పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
ఉద్యాన పంటలు, పప్పుదినుసుల సాగు పెంపుదలకు కృషి చేయాలని.. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, దీని కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని వరి మాదిరిగానే ఇతర పంటల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు కమిషన్కు తెలిపారు. శుక్రవారం కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, భవాని, గోపాల్రెడ్డి, సునీల్లు సీఎంను శాసనసభ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల సాగు పెరగాలి. సంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలి. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలి. దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుంది” అని తెలిపారు. కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు, కౌలు రైతుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోదండరెడ్డి కోరారు.


