ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్

ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.

మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.

ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.

గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.

మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:

  1. సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్‌ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్‌ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
  2. యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
    మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.

దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.

రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.

వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.

కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్‌ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్‌ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.

ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

  1. పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
  2. నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
  3. ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
  4. కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
  5. నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
    స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.

Read More

పాడి పరిశ్రమకు కల్పతరువు: హైబ్రిడ్ ‘నేపియర్ బజ్రా గడ్డి ‘ సాగు!

పాడి పరిశ్రమలో విజయవంతంగా రాణించాలన్నా, నిలకడగా లాభాలు ఆర్జించాలన్నా మేత ఖర్చును తగ్గించుకోవడం అత్యంత ప్రధానమైన అంశం. సాధారణంగా ఒక పాడి ఆవు లేదా గేదె రోజువారీ ఖర్చులలో దాదాపు 60 నుండి 70 శాతం భాగం దాణా మరియు పశుగ్రాసానికే ఖర్చవుతుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి, పశువులకు ఏడాది పొడవునా పోషకాలతో కూడిన నాణ్యమైన పచ్చిమేతను అందించడంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి ఒక అద్భుతమైన వరంగా నిలుస్తుంది. సజ్జ (Pearl Millet / Bajra) మరియు నేపియర్ గడ్డి (Elephant Grass) జాతులను సంకరీకరణం చేయడం ద్వారా అభివృద్ధి చేసిన అద్భుతమైన, అత్యధిక దిగుబడినిచ్చే బహువార్షిక పశుగ్రాసమే ఈ హైబ్రిడ్ నేపియర్ బజ్రా గడ్డి. కింగ్ గ్రాస్, ఎలిఫెంట్ గ్రాస్ దీనిని తెలుగులో సజ్జ సంకర గడ్డి, లేదా గంటలగడ్డి అని పిలుస్తారు. ఈ పంట వేడి, తేమతో కూడిన వాతావరణంలో తగినంత వర్షపాతం లేదా నీటి పారుదల సౌకర్యం ఉన్నప్పుడు అత్యంత అద్భుతంగా పెరుగుతుంది. ఇది దాదాపు అన్ని రకాల నేలలకు అనుకూలించినప్పటికీ, నీరు నిలవని, మంచి సారవంతమైన బంకమట్టి లేదా ఒండ్రు నేలలు దీని సాగుకు అత్యంత అనువైనవిగా పరిగణించబడతాయి. ముఖ్యంగా నత్రజని ఎరువుల యాజమాన్యానికి ఈ పంట అద్భుతంగా స్పందిస్తూ, ఎక్కువ పిలకలు మరియు ఆకుల పెరుగుదలతో పాటు మొత్తం పశుగ్రాస దిగుబడిని గణనీయంగా పెంచుకుంటుంది. కేవలం పశుగ్రాసంగానే కాకుండా, గడ్డికి ఇతర పారిశ్రామిక మరియు పర్యావరణ ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే అధిక సెల్యులోజ్ కారణంగా దీనిని ఇథనాల్, బ్యూటానాల్ మరియు మిథేన్ వంటి జీవ ఇంధనాల (Biofuel) మరియు బయోఎనర్జీ ఉత్పత్తుల తయారీకి వాడుకునే సంభావ్యత ఉంది. అంతేకాకుండా, ఇది ఒక అద్భుతమైన ఫైటోరెమిడియేషన్ (Phytoremediator) జాతిగా గుర్తించబడింది. ఇది నేలలో పేరుకుపోయిన భార లోహాలు మరియు కొన్ని రకాల రసాయన కాలుష్య కారకాలను సమర్థవంతంగా గ్రహించి, కలుషితమైన నేలలను శుద్ధి చేయడంలో పశువుల రంగానికి మరియు పర్యావరణానికి ఎంతగానో దోహదపడుతుంది.

సాధారణంగా భారతదేశంలో ఈ గడ్డిని మార్చి మధ్య నుండి ఆగస్టు చివరి వరకు నాటుతారు. అయితే గరిష్ట పచ్చిగ్రాస దిగుబడి మరియు ఎక్కువ కోతలు సాధించడానికి మార్చి మధ్యలోనే నాటడం పూర్తి చేయడం ఉత్తమం. ఇలా ముందుగా నాటడం వల్ల వేసవి తీవ్ర ఉష్ణోగ్రతలు రాకముందే పంట స్థిరపడి, సుదీర్ఘమైన, ఉత్పాదక పెరుగుదల కాలాన్ని కలిగి ఉంటుంది. ఆలస్యంగా నాటితే పెరుగుదల కాలం తగ్గి, నవంబర్ నాటికి కేవలం ఒక కోత మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత శీతాకాలపు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా పంట సుప్తచేతనావస్థ (dormant phase) లోకి ప్రవేశించి పెరుగుదల నిలిచిపోతుంది. నాటిన సుమారు మూడు నెలల తర్వాత, పంట తగినంత ఎత్తుకు వృద్ధి చెందినప్పుడు (సుమారు ఒక మీటర్) మొదటి కోతకు సిద్ధమవుతుంది. ఆపై వాతావరణం, నేల సారం, నీటి లభ్యతను బట్టి ప్రతి 45-50 రోజుల విరామంలో తదుపరి కోతలు చేపట్టవచ్చు. పశువులకు కనీస పోషక అవసరాలను (maintenance ration) అందించడమే పచ్చిగ్రాస సాగు యొక్క ప్రాథమిక లక్ష్యం. ఒకవేళ పంటను చాలా ఆలస్యంగా కోస్తే, అందులో పీచు మరియు లిగ్నిన్ శాతం పెరిగి జీర్ణశక్తితో పాటు పశుగ్రాస నాణ్యత, మాంసకృత్తుల (crude protein) స్థాయిలు తగ్గిపోతాయి. అందువల్ల, సరైన పోషక విలువలు మరియు రుచి సమతుల్యత కోసం పంటను సుమారు 1 మీటర్ ఎత్తులో లేదా సిఫార్సు చేసిన కోత వ్యవధిలో కోయడం ఎంతో ముఖ్యం. ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలకు పచ్చిగ్రాసంగా ఉపయోగపడటంతో పాటు, కట్-అండ్-క్యారీ పద్ధతి, సైలేజ్ మరియు హే తయారీ, మృత్తిక పరిరక్షణ మరియు ఫాడర్ బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఏడాది పొడవునా పశుగ్రాస కొరతను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

హైబ్రిడ్ నేపియర్ రకాలైన APBN 1, CO-4 మరియు CO-5 లు వాటి అసాధారణ పచ్చిగ్రాస దిగుబడికి విస్తృతంగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ పశుగ్రాసం యొక్క అసలు పోషక విలువ మరియు జీర్ణశక్తి అనేది అది కోసే దశ మరియు ఎత్తుపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. పంటను చాలా ఆలస్యంగా కోస్తే, అందులో పీచు (fiber) మరియు లిగ్నిన్ (lignin) శాతం పెరిగి, జీర్ణశక్తితో పాటు క్రూడ్ ప్రోటీన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనికి విరుద్ధంగా, సరైన పెరుగుదల దశలో అనగా సాధారణంగా 1 మీటర్ ఎత్తులో లేదా సిఫార్సు చేసిన కోత వ్యవధిలో (50-60) కోయడం వల్ల దిగుబడికి మరియు పోషక నాణ్యతకు మధ్య సరైన సమతుల్యత లభిస్తుంది; ఇది ముఖ్యంగా క్రూడ్ ప్రోటీన్ పరిమాణాన్ని, మేత రుచిని (palatability) మరియు పశువులు తినే శాతాన్ని మెరుగుపరుస్తుంది.అందువల్ల, సకాలంలో నాటడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం మరియు సరైన కోత వ్యవధులను పాటించడం ద్వారా, హైబ్రిడ్ నేపియర్ గడ్డి స్థిరమైన పశుగ్రాస ఉత్పాదక వ్యవస్థలలో అత్యంత ఉత్పాదకత కలిగిన, పోషక సమర్ధవంతమైన మరియు నమ్మకమైన పచ్చిగ్రాస పంటగా ఉపయోగపడుతుంది. ఇందులో 8–12% ముడి మాంసకృత్తులు, 25-35% ముడి పీచు మరియు 55–60% జీర్ణమయ్యే పోషకాలు (TDN) ఉంటాయి. సమృద్ధిగా లభించే కాల్షియం, పశువులలో పాల ఉత్పత్తిని, ఎదుగుదలను మరియు పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీని రసభరిత స్వభావం మరియు మంచి రుచి కారణంగా పశువులు దీనిని ఇష్టంగా తింటాయి.

ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు
హైబ్రిడ్ నేపియర్ గడ్డిని ప్రధానంగా ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలకు పచ్చిమేతగా సాగు చేస్తారు. దీని అధిక గడ్డి దిగుబడి క్రింది వాటికి ఎంతో అనుకూలమైనదిగా చేస్తుంది:

  • పచ్చిగ్రాస ఉత్పత్తి
  • సైలేజ్ (పాతర గడ్డి) మరియు హే (ఎండుగ్రాసం) తయారీ
  • కట్-అండ్-క్యారీ (కోసి మేపడం) పద్దతి
  • మృత్తిక పరిరక్షణ మరియు నేల కోత నివారణ
  • ఫాడర్ బ్యాంకులు (గ్రాస నిధి) మరియు ఏడాది పొడవునా పశుగ్రాస సరఫరా

ఏడాది పొడవునా బహుళ కోతలను ఇచ్చే దీని సామర్థ్యం పశువులకు నిరంతర మరియు నమ్మకమైన పచ్చిగ్రాస సరఫరాను నిశ్చయపరుస్తుంది. దీర్ఘకాలిక లేదా రుతుసంబంధ పశుగ్రాస కొరతను ఎదుర్కొనే ప్రాంతాలలో ఈ గుణం పశువులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.భూమి తక్కువగా ఉండి సాంద్ర పద్ధతిలో (కొట్టాలలో వేసి మేపడం) ప్రాధాన్యత ఇచ్చే చిన్నకారు రైతులకు కోసి మేపే (cut-and-carry) పద్ధతి అత్యంత అనువైనది. ఈ విధానంలో కోసిన గడ్డిని పశువులు కాండం వదలకుండా పూర్తిగా తినేలా చేయడానికి చాపింగ్ (ముక్కలుగా కత్తిరించడం) చేయాలి. అలాగే, కోసిన ముక్కలను కొన్ని గంటల పాటు ఎండలో ఆరబెట్టడం (wilting) ద్వారా అధిక తేమ తగ్గి, రుచి పెరగడమే కాకుండా పశువులలో జీర్ణక్రియ మరియు స్వచ్చంద మేత వినియోగం మెరుగవుతాయి. ఈ పద్ధతిలో సాధారణంగా ప్రతి 6 నుండి 8 వారాల వ్యవధిలో కోతలు చేపడతారు. అయితే వేడి మరియు తేమతో కూడిన తీరప్రాంతాలలో సరైన నీరు, ఎరువుల యాజమాన్యం ఉంటే ప్రతి 4 వారాలకే వేగంగా కోతకు వస్తుంది. ఒకవేళ పొడి వాతావరణం లేదా నీటి ఎద్దడి ఉంటే పంట ఉత్పాదకత దెబ్బతినకుండా 2 నెలల వరకు వ్యవధి ఇవ్వడం మంచిది.

నియంత్రిత పద్ధతిలో పచ్చికబయళ్ల నిర్వహణ (Pasture utilization) కోసం కూడా ఈ గడ్డిని విజయవంతంగా ఉపయోగించవచ్చు. పశువులు అధిక పోషక విలువలు కలిగిన లేత ఆకులు, చిగుర్లను సమర్థవంతంగా తినేలా ప్రతి 6 నుండి 9 వారాల వ్యవధిలో నియంత్రిత పద్ధతిలో మేపడం (controlled grazing) చేయాలి. మేపిన తర్వాత నేలపై సుమారు 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు పంట మోడులను (residual height) ఉంచడం వల్ల తిరిగి వేగంగా పెరగడానికి మరియు కాండం గట్టిపడకుండా ఆకులు రావడానికి సహాయపడుతుంది. నిరంతర ఉత్పాదకత కోసం ప్రతి కోత లేదా మేపిన ప్రతి చక్రం తర్వాత ఎరువులు వేయడం మరియు ముదిరిన నిరుపయోగ కాండాలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా పచ్చికబయళ్ల నాణ్యతను స్థిరంగా ఉంచవచ్చు.
అధిక పచ్చిగ్రాస దిగుబడి కారణంగా ఈ గడ్డి ఎండుగడ్డి (Hay) మరియు పాతర గడ్డి (Silage) తయారీకి సైతం ఎంతో అనుకూలమైనది. నాణ్యమైన ఎండుగడ్డి కోసం గడ్డి 1.5–2.0 మీటర్ల ఎత్తులో, పిలకకు 4-6 ఆకులు ఉన్నప్పుడే కోయాలి. దీనివల్ల కాండం లేతగా ఉండి జీర్ణశక్తి బాగుంటుంది. కోసిన తర్వాత సహజ సూర్యరశ్మిలో లేదా మెకానికల్ డ్రైయర్ల ద్వారా సమానంగా ఎండబెట్టడం వల్ల బూజు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. మరోవైపు, సైలేజ్ తయారీలో ఈ గడ్డిలో ఉండే అధిక తేమ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ల (WSC) వల్ల కిణ్వ ప్రక్రియలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనిని అధిగమించడానికి గడ్డిని సైలేజ్ చేసే ముందు కాసేపు ఆరబెట్టడం మరియు మొలాసిస్ (బెల్లం పాకం) లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ వంటి సైలేజ్ సంకలనాలను చేర్చడం ద్వారా కిణ్వ ప్రక్రియను పెంపొందించి, నాణ్యమైన సైలేజ్ ను ఏడాది పొడవునా నిల్వ చేసుకోవచ్చు.

సాగు పద్ధతులు
హైబ్రిడ్ నేపియర్ గడ్డి (Pennisetum purpureum x Pennisetum glaucum) అనేది భారతదేశంలో CO-3, CO-4, CO-5 మరియు సూపర్ నేపియర్ వంటి రకాలతో ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల వాతావరణ పరిస్థితులలో విస్తృతంగా సాగవుతోంది. ఇది ప్రాథమికంగా వేడి, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందే ఉష్ణమండల జాతి. ఈ పంట 25-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఉత్తమంగా పెరుగుతుంది. ఇది మంచు తదితర తీవ్ర చలి పరిస్థితులను అస్సలు తట్టుకోలేదు; ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 15 °C కంటే తగ్గినప్పుడు దీని పెరుగుదల గణనీయంగా మందగిస్తుంది. దీనికి పెరుగుదల కాలంలో సమానంగా విస్తరించిన సుమారు 800–1500 మి.మీ వార్షిక వర్షపాతం అవసరమవగా, పొడి వాతావరణ పరిస్థితులలో అనుబంధ నీటి పారుదలకు ఈ పంట చాలా అద్భుతంగా స్పందిస్తుంది. వేగవంతమైన పెరుగుదలకు తగినంత నేల తేమ అవసరమైనప్పటికీ, ఈ పంట నీటి నిల్వను అస్సలు తట్టుకోలేదు, కాబట్టి సరైన నీటి పారుదల వసతి కల్పించడం ఎంతో కీలకం. నిరంతర సూర్యరశ్మి పిలకల సంఖ్యను, పచ్చిగ్రాస దిగుబడిని పెంచుతుంది; నీడ ఉన్నచోట దీని ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుంది. పెరిగిన దశలో మొక్కలు పొడవుగా, రసభరితమైన కాండాలతో దట్టమైన ఆకులను కలిగి ఉండటం వల్ల అధిక గాలి వేగం ఉన్నప్పుడు పంట పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యస్థ గాలులు ఉండే ప్రాంతాలు లేదా గాలిని నిరోధించే చెట్లు ఉన్న పొలాలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి.
మంచు ప్రభావం తక్కువగా ఉండి, వేడి వాతావరణం ఉన్నంతవరకు ఇది సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తు వరకు బాగా పెరుగుతుంది. అయితే, 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలలో చల్లని ఉష్ణోగ్రతల వల్ల మొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గి దిగుబడి క్షీణిస్తుంది. ఉత్తర భారతదేశంలో (పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో) శీతాకాలపు నెలల్లో (డిసెంబర్-జనవరి) సంభవించే మంచు, సుదీర్ఘ చలి పరిస్థితులు నేపియర్ గడ్డికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఉష్ణోగ్రతలు 10 °Cకంటే తగ్గితే పంట పెరుగుదల పూర్తిగా మందగించి, ఆకులు మాడిపోవడం, కణజాల నష్టం మరియు పైభాగాలు ఎండిపోవడం జరుగుతుంది. తీవ్రమైన చలి వల్ల పిలకలు పాక్షికంగా చనిపోయి, శీతాకాలంలో పశుగ్రాస లభ్యత తగ్గుతుంది. నేల రకాల విషయానికి వస్తే, హైబ్రిడ్ నేపియర్ ఇసుక లోమ్ (sandy loam) నుండి ఒండ్రు నేలల వరకు విస్తృత శ్రేణి నేలల్లో పెరుగుతుంది. అయినప్పటికీ, సేంద్రీయ కర్బనం అధికంగా ఉండి, నీరు నిలవని, సారవంతమైన లోమ్ నేలలు అధిక దిగుబడికి అత్యంత అనువైనవి. ఇది 5.0–8.0 ( 5.5–7.5) pH పరిధిలో బాగా పెరుగుతుంది మరియు స్వల్ప ఆమ్ల లేదా మధ్యస్థ క్షార/ఉప్పు నేలలను తట్టుకోగలదు. కానీ అధిక ఉప్పు, తీవ్ర క్షార లేదా నీరు నిలిచే చౌడు నేలలు దీని సాగు కోసం పనికిరావు.

నేపియర్ గడ్డి సాగులో భాగంగా నాటడానికి ఒక నెల ముందు పొలంలో హెక్టారుకు 20–25 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు వేసి, రెక్కల నాగలితో దున్ని చదును చేయడం ద్వారా మట్టిని మెత్తటి పదునుకు తీసుకురావాలి; ఆ తర్వాత నేల మట్టానికి సుమారు 20 సెం.మీ ఎత్తులో, 90–100 సెం.మీ దూరంలో బోదెలు మరియు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నేపియర్ గింజలు చాలా చిన్నవిగా మరియు తక్కువ మొలక సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వాటిని ప్రజననానికే వాడతారు కాబట్టి,. వాణిజ్య సాగు కోసం దీనిని కాండం ముక్కలు (setts) లేదా వేర్లతో కూడిన పిలకల ద్వారా శాఖీయంగా ప్రవర్ధనం చేస్తారు. కాండం ముక్కలను నేరుగా నాటడం కంటే, మొదట నర్సరీలో పిలకలను పెంచి ఆపై ప్రధాన పొలంలో నాటడం (transplanting) ద్వారా పొలమంతటా ఏకరీతి పంటను సాధించవచ్చు, కానీ ఈ పద్ధతికి శ్రమ మరియు ఖర్చు ఎక్కువ అవుతుంది. మునుపటి పంట యొక్క వేర్లతో కూడిన మోడులను (rooted stubbles) విడదీసి కూడా నాటవచ్చు, అయితే వీటికి పిలకల బలానికి కొద్దిగా ఎక్కువ నత్రజని అవసరమవుతుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన, సులువైన పద్ధతి కాండం ముక్కలను ఉపయోగించడమే.

తెలంగాణలో వేడి వాతావరణం ప్రారంభమయ్యే మార్చి-ఏప్రిల్ నెలల్లో మరియు నైరుతి రుతుపవనాల రాకతో జూలై-ఆగస్టు నెలల్లో నాటడం మంచిది. ఈ సమయంలో 25-35 celsius అనుకూల ఉష్ణోగ్రతలు వేగంగా మొలకెత్తడానికి సహాయపడతాయి. దక్షిణ మరియు తీరప్రాంతాలలో, ఏడాది పొడవునా వాతావరణం వేడిగా ఉండటం వల్ల, తీవ్రమైన కరవు లేదా అధిక నీటి ముంపు లేని ఏ సమయంలోనైనా దీనిని నాటవచ్చు. నాటడానికి బాగా పెరిగిన మూడు కన్నులు/మొగ్గలు ఉన్న ఆరోగ్యకరమైన కాండం ముక్కలను ఎంచుకోవాలి. ప్రతి ముక్క పొడవు సుమారు 20–30 సెం.మీ ఉండాలి. సాధారణంగా వరుసల మధ్య 90-100 సెం.మీ మరియు వరుసలో మొక్కల మధ్య 50-60 సెం.మీ దూరం ఉండేలా బోదెలపై నాటాలి. ఇది అంతరకృషి పనులకు (కలుపు తీత, ఎరువులు వేయడం, నీటి పారుదల) వీలుగా ఉంటుంది. నేపియర్ కాండం ముక్కలను నేల ఉపరితలానికి సుమారు 45డిగ్రీల కోణంలో నాటాలి, దీనివల్ల 1-2 కన్నులు మట్టిలోపల వేర్లు రావడానికి మరియు 1-2 కన్నులు పైకి చిగురించడానికి వీలుంటుంది. ఇది నిలువుగా నాటడం కంటే ముక్కలు కుళ్లిపోకుండా కాపాడుతుంది. వేర్ల పిలకలను మాత్రం నిలువుగా నాటాలి. ఒక ఎకరానికి సుమారు 10,000 నుండి 12,500 కాండం ముక్కలు అవసరమవుతాయి. వీటిని సిద్ధం చేసిన కాలువలలో 7-8 సెం.మీ లోతులో నాటాలి.

పంట నాటిన మొదటి 45-60 రోజులు నేపియర్ గడ్డి నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి కలుపు పోటీని తట్టుకోలేదు. ఈ దశలో కలుపు నివారణ సరిగ్గా లేకుంటే దిగుబడి తగ్గుతుంది. కాబట్టి కలుపుని నివారించాలి. గుంటక తోలడం, చేతి కలుపు తీయడం మరియు మొదళ్లకు మట్టిని తోయడం ద్వారా వేర్లకు గాలి ఆది, పిలకలు వేగంగా వస్తాయి. మట్టిని తోయడం వల్ల మొక్కలు పడిపోకుండా యాంత్రిక మద్దతు లభిస్తుంది. ఆచ్ఛాదనం (Mulching) ఆకులు అలములు కప్పడం) ద్వారా కూడా తేమను కాపాడి కలుపును అణచవచ్చు. తెగుళ్లు మరియు వ్యాధుల యాజమాన్యం విషయానికి వస్తే, కాండం తొలిచే పురుగు, చెదపురుగులు మరియు మిడతలు కాండం, వేర్లు మరియు ఆకులను దెబ్బతీస్తాయి. వీటిని లోతు దుక్కులు మరియు అవసరమైతే వేప ఆధారిత జీవ పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు మరియు కాటుక తెగులు వంటి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన కాండపు ముక్కలను వాడాలి మరియు వ్యాధి సోకిన భాగాలను వెంటనే తొలగించాలి. హైబ్రిడ్ నేపియర్ గడ్డి నాటిన సుమారు 3 నెలల (80-90 రోజులు) తర్వాత మొదటి కోతకు సిద్ధమవుతుంది. తదుపరి కోతలను మొక్కల పెరుగుదలను బట్టి ప్రతి 45–55 రోజుల వ్యవధిలో చేపట్టవచ్చు. సగటున ఏడాదికి 5 నుండి 7 కోతలు పొందవచ్చు. సాధారణంగా హెక్టారుకు సగటున 2500–3500 క్వింటాళ్ల పచ్చిగ్రాస దిగుబడి వస్తుంది, అయితే సరైన యాజమాన్య పద్ధతులు మరియు ఎరువులు వాడితే 4000 క్వింటాళ్ల/హెక్టారు వరకు దిగుబడి సాధించవచ్చని పరిశోధనా ఫలితాలు వెల్లడించాయి. కోతను ఎల్లప్పుడూ నేలకు దగ్గరగా కోయాలి, ఇది తదుపరి మోడుల పెరుగుదలకు మరియు ఎక్కువ పిలకలు రావడానికి సహాయపడుతుంది. ముదిరిన గడ్డి పీచుగా మారిపోతుంది కాబట్టి లేత రసభరిత దశలోనే కోయాలి. స్థిరమైన ఉత్పాదకత కోసం నేపియర్ గడ్డిని ఒకే పొలంలో 5–6 సంవత్సరాల వరకు ఉంచవచ్చు, ఆ తర్వాత దాని స్థానంలో వేరే పంటను మార్చాలి.

నేపియర్ గడ్డిలో కరిగే మరియు కరుగని రెండు రూపాల ఆక్సలేట్లు ఉంటాయి, ఇవి ముఖ్యంగా లేతగా,వేగంగా పెరుగుతున్న మొక్కలలో మరియు అధిక నత్రజని ఎరువులు వేసి పెంచిన వాటిలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థలో క్యాల్షియంతో బంధాన్ని ఏర్పరుచుకుని, శరీరం శోషించుకోలేని కరుగని క్యాల్షియం ఆక్సలేట్గా మారతాయి,

తద్వారా మొత్తం ఖనిజాల సమతుల్యతను దెబ్బతీస్తాయి (Nasution et al., 2025). అధికంగా ఆక్సలేట్లను తీసుకునే జంతు రక్తంలో క్యాల్షియం స్థాయిలు తగ్గడం (మిల్క్ ఫీవర్/పాల జ్వరం వలె),ఎముకలు బలహీనపడటం, ఎదుగుదల లోపించడం మరియు తీవ్రమైన సందర్భాలలో స్పటికాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. లేత మొక్కలు, అధికనత్రజని ఎరువుల వాడకం మరియు కరవు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం అత్యధికంగా ఉంటుంది.

హైబ్రిడ్ నేపియర్ గడ్డిలో ఆక్సలేట్ శాతాన్ని తగ్గించడానికి వివిధ రకాల సమర్థవంతమైన యాజమాన్యవ్యూహాలను అనుసరించవచ్చు. మొదటగా, పంటను సరియైన వయస్సులో, అంటే 45 నుండి 60 రోజుల మధ్య సరైన పెరుగుదల దశలో కోయడం ద్వారా ఆక్సలేట్ మరియు టానిన్ సాంద్రతలను అదుపులో ఉంచవచ్చు, ఎందుకంటే చాలా లేత మొక్కలలో ఈ యాంటీ- న్యూట్రిషనల్ కారకాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. కోసిన పశుగ్రాసాన్ని వాడబెట్టడం (wilting) మరియు ఎండబెట్టడం (sun-drying) వంటి పద్ధతులకు గురిచేయడం ద్వారా అందులోని కరిగే ఆక్సలేట్లను, హైడ్రోజన్ సయనైడ్ (HCN) ను గణనీయంగా తగ్గించవచ్చు. దీనితో పాటు, కిణ్వ ప్రక్రియ ద్వారా సైలేజ్ చేయడం (Ensiling) వల్ల ఆక్సలేట్ టానిన్లు మరియు ఫైటేట్ స్థాయిలు సమర్థవంతంగా తగ్గడమే కాకుండా పశుగ్రాసం యొక్క రుచి, జీర్ణశక్తి కూడా మెరుగుపడతాయి. పొలంలోఅధిక నత్రజని ఎరువులు వేయడం వల్ల ఆక్సలేట్ సాంద్రతలు పెరుగుతాయి కాబట్టి, సమతుల్య ఎరువుల వాడకం ద్వారా తగినంత పొటాషియం మరియు భాస్వరం అందిస్తూ ప్రతిపోషక కారకాలు( అనేవి ఆహారంలో సహజంగా ఉండే రసాయన పదార్థాలు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను జీర్ణం చేయడం, శోషించుకోవడం లేదా వినియోగించుకోవడాన్ని అడ్డుకుంటాయి. అందువల్ల ఆహారంలోని పోషక విలువ తగ్గుతుంది. ) పేరుకుపోవడాన్ని అదుపులో ఉంచాలి. పశువులకు మేతగా ఇచ్చేటప్పుడు సున్నం లేదా ఖనిజ మిశ్రమాల వంటి క్యాల్షియం వనరులను ఆహారంలో చేర్చడం ద్వారా ఆక్సలేట్ సంబంధిత లోపాలను అధిగమించవచ్చు. అలాగే, నేపియర్ గడ్డిని లూసర్న్, అలసందలు లేదా మునగ వంటిపప్పుధాన్యాల పశుగ్రాసాలతో కలిపి ఇవ్వడం వల్ల ఆక్సలేట్ వంటి ప్రతిపోషక కారకా ల సాంద్రత తగ్గడమే కాకుండా, పశుగ్రాసంలో ప్రొటీన్ మరియు ఖనిజాల శాతం పెరిగి పశువులకుమేలైన పోషకాలు అందుతాయి.

సి. హెచ్. రామకృష్ణ కె. సుష్మ, సి. హెచ్. శివప్రసాద్, పి. అమరేశ్వరి, మరియు టి. రఘునందన్
పశుగణ క్షేత్ర సముదాయ, పశువైద్య కళాశాల
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం. ph: 7989269600

Read More

ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More