నాణ్యమైన విత్తనముతోనే అధిక దిగుబడులు మరియు విత్తనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నాణ్యమైన విత్తనంలో మంచి దిగుబడికి తోడ్పడే అన్ని లక్షణాలు ఇమిడి ఉంటాయి. అందుచేత విత్తన నాణ్యతపై దిగుబడి ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇతర వ్యవసాయ ఉత్పాదకాలతో పాటు నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల అధిక లాభాలు పొందుతారు. కావున రైతులు నాణ్యమైన విత్తనము లక్షణాలపై అవగాహన కలిగి ఉండడం మంచిది.

నాణ్యమైన విత్తనంకి ఉండాల్సిన లక్షణాలు:
శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి పరిచే వంగడాలు ఎంతో మెరుగైనవి కావున వాటి నాణ్యతా ప్రమాణాలు కూడా ఖచ్చితంగా ఉంటే వాటిని రైతులు పూర్తి స్థాయిలో వినియోగిం చుకున్నవారవుతారు.

జన్యుస్వచ్ఛత:
ఒక రకం విత్తనం ఉపయోగించి అదే రకమైన విత్తనం పొందగలిగితే అది జన్యుస్వచ్ఛత కలిగి ఉన్న విత్తనంగా గుర్తించవచ్చు లేదా శాస్త్రవేత్తలు ఏవైతే లక్షణాలను వాటిలో ప్రవేశపెడ తారో అవే లక్షణాలు సంపూర్ణంగా ఆ విత్తనం కలిగి ఉంటే అది జన్యుపరంగా స్వచ్ఛమైందిగా చెప్పవచ్చు.

జన్యుస్వచ్ఛత ఆధారంగా విత్తనాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి…
(1) బ్రీడరు సీడ్ : నూరు శాతం జన్యుస్వచ్ఛత కలిగి ఉన్న విత్తనం శాస్త్రవేత్తలు ఏవైతే రకాలను ఉత్పత్తి చేస్తారో వాటి నుంచి లభించిన అత్యంత స్వచ్ఛమైన విత్తనమే ఈ బ్రీడరు సీడ్ ఈ విత్తనం ఖచ్చితంగా శాస్త్రవేత్త లేదా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసినదై ఉంటుంది. దీనిని బంగారు పసుపు రంగు లేబుల్/ట్యాగ్ తో గుర్తిస్తారు.

(2) ఫౌండేషన్ సీడ్ : బ్రీడరు సీడు నుంచి ఉత్పత్తి చేసిన రెండో తరం విత్తనం కాబట్టి దీని జన్యుస్వచ్ఛత 98 శాతం పైనే ఉంటుంది, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో దీనిని ఉత్పత్తి చేసి, తెలుపు రంగు ట్యాగ్ తో గుర్తిస్తారు. దీనిని విత్తనోత్పత్తి చేపట్టే రైతులకు అందజేస్తారు.

(3) సర్టిఫైడ్ సీడ్ : రైతులు పంటలు పండించడానికి ఉపయోగించుకునే విత్తనమే సర్టిఫైడ్ సీడ్. ఫౌండేషన్ సీడ్ నుంచి విత్తనోత్పత్తి చేసే రైతులతోగానీ, ప్రైవేటు విత్తనోత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన మూడోతరం విత్తనం. దీని జన్యుస్వచ్ఛత 98 శాతంగా ఉండాలి. విత్తన ధృవీకరణ సంస్థ వారు విత్తనోత్పత్తిదారుల క్షేత్రాలను తనిఖీ చేసి దీనిని ధృవీకరిస్తారు. నీలి రంగు ట్యాగ్ ద్వారా దీనిని గుర్తించాలి.

4) ట్రూత్ ఫుల్ లేబుల్ సీడ్: దాదాపుగా రైతులు వినియోగించుకునే విత్తనం ఇది. కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే తమ విత్తనాలను ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తి చేస్తాయి. వాటిని సర్టిఫైడ్ సీడ్ అని అంటాం. కానీ దాదాపుగా ప్రైవేటు విత్తనోత్పత్తి దారులు తమ స్వంత బాధ్యత వహించి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే ట్రూత్ ఫుల్ లేబుల్ సీడ్ అని అంటారు. రైతు ఆయా ఉత్పత్తిదారులపై నమ్మకంతోనే వీటిని కొనాల్సి ఉంటుంది. ఇది ఆకుపచ్చ రంగు ట్యాగు కలిగి ఉంటుంది.

భౌతిక స్వచ్ఛత: ఎంపిక చేసుకున్నవంగడం (రకం) అదే రకమైన విత్తనాన్ని కలిగి ఉండి తాలు గింజలు, మట్టి పెళ్లలు, దుమ్ము, ధూళి, కలుపు గింజలు, ఇతర రకాల విత్తనాలు (గింజలు) లేకుండా ఉంటే ఆ విత్తనం భౌతిక స్వచ్ఛత కలిగి ఉన్నట్లుగా చెప్ప వచ్చు అన్ని పంటల్లో భౌతిక స్వచ్ఛత 98 శాతంగా ఉండాలి. అంటే ఒక రకం విత్తనం ఎంపిక చేసుకుంటే నూరు విత్తనాలకు కనీసం 98 విత్తనాలు అదే రకానికి చెందినవై ఉండాలి.

సర్టిఫైడ్ సీడ్లలో జన్యుస్వచ్ఛతః

సర్టిఫైడ్ జన్యుస్వచ్ఛత (%)
సూటిరకాలు 98
సంకర రకాలు 95
పత్తి, వంకాయ, టొమాటో సంకర రకాలు 90
ఆముదం (సంకర రకాలు) 85

మొలక శాతం: మొలక శాతం అధికంగా ఉంటే అది నాణ్యమైన విత్తనంగా చెప్పవచ్చు. విత్తనం వేసిన తర్వాత వచ్చే మొలకల ఆధారంగా మొలక శాతం లెక్కించబడుతుంది. మొలక శాతంపైనే మొక్కల సాంద్రత ఆధారపడి ఉంటుంది. పంటలను బట్టి కనీసం 70-90 మొలకశాతం ఉండేలా చూడాలి.

పంట మొలకశాతం (%)
మొక్కజొన్న 90
వరి, గోధుమ 80
జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర 75
వేరుసెనగ, ఆముదం, పొద్దుతిరుగుడు 70

సాధారణంగా విత్తనం ఉత్పత్తయిన 9 నెలల నుంచి మొలక శాతం తగ్గు తుంది. రైతులు విత్తనం కొనేముందు. విత్తన తయారీ తేదీని పరిశీలించి 9-12 నెలలు దాటకుండా చూసుకోవాలి.

రైతుస్థాయిలో మొలక శాతం కనుగొనే పద్ధతి:
తక్కువ ఖరీదున్న విత్తనాలైతే 200 చొప్పున, బాగా ఖరీదైన విత్తనాలైతే 50-100 చొప్పున రెండు దఫాలుగా లెక్కించి పక్కన పెట్టుకోవాలి. ఏదై నా దినపత్రికను రెండు పొరలుగా మడిచి నీళ్ళతో తడపాలి. ఇలా తడి పిన పేపరుపై లెక్కించిన విత్తనాలను సమానంగా పరచాలి. దీనిపై మరొక తడి పేపరు కప్పి చాపమాదిరిగా చుట్టి దారంతో రెండువైపులా కట్టాలి. దీనిని ఏటవాలుగా ఒక ట్రేలో పెట్టి తడి ఆరకుండా నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా వారం రోజులు ఉంచిన తరువాత, పేపరు జాగ్రత్తగా విప్పి, వేరు, కాండం సమా నంగా ఉన్న మొలకలు మాత్రమే లెక్కించాలి. వేర్లు మరీ పొట్టిగా ఉండి కాండం పొడవుగా ఉన్నా లేదా కాండం బాగా పొట్టిగా ఉండి వేర్లు పొడవుగా ఉన్నా వాటిని లెక్కించ రాదు. ఉదాహరణకు 100 విత్తనా లకు 80 విత్తనాలు మొలకెత్తితే 80 మొలక శాతం ఉన్నట్లు.

తేమశాతం: విత్తనానికి తగినంత తేమ అందితే అది మొలకెత్తుతుంది. తేమ శాతం మరీ ఎక్కువగా ఉంటే విత్తనం నిల్వకాలం బాగా తగ్గిపోయి, కుళ్ళిపోయే అవకాశముంటుంది. ఎక్కువ కాలం విత్తనాన్ని నిల్వ చేసు కోవాలంటే తేమ శాతం ఎంత తక్కు వగా ఉంటే అంత మంచిది, వరి, మొక్కజొన్న, సజ్జ మొదలగు ఆహార పంటల్లో 10-12 శాతం, నూనెగింజలు, అపరాల విత్తనాల్లో 9-10 శాతం, కూరగాయ విత్తనాల్లో 7-8 శాతంగా ఉండాలి. అన్ని రకాల విత్తనాల్లో తేమ 14 శాతానికి మించరాదు.

విత్తనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వీలైనంత వరకు ధృవీకరించిన (సర్టిఫైడ్ సీడ్) విత్తనాన్నే రైతులు కొనుగోలు చేయాలి.
  • ట్రూత్ ఫుల్ లేబుల్ ఉన్న విత్తనా లను కొనాలనుకుంటే లేబుల్ ను పరిశీలించి జన్యుస్వచ్ఛత, మొలక శాతం, భౌతిక స్వచ్ఛత వంటి వివరా లను క్షుణ్ణంగా పరిశీలించాకే కొనాలి.
  • లాట్ నెంబరు, విత్తనం ఉత్పత్త యిన తేదిని చూసుకోవాలి.
  • లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనం కొనాలి.
  • డీలర్ల వద్దనుంచి బిల్లును తీసుకో వడం తప్పనిసరి, తరువాత మొలక /శాతం తగ్గినా, కల్తీ ఉన్నట్లు అనిపించినా, ఆ బిల్లు ఆధారంగా సమీపం లోని వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
  • ధృవీకరించిన సూటి రకాల విత్త నాలను ఒకసారి కొనుగోలు చేసిన తరువాత (మూడేళ్ళ పాటు) రైతులు మెరుగైన మొక్కల నుంచి సేకరిం చిన విత్తనాలను నిల్వ చేసుకొని మూడేళ్ల పాటు ఉపయోగించుకోవచ్చు అదే సంకర రకాలైతే ప్రతీసారి మారుస్తూ ఉండాలి.

N. స్వప్న (7816076871), Ch. ప్రగతి కుమారి, టి. చైతన్య, Dr. స్వర్ణలత, కె. కవిత, Dr. వి.అనిత, వ్యవసాయ కళాశాల, పాలెం.

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More