పాముకాటుకు చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టండి

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

పాముకాటు సమస్య దేశమంతటా ప్రబలంగా ఉందని, దీనికి సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాముకాటు చికిత్సలో కీలకమైన యాంటీ (పాలీ)వీనమ్‌ కొరత కారణంగా దేశం గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏటా సుమారు 58,000 పాము కాటు మరణాలు భారత దేశంలో సంభవిస్తున్నాయని, యాంటీవీనమ్‌ కొరత కారణంగా చికిత్స ఆలస్యమై బాధితులు మరణిస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు మరణాలను తగ్గించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహించాని విజ్ఞప్తి చేశారు. అన్ని వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులతో పాముకాటు చికిత్స, సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. ఈ సమస్యపై కేంద్రంతో పాటు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల వైద్య ప్రతినిధులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాదికి తెలిపింది.
Read More

పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి

సీసీఐని కోరిన ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

పత్తి కొనుగోళ్ళలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రైతులకు కనీస మద్దతు ధర అందించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి సచివాలయంలో సీసీఐ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో పత్తి కొనుగోళ్ళపై గురువారం జరిపిన సమీక్షలో సీసీఐని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన 11 యార్డులు, 60 జిన్నింగ్‌ మిల్లుల్లో విధిగా పత్తి కొనుగోళ్ళు జరిగేలా చూడాలని, తేమ శాతం విషయంలో సరళీకృతంగా వ్యవహించాలని అధికారులను ఆదేశించారు. పత్తిని ఆరబెట్టి, నాణ్యత ఉండేలా చూసుకుని, ప్లాస్టిక్‌ సంచుల్లో కాకుండా గన్నీ బ్యాగ్స్‌లో తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీఐ సీజీఎం పాణిగ్రహీ, జీఎం అమరనాథ్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More

రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై ‘ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటినెన్స్‌ యాక్టు(ఎస్మా)’ను ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ రైతులను ఇబ్బబందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినా, రైతులను గందరగోళానికి గురి చేసినా, వేధించినా కఠినంగా వ్యవహరించాలని నిర్ధేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

Read More