కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
పాముకాటు సమస్య దేశమంతటా ప్రబలంగా ఉందని, దీనికి సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాముకాటు చికిత్సలో కీలకమైన యాంటీ (పాలీ)వీనమ్ కొరత కారణంగా దేశం గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని దాఖలైన పిటిషన్ను జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏటా సుమారు 58,000 పాము కాటు మరణాలు భారత దేశంలో సంభవిస్తున్నాయని, యాంటీవీనమ్ కొరత కారణంగా చికిత్స ఆలస్యమై బాధితులు మరణిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు మరణాలను తగ్గించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహించాని విజ్ఞప్తి చేశారు. అన్ని వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులతో పాముకాటు చికిత్స, సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఈ సమస్యపై కేంద్రంతో పాటు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల వైద్య ప్రతినిధులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాదికి తెలిపింది.

