రైతు క్షేత్ర మరియు గృహ సంబంధిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి బయోగ్యాస్ (గోబర్ గ్యాస్)
భారత దేశం బలమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ ఖ్యాతి పొందినది. కారణం భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా మరియు పరోక్షం గాను వ్యవసాయ ఆధారిత ఉత్పతుల ఎగుమతులు, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ మూలధనం అందేది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద ఎప్పుడూ స్ధిరంగా ఉండేది. ఇటు రైతులు మరియు వ్యవసాయ అనుబంధ కార్మికుల ఆర్థికపరమైన ప్రగతి పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కర్మాగారాలు ప్రారంభించి పెట్టుబడి పెట్టి ఇటు ఉపాది కల్పనతో పాటు మంచి ఆర్ధిక ప్రగతిని సాధించేవారు. అంతే కాకుండా వ్యవసాయానికి పశు సంపదకు సంబందం వీడదీయలేనిది. కావున పాల ఉత్పత్తుల సంస్దలను ఏర్పాటు చేసి పాడి రైతులకు చేయూత అందించి ఇటు పశు పోషణలో గణనీయమైన అభివృద్ది సాధించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యంలో చిక్కుకొని పోయి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఆర్ధిక పురోగతి దెబ్బ తిని ఆ దేశాల ప్రజలు విల విల లాడారు. అటు వంటి సమయంలో భారత ఆర్ధిక వ్యవస్ద దెబ్బ తినకుండా నిల్చొని ప్రపంచదేశాలకు ధీటుగా జవాబు ఇచ్చింది. దానికి ప్రధాన కారణాలు పైన పేర్కొన్న అంశాలే కానీ ప్రస్తుతం అంతా విరుద్ధంగా మారింది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించి ఎక్కువమంది పట్టణాల వైపు తరలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ వ్యయo పెరగడంతో పాటు నష్టాలు పెరగడంతో అధిక శారరిక శ్రమ, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారడం వల్ల పూర్తిగా విఫలమయింది. దీనికి తోడు రైతుకు చేదోడు వాదోడు వుండే పశుపోషణ వ్యవస్దను పూర్తిగా నిర్లక్ష్య పరచడం కూడా ఒక ప్రధాన కారణం. నేల ఫల శక్తికి మూల కారణం అయిన సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కేవలం పశుపోషణ ద్వారా సాధ్యం అయ్యేది, ఈ పశుపోషణ ద్వారా వచ్చే సేంద్రియ పదార్దం నేలను సుదీర్గకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. కానీ ప్రస్తుత రైతులు సేంద్రియ ఎరువులు పూర్తిగా వదిలేసి కేవలం వాణిజ్య రసాయనిక ఎరువుల పైనే చొరవ చూపడం వల్ల నేలలో సేంద్రియ పదార్దం స్థితిగతులు పూర్తిగా తగ్గిపోయి నేల జీవ శక్తి క్షీణించి రసాయనిక ఎరువుల వల్ల నేల కలుషిత మై బీడు భూములుగా మారి పోయాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు నిమిత్తం వృక్ష సంపద పైన మాత్రమే ఆధారపడే వారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతవాసుల వలే వంట గ్యాస్ కు పూర్తిగా అలవాటు పడినారు. ఒక వైపు శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే గ్యాస్ వాడుక వల్ల వాటి ధరలు పెరగడంతో పాటు ప్రక్క దేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్థితికి చేరగా శిలాజ ఇంధనాల తరుగుదల వలన, వివిధ దేశాల మధ్య యుద్ద వాతవరణాల వలన వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అందేలా మారి ఇటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు అదనపు భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అభివృద్దికి సహకరించే సేంద్రియ ఎరువుల అవసరాన్ని తీర్చి నేల సారాన్ని పెంచే అధిక ఖర్చులతో కూడిన గ్యాస్ వంట బదులుగా పంట సంబంధిత వ్యర్దాలను, మరియు పశు వ్యర్ధాలతో అవాయు పరిస్దితులలో కుళ్ళింప చేసి అటు వంటకు గ్యాస్ మరియు ఇటు పోలానికి సేంద్రియ ఎరువును అందించవచ్చు. ఏమిటి ఆ పక్రియ అంటే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారీ విదానం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమగు అవాయు పరిస్దితుల్లో పని చేసే డైజెస్టర్ 1859లో ముoబై నగరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ విదానం మొట్టమొదట జర్మన్ శాస్త్రవేత్తలు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బయోగ్యాస్ విధానాన్ని ఆధునికరణం చేసి సులభంగా వాడేలా చేశారు. ఒకప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తిలో అగ్ర స్ధానంలో జెర్మనీ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చైనా దానిని అధికమించి అగ్రగామిగా ముందుకు వెళుతుంది. దానికి కారణం ఆ విధానంలో వున్న అధిక ఉపయోగాలే. మన దేశంలో కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం బయోగ్యాస్ అభివృద్దికి అనేక పరిశోధనలు చేసి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంస్ద ద్వారా ప్రజలకు సలహలు, సూచనలు, అవగహన కల్పిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు.
- బయోగ్యాస్ ప్లాంట్ మొత్తం అన్నీ విభాగాలను చూపించే నమూనా పటం

బయోగ్యాస్ తయారీ విధానం మరియు ముఖ్య విభాగాలు : బయోగ్యాస్ తయారీలో ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాలు కలవు అవి ఒకటి వ్యర్ద పదార్థాలను సంగ్రహించే విభాగం, రెండవది వ్యర్ద పదార్థాలను అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేసి బయోగ్యాస్ ఉత్పత్తి జరిపే డైజెస్టర్
కలిపే విభాగం (సంగ్రహణ విభాగం) : ఈ విభాగం డైజెస్టర్ కు ప్రక్కన ఉండే భాగం. ఈ విభాగం ద్వారా బయోగ్యాస్ తయారీ కి అవసరం అగు వివిధ వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్దలను లోపలకి వేసి అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేయడానికి పశువుల పేడ నాలుగు భాగాలు మరియు ఐదు భాగాలు నీరు (4 : 5) కలిపి లోపలికి పోయాలి . ఈ విధంగా పోసిన (4 : 5) నిష్పత్తి కలిపిన పశువుల పేడ మరియు నీరు డైజెస్టర్ల లో స్టార్టర్ పదార్దంగా పనిచేసి లోపలి వ్యర్ద పదార్థాలు మిధనోకోకస్, మిధనో బాసిల్లాస్ వంటి బ్యాక్టిరియా సూక్ష్మజీవుల వలన అవాయు పరిస్ది తుల్లో కిణ్వవణ పక్రియ ద్వారా కుళ్ళింపజేసి మీథేన్ (బయోగ్యాస్) విడుదల అగును.


- ఒకటవ రకమైన కదిలే ఢ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
- రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
- మూడవ రకమైన దీన బంధు బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం

డైజెస్టర్ : బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) తయారీలో ముఖ్యమైన ప్రధాన విభాగం డైజెస్టర్ లేదా పేర్మెంటర్. బయోగ్యాస్ విభాగంలో ఇది మధ్యన ఉండి బయోగ్యాస్ తయారీకి సహకరించే అత్యంత కీలక విభాగం. సాధరణంగా బయోగ్యాస్ తయారీలో వాడే డైజెస్టర్ లేదా పేర్మెంటర్ ను మూడు రకాలుగా వర్గీకరించారు, అవి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ అభివృద్ది పరిచినది. ఈ రకపు డైజెస్టర్ ముడి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడి పరిమాణం పరంగా మధ్యస్థంగా ఉండును. సాధారణంగా భారత దేశంలో ఈ రకపు డైజెస్టర్లు ఎక్కువగా వాడుకలో కలవు. ఈ డైజెస్టర్ కు ఉన్న గొప్ప లక్షణం ఎటువంటి నష్టం లేకుండా మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు.
సాధారణంగా ఈ డైజెస్టర్ నేలలో 3.5 నుంచి 6.5 మీటర్ల లోతు మరియు 1.2 నుంచి 1.6 మీటర్ల వ్యాసార్దం గుంతను తవ్వి అందులో అమర్చాలి. పైన పేర్కొన్న కొలతలు సామాన్యంగా వాడేవి. ఈ కొలతలను బయోగ్యాస్ పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బయోగ్యాస్ డైజెస్టర్ లో రెండు గదులు కలవు. అవి మిశ్రమ విభాగం ద్వారా వేసే వ్యర్ద పదార్థాలు, వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్థాలను కుళ్ళింప జేసె డైజెస్టర్ . రెండవ గది డైజెస్టర్ ను రంద్రాలు కలిగిన గోడ ద్వారా వేరు చేయబడి కిణ్వన పక్రియ పూర్తి అయి బయోగ్యాస్ విడుదల జరిగిన తరువాత మిగిలిన పదార్దం ఆ రంద్రాల ద్వారా బయటకు వచ్చి చేరుకొనును. దీనిని మనం సేంద్రియ ఎరువుగా పాడి పంటలకు వాడుకోవచ్చు. డైజెస్టర్ పై భాగం కొద్దిగా వంపుగా వుండి ప్రెజర్ వాల్వుని కలిగి ఉండి వాలు కలిగిన పైపు ద్వారా వంట గదికి అమర్చుకొని వంట గ్యాస్ గా వాడుకోవచ్చు. ఈ పక్రియలో మొదట మిశ్రమ విభాగం ద్వారా వేసిన వ్యర్ద పదార్థాలు 4: 5 నిష్పత్తిలో వేసిన పేడ మరియు నీరు మిశ్రమం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి అవాయు పరిస్దితుల్లో మీథేన్ వాయువు అణువులు విడుదల అయి వంపు కలిగిన డైజెస్టర్ పై భాగాన్ని డీ కొని తడనం చెందడం ద్వారా పీడనం పెరిగి అన్నీ అణువులు ఒకదానికొకటి కలిసి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ను విడుదల చేయును. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన జనతా రకం దీనిని చైనా దేశం వాళ్ళు అబివృద్ది పరిచినారు. దీనిని సాధరణంగా ఇటుక మరియు కాంక్రీట్ మిశ్రమంతో నేల లోపల నిర్మిస్తారు. ఇది పరిమాణం పరంగా పెద్దది ఎక్కువ బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును. దీని జీవన కాల పరిమితి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మూడవ డైజెస్టర్ రకం దీనబంధు బయోగ్యాస్ దీనిని 1984లో ఎ. ఎఫ్. పి. ఆర్. ఓ అను నూడిల్లీకి చెందిన ఒక స్వచ్చంధ సంస్ద అభివృద్ది పరిచింది. ఇది కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చితే సగం ధరలో తయారీ అగును. నిరుపేద ప్రజలకు భాగా అనుకూలం అగు డైజెస్టర్
బయోగ్యాస్ వలన కలిగే ఉపయోగాలు:
- పశువుల పేడ మిశ్రమ ద్రావణం మరియు విచ్ఛిన్నం అగు వివిధ పదార్ధాల ద్వారా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను ఇంటి వంటకు వాడుకోవచ్చు
- కాంతి కోసం వాడే లాంతర్లలో నింపుకొని వాడుకోవచ్చు
- రైతులకు సేంద్రియ ఎరువు లోటుని తీర్చి కావలసినంత సేంద్రియ ఎరువును సమకూర్చి ఆర్ధిక భారాన్ని తగ్గించి నేల ఆరోగ్యానికి కాపాడుటలో సహయపడును
- పశుపోషణ అభివృద్దికి ప్రత్యక్షంగా ఉపయోగపడును. ఎలా అనగా బయోగ్యాస్ తయారీకి వాడే వ్యర్ధ పదార్ధాలలో అధిక భాగం పశువుల వ్యర్ధాలను వాడుతున్నారు. అంతే కాకుండా స్టార్టర్ పదార్ధంగా కూడా పశువుల పేడను వాడుట గమనించదగ్గ విషయం
- విచ్చిన్నం అగు వ్యర్ధ పదార్ధాలను కుళ్ళింపజేయుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుటలో ఉపయోగపడును
- సాధారణ పశువుల ఎరువుతో పోల్చుకుంటే బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో ఎక్కువగా పోషకాలు ఉండును. అందులో నత్రజని (2-2.5 %), భాస్వరం ( 1.5%), పోటాషియం (1 %) .
- బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో అధికంగా సేంద్రియ కర్బనం మరియు హ్యూమస్ ఉండి నేలలో వివిధ జీవరాశుల అభివృద్దికి దోహదపడును.
- ఎటువంటి నష్టం లేకుండా ఉష్ణశక్తి మరియు విద్యుత్ శక్తి పునరుద్దరణకు సహకరించును.
- శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి వాటి స్ధానంలో బయోగ్యాస్ వాడుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడును.
- వాయు కాలుష్యాన్ని తగ్గించి హరితగృహ వాయువుల ఉద్గారాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించును.
- మిగతా సేంద్రియ ఎరువులలాగా కాకుండా చెడు వాసన లేకుండా వుండును,
- బయోగ్యాస్ ఈగలు మరియు దోమల పునరుత్పత్తిని తగ్గించును
బయోగ్యాస్ తయారీలోన అధిగ మించవలసిన సవాళ్లు :
- బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అనగా డైజెస్టర్ మరియు సంగ్రహణ విభాగం తయారీ అధిక ఖర్చులతో కుడికున్నది.
- ప్రతి రోజు పశువుల పేడ మరియు ఇతర విచ్ఛిన్నం అయ్యే వ్యర్ధాలు సేకరణ శ్రమతో పాటు స్వల్ప ఆర్ధికపరమైన ఇబ్బందితో కూడుకున్నది.
- సాధారణ వంట గ్యాస్ తో పోల్చుకుంటే బయోగ్యాస్ తక్కువ శక్తి కలిగిన ఇంధనంగా ఉపయోగపడును
- ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్లయితే బయోగ్యాస్ తయారీకి చాలా ఎక్కువ సమయం తీసుకొనును.
- బయోగ్యాస్ ను తయారీ దగ్గర మాత్రమే వాడుకోవాలి. దీని నిల్వ మరియు రవాణా అధిక వ్యయంతో కూడుకున్న అంశాలు
- బయోగ్యాస్ తో పాటుగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్పేట్ వంటి వాయువులను వాడుకకు ముందు తొలగించాల్సిన అవసరం తప్పనిసరి
- బయోగ్యాస్ ప్లాంట్ కు తగిన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల మీధేన్ వాయువు బయటకు విడుదల వలన హరిత వాయువుల మోతాదును పెంచడంతో పాటు మండే లక్షణం ఉండుట వలన అగ్ని ప్రమాదాలకు కారణం అగును
- నైపుణ్యం కలిగిన వ్యక్తుల పర్యవేక్షణ మరియు శిక్షణ కలిగిన వ్యక్తులు ఉండి తగిన యాజమాన్య పద్దతులు పాటించుట వలన బయోగ్యాస్ తయారీలోని అవరోధాలను అధిగమించవచ్చు.
బయోగ్యాస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- 60 ఘనపు అడుగులు లేదా 2 మీటర్3 పరిమాణం కలిగిన బయోగ్యాస్ తయారీకి రోజుకి కనీసం 45-55 కేజీల పేడ అవసరం అంటే దీని కోసం 5 ఆవులు లేదా 5 గేదెలు అవసరం
- మానవ విసర్జన పదార్ధాలను (నైట్ సాయిల్) రోజుకి 60 కేజీలు హోటల్స్ మరియు హాస్టల్స్ , ప్రజల మరుగుదొడ్డి నుంచి సంగ్రహించి కూడా బయోగ్యాస్ తయారు చేయవచ్చు.
- ఒక పశువుల పేడే కాకుండా పందుల, కోళ్ళ విసర్జక పదార్దలను కూడా బయోగ్యాస్ తయారీలో వాడవచ్చు.
- బయోగ్యాస్ తయారికీ వాడే డైజెస్టర్ కి సూర్యరశ్మి సరిపడ తగిలేలా చూసుకోవాలి దీనివలన డైజెస్టర్ అంతర భాగంలో కిణ్వన ప్రక్రియ త్వరగా జరిగి ఇటు మీధేన్ వాయువు తయారీలో మరియు సేంద్రియ ఎరువు తయారీలో ఎంత గానో ఉపయోగపడును,
- బయోగ్యాస్ ప్లాంట్ కు మరియు వంట గదికి మధ్య దూరం 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
- బయోగ్యాస్ ప్లాంట్ ను మరియు వంట గదిని కలిపే పైపును కొద్దిగా వాలుగా వుండేటట్లు చూసుకోవాలి.
- బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు గట్టిగా ఉండే నేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
- బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు వాడే నేలలో నీటి ముంపు లేకుండా చూసుకోవాలి.
- బయోగ్యాస్ డైజస్టర్ ఇనుముతో తయారీ చేసినది అయితే అది త్రుప్పు పట్టకుండా రంగును వేసుకోవాలి.
- శీతకాలంలో డైజస్టర్ లో ఉష్ణ నష్టం జరగకుండా నివారించుటకు పైన వరి గడ్డి వేసుకోవాలి.
- పేడ ద్రావణం మరియు ఇతర పదార్థాల ద్వారా డైజెస్టర్లోనికి ఇసుక చేరకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- భాగా కుళ్లిన ఎక్కువ మొలాసిస్ ను శీతకాలంలో వేయరాదు, ఎందుకు అనగా దీని వలన సరిగా మండని బయోగ్యాస్ విడుదల అగును.
- అరటి మరియు గుర్రపు డెక్కలను 5 – 10 సెం,మీ కత్తిరించుకొని సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
- నీలగిరి లేదా యూకలిప్టస్ ఆకులను 5 రోజులు నీటిలో నానబెట్టిన మిశ్రమాన్ని పేడ ద్రావణం వేయడానికి ముందుగా వేసుకోవాలి.
- విచ్ఛిన్నం అగు గృహ మరియు ఇతర వ్యర్ధ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికుని, వరి మరియు అరటి కాండం ముక్కలను పశువుల పేడ ద్రావణంతో కలిపి సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
- పశువుల పేడ ద్రావణం మిట్ట మధ్యాహ్నం డైజస్టర్ లోకి సంగ్రహణ విభాగం ద్వారా పంపుకోవాలి.
- ఉదయం మరియు సాయంత్రం బయోగ్యాస్ విడుదల అగు గొట్టం ద్వారా దేని సహయంతో నైనా డైజస్టర్ లోపలి భాగంలోని చెత్తను 50 సార్లు బాగా కలుపుకోవాలి. దీనివలన డైజెస్టర్ లో పేరుకు పోయిన తెట్టును సులభంగా తొలగించి బయోగ్యాస్ విడుదలకు సహకరించును. పై విధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు బయోగ్యాస్ తయారీ విధానాన్ని అనుసరించుట వలన ఇంటికి కావలసిన వంట గ్యాస్ అందించుట తో పాటు రైతుకు కావల్సిన సేంద్రియ ఎరువు అందించుట వలన నేల ఆరోగ్యాన్ని కాపాడుటతో పాటు బయోగ్యాస్ తయారీకి పశువుల ఎరువు పశువుల నుంచి సంగ్రహించుట ద్వారా పశుపోషణ ప్రోత్సహించి రైతులు ఆర్ధికంగా ప్రగతికి ఉపయోగపడుతూ పరిసరాలలో వ్యర్ద పదార్దాల కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఈ విధంగా రైతుకు అన్నీ రకాలుగా చేయూతను ఇవ్వడం వలన బయోగ్యాస్ ను రైతు క్షేత్ర మరియు గృహ సంబందిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి అని పిలవడంలో అతిశయోక్తి లేదు.
టి. రాజశేఖర్, సిహెచ్. సీత రామ లక్ష్మి, ఎ. శీరిష, ఎమ్. చారుమతి, ఎన్ . భారతి, టి. శ్రీలత, ఎమ్. ముకుందరావు
వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి
ఫోన్: 6304852859



















