సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం

ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 

సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.

సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?
కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం.
ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాన సాగు పద్ధతులు

పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చిమార్చి వేయడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.

పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.

వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్ౘ్ి పొలానికి అందించడం.

జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.

సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.

కలిగే ప్రయోజనాలు
రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయోÐఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.

ముగింపు:
మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951

Read More

మొక్క పెరుగుదలకు దోహదపడే ‘చేప కునప జలం’

కావలసిన పదార్థాలు:
తాజా చేప ముక్కలు : కిలో
దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు, నల్లబెల్లం – కిలో
దేశీ ఆవు నెయ్యి : 50 గ్రా, తేనె – 50 గ్రా

చేప కునప జలం ఇంచుమించు ‘మీనామృతం’ మాదిరిగానే పంటలపై పనిచేస్తుంది.

తయారుచేసే పద్ధతి: ఒక కిలో తాజా చేపలను ముక్కలుగా కోయాలి. వాటికి ఒక కిలో నల్లబెల్లం పొడిని కలపాలి. 50 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కూడా కలిపి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక మట్టికుండలో గాని, ప్లాస్టిక్ పాత్రలో గాని 5 లీటర్ల ఆవు మూత్రం పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. పాత్ర మీద మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో బిగించి కట్టాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుతూ 20 రోజుల పాటు చల్లని గదిలో ఉంచి మురగబెట్టాలి. తయారైన చేప కునప జలాన్ని వడకట్టి వాడుకోవచ్చు. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని కలిపి మె°క్కలపై పిచికారీ చేయాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

వాడే విధానం : 3 నుండి 5 శాతం ద్రావణాన్ని ఏ పంటపైనయినా ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేయవచ్చు.

ఫలితాలు :

  • భూమికి అద్భుతమైన పోషకాలనందిస్తుంది.
  • మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనిని సులభంగా తయారు చేయవచ్చు.
  • మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది.
Read More

ఔషధ మొక్క… జీడి మామిడి

జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
  • జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
  • గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • జీడిమామిడి పెంకు ద్రావణం ధాన్యం నిల్వలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని నివారిస్తుంది, నత్తల నివారణలో ఉపయోగపడుతుంది.
  • జీడికాయ, పెంకులు బంబారా వేరుశనగ నిల్వలలో ఆశించే కాల్లసోబ్రూకస్ సబిన్నోటేటస్‌ని నివారిస్తాయి (ఒపరేక్, బన్ని, 2006)
  • జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
  • జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
  • జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
  • జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి పెంకు ద్రవం శనగ పచ్చ పురుగు లార్వాలను నివారించింది (మహాపాత్రో, 2010).
  • జీడి మామిడి గింజల పొడి, ద్రావణం అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ అలసంద బ్రూచిడ్)ని సమర్ధవంతంగా నివారించాయి (ఇలెకి, 2012).
  • జీడిమామిడి గింజల నూనె (3%) బెండ కాండం మరియు కాయతొలుచు పురుగు లార్వాలను 87.4% నివారించింది (ప్రవీణ; ఆమె అనుచరలు, 2012).
  • జీడి మామిడి గింజల పొడి ద్రావణం జొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు (సైటోఫిలస్ ఒరైజె)ని నివారించింది (ఇలెకి, అతని అనుచరులు, 2013)
  • జీడిమామిడి క్రూడ్ మిథనాల్ ద్రావణం క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్‌ని నివారించింది. (మున్సెమన & ఆల్బర్టో, 2017).
  • జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
  • జీడిమామిడి ద్రావణం క్షేత్రస్థాయిలో మాక్రోటెర్మస్ బెల్లికోసస్ (చెదపురుగు)ని పర్యావరణహిత పద్ధతిలో నివారించింది (ఓస్పిటాన్, ఒసెయెమి, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… తెల్లగన్నేరు

సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని
శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి

తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
  • వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్‌స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
  • వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
  • మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఆల్‌స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్‌గ్బె, అతని అనుచరులు, 2007).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ క్లోరోఫాం, ఇథనాల్, నీటి ద్రావణాలు బాక్టీరిసైడైల్, ఫంగిసైడల్, యాంతెల్మింటిక్ చర్యలను ప్రదర్శించాయి. బాసిల్లస్ సీరియస్, క్లెబ్సియెల్లా న్యుమోనియె, ఎస్కెరిచియా కోలి, ఫిగెల్లా డీసెంట్రియేపై బాక్టీరిసైడల్ చర్యను ప్రదర్శించింది. రైజోపస్ ఒరైజె, క్లాడోస్పోరియం హెర్పారమ్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, రైజోపస్ ఒరైజెపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది.
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకు ఎసిటోన్ ద్రావణం చెదపురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (సోహైల్ అహ్మద్, అతని అనుచరులు)
  • ఆల్‌స్టోనియాస్కాలారిస్ ఇథనాల్ ద్రావణం స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

చేప అమైనో ఆమ్లాల ద్రావణం / చేప – బెల్లం ద్రావణం

చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో

తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):

  • ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
  • కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి.
    సూచనః
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… ఏడాకుల పొన్న

ఏడాకుల పొన్న 4-10 మీ. ఎత్తు వరకు పెరిగే వృక్షం. ప్రతి కణుపు నుండి 4-7 ఆకులు వస్తాయి. ఆకులు దాదాపు 9-12 x 2.5-3 సెం.మీ. పరిమాణంతో కోలగా ఉన్న దీర్ఘచతురస్రాకారంలో గాని, బళ్ళెం ఆకారంలో గాని ఉంటాయి. ఈనెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆకుల అడుగు భాగం పాలిపోయి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. గింజలు ఒంటరిగా లేదా జతగా ఉంటాయి.

సాధారణ నామం : డెవిల్స్‌ట్రీ, సప్తపర్ణి శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా స్కాలారిస్ / ఆల్‌స్టోనియా బూనీ కుటుంబం: అపోసైనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండ్లు మరియు చెట్టు బెరడుకు ఔషధగుణాలున్నాయి.
  • దీనిలో ఎఖిటమైన్, వినోటర్పిన్, గ్లూకోసైడ్, డిటేమిన్, ఎఖిటోనైన్, ఎఖిటైన్ అనే రసాయనాలు ఉంటాయి.
  • బాగా పండిన పండ్లు సిఫిలిస్, మూర్ఛ, పిచ్చి మొదలగు వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి.
  • బెరడు కషాయం జ్వరం, శ్వాసకోశవ్యాధులు, కుష్టు మరియు పుండ్లను నివారిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • ఆల్‌స్టోనియా బూనీ ఆకు మరియు కొమ్మ ద్రావణం గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియా కలామిస్టిస్ పెరుగుదల నిరోధకంగా పనిచేస్తాయి.
  • ఏడాకుల పొన్న పెట్ ఈథర్ ద్రావణం షిగెల్లా బాయ్‌డీ, విబ్రియో పారాహెమోలైటికస్‌పై కొద్దిపాటి నిరోధక చర్యను ప్రదర్శించింది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణం విబ్రియో మిమికస్, విబ్రియో పారాహెమోలైటికస్‌లపై బలమైన నిరోధక చర్యను ప్రదర్శించింది. క్లోరోఫాం ద్రావణాలు విబ్రియో పారాహెమోలైటికస్ పెరుగుదలను బలంగా అరికట్టింది. ఎస్కెరిచియా కోలిపై కూడా నిరోధక చర్యను ప్రదర్శించాయి (బెల్లా, అతని అనుచరులు, 2017).
  • ఈ చెట్లు కాండం బెరడు ద్రావణం నత్త, లిమ్నేయియా అక్యూమినేటపై బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 2003).
  • ఈ మొక్క ద్రావణం దోమల లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (జిజి, అతని అనుచరులు, 2012).
  • ఏడాకుల పొన్న కాండం బెరడు పెట్రోలియం ద్రావణం లిమ్నేయీ అక్యూమినేట, ఇండోప్లానోర్బిస్ ఎక్ౙస్టస్ అను నత్తలపై అధిక విషప్రభావం చూపింది (చౌహాన్ అండ్ సింగ్, 2014).
  • ఏడాకుల పొన్న మిథనాల్, నీటి ద్రావణాలలో ఉన్న అత్యధిక ఫైటోకెమికల్ సముదాయాలు అత్యుత్తమ యాంటీబాక్టీరియల్ చర్యలను ప్రదర్శించాయి (షకీల్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… దుంపరాష్ట్రకం

సాధారణ నామం : శ్నాప్ జింజర్/కార్డమం జింజల్ / ఇండియన్ జింజర్ / గులంగాల్ శాస్త్రీయ నామం : ఆల్పినియా కాల్కరేట / ఆల్పినియా గాలంగ కుటుంబం: ఆజింజిబెరేసి.

దుంపరాష్ట్రకం సుమారు 30-50 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పసుపు ఆకుల కంటే తక్కువ వెడల్పు గలిగి ఉంటాయి. బల్లెం ఆకారంలో సన్నగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. దుంపలలో సినియోల్, మిథైల్ సిన్నమేట్, కెంపెఫెరిన్ అనే రసాయనాలు ఉంటాయి.
  • దుంపలు చేదుగా, కారంగా ఉంటాయి. వీటిని వాతం, నొప్పులు, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తారు.
  • వీర్యపుష్టి, నడుములకు సత్తువ కలుగజేస్తుంది.
  • దుంప పొడి (13 గ్రా.)ని శ్వాసకోశసంబంధిత, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకుపయోగిస్తారు.
  • దుంపపొడి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • దుంపరాష్ట్రకం క్రూడ్ ఇథనాల్ ద్రావణం మరియు నీటిలో కరిగే కారకం నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (పర్వీన్, అతని అనుచరులు, 2016).
  • ఆల్పినియా గాలంగ ద్రావణం బీన్‌వీవిల్, మాత్‌పై యాంటిఫీడెంట్ చర్యను, నల్లిపై అకారిసైడల్ చర్యను ప్రదర్శించింది (రియాంటో అండ్ అఫాప, 1998; యమహర, 1998).
  • దుంపరాష్ట్రకం ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ వరి నిల్వధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై వికర్షక, విషచర్యలను ప్రదర్శించింది (పరనగమ, అతని అనుచరులు, 2004).
  • ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ ఆసియన్ సబ్‌టెర్రీనియన్ చెదలు, కోప్టోటెర్మస్ గెస్ట్రాయ్, కోప్టోటెర్మస్ కర్విగ్నాస్ పై యాంటీ ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (అబ్దుల్లా, అతని అనుచరులు, 2015).
  • ఆల్పినియా గాలంగ దుంపల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పెద్ద పురుగులపై స్పర్శ విషచర్య, ఫ్యూమిగెంట్ విష చర్యను ప్రదర్శించింది (వు, అతని అనుచరులు, 2014).
  • దుంపరాష్ట్రకం సహజ ఉత్పత్తులు ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియె, సూడోమోనాస్ ఈరోజినోసా, ఎంటరోబాక్టర్ ఈరోజినెస్, సాల్మొనెల్ల పారట్రెఫి, విబ్రియో కలరా, బాసిల్లస్ సబ్‌టైలిస్‌పై గణనీయమైన యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (రాబిన్‌సన్, అతని అనుచరులు, 2009).
  • ఆల్పినియా గాలంగ హెక్సేన్ క్రూడ్ ద్రావణం బ్రాక్టోసిరా డోర్సాలిస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (సుకిరన్, అతని అనుచరులు, 2010).
  • ఆల్పినియా గాలంగ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా మరియు నిల్వ దాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ (రియాంటో, అతని అనుచరులు, 1998) మరియు సైటోఫిలస్ జియామెయిస్, ట్రైబోలియం కాస్టానియం (సుతిసట్, అతని అనుచరులు, 2011) నివారణలో ఉపయోగపడుతుంది.
  • ఆల్పినియా గాలంగ గింజల ద్రావణాలు టైరోఫోగస్ ప్యూట్రెసింషియె, డెర్మటోఫాగాయిడెస్ టెరోనిస్సినస్ అనే నల్లులను చంపాయి (యమహర, 1998).
  • ఆల్పినియా గాలంగ ఇథనాల్ మరియు పెట్రోలియం ద్రావణాలు 95-100% చెదలను (ఒడొంటెటెర్మెస్) చంపాయి (సౌమ్య, ఆమె అనుచరులు, 2016).
  • దుంపరాష్ట్రకం ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని రసాయనం 1,8 సినియెల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై ఫ్యూమిగెంట్ చర్యను, ఫ్యూమిగెంట్ మరియు స్పర్శ విషచర్యను ప్రదర్శించాయి (అబెయ్‌విక్రమ, అతని అనుచరులు, 2006).
  • ఆల్పినియా గాలంగ దుంపద్రావణం డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, లార్వాలు మరియు అడ్ౙుకి బీన్ వీవిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ పై కీటకనాశక చర్య ప్రదర్శించింది (డండాంగ్, అతని అనుచరులు, 1998).
  • ఆల్పినియా కంక్లూగెర మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ మరియు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై స్పర్శ మరియు యాంటీఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది (సుత్తిసుట్, అతని అనుచరులు, 2011).
  • ఆల్పినియా గాలంగ దుంప హెక్సేన్ మరియు ఇథనాల్ ద్రావణాలు బాక్ట్రోసిరా డోర్సాలిస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టాయి (సుఖిరన్, అతని అనుచరులు, 2011).
  • ఆల్పినియా గాలంగ దుంప ద్రావణం క్యాబేజి మాత్, క్రోసిడోలోమియా పవోనాని సమర్ధవంతంగా అరికట్టింది (రస్సామి, అతని అనుచరులు, 2016).
  • ఆల్పినియా గాలంగ మిథనాల్ క్రూడ్‌ద్రావణం, క్లోరోపాం క్రూడ్ ద్రావణం కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్ శిలీంద్ర పెరుగుదలను అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (జానీ, అతని అనుచరులు, 2010).
  • ఆల్పినియా గాలంగ దుంప ద్రావణాలు ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, ఆప్సర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది (మిశ్రా అండ్ డుబె, 1990; జాన్సన్ అండ్ ఫెషర్, 1985; అమిర్, 1990). ఈ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, ఎస్కెరిచియా కోలి, లిబ్రియో కలరా, డిప్లొకోకస్ న్యుమోనియే, మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ పై యాంటి బాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (చోప్రా, అతని అనుచరులు, 1957, స్ౙాపియుద్దిన్, 1981). దీని గింజల ద్రావణం టైరోఫాగస్ ప్రూట్రిసెంటయే, డెర్మటోఫాగాయిడెస్ టెరోనిస్సినస్‌పై అకారిసైడల్ చర్యను ప్రదర్శించింది (యమహర, 1998).
  • ఆల్పినియా గాలంగ దుంపలపొడి పెసరగింజల నాశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ ఆశించకుండా రక్షించింది (అస్మానిజర్, అతని అను,రులు, 2016).
  • ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ కోకోపాడ్‌బోరర్, కొనొపొమార్ఫ క్రామరెల్లాని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (బకార్, అతని అనుచరులు, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

‘మీనామృతం’తో మునగకు రక్ష!

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు: తాజా చేప ముక్కలు: 1 కిలో; దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు; నల్ల బెల్లం : 1 కిలో; తాటికల్లు : 1 లీటరు; దేశీ ఆవు నెయ్యి : 50 గ్రాములు; తేనె : 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి
మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే…
మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

Read More

ఔషధ మొక్క… మచ్చల కలబంద

సాధారణ నామం : స్పాటెడ్అలో శాస్త్రీయ నామం : అలో జెబ్రినా కుటుంబం: ఆస్ఫోడిలేసి

అలో జెబ్రినా చిన్న, దట్టమైన, నీటిని నిల్వ ఉంచుకునే భాగాలున్న ఆకులు కలిగిన మొక్క. ఈ మొక్కలు నీటిని కాండాలు, ఆకులు, వేర్లలో నిల్వ ఉంచుకుని వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఆకులు దట్టంగా గుబురుగా ఏర్పడి సాధారణంగా ఆకుపచ్చ రంగులో పెద్ద అండాకారపు తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకుల అంచులు బలమైన గోధుమ రంగు మొనలు గల ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకుల చివర్లు ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత ఎరుపు రంగులో గొట్టపు ఆకారంలో వుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • బోట్స్వానాలో దీనిని బుట్టల తయారీలో ఉపయోగిస్తారు.
  • అంగోలాలో కునీన్ నది పొడవునా ఉన్న ప్రజలు అలో జెబ్రినా పూలను ఉడికించి కేకులు తయారు చేస్తారు.
  • మహిళలు ప్రసవం తరువాత కాండం, ఆకు మొదళ్ళ పొడిని లోపలికి తీసుకుంటారు. దీని రసాన్ని గాయాలను మాన్పడానికి, చర్మ సమస్యలకు, నులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ప్రత్తి పంటలో నష్టాలు కలిగించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అలో జెబ్రినా 20% ద్రావణం వికర్షక, కాంటాక్ట్ చర్యలతో సమర్ధవంతంగా అరికట్టింది (రంగరిరాజ్, అతని అనుచరులు, 2016). ఆకు ద్రావణం తయారు చేయడానికి ఆకులను సేకరించి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్‌లో 5 రోజులు ఆరబెట్టాలి. తర్వాత ఆరిన ఆకులను రోటిలో వేసి బండతో దంచాలి. మెత్తగా దంచిన పొడిని 1000 మి.లీ. బీకర్లో వేయాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేయాలి. 400 గ్రా. పొడిని 3 లీ. గాజు ఫ్లాస్క్‌లో తీసుకుని 2 లీ. డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ ద్రావణాన్ని చేతిలో 1 గంట సేపు కుదుపుతూ, తర్వాత 24 గంటలుంచాలి. 24 గంటల తర్వాత ద్రావణాన్ని గుడ్డతో వడపోసి తర్వాత వాట్‌మన్ నెం. 24 ఫిల్టర్ పేపర్‌తో వడపోయాలి. ఈ ద్రావణాన్ని 2 లీ. కోనికల్ ఫ్లాస్క్‌లో సేకరించాలి. 20% ద్రావణం తయారు చేయడానికి 200 మి.లీ. స్టాకు ద్రావణాన్ని 800 మి.లీ. శుభ్రమైన నీటికి కలపాలి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More