వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

క్యారెట్ ఆకుల పచ్చి పచ్చడి

క్యారెట్ ఆకులను కూడా చక్కగా రోటి పచ్చడి చెయ్యవచ్చు. తెలియని వారు దాన్ని కొత్తిమీర పచ్చడి అనుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది.

గుప్పెడు లేత క్యారెట్ ఆకులను తీసుకుని, శుభ్రంగా మంచినీటిలో కడగాలి. ఆకుల అడుగున పేను గట్రా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్యారెట్ ఆకుల నుండి చిన్న చిన్న కాడలను తీసేసి, కేవలం ఆకులను మాత్రమే పళ్లెంలో సిద్దంగా ఉంచుకోవాలి.

రెండు టొమాటో పండ్లు, ఒక ఉల్లిగడ్డ, ఒక వెల్లుల్లిని ఒలిచి పొట్టు తీసి, తగినన్ని పచ్చిమిర్చి, లేత కరివేపాకులు కాసిన్నిచేర్చి, నాలుగింటిని ముక్కలుగా చేసుకుని రోట్లో వేసి దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

టొమాటో పండ్లలో ఉండే నీటి వల్ల పచ్చడి మెత్తగా రుబ్బుడు అవుతుంది. ప్రత్యేకంగా నీరు కలుపకూడదు.
ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు… ఇవన్నీ తగినంత మోతాదులో తీసుకుని రోట్లో/మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ముందుగానే తయారు చేసి, ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తరువాత క్యారెట్ టొమాటో గుజ్జులో, ఈ పొడుల మిశ్రమాన్ని వేసి మళ్ళీ రోట్లో / మిక్సీలో వేసి బాగా కలిసేలా తిప్పుకోవాలి. అంతే! క్యారెట్ ఆకుల రోటి పచ్చడి రె‘ఢీ’.

సేంద్రీయ ముడిబియ్యపు వేడి అన్నంలో, క్యారెటాకుల పచ్చడి కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. అవసరమైన వారు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కాస్తా వేసుకుని తినవచ్చు. లేదా పచ్చడి తయారీలోనే, గుప్పెడు నువ్వులు లేదా వేరుశనగలు పచ్చివే వేసి రుబ్బుకోవచ్చు.
ఇక నూనె, నెయ్యి అవసరం పడదు.

వంటలకు కొత్తవారు అయితే, ఉప్పు కారం ఎప్పుడైనా సరే, మొదట తక్కువ వేసుకుని, రుచి చూసుకుంటూ అవసరం అనుకుంటే, మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పును ఎంత తగ్గిస్తే, అంత ఆరోగ్యం.
ఏ రోజుకు ఆరోజు తయారు చేసి వాడుకోవాలి!

  • రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

*రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లి – నిమ్మ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, రెండు నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. అయిదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చతుర్రుచుల (పులుపు, కారం, ఉప్పు, ఉల్లిఘాటు) పచ్చడి రెడీ!

ఉల్లిగడ్డలను సన్నగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. వీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. కొద్దిగ పసుపు కలిపి అన్ని ముక్కలకు పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఎవరి రుచిని బట్టి వారికి కావలసినంత కారం, ఉప్పు అదే గిన్నెలో వేసి, స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ‘ముంతకిందిపప్పు’ అని, జాతరలలో కలుపుతారు కద, అలా బాగా కలుపుకోవాలి.

వేడి వేడి అన్నంలో, ఈ ‘ఉల్లి – నిమ్మ’ పచ్చడి వడ్డించుకుని తింటే, వండిన వంటలన్నీ బలాదూర్!

ఉల్లిపాయలలో పీచు, నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పసుపులో ఆరోగ్యం అన్ని కలగలిపిన సహజ పచ్చడిది.

వేడి చెయ్యనక్కర లేదు, వేపడం కూడా అవసరం లేదు, వండవలసిన అవసరం అసలే లేదు. నిముషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.

వంటలు చేసుకునే స్టూడెంట్స్, సింగిల్‌గా ఉంటున్న ఉద్యోగులు, సమయం తక్కువ ఉన్నవారు, నేచురల్ పద్ధతిలో ఇలా ట్రై చెయ్యడం బెటర్. పోషకాలు, ఫ్లేవర్లు మాత్రమే కాకుండా, చాలా ముఖ్యమైన జీవశక్తి పూరితమైన పచ్చడి ఉల్లి – నిమ్మ పచ్చడి

  • రచన : కావూరి మారుతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల తయారీ, ప్రాముఖ్యత మరియు వినియోగం

ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం

ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:

  • నేల సారవంతత పెరుగుతుంది.
  • పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
  • నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
  • రసాయన అవశేషాలు తగ్గుతాయి.
  • ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
  1. జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి
    జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.
    తయారీకి కావలసిన పదార్థాలు
  • దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
  • ఆవు మూత్రం – 10 లీటర్లు
  • బెల్లం – 2 కిలోలు
  • శనగపిండి – 2 కిలోలు
  • పొలం మట్టి – 1 కిలో
  • నీరు – 200 లీటర్లు

ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
  • మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
  • పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
  • నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
  1. పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం

పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి.
ఉద్యాన పంటలపై ప్రభావం
పుష్పించే శాతం పెరుగుతుంది.

  • పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
  • పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
  • కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
    ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
  1. వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ

వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది.
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • కూరగాయలలో అధిక దిగుబడి.
  • పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
  • పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
  • మొక్కల వేర్ల అభివృద్ధి.
  1. వర్మివాష్

వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
వినియోగం
5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.

  • నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
  • ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
  1. బీజామృతం
    ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు
  • విత్తన వ్యాధుల నివారణ.
  • మొలక శాతం పెరుగుదల.
  1. వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు
    ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    ప్రయోజనాలు
  • తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
  • పర్యావరణానికి హాని లేకపోవడం.
  • ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
  1. అగ్నాస్త్రం
    అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని.
    పదార్థాలు:
    • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు
    • వేపాకు పేస్ట్: 5 కిలోలు
    • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు
    • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు
    • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో

తయారీ విధానం:

  1. ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
  2. ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
  3. తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
  4. చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.

  1. బ్రహ్మాస్త్రం.
    వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’.
    కావలసిన పదార్థాలు:
    • ఆవు మూత్రం: 20 లీటర్లు
    • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)

తయారీ విధానం:

  1. ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
  2. పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
  3. పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
  5. 48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి.
• ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు

  1. ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు
• చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు)
• నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి)
• ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది

తయారీ విధానం

  1. చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
  2. బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
  3. మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
  4. నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
  5. గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
  6. వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.

ఉపయోగించేపద్ధతి:
స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి.
• మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు.
• సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.

ఉపయోగాలు
• మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.
• ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి.
• పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది.
• నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

  1. మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు
• పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ).
• ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు).
• త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు.
గుంత లేదా కుప్ప పద్ధతి

  1. స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
  2. మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
  3. రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
  4. పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
  5. పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి.
    • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు.
    • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి.
    • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.

ఎరువు తయారీ సమయం
వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర

సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

ముగింపు
ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.

డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని
డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291

Read More

వండని వంట… క్యారెట్ పచ్చడి

క్యారెట్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

  • ఒక పెద్ద క్యారెట్ దుంప
  • రెండు ఉల్లిగడ్డలు
  • ఒక వెల్లుల్లి గడ్డ
  • ఆరు పచ్చి మిరపకాయలు
  • తగినంత ఉప్పు
  • జీలకర్ర, చింతపండు లేదా నిమ్మరసం
  • సమయానికి ఉంటే, కొత్తిమీర ఆకులను వేసుకోవచ్చు.

అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.

మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.

ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.

క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.

అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

చిన్న రోలు, నూరే రాయి ఉంటే సరిపోతుంది.

పొయ్యి మీద వండే పనే లేదు.

  • శ్రీమతి జిట్టా జ్యోతి
Read More

ముల్లంగి పెరుగు పచ్చడి

పెరుగు పచ్చడి పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే కానీ, అందులో కూడా మళ్ళీ పోపు పెడతారు. పోపు వల్ల నూనె కాలుతుంది. కాలిన నూనె, క్యాన్సర్ కారకం. పెరుగు పచ్చడిలో ఉప్పు నూనె అవసరం లేదు.
లీటరు పెరుగును గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి.

రెండు ముల్లంగి దుంపలను మట్టి లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి ‘కోరు’ మీద సన్నగా తరుగాలి. ఆ తరిగిన కోరును పెరుగు గిన్నెలో వేసి బాగా కలపాలి.ఉంటే ఒక టొమాటో పండును చిన్నచిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి. కాస్తా పసుపు వెయ్యాలి.కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలు చేసి వెయ్యాలి. తగినన్ని పచ్చడి మిరపకాయలను చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చడిలో వెయ్యాలి. ఉల్లిగడ్డ తరుగు కూడా వెయ్యాలి. లేత కరివేపాకును ముక్కలు చేసి కలపాలి. ముల్లంగి దుంపల్లో సోడియం ఎక్కువ ఉంటుంది కనుక చప్పగా కాకుండా ఉప్పగానే ఉంటుంది.

అయినా ఉప్పు లేకుండా తినలేని వారు, స్వల్పంగా రాక్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి, ఇంగువ పొడిని కూడా కలుపుకోవచ్చు. మరింత రుచికరంగా ఉంటుంది.

నిజానికి పెరుగు పచ్చడిలో ఉప్పు అవసరం లేదు.పెరుగులో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది. ఉప్పు లేకుండా కూడా రుచికరంగా ఉంటుంది.

ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని, వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. ఎక్కువ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. పెరుగు పచ్చడి ఉంటే, మరో కూర అవసరం లేదు.

  • స్నేహా తిలక్
Read More

‘అమృత మట్టి’తో అమృతాహారం!

పర్యావరణానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించని పద్థతుల్లో పంటల సాగు ఇప్పటి అవసరం. అంతేకాదు.. పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా కలిగిన అధిక దిగుబడులు సాధించాలి! రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి!! ఈ లక్ష్యాల సాధనకు రైతులకు దారి చూపేదే ‘అమృత మట్టి’తో పర్యావరణ అనుకూల (నేచ్యు-ఎకో) సేద్యం. సేంద్రియ సేద్యాన్ని మరో మెట్టుపైన నిలబెడుతుంది ఈ సేద్య పద్ధతి.

పర్యావరణానికి హాని లేకుండా, వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా సాగు చేయటమే నేచ్యు-ఎకో పద్ధతి ప్రత్యేకత. ‘అమృత మట్టి’ ద్వారా ఈ పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని పరీక్షల్లో నిరూపితమైంది. సంప్రదాయ (రసాయనిక) పద్ధతుల్లో పండించే కూరగాయలతో పోల్చితే అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయలు అధికంగా పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి ఐదు రెట్ల మాంసకృత్తులు, 20 శాతం కాల్షియంను అదనంగా కలిగి ఉంటాయి. సాధారణంగా మాంసాహారంలోనే లభించే విటమిన్ బి-12 ఉనికిని అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయల్లో కనుగొనడం విశేషం.

ఉత్పాదకాలను డబ్బు పోసి కొని వాడడానికి బదులుగా.. పొలాల చుట్టు పక్కల్లో లభించే వనరులను ఉపయోగించుకోవటం, సాగు భూమికి ఎలాంటి నష్టం జరగకుండా మంచి దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ పద్ధతికి రూపకల్పన చేశారు ప్రొఫెసర్ శ్రీపాద్ ఎ.దబోల్కర్.

అమృతమట్టిని ఉపయోగించి… భూమిలో జీవన ద్రవ్యం, సేంద్రియ కర్బనాలను పెంచటం ద్వారా రసాయనిక వ్యవసాయంలో కన్నా తొలి ఏడాదే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని ప్రొ. దబోల్కర్ నిరూపించారు. చీడ పీడల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు దబోల్కర్ వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనిక కీటక నాశనులు, క్రిమి సంహారకాల పిచికారీ అవసరం లేదు. పోషకాలను అందించేందుకు రసాయనిక ఎరువులను వాడాల్సినవసరం లేదు. పొలం అంతటా మట్టి పరుపులను (రైజ్డ్ బెడ్స్) తయారుచేసుకుని అమృత జలాన్ని, అమృత మట్టిని వినియోగించి పంటలు పండిస్తారు.

అమృతమట్టి తయారుచేసే పద్ధతి….
అమృతమట్టి తయారీ వివిధ దశలతో కూడుకున్న ప్రక్రియ. దీనికోసం ముందుగా అమృత జలాన్ని తయారు చేసుకోవాలి.

అమృత జలం తయారీ విధానం:
ఒక లీటరు గోమూత్రం, ఒక కిలో తాజా ఆవు పేడ, 50 గ్రా.బెల్లాన్ని, 10 లీటర్ల నీటిని ఒక తొట్టెలో కలపాలి. మూడు రోజులు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు మూడుసార్లు కలపాలి. మూడురోజుల తర్వాత పదిపాళ్లు నీటికి ఒక పాలు అమృత జలాన్ని కలిపి పంటలకు వాడుకోవచ్చు.

అమృతమట్టి తయారీ విధానం:
తగినంత అమృత జలం పోసిన పాత్రలో పచ్చి, ఎండిన ఆకులు కలిపి వేసి 24 గంటలపాటు ఉంచాలి.
బెడ్‌ల తయారీ: 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలా బెడ్‌ను నిర్మించుకోవాలి. బెడ్‌లో మె°దటి పొరగా ఆకులు నానబెట్టిన అమృత జలాన్ని పోయాలి. దీనిపైన నేలపై పొర నుంచి సేకరించిన మట్టిని ముందు నేలపై పొరలాగా పరవాలి. దీనిపైన మళ్లీ అమృత జలాన్ని పోయటం, పైన మట్టిని పరవటం ఇలా… బెడ్‌ను పొరలు పొరలుగా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించాలి.
ప్రతి వారం రోజులకు బెడ్‌లో ఉన్న కంపోస్టును కలపాలి. సూక్ష్మజీవుల చర్యలు జరిపేందుకు తగినంత తేమ ఉండేలా అమృత జలంతో బెడ్‌ను తడుపుతుండాలి. ఈ మిశ్రమం పూర్తిస్థాయి కంపోస్టుగా మారేందుకు 30 రోజుల సమయం పడుతుంది.

విభిన్న రకాల పంటలకు చెందిన విత్తనాలను ఎంచుకొని బెడ్‌పై నాటుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను అమృత జలంలో ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత బెడ్‌లోఉన్న కంపోస్టుపై విత్తుకోవాలి. విత్తిన తర్వాత ఆకులతో ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పై అమృత జలాన్ని పిచికారీ చేయటం ద్వారా విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను అందించాలి.

21 రోజుల పాటు ఇలా చేయటం ద్వారా అన్ని విత్తనాలు మొలకెత్తేలా చూడాలి. ఆ తరువాత వివిధ దశల్లో పెరిగే మొక్కలకు కత్తిరింపులు చేపట్టాలి. మొలకెత్తిన 21 రోజులకు మొక్కల్లో పావు వంతు భాగాన్ని కత్తిరించాలి. 42వ రోజు రెండోసారి, 63వ రోజు పూత దశలో మూడోసారి కత్తిరించాలి. మూడో కత్తిరింపులో బెడ్‌పైన మొక్కలను అర అంగుళం వదిలి పైభాగం మొత్తం కత్తిరించాలి. ఇలా కత్తిరించిన భాగాలను అమృత జలంలో 8 గంటలు నానబెట్టి అమృత మట్టిలో కలపాలి. బెడ్స్‌పైన ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పైన అలా తయారైన కంపోస్టును వారానికి ఒకసారి కలపాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే… అమృత మట్టి సిద్ధమైనట్టే.

Read More

వండని వంట… పండు మిర్చి పచ్చడి

వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.

ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.

మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!

అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!

వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!

అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!

మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.

కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.

పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More