జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More

జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

స్వల్ప-మధ్యకాలిక పంటలకు ప్రాధాన్యం

ఈ ఏడాది ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఖరీఫ్ పంట నష్టాలను తగ్గించేందుకు కేంద్రం నడుం బిగించి వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పంటలు వాతావరణ పరిశీలన సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసింది. రాబోవు అనావృష్టి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, ఆహార భద్రత, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అంతర్ మంత్రిత్వశాఖల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప, మధ్యకాలిక పంటలకు ప్రాధాన్యం ఇస్తూ విత్తన నిల్వలను నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

Read More

గుడ్లు తలసరి వినియోగం 103 నుంచి 106కి పెరిగింది

మన దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ (చైనా తర్వాత) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి (2024-25 లో) తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంతకుముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉంది. ప్రధానంగా 2024-25 లో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పశు సంవర్ధకశాఖ సోమవారం ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు…
2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (18.37%), తమిళనాడు (15.63%), తెలంగాణ (12.98%), పశ్చిమ బెంగాల్ (10.72%), కర్ణాటక (6.67%) నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలే 64.37% వాటాను కలిగి ఉన్నాయి. 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే సగానికి (50 శాతానికి పైగా ఉత్పత్తి అవుతుండటం విశేషం.
2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగం ఏడాదికి 79 నుంచి 106 గుడ్లకు పెరిగింది. గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు (106) ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (516), తెలంగాణ (510), తమిళనాడు (302), హరియాణా (299), పంజాబ్ (164) తలసరి వినియోగంలో ముందున్నాయి.

పురోగతికి దోహదపడిన అంశాలు..
దేశంలో పౌష్ఠికాహారం పై అవగాహన పెరగడంతో పాటు ఆధునిక కోళ్ల ఫారాల్లో శాస్త్రీయ విధానాలు, మెరుగైన దాణా, వ్యాధి నిరోధక టీకాలను వినియోగించడం వల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
మాంసం, ఇతర ప్రొటీన్ ఆహారాలతో పోలిస్తే, గుడ్డు సామాన్యులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. గుడ్లలోని అద్భుత పోషక విలువల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు గుర్తిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించడం... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేయడం గుడ్ల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి.
Read More

త్రివిధ సజ్జతో అనేక ప్రయోజనాలు

ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వేపెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్) రకాన్ని ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా దానిని విడుదల చేశారు. సాధారణ హైబ్రిడ్ రకాలు రెండు మాతృకల నుంచి తయారైతే, ఈ త్రివిధ హైబ్రిడ్ మూడు మాతృకల కలయికతో రూపొందింది. అధిక దిగుబడి, నాణ్యమైన పశుగ్రాస లక్షణాలు చేకూరుతాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్, ప్రధాన శాస్త్రవేత్త ఎస్.కే. గుప్తా మంగళవారం వెల్లడించారు. త్రివిధ సజ్జ రకం.. ఏటా 400 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉండే రాజస్థాన్, గుజరాత్, హరియాణాల్లో మెట్ట ప్రాంతాలకు అనుకూలమైందన్నారు. దానిని మరింత అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు. ఈ సజ్జ సగటున హెక్టారుకు 2,230 కిలోల దిగుబడి వచ్చిందన్నారు.

Read More

‘సైలో’ పద్ధతిలో పంట ఉత్పత్తులను రెండేళ్ళ వరకు నిల్వ చేయవచ్చు

‘సైలో’ పద్ధతిలో పంటలను రెండేళ్ల వరకు సురక్షతంగా నిల్వ చేసుకునే వీలుందని, తెలంగాణా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంటిగ్రేటెడ్‌ క్లీనర్లు, డ్రయర్ల సాయంతో మక్కలు, వరి, సోయాబీన్‌ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు, ధాన్యాన్ని పరిరక్షంచేందుకు దీన్ని అమలు చేయనున్నాం. ఎక్కువ కాలం నిల్వ ఉన్న ధాన్యం, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read More

ఆహార పదార్థాలలో రసాయన అవశేషాలను గుర్తించే పరికరం

ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తుల వాడకం పెరిగింది. ఎక్కడ చూసినా సేంద్రియం పేరిటే అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి నిజమైన సేంద్రియ ఉత్పత్తులను గుర్తించేందుకు వీలుగా ఆహార పదార్థాల్లో క్రిమి సంహారక అవశేషాలను గుర్తించే పరికరాన్ని బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకులు రూపొందించారు. ఆహార పదార్థాలు, పండ్లు, టమాటాలకు సూక్ష్మ పట్టీని అతికించి ఈ పరికరాన్ని దగ్గరికి తీసుకెళ్తే చాలు.. క్రిమి సంహారక అవశేషాలుంటే రెడ్‌లైట్‌ వెలుగుతుంది. నార్వేలోని ఆర్కిటిక్‌ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రొ. సంకేత్‌ గోయల్‌ నేతృత్వంలో డా.పి. సాయికుమార్‌, పరిశోధక విద్యార్థి రేష్మ, రజనీశ్‌ కౌర్‌లు దీన్ని తయారు చేశారు. దీనికి కెమిలు మినో మీటర్‌ అని పేరు పెట్టారు. పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ మైక్రో మెకానికల్‌లో ప్రచురితమైంది. ఈ పరికరాన్ని వాణిజ్య అవసరాలకు రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రొ. సంకేత్‌ గోయల్‌ వివరించారు.
Read More