తడిసిన ధాన్యం కొంటాం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు అందాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని, ప్రతి రైతునూ ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కాలనీలు, నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయి… అక్కడి నుంచి మున్నేరుకు భారీగా వరద వస్తుండటంతో ఖమ్మంలోని కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More

4 వేల మంది సాగుదారులకు కొత్తగా భూపట్టాలు

నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలివ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, పీసీసీఎఫ్‌ సి. సువర్ణ, నల్గొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”భూభారతి పైలట్‌ ప్రాజెక్టులో తిరుమలగిరి (సాగర్‌) మండలంలో 23 వేల ఎకరాల్లో సర్వే చేపట్టాం. 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించాం. దీనిలో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. 4 వేల ఎకరాలకు పాసుపుస్తకాలు ఉన్నాయి. మిగిలిన 4 వేల ఎకరాలకు కొత్తగా పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. 3,069 మంది పేరుతో 2,936 ఎకరాలకు బోగస్‌ పాసుపుస్తకాలు ఉన్నట్లు గుర్తించి రద్దు చేశాం. వీటికి రైతుభరోసా, రైతు బీమా కూడా రద్దు చేశాం. 7 వేల ఎకరాల అటవీ భూమి గుర్తించాం. పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ, అటవీ శాఖలు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి” అని మంత్రి ఆదేశించారు.

Read More

పంట పండించిన రైతులకే కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశం

తెలంగాణలో పంట పండించిన రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌, ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి. తప్పనిసరిగా వారు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి. ధ్రువీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఇ పోస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలతో ధ్రువీకరణ అనంతరమే రైతుల నుంచి పంట తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెసలు, కందులు, జొన్నలు, సోయా, పొద్దుతిరుగుడు వంటి పంటలకు సరైన ధరలు రానప్పుడు ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా వాటిని మద్దతు ధరకు కొంటోంది. ఈ కేంద్రాలకు దళారుల బెడద ఎక్కువైంది. రైతుల వద్ద తక్కువ ధరకు పంట కొన్న వ్యాపారులు.. కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆధార్‌ కార్డుల నమోదు ఆధారిత కొనుగోళ్ల విధానం చేపట్టాలని, దీనికోసం నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల లేఖ రాసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ కొత్త విధానంపై ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇపోస్‌ యంత్రం ఏర్పాటు చేసి వాటిలో రైతులందరి భూముల సర్వే నంబర్లు, పంటల సమాచారం (వ్యవసాయశాఖ పంట నమోదు) ద్వారా అనుసంధానం చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులతో ఆయా కేంద్రాలకు వచ్చినప్పుడు ముందుగా ఆధార్‌ కార్డుతో ఇపోస్‌ నమోదు చేసుకోవాలి. అందులో రైతు సాగు చేసిన పంట వివరాలను, తెచ్చిన పంట సరిచూసి.. తర్వాత కొనుగోళ్లకు అనుమతిస్తారు. ఇపోస్‌ యంత్రంలో రైతు భూమి, పంటల వివరాలున్నా.. ఆధార్‌ కార్డు లేకపోయినా, పేరు, ఇతర వివరాల్లో తప్పులున్నా.. జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకొని ఆ పత్రాన్ని తెచ్చి సమర్పిస్తే పంటను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ధాన్యం, పత్తేతర కొనుగోలు కేంద్రాలకే పరిమితం చేశారు. త్వరలో పౌరసరఫరాల శాఖ, సీసీఐల ద్వారా జరిగే వరి, పత్తి కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త విధానం అమలుకు మార్క్‌ఫెడ్‌ సిద్ధమైంది. తమ పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాలు, సహకార సంఘాల్లో వెంటనే ఇపోస్‌ యంత్రాలను కొనుగోలు చేయాలని సంస్థ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో త్వరలో పెసలు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 58,728 ఎకరాల్లో పెసర పంట వేయగా.. 16,326 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేస్తున్నారు. దీంతో ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.

Read More

వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థకు పూర్వ వైభవం తేవాలి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థ ప్రస్తుత పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించి సంస్థకు పూర్వవైభవం తెస్తామని వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మలక్ పేటలోని ఆ సంస్థను తమ సభ్యులతో కలిసి సందర్శించారు.

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాయితీలతో ఉద్యాన పంటలకు ఊతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.

బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్‌, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్‌ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

Read More

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల

  • దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్‌ స్టాప్‌ సెంటర్‌’గా మారాలి
  • ఎఫ్‌.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి
  • ఎన్‌.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్‌.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్‌.సి.డి.సి. మరియు కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్‌డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్‌ మెంట్‌ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్‌.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్‌.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్‌.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్‌ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్‌.సి.డి.సి. రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్‌ రవీందర్‌ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read More

రైతునేస్తం వ్యవసాయ కుటుంబ మాసపత్రిక2025 రైతునేస్తం పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

‘రైతునేస్తం’ 21వ వార్షికోత్సవ సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా|| ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను అవార్డులతో సెప్టెంబర్‌లో జరగబోయే వార్షికోత్సవ వేడుకలో ఘనంగా సత్కరించనుంది.
పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్‌, రైతులు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్‌ https://rythunestham.in/awards నుండి అప్లికేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి ఆగస్టు 31వ తేదీలోగా ‘ఎడిటర్‌, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ – 500004. ఫోన్‌: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం||, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ – 522 017, ఫోన్‌: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.in కు ఇ-మెయిల్‌ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వార్షికోత్సవం సెప్టెంబర్‌లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.

Read More

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల

  • జిల్లాల వారిగా ఉద్యానపంటల ప్రగతిని వివరించిన అధికారులు
  • రైతులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం కావద్దని ఆదేశించిన మంత్రి
  • హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో పెద్దఎత్తున కూరగాయల సాగును చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
  • డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
  • కమిషనరేట్‌ అధికారులు హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్రంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించడం జరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ మంత్రికి వివరించడం జరిగింది. ఉద్యానపంటలను ప్రొత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున తుంపర మరియు బిందు సేద్య పరికరాలపై రాయితీ ఇవ్వడం జరుగుతున్నదని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న, సన్నకారు మరియు బిసి రైతులకు 90 శాతం రాయితీతో, ఇతరులకు 80 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు మరియు అన్ని వర్గాల రైతులకు 70 శాతం తుంపర సేద్య పరికరాలను అందించడం జరుగుతున్నదని, కేంద్రం ఇచ్చే సబ్సీడి కన్నా అదనంగా 45 శాతం సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు, 35 శాతం సబ్సిడీని చిన్న, సన్నకారు, బిసి రైతులు మరియు ఇతర రైతులకు ప్రభుత్వం అందచేయడం జరుగుతున్నదని మంత్రికి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29,821 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 81,942 ఎకరాల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 28,147 ఎకరాల విస్తీర్ణానికి బిందు మరియు తుంపర సేద్య పరికారాలు ఏర్పాటు చేయబడ్డాయి అని డైరెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులకు చెందిన 40,247 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టడం జరిగిందని, 2021-22 సంవత్సరంలో కొత్త జిల్లాలలో సాగులోకి తీసుకురాబడ్డ ఆయిల్‌ పామ్‌ తోటలు కాపుకు వచ్చాయని, ఆయా కంపెనీలు రైతుల వద్ద నుండి ఆయిల్‌ పామ్‌ గెలలను కొనుగోలు చేయడం జరుగుతున్నదని, ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌ కర్మాగారాలను ఏర్పరచడం జరుగుతున్నదని తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,25,000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ నాటుటకు నమోదు చేసుకోవడం జరిగిందని, 26 వేల ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో జూన్‌ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ ను పూర్తి చేసుకోవడం జరిగిందని డైరెక్టర్‌ మంత్రికి వివరించారు.
తుమ్మల మాట్లాడుతూ.. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసి, డిప్యూటి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలు అయిన రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా డిమాండుకు అనుకూలంగా కూరగాయల సాగును రైతులకు అందించాలని పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పురోగతి చాలా మందకోడిగా నడుస్తున్నదని, వారంవారిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలని డైరెక్టర్‌ని ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్‌ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పెంచడానికి, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ నర్సరీలలో ఎట్టి పరిస్థితులలో కూడా కల్లింగ్‌ మొక్కలు ఉండకూడదని, ఆయిల్‌ పామ్‌ రైతులకు ఆరోగ్యకరమైన, మంచి మొక్కలను అందించాలని ఇదివరకే నాటిన ఆయిల్‌ పామ్‌ తోటల రైతులకు, పంట యాజమాన్యం విషయంలో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, ఆవగాహన కల్పించాలని తద్వారా అనుకున్న సమయానికి ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మంత్రిగారు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ నెలాఖరు కల్లా ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, తదనుగుణంగా వారంవారిగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రిగారు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్‌ రావు, ఉద్యానశాఖ సంచాలకులు శ్రీమతి యాస్మిన్‌ బాషా మరియు ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More