పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక విషపూరిత మొక్కలు, వాటి యొక్క ప్రబావం

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం కొంతమంది రైతులకు ముఖ్యమైన ఉపాధి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే పశుపాలనగా ఇది గుర్తింపు పొందింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల తగ్గుదల, పచ్చిక కొరత, పశుపోషణ లోపాల వల్ల గొర్రెలు, మేకలు తినరాని కొన్ని స్థానిక మొక్కలను తిని విషబాధకు గురవడం మన రాష్ట్రంలో తరచూ కనిపిస్తోంది. ఈ సమస్య వల్ల జంతువులు అనారోగ్యానికి గురై, కొన్నిసార్లు మరణించడమూ జరుగుతుంది. అందుకే రైతులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

విషపూరిత మొక్కలు అంటే ఏమిటి?
గొర్రెలు, మేకలు సాధారణంగా పచ్చిక, ఆకులు, కొమ్మలు తింటాయి. కానీ కొన్ని మొక్కల్లో సహజంగానే విషపదార్థాలు ఉంటాయి. అలాంటి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఆ విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ, నరాలు, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దీనినే మొక్కల వల్ల వచ్చే విషబాధ అంటారు.

ఈ విషబాధ ఎక్కువగా:
• వేసవిలో పచ్చిక కొరత ఉన్నప్పుడు
• కరవు పరిస్థితుల్లో
• అడవుల్లో మేపేటప్పుడు
• పొలాల అంచుల్లో నిర్లక్ష్యంగా మేపినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.

తెలంగాణలో సాధారణంగా కనిపించే విషమొక్కలు

లంతెన (గండ్ల పూల చెట్టు)

ఈ మొక్క తెలంగాణ అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. దీని ఆకులు, పువ్వులు తిన్న గొర్రెలు, మేకల్లో:
• ఆకలి తగ్గిపోవడం
• నోరు పచ్చగా మారడం
• కడుపు ఉబ్బడం
• బలహీనత
• క్రమంగా చనిపోవడం కనిపిస్తాయి.

తుమ్మ చెట్టు

తుమ్మ ఆకులు ఎక్కువగా తింటే:
• నోటిలో గాయాలు
• మేత తినకపోవడం
• జీర్ణక్రియ లోపించడం వంటివి వస్తాయి

కందగడ్డి / అడవి కంద

ఇవి తిన్నప్పుడు:
• వాంతులు
• విరేచనాలు
• నడవలేకపోవడం
• అకస్మాత్తుగా పడిపోవడం కనిపిస్తాయి.

నల్ల ఉసిరి / అడవి ఉసిరి

ఇది తినడం వల్ల:
• కాలేయానికి నష్టం
• కళ్లు పసుపు రంగులో మారడం
• మూత్రం ముదురు రంగులో రావడం వంటివి కనిపిస్తాయి.

అడవి పొగాకు

ఈ మొక్క తిన్న మేకల్లో:
• నరాల బలహీనత
• వణుకు
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
• చనిపోవడం కూడా జరుగుతుంది.

విషబాధకు కారణాలు

  1. పచ్చిక కొరత వేసవిలో పచ్చిక దొరకకపోవడంతో జంతువులు దొరికిన మొక్కలన్నీ తింటాయి.
  2. ఖనిజాల లోపం ఉప్పు, ఖనిజాల లోపం ఉన్నప్పుడు జంతువులు అసాధారణంగా ఇతర మొక్కలను తింటాయి.
  3. అడవుల్లో నిర్లక్ష్య మేపకం అడవుల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా మేపితే విషమొక్కలు తినే ప్రమాదం ఎక్కువ.
  4. పొలాల్లో రసాయనాల ప్రభావం మందులు పిచికారీ చేసిన తర్వాత మేపడం వల్ల విషబాధ వస్తుంది.

లక్షణాలు (గుర్తించే విధానం)
విషమొక్కలు తిన్న గొర్రెలు, మేకల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి:
• మేత తినకపోవడం
• ఎక్కువగా నోరు నుంచి నురుగు రావడం
• కడుపు నొప్పి, ఉబ్బరం
• విరేచనాలు లేదా మలబద్ధకం
• నడవలేక కూలిపోవడం
• శ్వాస వేగంగా తీసుకోవడం
• అకస్మాత్తుగా మరణం

లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి.
చికిత్స (ప్రాథమిక చర్యలు)

  1. వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి
  2. అనుమానాస్పద మొక్కలు తినకుండా జంతువులను వేరుచేయాలి
  3. శుద్ధమైన నీరు ఇవ్వాలి
  4. డాక్టర్ సూచన మేరకు:
    o యాంటీడోట్ మందులు
    o గ్లూకోజ్ డ్రిప్
    o కాలేయ రక్షక మందులు ఇవ్వాలి

గమనిక: ఇంటి చిట్కాలు వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.

నివారణ చర్యలు (అత్యంత ముఖ్యమైనవి)
• పశువులకు సరిపడా పచ్చిక, ఎండుగడ్డి అందించాలి
• ఉప్పు, ఖనిజ మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి
• పొలాల అంచుల్లో, అడవుల్లో విషమొక్కలను తొలగించాలి
• మందులు పిచికారీ చేసిన పొలాల్లో మేపకూడదు
• రైతులకు విషమొక్కలపై శిక్షణ ఇవ్వాలి

సారాంశం
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక మొక్కల వల్ల వచ్చే విషబాధలు రైతులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ సరైన అవగాహన, జాగ్రత్తలు, సమయానికి చికిత్స ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు ఆర్థికంగా ముందుకు సాగగలడు. అందుకే ప్రతి పశుపోషకుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

విస్తరణ సేవలను పటిష్టం చేస్తున్న కోరమాండల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గ్రోమోర్ గ్రామ్ పేరుతో వ్యవసాయ విస్తరణ సేవలను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో, 12 రాష్ట్రాల్లోని 101 గ్రామాలను కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎంపిక చేసింది. ఈ మోడల్ గ్రామాల రైతులు సమతుల్య పోషక పద్ధతులను అవలంబించి, స్థిరమైన దిగుమతులు సాధించేలా వారిని సాధికారులను చేస్తామని కోరమాండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాధబ్ అధికారి తెలిపారు. భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడటం, ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ, రైతులకు కొత్త సాగు పద్దతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లాంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.

Read More

జిల్లాలవారీగా జొన్నకొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి

అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ అదికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో వర్షాల బీభత్సంపై ఆయన బుధవారం ఆ జిల్లాతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసు కురావాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మార్కెటింగ్ అదికారులను వెంటనే మంచిర్యాలకు వెళ్లాలని ఆదేశించారు.

Read More

విడుదలైన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు

రైతుభరోసా రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో విడుదలైన వెంటనే జమ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుభరోసాపై ఆదివారం తన నివాసంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో సోమవారం సీఎం చేతుల మీదుగా 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం రూ.2,206.06 కోట్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ సహా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తెలియజేయాలని సూచించారు. సీఎం నిధులను విడుదల చేయగానే ఆ నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో వెంటనే జమ కావాలన్నారు. మొదటి విడతలో కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను నిలిపివేయడం వల్ల వారికి నిధులు అందలేదని, ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.

శనగ, పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేయాలి*మొక్కజొన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘పంటలకు మద్దతు ధరల ప్రకటనకే కేంద్రం పరిమితమవుతోంది. మద్దతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొనుగోలులో కొత్త విధానంతో పత్తి రైతులను నష్టపరిచేందుకు పథకం వేస్తోంది. శివరాజ్‌సింగ్ ఈ వ్యవహారాలను సమీక్షించి రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి’ అని తుమ్మల లేఖలో కోరారు.

Read More

90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

నకిలీ విత్తనాల వలన రైతులకు పరిహారం

హైదర్‌గూడలోని శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ధన్య సీడ్స్ సంస్థలను నకిలీ మిరప విత్తనాల విక్రయం కేసులో నష్టపోయిన రైతులకు రూ.16.80 లక్షలు చెల్లించాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన ఎనిమిది మంది రైతులు 2017లో వేర్వేరుగా దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అనంతరం ఒక్కో రైతుకు రూ.2 లక్షల పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేల చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఏ. వీరన్న, జి. వెంకన్న, ఎం. ముఖేష్, రామ్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్, టి.వెంకట్‌రెడ్డి, వి. యాకుబ్ రెడ్డి 2016 జులైలో శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి ‘ధన్య మిరప విత్తనాలు’ కొనుగోలు చేశారు. టాటా సంస్థ ఉత్పత్తిగా ప్రచారం చేసిన ఈ విత్తనాలు తెలంగాణ వాతావరణానికి సరిపోతాయని డీలర్ హామీ ఇవ్వడంతో ఒక్కొక్కరు రూ.300కి ఒక ప్యాకెట్ చొప్పున అవసరమైనన్ని కొనుగోలు చేశారు. వీటిని పొలంలో చల్లగా నవంబరు నాటికి మొక్కలు ఏపుగా పెరిగినా పూత, దిగుబడి రాలేదు. దీంతో 2016 నవంబరు 29న మహబూబాబాద్ ఏఈవోకు ఫిర్యాదు చేయగా.. డిసెంబరు 17న జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారి పొలాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా రైతులంతా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విత్తనాలు నాణ్యమైనవే అని నిర్ధారించే ల్యాబ్ రిపోర్టులున్నాయని ప్రతివాదులు కమిషన్‌కు తెలుపగా… ఆ రిపోర్టుల్లో తేదీల వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఇనెస్పెక్షన్‌కు కంపెనీ ప్రతినిధి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం రైతులకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Read More