విజయవంతంగా ముగిసిన గ్రామగ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారుల చేతుల మీదుగా విత్తన పాకెట్లను లాంచనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని రాష్ట్రంలోని అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రిగారు తెలపారు. వరిలో 20,000, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతాంగానికి అందించడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వ్వయసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతీ గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు.

Read More

కంద.. చేమ.. క్యారెట్‌..!

దుంపల సాగు విస్తీర్ణం పెంపుపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి
నష్టాల నుంచి రైతులను గట్టెక్కించాలని నిర్ణయం

అకాల వర్షాలు, వరదలతో పంటలను కోల్పోతున్న రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తూ ప్రజలకు పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దుంపల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. రైతులను కంద, చేమ, బంగాళాదుంప, క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, కర్రపెండలం వంటి పంటల సాగువైపు మళ్లించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన, కురుస్తున్న అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు, మామిడి, నిమ్మ తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాల నివారణకు ప్రత్యామ్నాయాలను సూచించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వారి సూచనలతో ఎక్కువగా దుంప పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న దుంప పంటలు 3,700 ఎకరాల మేరకే సాగవుతున్నాయి. అత్యధికంగా 2,200 ఎకరాల్లో కందగడ్డ (మొరంగడ్డ/ చిలగడదుంప) సాగవుతోంది. బంగాళాదుంప వినియోగం ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్రంలో ఆ పంట కేవలం 452 ఎకరాల్లోనే సాగు అవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 6 లక్షల టన్నుల మేరకు దుంపల వినియోగం ఉంటుండగా.. ఇక్కడ తక్కువగా సాగు అవుతుండటంతో వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న ఖరీఫ్‌లో రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల మేరకు దుంప పంటలను సాగుచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తక్కువ నీరు.. ఎక్కువ నిల్వ: అకాల వర్షాలు, వరదలతో ఇతర పంటలు దెబ్బతింటున్నా.. దుంపలకు ఎలాంటి నష్టం కలగదని అధ్యయనాల్లో తేలింది. కోతకు వచ్చిన తర్వాత ఇతర పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దుంప పంటలను మాత్రం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే అవకాశముంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దుంపల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read More