మామిడిలో భారీగా కార్బైడ్‌ వినియోగం

నాణ్యత పరీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు: మంత్రి తుమ్మల

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా మామిడికాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు హానికరమైన కార్బైడ్‌తోపాటు మోతాదుకు మించి ఎథిలీన్‌ సాచెట్లను వినియోగిస్తున్నట్లు తేలింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్‌, ఆహారభద్రత విభాగం అధికారులు మంగళవారం 110 నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా కార్బైడ్‌ ప్యాకెట్లతోపాటు ఎథిలిన్‌ సాచెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జాంబాగ్‌, గడ్డి అన్నారం, బాటసింగారం, వరంగల్‌, జగిత్యాల తదితర మార్కెట్లలోని వ్యాపారులు తెచ్చిన పండ్లను తనిఖీ చేశారు. పలువురు కార్బైడ్‌ వాడిన పండ్లతో, మరికొందరు ఎథిలీన్‌ సాచెట్లతో దొరికారు. దాంతో అధికారులు వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ”సీజన్‌ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం అన్ని మార్కెట్లతోపాటు పండ్ల విక్రయ ప్రాంతాల్లో మామిడి పండ్లను తనిఖీ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే లైసెన్సుల రద్దుతోపాటు కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.

Read More

పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

Read More

వానలే వానలు

ఈ ఏడాది సాధారణానికి మించి
తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలకు అవకాశం
భారత వాతావరణ విభాగం వెల్లడి

వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం (జూన్‌-సెప్టెంబరు)లో దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో భూవిజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్‌, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే.. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తూ వస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని వారు పేర్కొన్నారు. అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు 56% అవకాశం ఉందని వివరించారు. ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని చెప్పారు. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని తెలిపారు. ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని పేర్కొన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌, ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, బిహార్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వానలు కురిసే వీలుందని వివరించారు. జూన్‌-సెప్టెంబరు మధ్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సాధారణానికి మించి వర్షాలు ఉండొచ్చని చెప్పారు. ప్రత్యేకించి ఏపీలోని ఉత్తర కోస్తాలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ఉండొచ్చని అంచనా వేశారు.

Read More

వెదురుతో దుర్భేద్య బంకర్లు ఐఐటీ పరిశోధకుల పరిశోధన

బంకర్లు, రక్షణశాఖ షెల్టర్ల నిర్మాణానికి అక్కరకొచ్చే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో భారత పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ కలప, ఇనుము, లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించొచ్చు. గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. దీన్ని భారత సైన్యం పరీక్షిస్తోంది.
స్వీయ బరువుతో పోలిస్తే అందించే అత్యుత్తమ బలం కారణంగా ఏరో స్పేస్‌, పౌర, నౌకాదళ రంగాల్లో గ్లాస్‌ ఫైబర్‌, కార్బన్‌ ఫైబర్‌, శాండ్‌విచ్‌ కాంపోజిట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి, పారవేతలో పర్యావరణ సవాళ్లు గణనీయంగానే ఉన్నాయి. చెట్ల నరికివేతపై ఆంక్షలు, హరిత ప్రత్యామ్నాయాలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా.. వెదురు ఆధారిత మిశ్రమ పదార్థాల రూపకల్పనపై గువాహటి ఐఐటీ శాస్త్ర వేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వెదురు చెట్టు వేగంగా పెరుగుతుంది. నాలుగైదేళ్లలోనే పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. సంప్రదాయ టేకు వంటి చెట్లకు ఇందుకు 30 ఏళ్లు పడుతుంది. వెదురుకు పునరుత్పాదక లక్షణం ఉంది. పైగా బరువు తక్కువ. పర్యావరణ అనుకూలం. స్థానికంగా లభ్యమవుతుంది. ఫర్నిచర్‌, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఐఐటీ పరిశోధకులు తాజాగా రూపొందించిన వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం.. లోహాల తరహాలో వంపునకు వీలుగా ఉంటుంది. తూటాలనూ తట్టుకునేంత బలం దీని సొంతం. ఈ లక్షణాల దృష్ట్యా ఇది సైనిక అవసరాలకు బాగా అక్కరకొస్తుందని పరిశోధకులు తెలిపారు.

Read More

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నుండి ఐదు ఉత్తమ మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలు విడుదల

ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆద్వర్యంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించిన అఖిల భారత మొక్కజొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల రూపొందించిన ఐదు ఉత్తమమైన మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలను విడుదల చేశారని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. నూతనంగా విదుదలైన హైబ్రిడ్‌ రకాలు దక్కన్‌ హైబ్రిడ్‌ మక్కా -144, డి.హెచ్‌.యం. 182, డి.హెచ్‌.యం.193, డిహెచ్‌.యం.206,డిహెచ్‌.యం.218 లతో కలిపి ఈ విశ్వవిద్యాలయం నుండి మొత్తం 24 మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలు విడుదల అయ్యాయి. ఇందులో డి.హెచ్‌.యం. 144 (తెలంగాణ మక్క – 6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వలన ఇథనాల్‌ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా డి.హెచ్‌.యం. 206 (తెలంగాణ మక్క – 3) మెట్ట సాగుకు అనుకూలమైనదని మరియు ఎండు తెగులును సమర్థ వంతంగా తట్టుకుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్థుతం రైతాంగానికి అందుబాటులో ఉన్న వివిధ మొక్కజొన్న వంగడాలతో పోల్చితే డి.హెచ్‌.యం. అన్ని విధాలుగా మేలైందని పరిశోదనలో తేలింది. కాబట్టి ఈ సదవకాశాన్ని రాబోయే కాలంలో రైతాంగం వినియోగించుకోవలసిందిగా విశ్వవిద్యాలయ అధికారులు కోరుతున్నారు.

16 పంట రకాలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటిత రకాలుగా గుర్తింపు
ఈ మధ్య కాలంలో జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన 16 వివిధ పంటల రకాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారిక ప్రకటిత రకాలుగా (నోటిఫైడ్‌ వెరైటీస్‌) గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసారు. తద్వార జయశంకర్‌ వర్సిటీ విడుదల చేసిన ఈ పంట రకాలను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా విత్తనోత్పత్తి ప్రణాళికలు రూపొందించి ఈ రకాలను రైతాంగానికి అందుబాటులోనికి తేవడానికి సహకరిస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ విత్తన సంస్థలు ఈ రకాల మూల విత్తన సరఫరా కొరకు విశ్వవిద్యాలయాన్ని సంప్రదించాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచిస్తున్నారు.

Read More

పీఎం కిసాన్‌తో ఏపీలో 41 లక్షల మందికి లబ్ధి

పీఎం కిసాన్‌ కింద 19వ విడత (2024 డిసెంబరు-మార్చి 2025) నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. లోక్‌సభలో ఎంపీ బెన్నీ బెహనన్‌ మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

Read More

ఉద్యాన నగరి.. ఉపాధి సిరి

పచ్చదనం నిర్వహణపై యువత, రైతు కూలీలకు శిక్షణ ఉద్దండరాయునిపాలెంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం

అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే గత తెదేపా సర్కారు హయాంలోనే బృహత్‌ ప్రణాళిక తయారైంది. అందులో భాగంగానే రహదారులు, కూడళ్లలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో నర్సరీలు, పచ్చదనం నిర్వహణలో ఉపాధి అవకాశాలు భారీగా రానున్నట్లు సీఆర్డీఏ అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలోని యువత, రైతులు, రైతు కూలీలకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది.

రెండెకరాల్లో…

ఉద్దండరాయునిపాలెంలో పెద్ద నర్సరీ ఏర్పాటుకు సీఆర్డీఏకు 25 ఎకరాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇది గతంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి ఎదురుగా.. కరకట్ట దిగువున ఉంది. ఇక్కడ ఉద్యానశాఖతో కలిసి ఉమ్మడిగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు తలపోస్తున్నారు. తొలుత ఎకరా స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. అనంతరం మరో ఎకరా స్థలాన్ని శిక్షణ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.75 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. రాజధాని నిర్మాణం కారణంగా వ్యవసాయ పనుల్లేక కూలీలు ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకే దీనిని ఉద్దేశించారు. రైతులకిచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచనున్నారు. పలుచోట్ల నైబర్‌ హుడ్‌ పార్కులు, చిన్న, పెద్దవి కలిపి దాదాపు 400 ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతీ రహదారి పక్కన అవెన్యూ ప్లాంటేషన్‌ చేయనున్నారు. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు సీఆర్డీఏ ఉద్యాన శాఖ సహకారం తీసుకోనుంది. తర్ఫీదు ఇవ్వడం ద్వారా రాజధానిలోని నిరుద్యోగ యువత, రైతు కూలీలకు జీవనోపాధులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొక్కలకు అంట్లు కట్టడం, కొమ్మలు కత్తిరించడం, నర్సరీల నిర్వహణలో మెలకువలు, మొక్కల సంరక్షణ, తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అవసరమైన వారిని గుర్తించి, ప్రతి బ్యాచ్‌కు 50 మందికి చొప్పున తర్ఫీదు ఇస్తారు. ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.

Read More

వరి కంటే ఆ పంటలే లాభదాయకం

జనరల్‌ నేచర్‌ అధ్యయనంలో వెల్లడి

వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు లాభదాయకమని జనరల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి ఉత్పత్తి ప్రభావితం అవుతోందని.. ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించింది. వరి నుంచి ఇతర పంటలకు మారిన అన్నదాతలు 11% లాభాలు గడించినట్లు అధ్యయనం వెల్లడించింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్‌ నుంచి పొందినట్లు పేర్కొంది. అధ్యయన బృందంలో భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ అసోసియేట్‌ ప్రొ. అశ్విని ఛాత్రే తదితరులున్నారు.

Read More

కార్పోరేషన్ల ప్రగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు సచివాలయంలో టిజి అగ్రోస్‌, హాకా, టిజిఆర్‌ఐసి, టిజి కోఆపరేటివ్‌ యూనియన్‌, టిజి వేర్‌హౌస్‌ కార్పోరేషన్ల ప్రగతిని సమీక్షించారు. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడ్డ కార్పోరేషన్లు, మారుతున్న రైతుల, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి వాటిని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకొంటేనే అవి మనుగడ సాగించగలవని, అదేవిధంగా ఒకే కార్యకలాపాల్ని నిర్వహించే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉందని తెలిపారు. తదనుగుణంగా సదరు సంస్థలన్నింటిని రానున్న సంవత్సరాలలో వారు నిర్వహించే కార్యకలాపాల మీద మరియు సంస్థల ఆర్థికస్థితి గురించి నివేదిక అందిన వెంటనే ఆయా సంస్థల బలోపేతానికి లేదా విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతిమంగా ప్రభుత్వం గాని, ప్రభుత్వ అనుబంధ సంస్థల ముఖ్యోద్ధేశం రైతులకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించడమే అని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఐఏఎస్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంథ్రేఖర్‌ రెడ్డి, ఐఏఎస్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి డా. కె.లక్ష్మీ, ఐఏఎస్‌, ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, శ్రీరాములు మరియు శ్రీమతి అన్నపూర్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read More

శుద్ధి, నిల్వ సౌకర్యాల కోసం అన్నదాతలకు సాయం

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ డైరెక్టర్‌

పంటల సాగుతో పాటు అన్న దాతలు ఉత్పత్తుల శుద్ధి, నిల్వ సౌకర్యాలతో అదనపు ఆదాయం పొందాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఆర్కే మీనా సూచించారు. మౌలిక వసతుల నిధి కింద కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని, ఏఐఎఫ్‌లో తక్కువ వడ్డీతో రుణసాయం లభిస్తోందని దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్‌) సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోదాములు, శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఏఐఎఫ్‌ ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల నిధి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఏఐఎఫ్‌ కింద సత్వరమే రుణాలు అందిస్తున్నామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ జీఎం ప్రశాంతకుమార్‌ వెల్లడించారు. ఏఐఎఫ్‌ ప్రగతిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు తెలంగాణ విభాగం అధికారి భుజంగరావు, రవితేజ ఇతర సిబ్బందిని ఆర్కే మీనా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Read More
  • 1
  • 2