాన్ వ్యవసాయ మరియు సాంకేతిక సంస్థ విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, గుంటూరు.

Read More

పశువుల కొనుగోలు సమయంలో తప్పక పరిశీలించాల్సిన 10 ముఖ్యమైన అంశాలు

     పాడి పరిశ్రమ రైతులకు రోజువారీ ఆదాయం అందించే ముఖ్యమైన అనుబంధ వృత్తి. అయితే, ఈ రంగంలో లాభం రావాలంటే మొదటి అడుగు నాణ్యమైన పశువును ఎంపిక చేసుకోవడమే. చాలామంది రైతులు పశువు బయటకు ఆరోగ్యంగా కనిపిస్తే చాలు అనుకుని కొనుగోలు చేస్తారు. కానీ పాల ఉత్పత్తి, ఆరోగ్య స్థితి, వయస్సు, ప్రజనన చరిత్ర, టీకాలు, నిర్వహణ వంటి విషయాలను పరిశీలించకుండా కొనుగోలు చేస్తే తరువాత పాల దిగుబడి తగ్గడం, తరచూ అనారోగ్యం రావడం, చికిత్స ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువును కొనుగోలు చేసే ముందు కొంత సమయం కేటాయించి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తే భవిష్యత్తులో నష్టాలను నివారించవచ్చు. రైతులు తప్పక గుర్తుంచుకోవాల్సిన 10 ముఖ్యమైన అంశాలు ఇవి.
  1. కొనుగోలు లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి
    పశువును ఎందుకు కొనుగోలు చేస్తున్నామో ముందుగా స్పష్టంగా నిర్ణయించుకోవాలి. పాలు ఉత్పత్తి పెంచడానికా, సంతానోత్పత్తికా, ఇప్పటికే ఉన్న ఫారాన్ని విస్తరించడానికా, లేక కొత్తగా పాడి పరిశ్రమ ప్రారంభించడానికా అనే విషయాన్ని ముందే ఆలోచించాలి. లక్ష్యానికి అనుగుణంగా పశువును ఎంపిక చేస్తే సరైన జాతి, సరైన వయస్సు, అవసరమైన పెట్టుబడి నిర్ణయించడం సులభం అవుతుంది. మీ ప్రాంత వాతావరణం, పచ్చిమేత లభ్యత, నీటి సౌకర్యం, నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇతరుల మాటలు విని లేదా తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం కంటే ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేయడం మంచిది.
  2. మంచి జాతి పశువును ఎంపిక చేయాలి
    పాడి పరిశ్రమలో లాభదాయకతకు జాతి ఎంపిక చాలా ముఖ్యమైనది. అయితే కేవలం జాతి పేరును చూసి పశువును కొనుగోలు చేయకూడదు. మీ ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండే, మంచి పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన, ఆరోగ్యవంతమైన పశువును ఎంపిక చేయాలి. సాధారణంగా ఆవులలో గిర్, సాహివాల్ వంటి స్వదేశీ జాతులు, అలాగే హెచ్‌ఎఫ్ (HF) సంకరజాతి, జెర్సీ సంకరజాతి పశువులు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. గేదెలలో ముర్రా, జాఫ్రాబాది వంటి జాతులు రైతుల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఏ జాతినైనా ఎంపిక చేసే ముందు పశువు ఆరోగ్యం, పాల దిగుబడి, ప్రజనన చరిత్ర, స్థానిక పరిస్థితులకు అలవాటు పడే సామర్థ్యం, నిర్వహణ సౌలభ్యం వంటి అంశాలను పరిశీలించాలి. వీలైనంత వరకు విశ్వసనీయ రైతులు, ప్రభుత్వ పశు అభివృద్ధి కేంద్రాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు లేదా గుర్తింపు పొందిన డెయిరీ ఫారాల నుంచి పశువులను కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల నాణ్యమైన పశువును ఎంపిక చేసే అవకాశం పెరుగుతుంది.
  3. వయస్సు మరియు కొనుగోలుకు అనువైన దశను గుర్తించాలి
    పాడి పశువు వయస్సు, దాని పాల ఉత్పత్తి, ప్రజనన సామర్థ్యం, ఉత్పాదక జీవితంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల పశువును కొనుగోలు చేసే ముందు దాని వయస్సును తప్పనిసరిగా తెలుసుకోవాలి. పుట్టిన తేదీ లేదా రికార్డులు లేకపోతే పళ్లను పరిశీలించి వయస్సును అంచనా వేయవచ్చు. అవసరమైతే పశువైద్యుని సహాయం తీసుకోవడం మంచిది. సాధారణంగా రెండో లేదా మూడో ఈతలో ఉండి, ఇటీవల ఈనిన పాడి పశువులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అలాంటి పశువుల గత పాల ఉత్పత్తి, ప్రజనన చరిత్రను అంచనా వేయడం సులభం. అలాగే మరికొన్ని సంవత్సరాలు ఉత్పాదకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. చాలా చిన్న వయస్సు గల లేదా అధిక వయస్సు గల పశువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. పశువు చివరిసారిగా ఎప్పుడు ఈనిందో, ప్రస్తుతం పాలిచ్చే కాలంలో ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవాలి.
  4. శారీరక ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి
    పశువు బయటకు ఆరోగ్యంగా కనిపించడం మాత్రమే సరిపోదు. కొనుగోలు చేసే ముందు దానిని కొంతసేపు గమనించి సాధారణ ఆరోగ్య స్థితిని అంచనా వేయాలి. ఆరోగ్యవంతమైన పశువు చురుకుగా ఉండి మేతను ఆసక్తిగా తింటుంది. కళ్లు స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉండాలి. ముక్కు సహజంగా తేమగా ఉండాలి. వెంట్రుకలు నునుపుగా, మెరుస్తూ ఉండాలి. చర్మంపై గాయాలు, పుళ్లు, గడ్డలు లేదా చర్మవ్యాధి లక్షణాలు ఉండకూడదు. శ్వాసలో ఇబ్బంది, తరచుగా దగ్గు, ముక్కు లేదా కళ్ల నుంచి అసాధారణ స్రావం, విరేచనాలు, అధిక బలహీనత, శరీరంపై వాపులు లేదా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే అలాంటి పశువును కొనుగోలు చేయకపోవడం మంచిది. పశువు మేత తినే తీరు, నెమరు వేసే విధానం,మూత్రం రంగు, మలవిసర్జనను కూడా గమనించాలి. సందేహం ఉంటే కొనుగోలు చేసే ముందే స్థానిక పశువైద్యునితో పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి.
  5. పొదుగు నిర్మాణం, చనుమొనలను పరిశీలించాలి
    పాడి పశువును కొనుగోలు చేసే సమయంలో పొదుగు నిర్మాణం, చనుమొనలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆరోగ్యకరమైన పొదుగు మృదువుగా, సమతుల్యంగా ఉండి శరీరానికి బలంగా అనుసంధానమై ఉండాలి. పొదుగు నాలుగు భాగాలు సమానంగా అభివృద్ధి చెంది ఉండటం మంచిది. నాలుగు చనుమొనలు సహజ ఆకారంలో, సరైన దూరంలో ఉండి పాలు పితికేందుకు అనువుగా ఉండాలి. పొదుగులో గడ్డలు, గట్టిపడిన భాగాలు, అధిక వేడి, వాపు, గాయాలు లేదా నొప్పి ఉన్నాయేమో పరిశీలించాలి. వీలైతే పాలు పితికే సమయంలో ప్రత్యక్షంగా గమనించి నాలుగు చనుమొనల నుంచి పాలు సరిగా వస్తున్నాయో చూడాలి. మొదటి పాలధారలను శుభ్రమైన పాత్రలో తీసుకుని వాటి రంగు, స్వభావం, గడ్డలు ఉన్నాయేమో పరిశీలించాలి. పాలలో గడ్డలు, రక్తపు చారలు లేదా ఇతర అసాధారణ మార్పులు కనిపిస్తే పొదుగు వాపు (మాస్టిటిస్) ఉండే అవకాశం ఉంది. అలాంటి పశువులను పశువైద్యుని పరీక్ష లేకుండా కొనుగోలు చేయకపోవడం మంచిది.
  6. కాళ్లు, గిట్టలను పరిశీలించాలి
    పాడి పశువు రోజంతా నిలబడటం, నడవడం, మేత మేయడం వంటి పనులకు బలమైన కాళ్లు అవసరం. అందువల్ల కొనుగోలు చేసే ముందు పశువును కొంత దూరం నడిపించి దాని నడకను గమనించాలి. కుంటడం, ఒక కాలిపై ఎక్కువ బరువు వేయడం లేదా నడవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు ఉంటే అలాంటి పశువులను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. గిట్టలు ఆరోగ్యంగా, పగుళ్లు లేకుండా ఉండాలి. కాళ్ల కీళ్ల వద్ద వాపు, గాయాలు లేదా అసాధారణ మార్పులు ఉన్నాయేమో పరిశీలించాలి. కాళ్ల సమస్యలు ఉన్న పశువులు మేతను సరిగా తినలేకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైన కాళ్లు, ఆరోగ్యకరమైన గిట్టలు ఉన్న పశువులను ఎంపిక చేయాలి.
  7. పాల దిగుబడి వివరాలు తెలుసుకోవాలి
    పశువు ఎన్ని పాలు ఇస్తుందనే విషయాన్ని కేవలం యజమాని మాటలపై ఆధారపడి నిర్ణయించకూడదు. వీలైతే ఉదయం లేదా సాయంత్రం పాలు పితికే సమయంలో ప్రత్యక్షంగా పరిశీలించి పాల దిగుబడిని అంచనా వేయాలి. పశువు ఏ తేదీన ఈనిందో, ప్రస్తుతం ఎన్ని నెలల పాలకాలంలో ఉందో కూడా తెలుసుకోవాలి. ఇటీవల ఈనిన పశువులు సాధారణంగా మంచి పాల ఉత్పత్తి దశలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత ఈతల వివరాలు, పాల ఉత్పత్తి రికార్డులు, కృత్రిమ గర్భధారణకి సంబంధించిన సమాచారం ఉంటే పరిశీలించడం మంచిది. ఈ వివరాలు అందుబాటులో ఉంటే పశువు ఉత్పాదకతను మరింత విశ్వసనీయంగా అంచనా వేయవచ్చు.
  8. టీకాలు, ఆరోగ్య రికార్డులు పరిశీలించాలి
    పశువుకు గాలికుంటు వ్యాధి (FMD), లంపీ స్కిన్ వ్యాధి (LSD), హెమరేజిక్ సెప్టిసీమియా (HS), బ్లాక్ క్వార్టర్ (BQ) వంటి ముఖ్యమైన వ్యాధుల నివారణ టీకాలు సకాలంలో వేయించారో లేదో తెలుసుకోవాలి. అలాగే నులిపురుగుల నివారణ మందులు క్రమం తప్పకుండా ఇచ్చారా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి. గతంలో తీవ్రమైన వ్యాధులు వచ్చాయా, శస్త్రచికిత్సలు జరిగాయా, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకోవడం అవసరం. వీలైతే ఆరోగ్య రికార్డులు, చెవి ట్యాగ్ (Ear Tag) లేదా ఇతర గుర్తింపు వివరాలను నమోదు చేసుకోవాలి.
  9. స్వభావాన్ని గమనించాలి
    పశువు ఆరోగ్యంతో పాటు దాని స్వభావం కూడా చాలా ముఖ్యమైనది. కొన్ని పశువులు పాలు పితికేటప్పుడు తన్నడం, ఎక్కువగా ఆందోళన చెందడం లేదా మనుషులను చూసి భయపడడం వంటి ప్రవర్తన చూపుతాయి. అలాంటి పశువులను నిర్వహించడం కష్టంగా మారుతుంది. అందువల్ల పశువును కొంతసేపు గమనించి, యజమాని లేదా పాలు పితికే వ్యక్తితో మాట్లాడి దాని స్వభావం గురించి తెలుసుకోవాలి. శాంత స్వభావం కలిగిన పశువులు నిర్వహణకు సులభంగా ఉండటమే కాకుండా పాల ఉత్పత్తి కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.
  10. కొనుగోలు తర్వాత వేరుగా ఉంచాలి
    కొత్తగా కొనుగోలు చేసిన పశువును నేరుగా ఇప్పటికే ఉన్న పశువులతో కలపకూడదు. కనీసం రెండు వారాల పాటు (10–15 రోజులు) ప్రత్యేక ప్రదేశంలో వేరుగా ఉంచి దాని ఆరోగ్యాన్ని గమనించాలి. ఇలా చేయడం వల్ల కొత్త పశువు ద్వారా ఇతర పశువులకు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ సమయంలో ఆహారం, నీరు, మలవిసర్జన, శరీర ఉష్ణోగ్రత, సాధారణ ప్రవర్తనను పరిశీలించాలి. అదేవిధంగా స్థానిక పశువైద్యునితో పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించి అవసరమైతే టీకాలు, నులిపురుగుల నివారణ మందులు ఇప్పించాలి. కొత్త పశువును రవాణా చేసే సమయంలో కూడా గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చర్యల వల్ల కొత్త పశువు కొత్త వాతావరణానికి సులభంగా అలవాటు పడుతుంది. అలాగే పాకలో ఇప్పటికే ఉన్న ఇతర పశువులకు అంటువ్యాధులు వ్యాపించకుండా నివారించవచ్చు
    పాడి పరిశ్రమలో విజయానికి నాణ్యమైన పశువును ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకమైన మొదటి అడుగు. పశువును కొనుగోలు చేసే సమయంలో ఆరోగ్యం, వయస్సు, పాల ఉత్పత్తి, ప్రజనన చరిత్ర, టీకాలు, స్వభావం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో అనవసర ఖర్చులు, నష్టాలను నివారించవచ్చు. అందువల్ల పశువుల కొనుగోలులో తొందరపడకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే పశువైద్యుని సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం ద్వారా పాడి పరిశ్రమను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ముర్రా గేదె

సాహీవాల్ ఆవు

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల, టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 7093198419

Read More

ఔషధ మొక్క…. వేప

వేప జన్మ స్థానం భారతదేశం. ఈ చెట్టు సుమారుగా 50 అడుగుల దాకా ఎత్తు పెరుగుతుంది. ఫిబ్రవరి, మార్చిలలో పూలు పూస్తాయి. పూలు తెలుపు రంగులో గుత్తులుగుత్తులుగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి. ఏప్రిల్ మాసం చివరికి కాయలు వస్తాయి. వేప చెట్టులోని బెరడు, ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, ఆకులు, కలప సమస్తం ఉపయోగపడుతాయి. వేప, మన నిత్య జీవితంలో ఆరోగ్య సమస్యలకు ఔషధముగా, సౌందర్య సాధనాలుగా, వ్యవసాయంలో క్రిమిసంహారిణిగా, ఎరువుగా, కలపగా ఉపయోగపడుతుంది. వేప పువ్వుని సేకరించి ఎండబెట్టి చూర్ణం చేసి ఎన్నో జీర్ణశక్తిని పెంచే ఔషధాలలో వాడుతారు. వేప కలపకు దీర్ఘకాలం మన్నే గుణం ఉంది. అందుకే ఈ కలపను నిర్మాణ రంగంలో విరివిగా ఉపయోగిస్తారు. వ్యవసాయ పనిముట్ల తయారీకి కూడా వాడతారు. వేప బెరడును చర్మవ్యాధులకు, జ్వరాలకు, అంటువ్యాధులకు సంబంధించిన ఔషధాలలో వాడుతారు.

సాధారణ నామం : వేప శాస్త్రీయ నామం : అజాడిరిక్టా ఇండికా కుటుంబం: మీలియేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వేప గింజలతో తీసిన నూనెను సౌందర్య సాధనాల తయారీకి, ఔషధాల తయారీలో, వ్యవసాయ రంగంలో క్రిమిసంహారిణిగా వాడుతారు.
  • వేప గింజల నుండి తయారైన వేప పిండిని ఎరువులలో, క్రిమిసంహారక మందులలో వాడుతారు.
  • వేపపిండి, వేపాకులు భూమిలో వేసి కలియదున్నట వలన కొన్ని రకాల శిలీంద్ర తెగుళ్ళను నివారించవచ్చు.
  • వేపనూనె పిచికారి చేయటం వలన, జామ, కాలీఫ్లవర్, సపోటా, అరటి వంటి పండ్ల మొక్కలను ఆశించే నులి పురుగులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
  • వేప గింజల పొడిని వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాల వంటి గింజలలో కలిపి నిలువ చేస్తే కీటకాల బారి నుంచి అరికట్టవచ్చు. వందకిలోల ధాన్యానికి ఒక కిలో వేప గింజల పిండి సరిపోతుంది. దీని వలన ధాన్యం రంగు, రుచి, వాసనల్లో ఎలాంటి మార్పులు రావు. అంతేకాదు. సుమారు 9 నెలలు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ధాన్యం నిల్వ కాలాన్ని పొడిగించాలంటే, మళ్ళీ ఇంకొక కిలో వేప గింజల పొడి చేర్చి నిల్వ చేసుకోవచ్చు.
  • టమాట నారు నాటే ముందు వేప నూనె ద్రావణంలో గాని, వేప గింజల కషాయంలో గాని ముంచి నాటినట్లయితే ఎండుతెగులును అరికట్టవచ్చు.
  • మిరపలో వేరు పురుగుల బెడదను నివారించటానికి 250 కిలోల వేపపిండిని ప్రతి హెక్టారు విస్తీర్ణంలో ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
  • వేప నూనె మందుల్ని ఉదయం లేదా సాయంత్రం పూట చల్లని వాతావరణంలో పిచికారి చేయవలసి ఉంటుంది. అంతేకాని, మిట్ట మధ్యాహ్నపు ఎండలో పిచికారీ చేసినట్లయితే సూర్యరశ్మి వలన దీని ప్రభావం త్వరగా తగ్గిపోతుంది. – రాంబాబు, ఆహార్ కుటీర్

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. శతావరి

శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.

సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
  • దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
  • శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
  • శతావరి ఆకుల ఇథనాల్ ద్రావణం బాసిల్లస్ ప్యుమిలిస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియాకోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, ప్రోటియస్‌వుల్గారిస్, స్టెఫైలోకోకసఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాండిడా ఆల్బికాన్స్ పెరుగుదలను అరికట్టింది (బిట్టు అండ్ కుమార్, 2010).
  • శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
  • శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More