‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More

‘అమృత మట్టి’తో అమృతాహారం!

పర్యావరణానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించని పద్థతుల్లో పంటల సాగు ఇప్పటి అవసరం. అంతేకాదు.. పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా కలిగిన అధిక దిగుబడులు సాధించాలి! రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి!! ఈ లక్ష్యాల సాధనకు రైతులకు దారి చూపేదే ‘అమృత మట్టి’తో పర్యావరణ అనుకూల (నేచ్యు-ఎకో) సేద్యం. సేంద్రియ సేద్యాన్ని మరో మెట్టుపైన నిలబెడుతుంది ఈ సేద్య పద్ధతి.

పర్యావరణానికి హాని లేకుండా, వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా సాగు చేయటమే నేచ్యు-ఎకో పద్ధతి ప్రత్యేకత. ‘అమృత మట్టి’ ద్వారా ఈ పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని పరీక్షల్లో నిరూపితమైంది. సంప్రదాయ (రసాయనిక) పద్ధతుల్లో పండించే కూరగాయలతో పోల్చితే అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయలు అధికంగా పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి ఐదు రెట్ల మాంసకృత్తులు, 20 శాతం కాల్షియంను అదనంగా కలిగి ఉంటాయి. సాధారణంగా మాంసాహారంలోనే లభించే విటమిన్ బి-12 ఉనికిని అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయల్లో కనుగొనడం విశేషం.

ఉత్పాదకాలను డబ్బు పోసి కొని వాడడానికి బదులుగా.. పొలాల చుట్టు పక్కల్లో లభించే వనరులను ఉపయోగించుకోవటం, సాగు భూమికి ఎలాంటి నష్టం జరగకుండా మంచి దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ పద్ధతికి రూపకల్పన చేశారు ప్రొఫెసర్ శ్రీపాద్ ఎ.దబోల్కర్.

అమృతమట్టిని ఉపయోగించి… భూమిలో జీవన ద్రవ్యం, సేంద్రియ కర్బనాలను పెంచటం ద్వారా రసాయనిక వ్యవసాయంలో కన్నా తొలి ఏడాదే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని ప్రొ. దబోల్కర్ నిరూపించారు. చీడ పీడల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు దబోల్కర్ వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనిక కీటక నాశనులు, క్రిమి సంహారకాల పిచికారీ అవసరం లేదు. పోషకాలను అందించేందుకు రసాయనిక ఎరువులను వాడాల్సినవసరం లేదు. పొలం అంతటా మట్టి పరుపులను (రైజ్డ్ బెడ్స్) తయారుచేసుకుని అమృత జలాన్ని, అమృత మట్టిని వినియోగించి పంటలు పండిస్తారు.

అమృతమట్టి తయారుచేసే పద్ధతి….
అమృతమట్టి తయారీ వివిధ దశలతో కూడుకున్న ప్రక్రియ. దీనికోసం ముందుగా అమృత జలాన్ని తయారు చేసుకోవాలి.

అమృత జలం తయారీ విధానం:
ఒక లీటరు గోమూత్రం, ఒక కిలో తాజా ఆవు పేడ, 50 గ్రా.బెల్లాన్ని, 10 లీటర్ల నీటిని ఒక తొట్టెలో కలపాలి. మూడు రోజులు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు మూడుసార్లు కలపాలి. మూడురోజుల తర్వాత పదిపాళ్లు నీటికి ఒక పాలు అమృత జలాన్ని కలిపి పంటలకు వాడుకోవచ్చు.

అమృతమట్టి తయారీ విధానం:
తగినంత అమృత జలం పోసిన పాత్రలో పచ్చి, ఎండిన ఆకులు కలిపి వేసి 24 గంటలపాటు ఉంచాలి.
బెడ్‌ల తయారీ: 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలా బెడ్‌ను నిర్మించుకోవాలి. బెడ్‌లో మె°దటి పొరగా ఆకులు నానబెట్టిన అమృత జలాన్ని పోయాలి. దీనిపైన నేలపై పొర నుంచి సేకరించిన మట్టిని ముందు నేలపై పొరలాగా పరవాలి. దీనిపైన మళ్లీ అమృత జలాన్ని పోయటం, పైన మట్టిని పరవటం ఇలా… బెడ్‌ను పొరలు పొరలుగా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించాలి.
ప్రతి వారం రోజులకు బెడ్‌లో ఉన్న కంపోస్టును కలపాలి. సూక్ష్మజీవుల చర్యలు జరిపేందుకు తగినంత తేమ ఉండేలా అమృత జలంతో బెడ్‌ను తడుపుతుండాలి. ఈ మిశ్రమం పూర్తిస్థాయి కంపోస్టుగా మారేందుకు 30 రోజుల సమయం పడుతుంది.

విభిన్న రకాల పంటలకు చెందిన విత్తనాలను ఎంచుకొని బెడ్‌పై నాటుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను అమృత జలంలో ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత బెడ్‌లోఉన్న కంపోస్టుపై విత్తుకోవాలి. విత్తిన తర్వాత ఆకులతో ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పై అమృత జలాన్ని పిచికారీ చేయటం ద్వారా విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను అందించాలి.

21 రోజుల పాటు ఇలా చేయటం ద్వారా అన్ని విత్తనాలు మొలకెత్తేలా చూడాలి. ఆ తరువాత వివిధ దశల్లో పెరిగే మొక్కలకు కత్తిరింపులు చేపట్టాలి. మొలకెత్తిన 21 రోజులకు మొక్కల్లో పావు వంతు భాగాన్ని కత్తిరించాలి. 42వ రోజు రెండోసారి, 63వ రోజు పూత దశలో మూడోసారి కత్తిరించాలి. మూడో కత్తిరింపులో బెడ్‌పైన మొక్కలను అర అంగుళం వదిలి పైభాగం మొత్తం కత్తిరించాలి. ఇలా కత్తిరించిన భాగాలను అమృత జలంలో 8 గంటలు నానబెట్టి అమృత మట్టిలో కలపాలి. బెడ్స్‌పైన ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పైన అలా తయారైన కంపోస్టును వారానికి ఒకసారి కలపాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే… అమృత మట్టి సిద్ధమైనట్టే.

Read More

పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.

సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.

బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.

నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.

అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.

బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు :
    బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని
    పెంచుతుంది.
  2. నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల :
    బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
  3. బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది
    ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా
    పరీక్షించాలి.
  4. నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల :
    బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం
    అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై
    ఆధారపడి ఉంటుంది.
  5. బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది :
    బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
  6. నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
  7. నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure)
    బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
  8. వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction)
    నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం

(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

  1. కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration)
    బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.

జాగ్రత్తలు

  1. నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
  2. కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
  3. పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  4. నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి

సిఫార్సు మోతాదు

  • ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
  • సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి
    బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

బయోచార్‌గా పంట వ్యర్థాలు

పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు బయోచార్ (జీవబొగ్గు) విధానాన్ని అమలు చేయాలని కొండాలక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు దహనం జరుగుతున్న నేపథ్యంలో.. వ్యవసాయానుబంధ శాఖలు, వర్సిటీలతో అధ్యయనం చేయించి, నివేదిక సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి తమ శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. పంట వ్యర్థాలతో రూపొందించే బయోచార్ విధానం దీనికి సరైన పరిష్కారమని చర్చించారు. పొలంలో గొయ్యి తీసి దానిలో పంట వ్యర్థాలను వేసి దహనం చేసి బొగ్గుగా మార్చి ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీనిపై హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో బయోచార్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించారు.

Read More

ప్రకృతిసాగుకు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్‌కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్‌కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్‌కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్‌స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్‌కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.

Read More

పంట వ్యర్థాలు పోషకాల గనులు

పంట వ్యర్థాలు… నేలకు జీవం. పొలంలో కలిపితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. పంట దిగుబడులూ పెరుగుతాయి. తగలబెడితే నేలకు నష్టం, భూమి వేడెక్కుతుంది. అందులోని సూక్ష్మజీవులూ చనిపోతాయి. పైగా కాలుష్యం మరో అతి పెద్ద సమస్య. టన్ను వరి గడ్డిని నేలలో కలిపేస్తే… 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల గంధకంతోపాటు సేంద్రియ కర్బనం లభిస్తుంది. టన్ను మొక్కజొన్న గడ్డిలో 9.16 కిలోల నత్రజని, 2.08 కిలోల ఫాస్పరస్, 15.78 కిలోల పొటాషియంతోపాటు 5.17 కిలోల కాల్షియం, 3.62 కిలోల మెగ్నీషియం, 1.54 కిలోల సల్ఫర్ ఉంటుంది.

గతంలో వరి కోతల తర్వాత నూర్పిడి చేసి గడ్డిని పశువుల మేతగా ఉపయోగించేవారు.. మిరప, పత్తి, కంది తదితర పంటలు వ్యర్థాల్ని మండెలుగా పేర్చి వంట చెరకుగా వినియోగించేవారు. ఇప్పుడు అధికశాతం రైతులు యంత్రాలతోనే వరి కోయిస్తున్నారు. ఎల్పీజీ అందుబాటులోకి రావడంతో వంట చెరకు అవసరమూ తగ్గిపోయింది. దీంతో పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. మొక్కజొన్న గడ్డి తగలబెట్టే సమయంలో మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తెలంగాణలోని హన్మ కొండ, ఏపీలోని పల్నాడు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి. వ్యర్థాల్ని కాల్ౘ్డం కంటే నేలలో కలిపి దున్నేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.

మొక్కజొన్న సాగు బాగా పెరిగింది
దేశంలో ఏటా 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% వాటా.. వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలకు సంబంధించినవే. ఒక్క వరి పంట వ్యర్థాలే 34% ఉన్నాయి.. ఈ ఏడాది రబీలో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 12.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 4.2 టన్నుల నుంచి 6.2 టన్నుల పంట వ్యర్థాలు వస్తాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున చూసినా.. ఒక్క మొక్కజొన్న నుంచే 62.75 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తాయి. తెలంగాణలోనూ 2024 సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు పెరిగింది. రబీలో 17.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పంట వ్యర్థాల్ని బయోమాస్ ప్లాంట్లకు తరలించవచ్చు. బయోచార్, ఇతర ఉత్పత్తులకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.

చాలా నష్టం

  • నేల పైభాగం నుంచి 15 సెం.మీ. లోతు వరకు వేర్లు అభివృద్ధి చెందుతాయి. అక్కడుండే నత్రజని, కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఈ పోషకాలు తగ్గిపోతాయి. మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
  • పంట వ్యర్థాల్ని తగలబెడితే.. అందులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రసఆక్సైడ్, ఇతర హైడ్రోకార్బన్లు అందులో ఉంటాయి.
  • వరిగడ్డిని కాల్ౘ్ివేస్తే అందులో 70% కార్బన్‌డైఆక్సైడ్, 7% కార్బన్ మోనాక్సైడ్, 0.66% మీథేన్ విడుదలవుతాయి. గడ్డిలోని నత్రజని నైట్రస్ ఆక్సైడ్‌గా వెలువడుతుంది.
  • పొగ నుంచి వెలువడే కాలుష్యం ద్వారా క్యాన్సర్ కారకాలు వెలువడుతున్నాయని అనుమానిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
    ప్రోత్సాహం తప్పనిసరి
  • 2021 సంవత్సరంలో ఏర్పాటైన ‘వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కాలుష్య నివారణకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలతో సమగ్ర విధానాన్ని పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను ఉచితంగా అందుబాటులో ఉంచాలని గతేడాది ఈ కమిషన్ ఆదేశించింది.
  • విద్యుత్ కేంద్రాలు పంట వ్యర్థాలతో చేసిన గుళికలను కనీసం 5% వాడాలని స్పష్టం చేసింది. అలా చేయ కుంటే.. అవి ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుపై పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
  • మరోవైపు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసే ఘటనలను కేంద్రం ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను రాయితీ ద్వారా అన్నదాతలకు అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట వ్యర్థాల నిర్వహణపై రైతులను చైత న్యపరచాలి. పలు ప్రోత్సాహకాలు అందిస్తే వారు మొగ్గుచూపుతారు.
Read More

రైతులు యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి

యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులు అనుసరించాలని ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు నానోయూరియా, పచ్చిరొట్ట ఎరువులు, జీవన, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్నారు. సోమవారం వర్సిటీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “గల్ఫ్ యుద్ధ ప్రభావం వలన ఒకవేళ యూరియా సరఫరా తగ్గినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. నానోయూరియా మార్కెట్‌లో కావలసినంత పరిమాణంలో అందుబాటులో ఉంది. నానోయూరియా మొక్కలకు కావాల్సిన నత్రజని అందించటంతో పాటు దిగుబడులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ పొందిన జీవన ఎరువులు కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాలను రైతాంగం సేకరించి తొలకరి వర్షాలు రాగానే పొలాల్లో చల్లి, విత్తిన 40 రోజుల్లో ఆయా పంటలను పొలంలో కలియదున్నితే సేంద్రియ కర్బనం పెరిగి నేల ఆరోగ్యం బాగుంటుంది” అని జానయ్య తెలిపారు.

Read More

ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో మామిడి పండ్లను రుచి చూసిన లోకేశ్

ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ రైతు మునగాల ద్వారకానాథ రెడ్డికి చెందిన 17 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి లోకేశ్ సందర్శించారు. 17 ఎకరాల్లో సమీకృత పండ్ల తోటలు, నాటుకోళ్లు, పొట్టేళ్లు, చేపల పెంపకం చేపడుతూ స్థిరమైన ఆదాయం ఆర్ౙిస్తున్న రైతు కుటుంబాన్ని ఆయన అభినందించారు. సేంద్రియ పద్ధతిలో పండిన మామిడి పండ్లను మంత్రి రుచి చూశారు.

Read More