పశువుల్లో గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్)
దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణనష్టం అంతగా ఉండదు. ఎద్దులు వ్యవసాయ పనులు సరిగా చేయవు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
వ్యాధి ఎలా వస్తుంది?
వ్యాధి సోకిన ఆవులు, గేదెల పాలద్వారా దూడలకు వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
- జ్వర తీవ్రత 104-106 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగి పశువులు నీరసించి పోతాయి.
- పశువుల నోటిలో, చిగుళ్ళపై పొక్కులు ఏర్పడటం చేత పశువుల మేత, నీరు తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుండి చొంగకారుతూ ఉంటుంది.
- నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 3, 4 వారాల్లో బొబ్బలు చితికి పుండ్లుగా మారి చర్మము గరుకుగా తయారవుతుంది.
- పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
- గిట్టలలో పుండ్లు ఏర్పడటం వలన ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవు.
వ్యాధిని ఎలా నివారించాలి?
- వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి.
- పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
- వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను, గడ్డితో కాల్చివేయాలి.
- చనిపోయిన పశువును, సున్నపు గోతిలో పూడ్చాలి
- వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు త్రాగించకూడదు.
- మార్చి – ఏప్రిల్ మరియు ఆగస్టు – సెప్టెంబరు మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.
చికిత్స:
- కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా నీమ్లెంట్, వేపనూనె పూయాలి.
- నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి.
- డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.
కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150

