పశువుల్లో గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్)

దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణనష్టం అంతగా ఉండదు. ఎద్దులు వ్యవసాయ పనులు సరిగా చేయవు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

వ్యాధి ఎలా వస్తుంది?
వ్యాధి సోకిన ఆవులు, గేదెల పాలద్వారా దూడలకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

  • జ్వర తీవ్రత 104-106 డిగ్రీల ఫారెన్‌హీట్ పెరిగి పశువులు నీరసించి పోతాయి.
  • పశువుల నోటిలో, చిగుళ్ళపై పొక్కులు ఏర్పడటం చేత పశువుల మేత, నీరు తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుండి చొంగకారుతూ ఉంటుంది.
  • నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 3, 4 వారాల్లో బొబ్బలు చితికి పుండ్లుగా మారి చర్మము గరుకుగా తయారవుతుంది.
  • పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
  • గిట్టలలో పుండ్లు ఏర్పడటం వలన ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవు.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి.
  • పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
  • వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను, గడ్డితో కాల్చివేయాలి.
  • చనిపోయిన పశువును, సున్నపు గోతిలో పూడ్చాలి
  • వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు త్రాగించకూడదు.
  • మార్చి – ఏప్రిల్ మరియు ఆగస్టు – సెప్టెంబరు మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

చికిత్స:

  • కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా నీమ్‌లెంట్, వేపనూనె పూయాలి.
  • నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి.
  • డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.

కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150

Read More

వర్తులాకార ఆర్థిక వ్యవస్థ – ఎన్‌డిడిబి వారి మృదా

భారతదేశంలో పాడి పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నాడు డా. వర్గీస్ కురియన్- రైతుల భాగస్వామ్యం, సహకార సంఘాల ఏర్పాటు ద్వారా సుస్థిర భారత దేశ అభివృద్ధికి బీజం నాటారు. రైతుల సాధికారిత లక్ష్యంగా ప్రతి అడుగులో రైతుకు మార్గదర్శిలా నిలబడేలా జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డిడిబి) గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేస్తోంది. దీని ప్రభావంతోనే రైతు సాధికారిత, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగలగడం, బలీయమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పోషకాల పూరిత పాలను అందించడం, భావితరాలకు సుస్థిర భవిష్యత్తు ఇవ్వగలగడం సాధ్యమైంది.




ఎన్‌డిడిబి పాడిపరిశ్రమ అభివృద్ధిపరంగా 6 సంస్థలను ఏర్పాటు చేసింది.
  1. 1974లో మదర్ డెయిరీ ఏర్పరిచి, శుద్ధీకరించిన పాలను వినియోగదారులకు చేరుస్తోంది.
  2. ఇండియన్ ఇమ్యునోజికల్స్‌ను 1982లో పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాలను ఉత్పత్తి చేయడం, అంతేకాక, హెపటైటిస్‌లాంటి టీకాల ఉత్పత్తి చేయడం ద్వారా అటు పశువుల ఆరోగ్యం, ఇటు ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది.
  3. 1978లో ఐడిఎంసి ని ఏర్పరిచి, దేశీయ పరిజ్ఞానంతో పాడి పరిశ్రమ పరికరాల ఉత్పత్తి ప్రారంభించింది. దీనివలన భారత్, డెయిరీ ఇంజనీరింగ్ రంగంలో స్వయం సమృద్ధత సాధించగలిగింది.
  4. 2010లో ఎన్‌డిఎస్ (ఎన్‌డిడిబి డెయిరీ సర్వీసెస్) స్థాపించి, సంస్థాగత నిర్మాణం ద్వారా పాడి పరిశ్రమల్లో పాల ఉత్పాదకత పెంపుదలకు కృషి చేస్తోంది. ఇప్పటికే దేశంలో 210 పైగా పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడినాయి.
  5. 2022లో CALF (Centre for Analysis and Learning in Livestock and Food) ని ఏర్పరిచి, పాల నాణ్యతా పరీక్షలతో పాలనాణ్యతకు పెద్దపీట వేసింది.
  6. 2022లో MRIDA అనే సంస్థ ద్వారా పాడిపరిశ్రమలో వ్యర్థాలను పునరుపయోగంలో తెచ్చి పాడిరైతుకు వర్తులాకార ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేసేలా చేసింది. దీనిద్వారా పశువుల మల, మూత్రాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, సేంద్రియ ఎరువులు ‘సుధన’ పేర తెచ్చి పాడిపరిశ్రమలో కొత్త అధ్యాయం సృష్టించింది. పశువుల పేడ, పర్యావరణానికి పీడగా భావిస్తున్న తరుణంలో ఎన్‌డిడిబి, దీని పునరుపయోగం ద్వారా పాడిరైతులను సుస్థిర అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించగా, వెలిగిన ఆశాకిరణం ‘మృదా’. మార్చి 2025లో సుజుకి R & D సెంటర్‌తో చేతులు కలిపి భారత దేశంలో వీలైనన్ని బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ధ్యేయంగా ప్రయాణం ప్రారంభించింది. తొలుత పశువుల పాకలు, గోశాలల వద్ద బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, గుజరాత్‌లోని వాసనాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రోజకు 65-70 మెట్రిక్ టన్నుల పేడ సేకరించి, దానికి గాను రైతులకు రూ. 150 లక్షలు చెల్లించగలిగారు. దీనిద్వారా దగ్గరలోని డెయిరీలకు బాయిలర్లకు ఇంధన సరఫరా, సుమారు 250 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి చూపించారు. రూట్‌గార్డ్, గ్రోమాక్స్ లాంటి పశువు…పేడ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ‘సుధన’ పేర రైతులకు అందజేసారు. ‘గోబర్ సే సమృద్ధి’ ని సాకారం చేసి ‘కార్బన్ క్రెడిట్స్’ పొందగలిగేలా ఎన్‌డిడిబి కృషి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌డిడిబి, సస్టెయిన్ ప్లస్ అనే సంస్థ సహకారంతో 10000 ఇళ్ళలో 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తోంది. వివరాలకు జయేష్ చవాన్ – ఫోన్: 9405716326 ని సంప్రదించవచ్చు. దీని ధన లబ్ధిదారుని వాటాగా రూ. 11,262/-గా నిర్ధారించారు. ఏది ఏమైనా, దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎన్‌డిడిబి వివిధ సేవల ద్వారా పాడి రైతుల అభివృద్ధికి అవిరళ కృషి చేస్తోంది. ఆనంద్‌లోని ఎన్‌డిడిబి సంస్థను ప్రతి ఒక్కరూ సందర్శిస్తే, పాడిరైతుల కోసం సంస్థ చేస్తోన్న కృషి తెలిసి వస్తుంది. ఇప్పటికే ఎన్‌డిడిబి సహకారంతో విజయ తెలంగాణ డెయిరీ ERP సేవలను కొనసాగిస్తోంది. ఇంకెన్నో ఆవిష్కరణలతో ఎన్‌డిడిబి అగ్రగామిగా ఉండాలని ఆశిద్దాం!
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ డెయిరీ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

పశువైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) వినియోగం: భవిష్యత్ పశుసంవర్ధకానికి నూతన దిశ

పరిచయం
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) నేటి కాలంలో పశువైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. పశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల ముందస్తు గుర్తింపు, పాల ఉత్పత్తి పెంపు, సంతానోత్పత్తి నిర్వహణ, మేత నిర్వహణ మరియు వ్యవసాయ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో AI కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో కూడా పశుపాలక రైతులు ఆధునిక సాంకేతికతలను స్వీకరిస్తూ అధిక ఉత్పాదకత మరియు లాభదాయకత సాధిస్తున్నారు. AI ఆధారిత పరికరాలు, సెన్సర్లు, మొబైల్ యాప్‌లు మరియు డేటా విశ్లేషణ వ్యవస్థలు పశుసంవర్ధక రంగాన్ని స్మార్ట్ వ్యవస్థగా మార్చుతున్నాయి.

పశువుల ఆరోగ్య పర్యవేక్షణలో AI
పశువుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతోంది. ప్రస్తుతం పశువుల మెడకు లేదా కాళ్లకు ధరించే స్మార్ట్ కాలర్లు మరియు సెన్సర్లు శరీర ఉష్ణోగ్రత, కదలికలు, మేత తీసుకునే సమయం మరియు విశ్రాంతి వ్యవధిని నమోదు చేస్తాయి. ఈ సమాచారాన్ని AI సాఫ్ట్ వేర్ విశ్లేషించి జ్వరం, మాస్టిటిస్, జీర్ణ సమస్యలు లేదా ఇతర వ్యాధుల సంకేతాలను ముందుగానే గుర్తిస్తుంది. తద్వారా రైతులు మరియు పశువైద్యులు వెంటనే చికిత్స చర్యలు చేపట్టగలుగుతారు.

వ్యాధుల నిర్ధారణలో కృత్రిమ మేధస్సు
ఇటీవలి కాలంలో AI ఆధారిత మొబైల్ అప్లికేషన్లు పశువుల ఫోటోలు, వీడియోలు మరియు లక్షణాలను విశ్లేషించి సంభావ్య వ్యాధులను సూచిస్తున్నాయి. చర్మ వ్యాధులు, కుంటితనం (Lameness), మాస్టిటిస్, శ్వాసకోశ వ్యాధులు మరియు ఇతర అంటువ్యాధులను గుర్తించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. కొన్ని దేశాల్లో ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ మరియు ప్రయోగశాల పరీక్షల ఫలితాలను AI ద్వారా విశ్లేషించి వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ధారణ చేస్తున్నారు.

సంతానోత్పత్తి నిర్వహణలో AI
పాడి పశువులలో ఈస్ట్రస్ (Heat) గుర్తించడం రైతులకు ప్రధాన సవాలు. ప్రస్తుతం AI ఆధారిత సెన్సర్లు మరియు యాక్టివిటీ మానిటరింగ్ పరికరాలు పశువుల ప్రవర్తనలో మార్పులను గుర్తించి సరైన కృత్రిమ గర్భధారణ (AI) సమయాన్ని సూచిస్తున్నాయి.
దీని వల్ల:
• గర్భధారణ శాతం పెరుగుతుంది.
• ఖాళీ రోజులు తగ్గుతాయి.
• పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
• రైతుల ఆదాయం పెరుగుతుంది.

పాల ఉత్పత్తి పెంపులో AI
ఆధునిక డెయిరీ ఫార్ములలో AI ఆధారిత మిల్కింగ్ సిస్టమ్స్ వినియోగంలోకి వస్తున్నాయి. ఈ వ్యవస్థలు ప్రతి పశువు పాల ఉత్పత్తి, పాల నాణ్యత, కొవ్వు శాతం మరియు ఆరోగ్య స్థితిని నమోదు చేస్తాయి.

AI విశ్లేషణ ద్వారా:
• అధిక ఉత్పత్తి చేసే పశువులను గుర్తించవచ్చు.
• పోషకాహార లోపాలను అంచనా వేయవచ్చు.
• పాల ఉత్పత్తిని మెరుగుపరచే సూచనలు పొందవచ్చు.

మేత నిర్వహణలో AI
పశువుల ఉత్పాదకతలో మేత కీలక పాత్ర పోషిస్తుంది. AI ఆధారిత ఫీడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు పశువు వయస్సు, బరువు, పాల ఉత్పత్తి మరియు శారీరక స్థితిని బట్టి సరైన మేత మిశ్రమాన్ని సూచిస్తాయి.

దీని వల్ల:
• మేత ఖర్చులు తగ్గుతాయి.
• పోషకాహార సమతుల్యత మెరుగుపడుతుంది.
• పాలు మరియు మాంస ఉత్పత్తి పెరుగుతుంది.

పౌల్ట్రీ రంగంలో AI
కోళ్ల పరిశ్రమలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. సెన్సర్లు మరియు కెమెరాల ద్వారా కోళ్ల కదలికలు, ఆహార వినియోగం, నీటి వినియోగం మరియు ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తారు.

AI వ్యవస్థలు:
• వ్యాధుల ప్రారంభ సంకేతాలను గుర్తిస్తాయి.
• మరణాల రేటును తగ్గిస్తాయి.
• ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
• నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి.

డ్రోన్లు మరియు రోబోటిక్స్ వినియోగం
అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రోన్లు మరియు రోబోటిక్స్ పశుసంవర్ధక రంగంలో వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పెద్ద పశువుల మందలను పర్యవేక్షించడం, మేత భూముల పరిస్థితిని అంచనా వేయడం జరుగుతోంది. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు మానవ శ్రమను తగ్గించి పాల సేకరణను వేగవంతం చేస్తున్నాయి.

తాజా AI సాంకేతికతలు
ప్రస్తుతం పశువైద్య రంగంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన AI సాంకేతికతలు:

  1. స్మార్ట్ కాలర్లు మరియు వేర్‌బుల్ సెన్సర్లు
  2. AI ఆధారిత హీట్ డిటెక్షన్ సిస్టమ్స్
  3. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు
  4. AI వ్యాధి నిర్ధారణ మొబైల్ యాప్‌లు
  5. డ్రోన్ ఆధారిత పశు పర్యవేక్షణ
  6. ఆటోమేటిక్ ఫీడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్
  7. కంప్యూటర్ విజన్ ఆధారిత లేమ్‌నెస్ గుర్తింపు
  8. AI ఆధారిత పౌల్ట్రీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్

రైతులకు కలిగే ప్రయోజనాలు
• వ్యాధుల ముందస్తు గుర్తింపు
• చికిత్స ఖర్చుల తగ్గింపు
• పాలు, మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంపు
• సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుదల
• మేత వినియోగ సామర్థ్యం పెంపు
• శ్రమ మరియు నిర్వహణ ఖర్చుల తగ్గింపు
• అధిక ఆదాయం మరియు లాభదాయకత

ముగింపు
కృత్రిమ మేధస్సు పశువైద్య మరియు పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. వ్యాధుల ముందస్తు గుర్తింపు నుండి పాల ఉత్పత్తి పెంపు వరకు ప్రతి దశలో AI రైతులకు తోడ్పడుతోంది. భవిష్యత్తులో AI ఆధారిత సాంకేతికతల వినియోగం మరింత విస్తరించి, స్మార్ట్ పశుసంవర్ధక వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. రైతులు, పశువైద్యులు మరియు విస్తరణ సంస్థలు ఈ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా మరియు స్థిరంగా తీర్చిదిద్దవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్ : 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More

ఒక్క ఫోన్ కాల్‌తో పశువైద్య సేవలు: టెలిమెడిసిన్ యొక్క కొత్త విప్లవం

రాత్రి 9 గంటలు. మీ ఆవుకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. దగ్గరలో పశువైద్యుడు లేరు. ఇప్పుడేం చేయాలి? ఇలాంటి సమస్యలకు పరిష్కారమే టెలిమెడిసిన్ – ఆధునిక సాంకేతికత రైతులకు అందిస్తున్న వరం.

టెలిమెడిసిన్ అంటే ఏమిటి?
పశువైద్యుడిని ప్రతిసారీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో రైతుకు అందుబాటులోకి వచ్చే సౌకర్యవంతమైన సేవే పశువైద్య టెలిమెడిసిన్. ఫోన్ కాల్, వీడియో కాల్, వాట్సాప్ లేదా ఇంటర్నెట్ వంటి మార్గాల ద్వారా పశువుకు కనిపిస్తున్న ఆరోగ్య సమస్యను పశువైద్యుడి దృష్టికి తీసుకెళ్లవచ్చు.

పశువులో కనిపిస్తున్న లక్షణాలను రైతు ఫోన్‌లో వివరించవచ్చు. అవసరమైతే పశువు పరిస్థితిని చూపించే ఫోటోలు లేదా చిన్న వీడియోలను కూడా పశువైద్యుడికి పంపవచ్చు. అందిన సమాచారాన్ని బట్టి పశువైద్యుడు సమస్య తీవ్రతను ప్రాథమికంగా అంచనా వేసి, వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులు లేదా తదుపరి చికిత్సకు సంబంధించిన సూచనలు అందించవచ్చు.
అంతేకాదు, సలహా ఇచ్చిన తర్వాత పశువు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి పశువైద్యుడు ఫాలో-అప్ చేయవచ్చు. దీంతో చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి రైతుకు సహాయం లభిస్తుంది.

అయితే టెలిమెడిసిన్ పశువైద్యుడి ప్రత్యక్ష పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్రమైన అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు లేదా ప్రత్యక్ష పరీక్ష అవసరమైన సందర్భాల్లో పశువును తప్పనిసరిగా పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.

నేటి రైతుకు టెలిమెడిసిన్ ఎందుకు అవసరం?
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో పశువైద్యుడు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. కొన్నిసార్లు వైద్యుడు వచ్చేలోపు విలువైన సమయం గడిచిపోతుంది. ఈలోపు వ్యాధి తీవ్రం కావచ్చు లేదా పాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు.
అలాంటి సందర్భాల్లో ఒక ఫోన్ కాల్ రైతుకు ధైర్యాన్ని ఇస్తుంది. పశువైద్యుడి సలహాతో ప్రారంభ దశలోనే సరైన చర్యలు తీసుకోవచ్చు.

టెలిమెడిసిన్ ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలు
టెలిమెడిసిన్ పశువైద్య సేవలను రైతుల ఇంటి వద్దకే చేరువ చేసే ఆధునిక సాంకేతిక సాధనం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులను ఆసుపత్రికి తీసుకెళ్లే ఇబ్బందులను తగ్గిస్తూ, అవసరమైన సమయంలో నిపుణుల సలహాలను అందిస్తుంది. దీని ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

  1. సమయానికి పశువైద్య సలహాలు పొందే అవకాశం
    పశువులో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా పశువైద్యుడిని సంప్రదించవచ్చు. దీంతో సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
  2. ప్రయాణ సమయం మరియు ఖర్చు తగ్గింపు
    ప్రతి చిన్న సమస్యకు పశువును ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. టెలిమెడిసిన్ ద్వారా ఇంటి వద్ద నుంచే ప్రాథమిక సలహాలు పొందడం వల్ల రైతుల సమయం, రవాణా ఖర్చు ఆదా అవుతుంది.
  3. నిపుణుల సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ
    దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా అనుభవజ్ఞులైన పశువైద్యుల సలహాలను పొందవచ్చు. దీనివల్ల నాణ్యమైన పశువైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
  4. వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించే అవకాశం
    పశువు ప్రవర్తనలో మార్పులు, మేత తగ్గడం, పాల దిగుబడి తగ్గడం వంటి ప్రారంభ సంకేతాలపై సలహాలు పొందడం ద్వారా వ్యాధులు తీవ్రరూపం దాల్చకుండా నివారించవచ్చు.
  5. పశువుల ఆరోగ్య నిర్వహణ మెరుగుదల
    టీకాలు, నులిపురుగుల నివారణ, పోషకాహారం, ప్రజనన నిర్వహణ, పాలిచ్చే పశువుల సంరక్షణ వంటి అంశాలపై నిపుణుల మార్గదర్శకత్వం పొందవచ్చు.
  6. అత్యవసరం కాని సమస్యలకు త్వరిత పరిష్కారం
    చిన్న గాయాలు, చర్మ సమస్యలు, ఆహార సంబంధిత సమస్యలు, మందుల వినియోగంపై సందేహాలు వంటి వాటికి త్వరగా సూచనలు పొందవచ్చు.
  7. చికిత్స అనంతర పర్యవేక్షణ సులభతరం
    చికిత్స పొందుతున్న పశువుల ఆరోగ్య పరిస్థితిని పశువైద్యుడికి తెలియజేసి, అవసరమైన మార్పులు లేదా తదుపరి సూచనలు పొందవచ్చు.
  8. రైతులలో అవగాహన మరియు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది
    టెలిమెడిసిన్ ద్వారా రైతులు పశువుల ఆరోగ్యం, పోషణ మరియు నిర్వహణపై శాస్త్రీయ సమాచారం పొందుతూ, మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

టెలిమెడిసిన్‌ను ఎలా ఉపయోగించాలి?
టెలిమెడిసిన్ సేవలను సరిగ్గా ఉపయోగించుకుంటే రైతులు తమ పశువుల ఆరోగ్య సమస్యలపై త్వరగా పశువైద్యుల సలహాలు పొందవచ్చు. అయితే, పశువుకు సంబంధించిన వివరాలను స్పష్టంగా అందించడం చాలా ముఖ్యం. టెలిమెడిసిన్ ద్వారా మంచి మార్గదర్శకత్వం పొందడానికి రైతులు ఈ క్రింది అంశాలను పాటించాలి.

  1. పశువు ఆరోగ్య పరిస్థితిని గమనించాలి
    ముందుగా పశువు ప్రవర్తనలో వచ్చిన మార్పులు, మేత తినే విధానం, పాల ఉత్పత్తిలో తగ్గుదల, జ్వరం, దగ్గు, విరేచనాలు, గాయాలు వంటి లక్షణాలను గమనించాలి. సమస్య ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతకాలంగా ఉంది అనే వివరాలను గుర్తుంచుకోవాలి.
  2. అవసరమైన సమాచారాన్ని పశువైద్యుడికి అందించాలి
    టెలిఫోన్ లేదా వీడియో కాల్ సమయంలో పశువు వయస్సు, జాతి, బరువు, గతంలో వచ్చిన వ్యాధులు, వేసిన టీకాలు, ప్రస్తుతం ఇస్తున్న మందులు, ఆహార పద్ధతులు వంటి వివరాలను తెలియజేయాలి. ఈ సమాచారం ఆధారంగా పశువైద్యుడు మెరుగైన సలహా ఇవ్వగలుగుతారు.
  3. ఫోటోలు మరియు వీడియోలను స్పష్టంగా పంపాలి
    పశువుకు ఉన్న గాయం, చర్మ సమస్య, కంటి లేదా ముక్కు నుంచి వచ్చే స్రావాలు, నడకలో మార్పులు వంటి వాటిని స్పష్టమైన ఫోటోలు లేదా చిన్న వీడియోల రూపంలో పంపితే సమస్యను అర్థం చేసుకోవడం సులభమవుతుంది.
  4. పశువైద్యుడి సూచనలను పాటించాలి
    మందుల మోతాదు, ఇచ్చే సమయం, ఆహార మార్పులు లేదా సంరక్షణ పద్ధతులపై పశువైద్యుడు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలి. స్వయంగా మందులు వాడటం లేదా మోతాదును మార్చడం చేయకూడదు.
  5. ఫాలో-అప్ సేవలను ఉపయోగించుకోవాలి
    చికిత్స ప్రారంభించిన తర్వాత పశువు ఆరోగ్యంలో వచ్చిన మార్పులను పశువైద్యుడికి తెలియజేయాలి. అవసరమైతే మళ్లీ వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించి తదుపరి సూచనలు పొందాలి.

టెలిమెడిసిన్‌తో పరిష్కరించగల కొన్ని సమస్యలు
టెలిమెడిసిన్ ద్వారా అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయలేకపోయినా, అనేక సాధారణ ఆరోగ్య సమస్యలపై పశువైద్యుల నుంచి సముచితమైన సలహాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ క్రింది సందర్భాల్లో టెలిమెడిసిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
• ఆహారం తగ్గడం, మేత సరిగా తినకపోవడం వంటి ప్రారంభ లక్షణాలపై సలహాలు పొందవచ్చు.
• జ్వరం, స్వల్ప దగ్గు, విరేచనాలు, అజీర్ణం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక సూచనలు పొందవచ్చు.
• చిన్న గాయాలు లేదా స్వల్ప చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఫోటోలు లేదా వీడియోల ద్వారా పశువైద్యుడికి చూపించి తగిన సలహా పొందవచ్చు.
• మందుల వినియోగం, మోతాదు, చికిత్స విధానం గురించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
• టీకాలు, నులిపురుగుల నివారణ (డీవార్మింగ్), ఖనిజ మిశ్రమాల వినియోగం వంటి నివారణ చర్యలపై మార్గదర్శకత్వం పొందవచ్చు.
• దాణా నిర్వహణ, పోషకాహారం, పాలిచ్చే లేదా గర్భిణీ పశువుల సంరక్షణ గురించి నిపుణుల సూచనలు పొందవచ్చు.
• కృత్రిమ గర్భధారణ (AI), ప్రజనన నిర్వహణ, హీట్ లక్షణాల గుర్తింపు వంటి అంశాలపై సలహాలు పొందవచ్చు.
• చికిత్స పొందుతున్న పశువుల ఫాలో-అప్ కోసం తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పశువైద్యుడితో సంప్రదింపులు కొనసాగించవచ్చు.
• అత్యవసరం కాని ఆరోగ్య సమస్యలపై రెండో అభిప్రాయం కూడా నిపుణుల నుంచి పొందవచ్చు.
ఈ విధంగా టెలిమెడిసిన్ రైతులకు సమయాన్ని, ప్రయాణ ఖర్చును ఆదా చేయడమే కాకుండా, పశువుల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఎప్పుడు తప్పనిసరిగా పశువైద్యుడిని ప్రత్యక్షంగా కలవాలి?
టెలిమెడిసిన్ ఎంతో ఉపయోగకరమైన సేవ అయినప్పటికీ, ప్రతి సమస్యకు ఇది ప్రత్యామ్నాయం కాదు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు సలహాలు పొందడం, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం, ఫాలో-అప్ సేవలు పొందడం వంటి సందర్భాల్లో టెలిమెడిసిన్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పశువును ప్రత్యక్షంగా పరీక్షించి చికిత్స అందించడం తప్పనిసరి.
ఉదాహరణకు, ప్రసవంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు, అధిక రక్తస్రావం జరిగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, పాము కాటు లేదా విషపదార్థాలు తిన్నప్పుడు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నప్పుడు, పశువు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు టెలిమెడిసిన్‌పై మాత్రమే ఆధారపడకూడదు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని పశువైద్యశాల లేదా పశువైద్యుడిని వెంటనే సంప్రదించడం పశువు ప్రాణాలను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
• ఫోన్‌లో చెప్పే సమాచారం నిజాయితీగా, స్పష్టంగా ఉండాలి.
• వైద్యుడి సూచన లేకుండా మందులు వాడకూడదు.
• పొరుగువారి సలహా లేదా సోషల్ మీడియాలో చూసిన మందులను ఉపయోగించకూడదు.
• చికిత్స తర్వాత పశువు పరిస్థితిని మళ్లీ వైద్యుడికి తెలియజేయాలి.

భవిష్యత్తు పశువైద్యం: రైతు చేతిలోని మొబైల్‌లోనే
ఈరోజు మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడేందుకు మాత్రమే కాదు. అది రైతుకు సమాచార కేంద్రం, మార్కెట్ వేదిక, బ్యాంకు, ఇప్పుడు పశువైద్య సేవలకు కూడా ఒక వంతెనగా మారుతోంది.

డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో టెలిమెడిసిన్ గ్రామీణ పశుపోషకులకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఇది సమయానుకూలమైన పశువైద్య సేవలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (AI), మొబైల్ యాప్‌లు, ధరించగల సెన్సర్లు (Wearable Sensors) వంటి సాంకేతికతలు టెలిమెడిసిన్‌తో కలిసినప్పుడు పశువైద్య సేవలు మరింత వేగంగా, ఖచ్చితంగా అందే అవకాశం ఉంది.

ముగింపు
“పశువుకు మాటలు రావు… కానీ రైతు సమయానికి చెప్పిన ప్రతి మాట పశువైద్యుడికి సరైన చికిత్స అందించడంలో సహాయపడుతుంది.”

టెలిమెడిసిన్ రైతుకు ఎంతో ఉపయోగకరమైన ఆధునిక సేవ. ఇది సమయానికి పశువైద్య సలహా అందించి, అనవసర ప్రయాణాన్ని తగ్గించి, పశువుల ఆరోగ్య సంరక్షణలో రైతుకు అండగా నిలుస్తుంది. అయితే, ఇది ప్రత్యక్ష పశువైద్య సేవలకు ప్రత్యామ్నాయం కాదు; వాటికి తోడ్పడే సేవ అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

డిజిటల్ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ, సమయానికి నిపుణుల సలహా తీసుకుంటే ఆరోగ్యవంతమైన పశువులు, అధిక ఉత్పత్తి మరియు అభివృద్ధి చెందిన రైతు కుటుంబం అనే లక్ష్యాన్ని మరింత సులభంగా చేరుకోవచ్చు.

*డా. బద్దం అఖిల, టీచింగ్ ఫ్యాకల్టీ,
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 9703121088

Read More

ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More

పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

పశువులలో గర్భస్రావాలకు కారణాలు – నివారణ

చూడి పశువు నెలలు నిండక మునుపే పిండాన్ని లేదా చనిపోయిన దూడను ప్రసవించడానిని గర్భస్రావము లేదా ఈసుకుపోవడం అని అంటారు. పశువు ఈసుకుపోవడం వలన అనేక కష్టాలు కలుగుతాయి. పిండాన్ని లేదా దూడను కోల్పోవడం, పాడిని కోల్పవడం, పశువు గర్భకోశ వ్యాధుల బారిన పడడం, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, ఒక్కోసారి వ్యంధత్వం ప్రాప్తించడం, ఒట్ఠి పశువును దీర్ఘకాలం పాటు మేపవలసి రావడం లేదా అమ్మవలసి రావడం, ఒకవేళ గర్భస్రావం అంటువ్యాధి వల్లనయితే మిగిలిన పశువులు కూడా ముప్పు బారిన పడడం వంటి వాటి ద్వారా రైతుకు ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది.

గర్భస్రావాలకు కారణాలు:

ప్రమాదాలు: చూడిపశువును ఇతర పశువులు పొడవటం కానీ, పోట్లాటల వలన గాయపడడం వల్ల కానీ గర్భస్రావాలు జరుగవచ్చు. ఏటవాలు ప్రదేశాలలో మేతమేయడానికి, కుంటలలో నీరు త్రాగడానికి వెళ్ళినపుడు ప్రమాదవశాత్తు జారిపడడం వల్ల, వాహనాల ప్రమాదాల వల్ల గర్భస్రావానికి అవకాశముంది.

పోషకాహార లోపం: గర్భస్థ పశువులకు అధిక మాంసకృత్తులు కలిగిన బలవర్ధకమైన సమగ్ర పౌష్ఠికాహారం అత్యవసరం. పచ్చిమేతలతో పాటు మిశ్రమ దాణా కూడా అవసరం. చూడి పశువు ఆకలితో మాడటం, పోషకాహార లోపం, విటమిన్ ఏ లోపం, అయోడిన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజ లవణాల లోపం వలన గర్భస్రావాలు జరుగవచ్చు.

జన్యుపరమైన కారణాలు: కొన్ని జన్యుపరమైన తేడాల వలన కూడా పిండ మరణాలు సంభవించవచ్చు.

జీవరసాల ఉత్పత్తిలో తేడా: గర్భస్థ పశువులలో చూడి పరిరక్షణ కొరకై కొన్ని రకాల జీవరసాలు లేదా హార్మోన్లు విడుదలవుతాయి. అందులో ప్రధానమయినది ‘ప్రొజెస్టిరోను’ అను జీవరసం. ఈ జీవరసం అండాశయం నుండి విడుదలవుతుంది. ఈ జీవరసం ఉత్పత్తి తగ్గి ఇతర హార్మోన్లు (ఈస్ట్రోజన్ వంటివి) అధికమైన వాటి నిష్పత్తిలో తేడా రావటం వలన గర్భస్రావాలు జరుగుతాయి. పిల్లిపెసర, ఉలవలు, చెరకు మొదలగు వాటిలో ఈస్ట్రోజన్ జీవరసం ఎక్కువగా ఉంటుంది. ఈ మేతలను పశువులకు ఎక్కువగా మేపడం వలన హార్మోన్ నిష్పత్తిలో తేడా వచ్చి గర్భస్రావాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. నిలువ ఉండి తడిచి బూజు పట్టిన మొక్కజొన్న లేదా దాణా మిశ్రమం చూడి పశువులకు మేపడం ద్వారా కూడా ఈసుకుపోతాయి. నాణ్యతలేని, సరిగ్గా పులియని సైలేజి కూడా గర్భస్రావాలకు కారణమే.

సూక్ష్మజీవులు: సూక్ష్మజీవులు అంటే బాక్టీరియా, వైరస్, ప్రొటోజోవా, కొన్ని రకాల ఫంగస్‌లు మొదలగునవి చూడి పశువులకు సోకినచో గర్భస్రావాలు జరుగుతాయి.

ఒత్తిడి: చూడి పశువు వేసవిలో అధికవేడికి, ఒకచోట నుండి మరియొక చోటికి వాహనములో తరలించడం వల్ల, కొన్ని రకాల శస్త్రచికిత్సలకు గురి అయినపుడు తీవ్రమైన అలసట, వత్తిడికి గురి అయి ఈసుకుపోతాయి.
రసాయనాలు, విషతుల్యమైన మొక్కలు తినడం: పశువులు ప్రమాదవశాత్తు నాఫ్తలీన్, పాదరసం, ఆర్సెనిక్, నైట్రేట్స్ వంటి రసాయన పదార్థాలను తినడం వలన, మేతకు వెళ్ళినపుడు కొన్ని రకాల విషతుల్యమయిన మొక్కలను మేయడం వలన ఈసుకుపోతాయి.

నివారణా చర్యలు

  1. ఈనడానికి సిద్ధముగê వున్న చూడి పశువులను ఇతర పశువులతో, మందతో మేతకు పంపకూడదు.
  2. చూడి పశువులను కొట్టడం, భయపెట్టి పరుగెత్తించడం చేయకూడదు.
  3. చూడి పశువును చల్లటి పాకలో ఉంచి, శుభ్రమయిన త్రాగు నీరు, మేత అందించి అధిక వేడి బారి నుండి కాపాడి శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలి.
  4. చూడి పశువుకు ఖనిజ లవణాలు, విటమిన్లు తగుపాళ్లలో ఉన్న నాణ్యమైన సమీకృత దాణా మిశ్రమమును, పచ్చి మేతలను, ఎండుగడ్డిని తగినంత అందించవలెను. బూజుపట్టిన దాణాను మేతగా వినియోగించకూడదు.
  5. మంచి గాలి, వెలుతురు వచ్చే పాకలో చూడి పశువులనుంచి, పాకలో బండలు జారుడు లేకుండా చూడాలి.
  6. చూడి దశను బట్టి పశువుకు తగినంత వ్యాయామం ఉండాలి.
  7. ఆంబోతులు, దున్నపోతుల ద్వారా సుఖ వ్యాధులు, ఆరోగ్యకరమైన పశువులకు సోకకుండా నివారించుటకు, కృత్రిమ గర్భధారణ ద్వారా మాత్రమే చూడి కట్టించవలెను.
  8. ఆంబోతులను చూడికట్టించడానికి వాడుతున్నట్లయితే, మూడు నెలలకు ఒకసారి ఆంబోతులకు, దున్నలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
  9. ప్రతి ఏటా పశువులన్నింటి రోగనిరోధక శక్తి పెంపొందించుటకు సంబంధిత వ్యాధులకు టీకాలు వేయించడం తప్పనిసరిగా చేయాలి.
  10. గర్భస్రావమైన పశువును ఇతర పశువులతో కలుపకుండా విడిగా ఉంచి వైద్యం చేయించాలి.
  11. ఈసుకుపోయిన పిండాన్ని, మాయను పాకకు దూరంగా లోతైన గోతిలో సున్నం వేసి పాతిపెట్టాలి. అశ్రద్ధ చేస్తే కుక్కలు వంటి జంతువులు పిండాన్ని తినడము లేదా దూరంగా లాక్కుపోవడం వలన వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
  12. గర్భస్రావమైన పశువు తినగా మిగిలిన గడ్డి, దాణాలను కాల్చి వేయాలి.
  13. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచి, అప్పుడప్పుడు క్రిమిసంహార మందులు పిచికారి చేయడం కూడా అవసరం.
  14. కొత్తగా కొన్న పశువులను కొంతకాలం పాటు మందతో కలుపకుండా పరిశీలనలో ఉంచుకోవడం సరియైన పద్ధతి.

డా. కె. జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, వెటర్నరీ సైన్స్ కాలేజి, ప్రొద్దుటూరు. ఫోన్: 9290661701

Read More

వర్షాకాలంలో పశుసంరక్షణ…!

వర్షాకాలం వచ్చింది. భారతదేశంలో పశుపోషణ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది, అయితే తొలకరిజల్లులు కురుస్తూ మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ వర్షాకాలం వేసవి వేడిని తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ, అధిక తేమ, బురద, నీటి నిల్వలు వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యానికి సవాళ్లను సృష్టిస్తాయి. ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు మరియు వ్యాధి వ్యాప్తి చేసే కీటకాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆశ్రయం, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

  1. పశువుల షెడ్ మరియు నివాస నిర్వహణ:
    వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవడానికి శాస్త్రీయమైన షెడ్ మరియు నివాస నిర్వహణ అత్యంత కీలకం.

వర్షాకాలంలో పశువుల షెడ్ చుట్టూ డ్రైనేజీ కాలువలను శుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలి, ఎందుకంటే నిల్వ నీటిలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. షెడ్ నేలను పొడిగా ఉంచడం చాలా ముఖ్యం; బురదగా లేదా తడిగా ఉన్న నేల వల్ల ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల పొడి గడ్డి, వరి పొట్టు లేదా సా డస్ట్ పరచి వాటిని తరచూ మార్చాలి. నేలపై సున్నం (లైమ్ పౌడర్) చల్లడం ద్వారా తేమ తగ్గడమే కాకుండా క్రిముల సంఖ్య కూడా తగ్గుతుంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందు పైకప్పు లీకేజీలను సరిచేసి షెడ్‌లోకి నీరు రాకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే తడి వాతావరణం ముఖ్యంగా పిల్ల దూడలు, గొర్రె పిల్లలు మరియు మేక పిల్లల్లో న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే షెడ్‌లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి; పూర్తిగా మూసివేయకుండా ఉండటం వల్ల మూత్రం నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు పేరుకుపోకుండా ఉండి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

  1. మేత మరియు పోషకాహార నిర్వహణ:
    మేత మరియు పోషకాహార నిర్వహణ విషయానికి వస్తే, వర్షాకాలంలో లభించే లేత పచ్చి మేతను పశువులకు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పరిచయం చేయాలి. పచ్చి గడ్డిలో నీటి శాతం, సులభంగా పులిసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో ‘బ్లోట్’ (కడుపుబ్బరం) మరియు తీవ్రమైన విరేచనాలు (Diarrhea) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని పొడి గడ్డి (Hay/Straw) తో కలిపి సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా, చిన్న వయస్సు లేదా తక్కువ ఎత్తు ఉన్న జొన్న (Sorghum) మొక్కల్లో ‘హైడ్రోసయానిక్ యాసిడ్’ (HCN / Prussic acid) అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు వచ్చే వరకు వాటిని మేపకూడదు. అధిక తేమ కారణంగా పశుగ్రాసం, పిండి పదార్థాలు త్వరగా బూజు పడతాయి. ఇటువంటి బూజు పట్టిన ఆహారం ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశించే మైకోటాక్సిన్లు ‘అఫ్లాటాక్సికోసిస్’ (Aflatoxicosis) అనే కాలేయ సంబంధిత విష ప్రభావానికి దారితీస్తాయి, కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. వర్షాల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి మేతలో వాటి శాతం తగ్గుతుంది కాబట్టి, పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి మినరల్ మిక్స్చర్ లేదా మినరల్ బ్లాక్ లను శాస్త్రీయంగా అందించాలి.
  2. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ
    వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి ముందస్తు రోగనిరోధక చర్యలు మరియు వ్యాధి నివారణ అత్యవసరం. వర్షాలు పడటానికి ముందే పశువైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఆవులు, గేదెలకు గొంతువాపు (Hemorrhagic Septicemia – HS), జబ్బవాపు (Black Quarter – BQ), మరియు గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) నివారణ టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకలకు బొబ్బరోగం లేదా ఇ.టి (Enterotoxemia – ET), పి.పి.ఆర్ (Peste des Petits Ruminants) మరియు నీలి నాలుక వ్యాధి (Blue Tongue) వంటి వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి కారక కీటకాలైన దోమలు, ఈగలు మరియు పేల నియంత్రణకు షెడ్ లోపల, గోడలకు అనువైన క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా స్ప్రే చేయడం ద్వారా బాహ్య పరాన్నజీవుల జనాభాను అదుపులో ఉంచవచ్చు.
  3. పరాన్నజీవుల (Worms) నియంత్రణ:
    పశువులలో అంతర్గత మరియు బాహ్య పరాన్నజీవుల (Parasites) నియంత్రణ చేయడం వల్ల పశువు యొక్క ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది. వర్షాకాల వాతావరణం పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం సరైన డోసేజ్‌తో డీ-వార్మింగ్ (నట్టల నివారణ) మందులు ఇప్పించాలి. పేలు (Ticks), మైట్స్, మరియు లైస్ వంటి బాహ్య పరాన్నజీవులు పశువుల రక్తాన్ని పీల్చడమే కాకుండా, రక్తం ద్వారా వ్యాపించే ప్రాణాంతక ప్రోటోజోవా వ్యాధులైన ‘బేబిసియోసిస్’ (Babesiosis) మరియు ‘అనాప్లాస్మోసిస్’ (Anaplasmosis) వంటి వాటికి కారణమవుతాయి కాబట్టి వీటి నిర్మూలన అవసరం.
  4. మాస్టిటిస్ మరియు కాళ్ల సంరక్షణ:
    చివరగా, పాడి పశువులలో మాస్టిటిస్ (పొదుగు వాపు వ్యాధి) మరియు కాళ్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు పొదుగును పొటాషియం పర్మాంగనేట్ లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి. పాలు పితికిన వెంటనే బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ‘టీట్ డిప్’ పద్ధతిలో ఐడోఫోర్ (Iodophor) ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా మాస్టిటిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పశువుల గిట్టలను తరచూ పరిశీలిస్తూ, ఏవైనా గాయాలు లేదా ఫుట్ రాట్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయాలి. గిట్టల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పశువులను 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కూడిన ‘ఫుట్ బాత్’ (Foot Bath) గుండా నడిపించడం అత్యంత శాస్త్రీయమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి.
  • Dr. Vaishnavi Polapelli, MVSc Scholar
    Department of Veterinary Surgery and Radiology, Ph: 9100725211

Read More

పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను.
ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా కృమినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్ల: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమి+న్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యతను: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నాపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది
• పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
• ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
• అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
• శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
• పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
• ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాంసన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
• గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
• మినరల్ మిక్చర్ నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
• పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
• వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
• సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
• మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
• కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
• సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
• కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
• పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
• పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.

అందువల్ల ప్రతి రైతు “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana
Assistant Professor
College of Veterinary Science, Korutla

Read More
  • 1
  • 2