ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో మామిడి పండ్లను రుచి చూసిన లోకేశ్

ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ రైతు మునగాల ద్వారకానాథ రెడ్డికి చెందిన 17 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి లోకేశ్ సందర్శించారు. 17 ఎకరాల్లో సమీకృత పండ్ల తోటలు, నాటుకోళ్లు, పొట్టేళ్లు, చేపల పెంపకం చేపడుతూ స్థిరమైన ఆదాయం ఆర్ౙిస్తున్న రైతు కుటుంబాన్ని ఆయన అభినందించారు. సేంద్రియ పద్ధతిలో పండిన మామిడి పండ్లను మంత్రి రుచి చూశారు.

Read More

న్యూట్రిహబ్ సహకారంతో రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం

మిల్లెట్ మార్వెల్స్ సంస్థ భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)కు చెందిన న్యూట్రిహబ్ సహకారంతో ‘రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం’ జాతీయ మిషన్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారాసత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలు దీనిని ప్రారంభించారు. న్యూట్రిహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్‌కు సినీనటుడు నాగార్జున, ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వీడియో ప్రసంగాల ద్వారా మద్దతు తెలిపారు.

Read More

సేంద్రియ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు యాప్

సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం దేశంలో తొలిసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్ ‘టీజీ ఆర్గానిక్స్’ రానుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద వ్యవసాయ వారోత్సవాలలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 4న యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసి రైతులు పండించే స్వచ్ఛమైన సేంద్రియ ఉత్పత్తులు వినియోగదారులకు లభ్యమయ్యేలా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ దీనిని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో నేంద్రియ వ్యవసాయం విస్తరిస్తోంది. రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 10 వేల మంది రైతులు, 24 రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు 50 వేల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారు. ప్రత్యేక మార్కెట్లు లేకపోవడం వల్ల వారు పంట ఉత్పత్తులను దుకాణాల చుట్టూ తిరిగి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ ఉత్పత్తులను నేంద్రియం పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా మోసాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి తుమ్మల ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థకు సూచించారు.
ధర నిర్ణయించే అధికారం రైతుకే
ప్రారంభంలో ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన 100 సేంద్రియ ఉత్పత్తులు, 500 మంది రైతుల సమాచారం యాప్‌లో ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైతుల వివరాలు వస్తాయి. మున్ముందు మరింత మంది రైతులను, ఉత్పత్తులను ఇందులో చేరుస్తారు. ఆయా ఉత్పత్తులు కావాలనుకున్న వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ద్వారా రైతులను సంప్రదించవచ్చు. రైతు మొబైల్ నంబరు, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. ధర నిర్ణయించే అదికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.

Read More

సేంద్రియ రైతుల కోసం ‘ఏలూరు రైతు సంపద’

‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌ను ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉంచేందుకు ఈ ప్రత్యేక ప్లాట్‌ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి తీసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…

సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందు బాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.
ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని సోమవారం పీజీఆర్ఎస్‌కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

బయో ఫోర్టిఫైడ్ మొక్కజొన్నలో అధిక పోషకాలు

హెచ్‌క్యూ పీఎం-5 పేరుతో అభివృద్ధి చేసిన అధిక ప్రొటీన్ మొక్కజొన్న పంటను గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు (కేవీకే) ఈ విత్తనాలను కేవీకే శాస్త్రవేత్తలు ఈ రబీలో 20 ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. దిల్లీకి చెందిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) సహకారంతో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐ.ఏ.అర్.ఐ.) శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని గండ్రాయి, చెర్వుకొమ్ముపాలెం, బబ్బెళ్లపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి, కన్నెవీడు గ్రామాల్లో రైతులకు పంపిణీ చేశారు. 20 ఎకరాల్లో పంట సాగులో ఉంది. పంట లేత కంకి దశలో ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురం అఖిల భారత సమన్వయ మొక్కజొన్న పరిశోధన ప్రాజెక్టు సౌజన్యంతో రైతులకు కలుపు మందులు, పురుగు మందులు ఉచితంగా అందించారు. ఈ విత్తనాల ప్రత్యేకతను కేవీకే సేద్యవిభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎన్ శివప్రసాద్, వ్యవసాయ విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఐ. వెంకటరెడ్డి వివరించారు.
ఇది బయోఫోర్టిఫైడ్ హైబ్రిడ్ రకం మొక్క జొన్న. సాధారణ రకంతో పోలిస్తే ఇందులో రెట్టింపు అమైనో ఆమ్లాలు (లైసిన్, ట్రిప్టోఫాన్), అధిక ప్రొవిటమిన్-ఎ కంటెంట్‌తో మెరుగైన పోషకాలు ఉంటాయి. ఈ పంట 90 రోజుల్లో కోతకు వస్తుంది. వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్నను మనుషులు తినేందుకు, పశువుల దాణాకు కూడా వినియోగిస్తారు.
హెచ్‌క్యూ పీఎం-5 మొక్కజొన్నలో పోషకాల నాణ్యత దాదాపు 3.37 శాతం లైసిన్, 0.72 శాతం ట్రిప్టోఫాన్, 6.60 పీపీఎం ప్రొవిటమిన్-ఎ కలిగి ఉంటుంది. హెక్టారుకు 43-76 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మన ప్రాంతంతో పాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. ఇది 5.8-6.8 పీహెచ్ ఉన్న నేలల్లో బాగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద దేశ ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించడానికి ఈ రకం విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది.

Read More

రసాయన రహిత సహజ సాగు ప్రాజెక్టును తెలంగాణాలో ప్రారంభించాం

కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.

Read More

9 రకాల చిరుధాన్యాలతో 190 రకాల ఉత్పత్తులు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ మిల్లెట్స్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం (సీఓఈఎం) చిరుధాన్యాలను ‘రెడీ టూ ఈట్‌’లా సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ సంస్థ.. ఔత్సాహికులకు ఆయా సాంకేతికతలను అందిస్తోంది. మైసూరులోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఎఐ) లో గతేడాది డిసెంబరులో సీఓఈఎం ఏర్పాటైంది. ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ కేంద్రం.. చిరుధాన్యాలలో సాధించిన ఘన ఆవిష్కరణలు…

గంటకు 500 కిలోల సామర్థ్యం
చిరుధాన్యాల ఉత్పత్తిలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. రైతులు మాత్రం అవగాహన లేక నష్టపోతున్నారు. సీఓఈఎం ముందుగా రైతు నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. రూ.20 కోట్లతో 3 రకాల ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నేరుగా ఈ కేంద్రాలకు తరలించేలా అవగాహన కల్పించింది. ధాన్యం నాణ్యత, శుద్ధి, అనుబంధ ఉత్పత్తుల తయారీ రైతుల కళ్లముందే చేపడుతోంది. ప్రత్యేక ప్రాసెసింగ్‌ యంత్రాలతో గంటకు 500 కిలోల ధాన్యం శుద్ధి చేసి, ఉత్పత్తులనూ తయారు చేయడంతో రైతులకు కేంద్రంపై గురి కుదిరింది.

మెక్‌ డొనాల్డ్‌ మెచ్చింది
సీఓఈఎంలో జొన్న, రాగి, సజ్జ తదితర ధాన్యాలతో చేసిన బన్‌.. మెక్‌డొనాల్డ్‌ సంస్థకు ఎంతో నచ్చింది. దాన్ని ‘మిల్లెట్‌ బన్‌ బర్గర్‌’గా మార్చి ప్రపంచ విపణికి పరిచయం చేసింది.

వివిధ రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలు శుద్ధి చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలనూ ఈ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో వృథాగా పోనివ్వడం లేదు. రాగి పొట్టు నుంచి అయిల్‌, విరిగిన రాగులతో సేలాలు, పగుళ్లిచ్చిన గింజలతో ‘రాగి రైస్‌’, నూకతో రవ్వ, మురుకులు ఇలా.. ఒక్క రాగులతోనే 45 రకాల ఉత్పత్తులు చేస్తోంది. వాటికి అదనపు పోషకాలూ జోడిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో 9 రకాల ధాన్యాలను 190 రకాల ఉత్పత్తులుగా మలిచే వ్యవస్థలున్నాయి. బయో డిగ్రేడబుల్‌, తినదగిన ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు తయారు చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగులు, రుచులను చేర్చేందుకు ఎలక్ట్రానిక్స్‌ నోస్‌, మౌత్‌ అప్లికేషన్లు, ప్యాకేజింగ్‌ వ్యవస్థలూ తీసుకొచ్చింది.

నిల్వకు పెద్దపీట..

  • చిరు ధాన్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. వాటి పిండి, రవ్వ ఇతర ఉత్పత్తుల నిల్వ కాలం తక్కువ.
  • సీఓఈఎం ప్రత్యేక పద్ధతుల్లో 4-5 నెలలపాటు నిల్వ చేసుకునేలా చేసింది.
  • ఇందుకు తొలుత వైబ్రో క్లీనర్ల ద్వారా ధాన్యం శుభ్రం చేసి, స్టీమింగ్‌ ట్యాంకర్లు, డ్రైయర్‌ బెడ్ల ద్వారా ఆరబెట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకు నేలా పాలిష్‌ చేస్తోంది.
  • ఆ తర్వాత వినియోగదారుడికి అవసరమైన ఉత్పత్తులుగా మార్చుతోంది.
  • ధాన్యం నిల్వకూ ఈ కేంద్రంలోనే గోదాములు ఏర్పాటు చేసింది.
Read More

ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్‌’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

Read More

ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం: సుభాష్‌ పాలేకర్‌

పర్యావరణ సమతుల్యానికి యూరియా, రసాయన ఎరువుల వాడకంతో ఏర్పడుతున్న సమస్యల కారణంగా గ్రామాల నుంచి పెద్దఎత్తున నిధులు బయటకు వెళ్తున్నాయని, ‘మారిన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో పండించిన పంటలే ఇందుకు కారణమని, గ్రామాల నుంచి ఇంతలా నిధులు బయటకు వెళ్తుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రకృతి వ్యవసాయమే దీనికి పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారం వల్ల క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు దరిచేరవు. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణం సమతుల్యమవుతుంది’ అని నిన్న హైదరాబాదులో జరిగిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాల సభలో పాల్గొన్న సుభాష్‌ పాలేకర్‌ అన్నారు.

Read More