ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్

ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.

మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.

ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.

గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.

మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:

  1. సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్‌ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్‌ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
  2. యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
    మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.

దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.

రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.

వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.

కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్‌ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్‌ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.

ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

  1. పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
  2. నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
  3. ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
  4. కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
  5. నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
    స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.

Read More

ఎల్నినో పరిస్థితుల్లో పాడి పశువులకు పశుగ్రాసాల ఎంపిక

    ఎల్నినో పరిస్థితుల్లో సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం అస్థిరంగా ఉండటం, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు మరియు నీటి లభ్యతలో మార్పులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026లో ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు పంటలతో పాటు పశుసంపద, పశుగ్రాసం మరియు నీటి వనరుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ICAR సంస్థలు కూడా సూచిస్తున్నాయి.ఎల్నినో పరిస్థితుల్లో పచ్చిమేత లభ్యత తగ్గితే పశువులకు పోషక పదార్థాల కొరత ఏర్పడి, పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల “పశుగ్రాస భద్రత – పాడి పశువుల ఆరోగ్యం – పాల ఉత్పత్తి – రైతు ఆదాయం” అనే నాలుగు అంశాలను సమగ్రంగా చూడాలి

పశుగ్రాసం అనగానే మన రైతులకు వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ వంటి పంట అవశేషాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో పశువులకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు తగిన స్థాయిలో ఉండవు. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల్లో పచ్చిమేత కొరత ఏర్పడితే కేవలం ఎండుమేతపై ఆధారపడటం వల్ల పశువుల పోషక అవసరాలు పూర్తిగా తీరకపోవచ్చు.

అదే సమయంలో జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి ధాన్యాలను అధికంగా పశుదాణాలో ఉపయోగించడం ఆర్థికంగా కూడా భారమవుతుంది. కాబట్టి రైతులు తమ భూమి, నీటి లభ్యత మరియు పశువుల సంఖ్యకు అనుగుణంగా పచ్చిమేత + ఎండుమేత + కాయజాతి పశుగ్రాసాలు + అవసరమైన మిశ్రమ దాణా కలిపి సమతుల్య పశుగ్రాస ప్రణాళికను రూపొందించుకోవాలి.

I.ఎల్నినో పరిస్థితుల్లో పశుగ్రాసాల ఎంపిక ఎలా ఉండాలి

  1. ఒకటి లేదా రెండు పాడి పశువులు ఉన్న రైతులు
    సన్నకారు మరియు చిన్నకారు రైతులు తమ ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
    • సుబాబుల్, అవిస వంటి పశుగ్రాస చెట్లను పెంచుకోవాలి.
    • ఇంటి పరిసరాలు, పొలాల గట్లను పశుగ్రాస వనరులుగా ఉపయోగించుకోవాలి.
    • నీటి లభ్యత ఉన్నట్లయితే కొంత భూమిలో శాశ్వత పచ్చిమేతను సాగు చేయాలి.
    • పంట అవశేషాలను వృథా చేయకుండా ఎండుమేతగా నిల్వ చేసుకోవాలి.
    • ఎల్నినో సమయంలో అత్యవసర పరిస్థితులకు ముందుగానే పశుగ్రాస నిల్వ చేసుకోవాలి.
  2. మధ్యస్థ స్థాయిలో పాడి పశువులు ఉన్న రైతులు
    పాడి పశువుల సంఖ్య పెరిగిన కొద్దీ రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పశుగ్రాస సాగుకు కేటాయించాలి.

నీటి వసతి ఉన్న భూముల్లో హైబ్రిడ్ నేపియర్ రకాలు (CO-1, CO-2, CO-3) వంటి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు లూసర్న్, అలసంద, అనుములు, హెడ్జ్ లూసర్న్, స్టైలో వంటి కాయజాతి పశుగ్రాసాలను కూడా పెంచుకోవాలి.
గడ్డిజాతి మరియు కాయజాతి పశుగ్రాసాలను కలిపి మేపడం ద్వారా పశువులకు మెరుగైన పోషక సమతుల్యతను అందించవచ్చు.

  1. పెద్దస్థాయి పాడి పరిశ్రమలు
    వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు “సంవత్సరం పొడవునా పశుగ్రాస లభ్యత” అనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించుకోవాలి.
    • నీటి వసతి ఉన్న చోట బహువార్షిక పశుగ్రాసాలు.
    • వర్షాధార ప్రాంతాల్లో సీజనల్ పశుగ్రాసాలు.
    • అదనపు పచ్చిమేతను సైలేజీగా నిల్వ చేయడం.
    • పంట అవశేషాలను శాస్త్రీయ పద్ధతిలో ఎండుమేతగా నిల్వ చేయడం.
    • కాయజాతి పశుగ్రాసాల సాగు.
    • అత్యవసర పరిస్థితులకు ముందుగానే పశుగ్రాస బ్యాంకును ఏర్పాటు చేయడం.

II.నీటి లభ్యత ఆధారంగా పశుగ్రాసాల ఎంపిక
ఎల్నినో పరిస్థితుల్లో నీరు అత్యంత విలువైన వనరు. అందువల్ల నీటి లభ్యతను బట్టి పశుగ్రాసాలను ఎంపిక చేయాలి.

A.నీటి వసతి ఉన్న భూముల్లో:
హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, లూసర్న్, పేరాగడ్డి వంటి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేయవచ్చు.

B.నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో:
జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి సీజనల్ పశుగ్రాసాలను వర్షాధారంగా సాగు చేయవచ్చు.

C.నీరు నిలిచే ప్రాంతాల్లో:
పేరాగడ్డి వంటి రకాలను అనువైన పరిస్థితుల్లో సాగు చేయవచ్చు

III.ఎల్నినో సమయంలో పశుగ్రాస భద్రత కోసం రైతులు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు

  1. తోటలలో / చెట్ల నీడల్లో – అనువైన పశుగ్రాసాలు : గినిగడ్డి, (మకుని), స్టైలో
  2. మిశ్రమ పంటగా పనికివచ్చే అనువైన పశుగ్రాసాలు : అలసంద, స్టైలో
  3. చవుడు భూములలో- అనువైన పశుగ్రాసాలు : రోడ్స్ గడ్డి
  4. తక్కువ వర్షపాతము గల ప్రాంతాలకు – అనువైన పశుగ్రాసాలు : సజ్జ
  5. నల్లరేగడి భూములకు – అనువైన పశుగ్రాసాలు : ఆఫ్రికన్ టాల్ రకపు మొక్కజొన్న ఎస్.ఎస్.జి
  6. ఎఱ్ఱభూములు, తేలిక పాటి భూములకు – అనువైన పశుగ్రాసాలు : ఏకవార్షికాలు- ఎస్.ఎస్.జి, ఎమ్.పి.చారి, సజ్జరకాలు బహువార్షికాలు- స్టైలో
  7. బంజరు, పడావు భూములలో – అనువైన పశుగ్రాసాలు : స్టైలో, అంజాన గడ్డి
  8. నీరునిలువ ఉండు భూములలో – అనువైన పశుగ్రాసాలు : పేరాగడ్డి
  9. ఎండుమేతగా నిలువ చేయుటకు – అనువైన పశుగ్రాసాలు : వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, జనుము, అంజాన గడ్డి, గినిగడ్డి
  10. సైలేజి (పాతరగడ్డి) గా వాడుటకు – అనువైన పశుగ్రాసాలు : జొన్న, మొక్కజొన్న, నేపియర్ రకాలు
  11. యూరయాతో సుపోషకం చేసుకోవడానికి – అనువైన పశుగ్రాసాలు : వరిగడ్డి, ముక్కలుగా నరికిన జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప
  12. ముక్కలుగా (చాఫింగ్) నరికి మేపుటకు – అనువైన పశుగ్రాసాలు : జొన్న, సజ్జ, మొక్కజొన్న రకాలు
    ఇలాంటి ముందస్తు ప్రణాళిక ఎల్నినో వంటి వాతావరణ ఒత్తిడి సమయంలో పశుగ్రాస కొరతను తగ్గించడంలో పశుగ్రాస భద్రత, సైలేజీ తయారీ మరియు contingency preparedness సహాయపడుతుంది.

డా. ఎం. గంగా దేవి, సీనియర్ సైంటిస్ట్ (అగ్రానమీ),
డా. ఎం. యుగంధర్ కుమార్ , ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. కె. రవిచంద్ర, సైంటిస్ట్,
డా. సౌజన్య లక్ష్మి, సైంటిస్ట్
కృషి విజ్ఞాన కేంద్రం, లాం, గుంటూరు. Ph: 9490035258

Read More

పాడి పరిశ్రమకు కల్పతరువు: హైబ్రిడ్ ‘నేపియర్ బజ్రా గడ్డి ‘ సాగు!

పాడి పరిశ్రమలో విజయవంతంగా రాణించాలన్నా, నిలకడగా లాభాలు ఆర్జించాలన్నా మేత ఖర్చును తగ్గించుకోవడం అత్యంత ప్రధానమైన అంశం. సాధారణంగా ఒక పాడి ఆవు లేదా గేదె రోజువారీ ఖర్చులలో దాదాపు 60 నుండి 70 శాతం భాగం దాణా మరియు పశుగ్రాసానికే ఖర్చవుతుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి, పశువులకు ఏడాది పొడవునా పోషకాలతో కూడిన నాణ్యమైన పచ్చిమేతను అందించడంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి ఒక అద్భుతమైన వరంగా నిలుస్తుంది. సజ్జ (Pearl Millet / Bajra) మరియు నేపియర్ గడ్డి (Elephant Grass) జాతులను సంకరీకరణం చేయడం ద్వారా అభివృద్ధి చేసిన అద్భుతమైన, అత్యధిక దిగుబడినిచ్చే బహువార్షిక పశుగ్రాసమే ఈ హైబ్రిడ్ నేపియర్ బజ్రా గడ్డి. కింగ్ గ్రాస్, ఎలిఫెంట్ గ్రాస్ దీనిని తెలుగులో సజ్జ సంకర గడ్డి, లేదా గంటలగడ్డి అని పిలుస్తారు. ఈ పంట వేడి, తేమతో కూడిన వాతావరణంలో తగినంత వర్షపాతం లేదా నీటి పారుదల సౌకర్యం ఉన్నప్పుడు అత్యంత అద్భుతంగా పెరుగుతుంది. ఇది దాదాపు అన్ని రకాల నేలలకు అనుకూలించినప్పటికీ, నీరు నిలవని, మంచి సారవంతమైన బంకమట్టి లేదా ఒండ్రు నేలలు దీని సాగుకు అత్యంత అనువైనవిగా పరిగణించబడతాయి. ముఖ్యంగా నత్రజని ఎరువుల యాజమాన్యానికి ఈ పంట అద్భుతంగా స్పందిస్తూ, ఎక్కువ పిలకలు మరియు ఆకుల పెరుగుదలతో పాటు మొత్తం పశుగ్రాస దిగుబడిని గణనీయంగా పెంచుకుంటుంది. కేవలం పశుగ్రాసంగానే కాకుండా, గడ్డికి ఇతర పారిశ్రామిక మరియు పర్యావరణ ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే అధిక సెల్యులోజ్ కారణంగా దీనిని ఇథనాల్, బ్యూటానాల్ మరియు మిథేన్ వంటి జీవ ఇంధనాల (Biofuel) మరియు బయోఎనర్జీ ఉత్పత్తుల తయారీకి వాడుకునే సంభావ్యత ఉంది. అంతేకాకుండా, ఇది ఒక అద్భుతమైన ఫైటోరెమిడియేషన్ (Phytoremediator) జాతిగా గుర్తించబడింది. ఇది నేలలో పేరుకుపోయిన భార లోహాలు మరియు కొన్ని రకాల రసాయన కాలుష్య కారకాలను సమర్థవంతంగా గ్రహించి, కలుషితమైన నేలలను శుద్ధి చేయడంలో పశువుల రంగానికి మరియు పర్యావరణానికి ఎంతగానో దోహదపడుతుంది.

సాధారణంగా భారతదేశంలో ఈ గడ్డిని మార్చి మధ్య నుండి ఆగస్టు చివరి వరకు నాటుతారు. అయితే గరిష్ట పచ్చిగ్రాస దిగుబడి మరియు ఎక్కువ కోతలు సాధించడానికి మార్చి మధ్యలోనే నాటడం పూర్తి చేయడం ఉత్తమం. ఇలా ముందుగా నాటడం వల్ల వేసవి తీవ్ర ఉష్ణోగ్రతలు రాకముందే పంట స్థిరపడి, సుదీర్ఘమైన, ఉత్పాదక పెరుగుదల కాలాన్ని కలిగి ఉంటుంది. ఆలస్యంగా నాటితే పెరుగుదల కాలం తగ్గి, నవంబర్ నాటికి కేవలం ఒక కోత మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత శీతాకాలపు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా పంట సుప్తచేతనావస్థ (dormant phase) లోకి ప్రవేశించి పెరుగుదల నిలిచిపోతుంది. నాటిన సుమారు మూడు నెలల తర్వాత, పంట తగినంత ఎత్తుకు వృద్ధి చెందినప్పుడు (సుమారు ఒక మీటర్) మొదటి కోతకు సిద్ధమవుతుంది. ఆపై వాతావరణం, నేల సారం, నీటి లభ్యతను బట్టి ప్రతి 45-50 రోజుల విరామంలో తదుపరి కోతలు చేపట్టవచ్చు. పశువులకు కనీస పోషక అవసరాలను (maintenance ration) అందించడమే పచ్చిగ్రాస సాగు యొక్క ప్రాథమిక లక్ష్యం. ఒకవేళ పంటను చాలా ఆలస్యంగా కోస్తే, అందులో పీచు మరియు లిగ్నిన్ శాతం పెరిగి జీర్ణశక్తితో పాటు పశుగ్రాస నాణ్యత, మాంసకృత్తుల (crude protein) స్థాయిలు తగ్గిపోతాయి. అందువల్ల, సరైన పోషక విలువలు మరియు రుచి సమతుల్యత కోసం పంటను సుమారు 1 మీటర్ ఎత్తులో లేదా సిఫార్సు చేసిన కోత వ్యవధిలో కోయడం ఎంతో ముఖ్యం. ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలకు పచ్చిగ్రాసంగా ఉపయోగపడటంతో పాటు, కట్-అండ్-క్యారీ పద్ధతి, సైలేజ్ మరియు హే తయారీ, మృత్తిక పరిరక్షణ మరియు ఫాడర్ బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఏడాది పొడవునా పశుగ్రాస కొరతను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

హైబ్రిడ్ నేపియర్ రకాలైన APBN 1, CO-4 మరియు CO-5 లు వాటి అసాధారణ పచ్చిగ్రాస దిగుబడికి విస్తృతంగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ పశుగ్రాసం యొక్క అసలు పోషక విలువ మరియు జీర్ణశక్తి అనేది అది కోసే దశ మరియు ఎత్తుపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. పంటను చాలా ఆలస్యంగా కోస్తే, అందులో పీచు (fiber) మరియు లిగ్నిన్ (lignin) శాతం పెరిగి, జీర్ణశక్తితో పాటు క్రూడ్ ప్రోటీన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనికి విరుద్ధంగా, సరైన పెరుగుదల దశలో అనగా సాధారణంగా 1 మీటర్ ఎత్తులో లేదా సిఫార్సు చేసిన కోత వ్యవధిలో (50-60) కోయడం వల్ల దిగుబడికి మరియు పోషక నాణ్యతకు మధ్య సరైన సమతుల్యత లభిస్తుంది; ఇది ముఖ్యంగా క్రూడ్ ప్రోటీన్ పరిమాణాన్ని, మేత రుచిని (palatability) మరియు పశువులు తినే శాతాన్ని మెరుగుపరుస్తుంది.అందువల్ల, సకాలంలో నాటడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం మరియు సరైన కోత వ్యవధులను పాటించడం ద్వారా, హైబ్రిడ్ నేపియర్ గడ్డి స్థిరమైన పశుగ్రాస ఉత్పాదక వ్యవస్థలలో అత్యంత ఉత్పాదకత కలిగిన, పోషక సమర్ధవంతమైన మరియు నమ్మకమైన పచ్చిగ్రాస పంటగా ఉపయోగపడుతుంది. ఇందులో 8–12% ముడి మాంసకృత్తులు, 25-35% ముడి పీచు మరియు 55–60% జీర్ణమయ్యే పోషకాలు (TDN) ఉంటాయి. సమృద్ధిగా లభించే కాల్షియం, పశువులలో పాల ఉత్పత్తిని, ఎదుగుదలను మరియు పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీని రసభరిత స్వభావం మరియు మంచి రుచి కారణంగా పశువులు దీనిని ఇష్టంగా తింటాయి.

ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు
హైబ్రిడ్ నేపియర్ గడ్డిని ప్రధానంగా ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలకు పచ్చిమేతగా సాగు చేస్తారు. దీని అధిక గడ్డి దిగుబడి క్రింది వాటికి ఎంతో అనుకూలమైనదిగా చేస్తుంది:

  • పచ్చిగ్రాస ఉత్పత్తి
  • సైలేజ్ (పాతర గడ్డి) మరియు హే (ఎండుగ్రాసం) తయారీ
  • కట్-అండ్-క్యారీ (కోసి మేపడం) పద్దతి
  • మృత్తిక పరిరక్షణ మరియు నేల కోత నివారణ
  • ఫాడర్ బ్యాంకులు (గ్రాస నిధి) మరియు ఏడాది పొడవునా పశుగ్రాస సరఫరా

ఏడాది పొడవునా బహుళ కోతలను ఇచ్చే దీని సామర్థ్యం పశువులకు నిరంతర మరియు నమ్మకమైన పచ్చిగ్రాస సరఫరాను నిశ్చయపరుస్తుంది. దీర్ఘకాలిక లేదా రుతుసంబంధ పశుగ్రాస కొరతను ఎదుర్కొనే ప్రాంతాలలో ఈ గుణం పశువులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.భూమి తక్కువగా ఉండి సాంద్ర పద్ధతిలో (కొట్టాలలో వేసి మేపడం) ప్రాధాన్యత ఇచ్చే చిన్నకారు రైతులకు కోసి మేపే (cut-and-carry) పద్ధతి అత్యంత అనువైనది. ఈ విధానంలో కోసిన గడ్డిని పశువులు కాండం వదలకుండా పూర్తిగా తినేలా చేయడానికి చాపింగ్ (ముక్కలుగా కత్తిరించడం) చేయాలి. అలాగే, కోసిన ముక్కలను కొన్ని గంటల పాటు ఎండలో ఆరబెట్టడం (wilting) ద్వారా అధిక తేమ తగ్గి, రుచి పెరగడమే కాకుండా పశువులలో జీర్ణక్రియ మరియు స్వచ్చంద మేత వినియోగం మెరుగవుతాయి. ఈ పద్ధతిలో సాధారణంగా ప్రతి 6 నుండి 8 వారాల వ్యవధిలో కోతలు చేపడతారు. అయితే వేడి మరియు తేమతో కూడిన తీరప్రాంతాలలో సరైన నీరు, ఎరువుల యాజమాన్యం ఉంటే ప్రతి 4 వారాలకే వేగంగా కోతకు వస్తుంది. ఒకవేళ పొడి వాతావరణం లేదా నీటి ఎద్దడి ఉంటే పంట ఉత్పాదకత దెబ్బతినకుండా 2 నెలల వరకు వ్యవధి ఇవ్వడం మంచిది.

నియంత్రిత పద్ధతిలో పచ్చికబయళ్ల నిర్వహణ (Pasture utilization) కోసం కూడా ఈ గడ్డిని విజయవంతంగా ఉపయోగించవచ్చు. పశువులు అధిక పోషక విలువలు కలిగిన లేత ఆకులు, చిగుర్లను సమర్థవంతంగా తినేలా ప్రతి 6 నుండి 9 వారాల వ్యవధిలో నియంత్రిత పద్ధతిలో మేపడం (controlled grazing) చేయాలి. మేపిన తర్వాత నేలపై సుమారు 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు పంట మోడులను (residual height) ఉంచడం వల్ల తిరిగి వేగంగా పెరగడానికి మరియు కాండం గట్టిపడకుండా ఆకులు రావడానికి సహాయపడుతుంది. నిరంతర ఉత్పాదకత కోసం ప్రతి కోత లేదా మేపిన ప్రతి చక్రం తర్వాత ఎరువులు వేయడం మరియు ముదిరిన నిరుపయోగ కాండాలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా పచ్చికబయళ్ల నాణ్యతను స్థిరంగా ఉంచవచ్చు.
అధిక పచ్చిగ్రాస దిగుబడి కారణంగా ఈ గడ్డి ఎండుగడ్డి (Hay) మరియు పాతర గడ్డి (Silage) తయారీకి సైతం ఎంతో అనుకూలమైనది. నాణ్యమైన ఎండుగడ్డి కోసం గడ్డి 1.5–2.0 మీటర్ల ఎత్తులో, పిలకకు 4-6 ఆకులు ఉన్నప్పుడే కోయాలి. దీనివల్ల కాండం లేతగా ఉండి జీర్ణశక్తి బాగుంటుంది. కోసిన తర్వాత సహజ సూర్యరశ్మిలో లేదా మెకానికల్ డ్రైయర్ల ద్వారా సమానంగా ఎండబెట్టడం వల్ల బూజు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. మరోవైపు, సైలేజ్ తయారీలో ఈ గడ్డిలో ఉండే అధిక తేమ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ల (WSC) వల్ల కిణ్వ ప్రక్రియలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనిని అధిగమించడానికి గడ్డిని సైలేజ్ చేసే ముందు కాసేపు ఆరబెట్టడం మరియు మొలాసిస్ (బెల్లం పాకం) లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ వంటి సైలేజ్ సంకలనాలను చేర్చడం ద్వారా కిణ్వ ప్రక్రియను పెంపొందించి, నాణ్యమైన సైలేజ్ ను ఏడాది పొడవునా నిల్వ చేసుకోవచ్చు.

సాగు పద్ధతులు
హైబ్రిడ్ నేపియర్ గడ్డి (Pennisetum purpureum x Pennisetum glaucum) అనేది భారతదేశంలో CO-3, CO-4, CO-5 మరియు సూపర్ నేపియర్ వంటి రకాలతో ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల వాతావరణ పరిస్థితులలో విస్తృతంగా సాగవుతోంది. ఇది ప్రాథమికంగా వేడి, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందే ఉష్ణమండల జాతి. ఈ పంట 25-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఉత్తమంగా పెరుగుతుంది. ఇది మంచు తదితర తీవ్ర చలి పరిస్థితులను అస్సలు తట్టుకోలేదు; ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 15 °C కంటే తగ్గినప్పుడు దీని పెరుగుదల గణనీయంగా మందగిస్తుంది. దీనికి పెరుగుదల కాలంలో సమానంగా విస్తరించిన సుమారు 800–1500 మి.మీ వార్షిక వర్షపాతం అవసరమవగా, పొడి వాతావరణ పరిస్థితులలో అనుబంధ నీటి పారుదలకు ఈ పంట చాలా అద్భుతంగా స్పందిస్తుంది. వేగవంతమైన పెరుగుదలకు తగినంత నేల తేమ అవసరమైనప్పటికీ, ఈ పంట నీటి నిల్వను అస్సలు తట్టుకోలేదు, కాబట్టి సరైన నీటి పారుదల వసతి కల్పించడం ఎంతో కీలకం. నిరంతర సూర్యరశ్మి పిలకల సంఖ్యను, పచ్చిగ్రాస దిగుబడిని పెంచుతుంది; నీడ ఉన్నచోట దీని ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుంది. పెరిగిన దశలో మొక్కలు పొడవుగా, రసభరితమైన కాండాలతో దట్టమైన ఆకులను కలిగి ఉండటం వల్ల అధిక గాలి వేగం ఉన్నప్పుడు పంట పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యస్థ గాలులు ఉండే ప్రాంతాలు లేదా గాలిని నిరోధించే చెట్లు ఉన్న పొలాలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి.
మంచు ప్రభావం తక్కువగా ఉండి, వేడి వాతావరణం ఉన్నంతవరకు ఇది సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తు వరకు బాగా పెరుగుతుంది. అయితే, 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలలో చల్లని ఉష్ణోగ్రతల వల్ల మొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గి దిగుబడి క్షీణిస్తుంది. ఉత్తర భారతదేశంలో (పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో) శీతాకాలపు నెలల్లో (డిసెంబర్-జనవరి) సంభవించే మంచు, సుదీర్ఘ చలి పరిస్థితులు నేపియర్ గడ్డికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఉష్ణోగ్రతలు 10 °Cకంటే తగ్గితే పంట పెరుగుదల పూర్తిగా మందగించి, ఆకులు మాడిపోవడం, కణజాల నష్టం మరియు పైభాగాలు ఎండిపోవడం జరుగుతుంది. తీవ్రమైన చలి వల్ల పిలకలు పాక్షికంగా చనిపోయి, శీతాకాలంలో పశుగ్రాస లభ్యత తగ్గుతుంది. నేల రకాల విషయానికి వస్తే, హైబ్రిడ్ నేపియర్ ఇసుక లోమ్ (sandy loam) నుండి ఒండ్రు నేలల వరకు విస్తృత శ్రేణి నేలల్లో పెరుగుతుంది. అయినప్పటికీ, సేంద్రీయ కర్బనం అధికంగా ఉండి, నీరు నిలవని, సారవంతమైన లోమ్ నేలలు అధిక దిగుబడికి అత్యంత అనువైనవి. ఇది 5.0–8.0 ( 5.5–7.5) pH పరిధిలో బాగా పెరుగుతుంది మరియు స్వల్ప ఆమ్ల లేదా మధ్యస్థ క్షార/ఉప్పు నేలలను తట్టుకోగలదు. కానీ అధిక ఉప్పు, తీవ్ర క్షార లేదా నీరు నిలిచే చౌడు నేలలు దీని సాగు కోసం పనికిరావు.

నేపియర్ గడ్డి సాగులో భాగంగా నాటడానికి ఒక నెల ముందు పొలంలో హెక్టారుకు 20–25 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు వేసి, రెక్కల నాగలితో దున్ని చదును చేయడం ద్వారా మట్టిని మెత్తటి పదునుకు తీసుకురావాలి; ఆ తర్వాత నేల మట్టానికి సుమారు 20 సెం.మీ ఎత్తులో, 90–100 సెం.మీ దూరంలో బోదెలు మరియు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నేపియర్ గింజలు చాలా చిన్నవిగా మరియు తక్కువ మొలక సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వాటిని ప్రజననానికే వాడతారు కాబట్టి,. వాణిజ్య సాగు కోసం దీనిని కాండం ముక్కలు (setts) లేదా వేర్లతో కూడిన పిలకల ద్వారా శాఖీయంగా ప్రవర్ధనం చేస్తారు. కాండం ముక్కలను నేరుగా నాటడం కంటే, మొదట నర్సరీలో పిలకలను పెంచి ఆపై ప్రధాన పొలంలో నాటడం (transplanting) ద్వారా పొలమంతటా ఏకరీతి పంటను సాధించవచ్చు, కానీ ఈ పద్ధతికి శ్రమ మరియు ఖర్చు ఎక్కువ అవుతుంది. మునుపటి పంట యొక్క వేర్లతో కూడిన మోడులను (rooted stubbles) విడదీసి కూడా నాటవచ్చు, అయితే వీటికి పిలకల బలానికి కొద్దిగా ఎక్కువ నత్రజని అవసరమవుతుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన, సులువైన పద్ధతి కాండం ముక్కలను ఉపయోగించడమే.

తెలంగాణలో వేడి వాతావరణం ప్రారంభమయ్యే మార్చి-ఏప్రిల్ నెలల్లో మరియు నైరుతి రుతుపవనాల రాకతో జూలై-ఆగస్టు నెలల్లో నాటడం మంచిది. ఈ సమయంలో 25-35 celsius అనుకూల ఉష్ణోగ్రతలు వేగంగా మొలకెత్తడానికి సహాయపడతాయి. దక్షిణ మరియు తీరప్రాంతాలలో, ఏడాది పొడవునా వాతావరణం వేడిగా ఉండటం వల్ల, తీవ్రమైన కరవు లేదా అధిక నీటి ముంపు లేని ఏ సమయంలోనైనా దీనిని నాటవచ్చు. నాటడానికి బాగా పెరిగిన మూడు కన్నులు/మొగ్గలు ఉన్న ఆరోగ్యకరమైన కాండం ముక్కలను ఎంచుకోవాలి. ప్రతి ముక్క పొడవు సుమారు 20–30 సెం.మీ ఉండాలి. సాధారణంగా వరుసల మధ్య 90-100 సెం.మీ మరియు వరుసలో మొక్కల మధ్య 50-60 సెం.మీ దూరం ఉండేలా బోదెలపై నాటాలి. ఇది అంతరకృషి పనులకు (కలుపు తీత, ఎరువులు వేయడం, నీటి పారుదల) వీలుగా ఉంటుంది. నేపియర్ కాండం ముక్కలను నేల ఉపరితలానికి సుమారు 45డిగ్రీల కోణంలో నాటాలి, దీనివల్ల 1-2 కన్నులు మట్టిలోపల వేర్లు రావడానికి మరియు 1-2 కన్నులు పైకి చిగురించడానికి వీలుంటుంది. ఇది నిలువుగా నాటడం కంటే ముక్కలు కుళ్లిపోకుండా కాపాడుతుంది. వేర్ల పిలకలను మాత్రం నిలువుగా నాటాలి. ఒక ఎకరానికి సుమారు 10,000 నుండి 12,500 కాండం ముక్కలు అవసరమవుతాయి. వీటిని సిద్ధం చేసిన కాలువలలో 7-8 సెం.మీ లోతులో నాటాలి.

పంట నాటిన మొదటి 45-60 రోజులు నేపియర్ గడ్డి నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి కలుపు పోటీని తట్టుకోలేదు. ఈ దశలో కలుపు నివారణ సరిగ్గా లేకుంటే దిగుబడి తగ్గుతుంది. కాబట్టి కలుపుని నివారించాలి. గుంటక తోలడం, చేతి కలుపు తీయడం మరియు మొదళ్లకు మట్టిని తోయడం ద్వారా వేర్లకు గాలి ఆది, పిలకలు వేగంగా వస్తాయి. మట్టిని తోయడం వల్ల మొక్కలు పడిపోకుండా యాంత్రిక మద్దతు లభిస్తుంది. ఆచ్ఛాదనం (Mulching) ఆకులు అలములు కప్పడం) ద్వారా కూడా తేమను కాపాడి కలుపును అణచవచ్చు. తెగుళ్లు మరియు వ్యాధుల యాజమాన్యం విషయానికి వస్తే, కాండం తొలిచే పురుగు, చెదపురుగులు మరియు మిడతలు కాండం, వేర్లు మరియు ఆకులను దెబ్బతీస్తాయి. వీటిని లోతు దుక్కులు మరియు అవసరమైతే వేప ఆధారిత జీవ పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు మరియు కాటుక తెగులు వంటి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన కాండపు ముక్కలను వాడాలి మరియు వ్యాధి సోకిన భాగాలను వెంటనే తొలగించాలి. హైబ్రిడ్ నేపియర్ గడ్డి నాటిన సుమారు 3 నెలల (80-90 రోజులు) తర్వాత మొదటి కోతకు సిద్ధమవుతుంది. తదుపరి కోతలను మొక్కల పెరుగుదలను బట్టి ప్రతి 45–55 రోజుల వ్యవధిలో చేపట్టవచ్చు. సగటున ఏడాదికి 5 నుండి 7 కోతలు పొందవచ్చు. సాధారణంగా హెక్టారుకు సగటున 2500–3500 క్వింటాళ్ల పచ్చిగ్రాస దిగుబడి వస్తుంది, అయితే సరైన యాజమాన్య పద్ధతులు మరియు ఎరువులు వాడితే 4000 క్వింటాళ్ల/హెక్టారు వరకు దిగుబడి సాధించవచ్చని పరిశోధనా ఫలితాలు వెల్లడించాయి. కోతను ఎల్లప్పుడూ నేలకు దగ్గరగా కోయాలి, ఇది తదుపరి మోడుల పెరుగుదలకు మరియు ఎక్కువ పిలకలు రావడానికి సహాయపడుతుంది. ముదిరిన గడ్డి పీచుగా మారిపోతుంది కాబట్టి లేత రసభరిత దశలోనే కోయాలి. స్థిరమైన ఉత్పాదకత కోసం నేపియర్ గడ్డిని ఒకే పొలంలో 5–6 సంవత్సరాల వరకు ఉంచవచ్చు, ఆ తర్వాత దాని స్థానంలో వేరే పంటను మార్చాలి.

నేపియర్ గడ్డిలో కరిగే మరియు కరుగని రెండు రూపాల ఆక్సలేట్లు ఉంటాయి, ఇవి ముఖ్యంగా లేతగా,వేగంగా పెరుగుతున్న మొక్కలలో మరియు అధిక నత్రజని ఎరువులు వేసి పెంచిన వాటిలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థలో క్యాల్షియంతో బంధాన్ని ఏర్పరుచుకుని, శరీరం శోషించుకోలేని కరుగని క్యాల్షియం ఆక్సలేట్గా మారతాయి,

తద్వారా మొత్తం ఖనిజాల సమతుల్యతను దెబ్బతీస్తాయి (Nasution et al., 2025). అధికంగా ఆక్సలేట్లను తీసుకునే జంతు రక్తంలో క్యాల్షియం స్థాయిలు తగ్గడం (మిల్క్ ఫీవర్/పాల జ్వరం వలె),ఎముకలు బలహీనపడటం, ఎదుగుదల లోపించడం మరియు తీవ్రమైన సందర్భాలలో స్పటికాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. లేత మొక్కలు, అధికనత్రజని ఎరువుల వాడకం మరియు కరవు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం అత్యధికంగా ఉంటుంది.

హైబ్రిడ్ నేపియర్ గడ్డిలో ఆక్సలేట్ శాతాన్ని తగ్గించడానికి వివిధ రకాల సమర్థవంతమైన యాజమాన్యవ్యూహాలను అనుసరించవచ్చు. మొదటగా, పంటను సరియైన వయస్సులో, అంటే 45 నుండి 60 రోజుల మధ్య సరైన పెరుగుదల దశలో కోయడం ద్వారా ఆక్సలేట్ మరియు టానిన్ సాంద్రతలను అదుపులో ఉంచవచ్చు, ఎందుకంటే చాలా లేత మొక్కలలో ఈ యాంటీ- న్యూట్రిషనల్ కారకాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. కోసిన పశుగ్రాసాన్ని వాడబెట్టడం (wilting) మరియు ఎండబెట్టడం (sun-drying) వంటి పద్ధతులకు గురిచేయడం ద్వారా అందులోని కరిగే ఆక్సలేట్లను, హైడ్రోజన్ సయనైడ్ (HCN) ను గణనీయంగా తగ్గించవచ్చు. దీనితో పాటు, కిణ్వ ప్రక్రియ ద్వారా సైలేజ్ చేయడం (Ensiling) వల్ల ఆక్సలేట్ టానిన్లు మరియు ఫైటేట్ స్థాయిలు సమర్థవంతంగా తగ్గడమే కాకుండా పశుగ్రాసం యొక్క రుచి, జీర్ణశక్తి కూడా మెరుగుపడతాయి. పొలంలోఅధిక నత్రజని ఎరువులు వేయడం వల్ల ఆక్సలేట్ సాంద్రతలు పెరుగుతాయి కాబట్టి, సమతుల్య ఎరువుల వాడకం ద్వారా తగినంత పొటాషియం మరియు భాస్వరం అందిస్తూ ప్రతిపోషక కారకాలు( అనేవి ఆహారంలో సహజంగా ఉండే రసాయన పదార్థాలు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను జీర్ణం చేయడం, శోషించుకోవడం లేదా వినియోగించుకోవడాన్ని అడ్డుకుంటాయి. అందువల్ల ఆహారంలోని పోషక విలువ తగ్గుతుంది. ) పేరుకుపోవడాన్ని అదుపులో ఉంచాలి. పశువులకు మేతగా ఇచ్చేటప్పుడు సున్నం లేదా ఖనిజ మిశ్రమాల వంటి క్యాల్షియం వనరులను ఆహారంలో చేర్చడం ద్వారా ఆక్సలేట్ సంబంధిత లోపాలను అధిగమించవచ్చు. అలాగే, నేపియర్ గడ్డిని లూసర్న్, అలసందలు లేదా మునగ వంటిపప్పుధాన్యాల పశుగ్రాసాలతో కలిపి ఇవ్వడం వల్ల ఆక్సలేట్ వంటి ప్రతిపోషక కారకా ల సాంద్రత తగ్గడమే కాకుండా, పశుగ్రాసంలో ప్రొటీన్ మరియు ఖనిజాల శాతం పెరిగి పశువులకుమేలైన పోషకాలు అందుతాయి.

సి. హెచ్. రామకృష్ణ కె. సుష్మ, సి. హెచ్. శివప్రసాద్, పి. అమరేశ్వరి, మరియు టి. రఘునందన్
పశుగణ క్షేత్ర సముదాయ, పశువైద్య కళాశాల
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం. ph: 7989269600

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More

పశువుల్లో బెబీసియోసిస్ లేదా ఎరుపు మూత్ర వ్యాధి

బెబీసియోసిస్‌ను టిక్ ఫీవర్ లేదా టెక్సాస్ ఫీవర్ లేదా పైరోప్లాస్మోసిస్ లేదా రెడ్ వాటర్ డిసీస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి రిపిసెఫాలస్ మైక్రోప్లస్ (పూర్వపు పేరు బూఫైలస్ మైక్రోప్లస్) అనే జాతికి చెందిన గోమార్ల ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి బెబీసియా బైజెమినా మరియు బెబీసియా బోవిస్ అనే ఏకకణ పరాన్నజీవుల (ప్రోటోజోవా) వలన పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి గేదెలలో కంటే విదేశీ జాతి పశువులు మరియు సంకరజాతి పశువులలో ఎక్కువగా సోకుతుంది.

వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన పశువులలో అధిక జ్వరం (105-107 డిగ్రీల ఫారెన్‌హీట్), మేత తినవు. నీరసంగా ఉంటాయి. కంటి పొరలు రక్తలేమితో ఉంటాయి. రక్తహీనత మరియు కామెర్లు వంటి లక్షణాలుంటాయి. మూత్రం కాఫీరంగులో ఉండడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం. వ్యాధి సోకిన పాడి పశువులలో పాలుతగ్గడం, దుక్కి దున్నే పశువులలో పని సామర్థ్యం తగ్గడం మరియు చూలు పశువులు ఈసుకుని పోవడం సంభవిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

చికిత్స:
వ్యాధి సోకిన పశువులకు ఇమిడోకార్బ్ అనే మందును 1 మి.గ్రా./కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. లేదా డైమినజిన్ అసిటురేట్ (బెరినిల్) అనే మందును 3.5 మి.గ్రా. / కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. వీటితో పాటుగా, టెట్రాసైకిన్స్ అనే యాంటిబయాటిక్‌ను, డెక్స్‌ట్రోస్, సెలైన్స్, బి-కాంప్లెక్స్ మరియు ఐరన్ ఇంజక్షన్స్ కూడా ఇవ్వాలి.

నివారణః
ఈ వ్యాధి ముఖ్యంగా గోమార్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావునా గోమార్ల నివారణకు డెల్టామెత్రిన్ లేదా సైపర్‌మెత్రిన్ అనే మందును 2 మి.లీ./1లీ. నీటితో పశువులపై పిచికారి చేసి, పశువుల శరీరంపై ఉన్న బాహ్యపరాన్న జీవులను నిర్మూలించాలి. పోరఆన్ (ఫ్లుమెత్రిన్) అనే మందును పశువుల శరీరంపై తలభాగం నుండి తోక వరకు వెన్నెముకపై ఒక గీత లాగా పోసినచో ఈ గోమార్లను నిర్మూలించవచ్చు.

డా॥ పొట్టబత్తుల మల్లేష్, సహాయ ఆచార్యులు, ఫోన్: 9030427110,
డా. యస్. రమేష్ భూమయ్య, సహఆచార్యులు మరియు విభాగాధిపతి, ఫోన్: 8897851699
పశువైద్య పరాన్నజీవ శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, జగిత్యాల జిల్లా

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

పశుపోషణలో మునగ ప్రాముఖ్యత

మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

మునగ సాగు – వివరాలు:
మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.

పోషక విలువలు:
పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.

ప్రయోజనాలు:

  • పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
  • పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
  • పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
  • అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

డా.డి. వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశుగణ సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, ఫోన్: 9951534076

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More