సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు

తెలంగాణా రాష్ట్రంలో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో పండించే ప్రసిద్ధి పొందిన సజ్జాపూర్ చామగడ్డకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ఇవ్వాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయంలో మంగళవారం దరఖాస్తు చేసుకుంది. ఈ చేమ దుంప ప్రపంచంలోనే అరుదైందని, అత్యంత పోషకవిలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగి ఉందని వివరించింది. జీఐ కోసం దరఖాస్తు చేసిన మొట్ట మొదటి దుంప రకంగా ఇది నమోదైంది. సజ్జాపూర్ చామదుంప విశిష్టతను గుర్తించిన ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్త పిడిగం సైదయ్య దీనిపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు టీజీవోఎస్‌టీ సహకారం అందించింది. ఈక్రమంలో చామదుంప పుట్టుక, దాని రకపు లక్షణాలు, జీవరసాయన ప్రొఫైలింగ్, సాగు పద్దతులు, డీఎనఏ, ఇతర విశిష్ట లక్షణాలకు భౌగోళిక సంబంధాలు వంటి కీలక సమాచారాన్ని సేకరించారు. సంకర లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రకాల మాదిరిగా కాకుండా.. సజ్జాపూర్ చామదుంపను స్థానిక రైతులు శతాబ్దానికి పైగా సంప్రదాయ శాఖీయ పద్ధతుల ద్వారా సంరక్షించి, వ్యాప్తి చేస్తున్నారు. ఈ వివరాల నివేదికతో జీఐ నిపుణుడు శుభజీత్ సాహా ద్వారా జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేశారు. దరఖాస్తును ఆమోదించిన రిజిస్ట్రీ.. పరిశీలనకు స్వీకరించినట్లు వెల్లడించింది.

Read More

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో 11 ప్రాజెక్టులు పూర్తి

ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు రాబోయే రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీంతో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘2021లో వంశధార ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును గెజిట్ ప్రచురణ చేయించడంలో సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. కేంద్ర మంత్రి, కేంద్ర జలశక్తి అధికారులతో తరచూ సంప్రదింపులు జరిపి ఇది సాధించారు. ఫలితంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో జలవనరులశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఓఎస్డీ కె.వి.ఎల్.ఎన్. చౌదరి, ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

పీఎం ఆషా పథకం కింద మొక్కజొన్న రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఏపీని ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100% కేంద్రమే భరించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ. 2,400 కంటే ఇది చాలా తక్కువ. రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి’ అని వివరించారు. ‘రాష్ట్రంలో 42.06 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. నాఫెడ్, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి. జూన్ 2026 వరకు పథకాన్ని పొడిగించాలి’ అని సీఎం కోరారు.

Read More

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్‌కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read More

*వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలసాగు*

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నుంచి మే 23 వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఇందులో భాగంగా వ్యవసాయ అదికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు 200 బృందాలుగా ఏర్పడతారు. ప్రతి వారం 400 గ్రామాల్లో పర్యటిస్తారు. మొత్తం నాలుగు వారాల్లో 1,600 గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. వానాకాలం పరిస్థితులను వివరించి, ఆయా గ్రామాల్లో పంటల ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేసి.. పంటల సాగుపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల, ఇతర జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంబిస్తారని అగ్రివర్సిటీ వీసీ జానయ్య తెలిపారు.

Read More

సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర

సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా విజయవాడకు చెందిన వనఎర్త్ వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ వాట్సప్ గ్రూప్) సభ్యులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. హ్యాపీసండేలో భాగంగా నగర పాలక సంస్థ సహకారంతో స్థానిక ఇందిరా గాందీ స్టేడియంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి ఆదివారం నేరుగా రైతులే విక్రయించేలా ఏర్పాటు చేశారు. దీని ద్వారా అటు రైతులకు ఆదాయం వస్తుండగా.. ఇటు ఉదయపు నడకకు వచ్చే వారికి రసాయనాలు వాడని కూరగాయలు, ఆకుకూరలు లబిస్తున్నాయి. మిద్దెతోటలు పెంచే ఔత్సాహికుల ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. నాలుగు వారాల కిందట ఈ కార్యక్రమం మొదలు పెట్టగా మంచి స్పందన వస్తోందని సభ్యులు చెబుతున్నారు.

Read More

అధిక దిగుబడిని ఇచ్చే కూరగాయల విత్తనోత్పత్తి

అధిక దిగుబడులు ఇచ్చే కూరగాయల విత్తనాల ఉత్పత్తిని తతెలంగాణా రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్నట్లు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా కూరగాయ పంటల్లో ఈ విత్తనోత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పరిశోధన, విస్తరణ మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దెందుకు ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. సాంకేతికత, ఆధునికత, యాంత్రీకరణ ద్వారా కూరగాయల సాగుకు ఊతమిస్తున్నాం. జీవ ఎరువులు, పురుగు మందుల లభ్యత పెంచుతాం. పంట నష్టాలను నివారించేందుకు వాతావరణ ఆధారిత ఉద్యాన సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తాం” అని రాజిరెడ్డి తెలిపారు.

Read More

ఏపీ మష్రూమ్ మిషన్‌కు కార్యాచరణ

ఆంధ్రరాష్ట్రంలో రూ. 12,960 కోట్లతో ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31 అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా 40% రాయితీ అందిస్తారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుట్టగొడుగులను కూడా వ్యవసాయ ఉత్పత్తిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏడాదికి లక్ష టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎం నిర్దేశించారు. రాయలసీమ ఉద్యానహబ్‌లో భాగంగా ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన వాతావరణానికి అనుకూలమైన మిల్కీ, వరి గడ్డి ఆధారిత రకాల నుంచి బటన్ మష్రూమ్ రకాల సాగును ప్రోత్సహిస్తారు. రోజుకు 10 టన్నుల సామర్థ్యంతో కూడిన యూనిట్లతో పాటు చిన్న యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ కింద ఏపీ మష్రూమ్ మిషన్ ద్వారా ప్రోత్సాహకాలిస్తారు. పుట్టగొడుగుల ఉత్పత్తిలో (ఏటా 45 వేల టన్నులతో) బిహార్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్త ఉత్పత్తిలో 11% ఆ రాష్ట్రానిదే. బటన్, ఆయిస్టర్, మిల్కీ రకాల సాగులో అగ్రస్థానంలో ఉంది. బిహార్ తర్వాత స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హరియాణ, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. దేశీయ ఉత్పత్తిలో వైట్‌బటన్ వాటా అధికం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముందంజలో ఉంది. 2023-24 గణాంకాల ప్రకారం అక్కడ ఏడాదికి 16 వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది.

ఏపీ పుట్టగొడుగుల మిషన్
వార్షిక ఉత్పత్తి లక్ష్యం: 67,500 టన్నులు
అవసరమైన స్థలం: 81 కోట్ల చదరపు అడుగులు
యూనిట్ల సంఖ్య (ఒక్కోటి 5 వేల అడుగులు):1,62,000
మొత్తం పెట్టుబడి అంచనా: రూ. 12,960 కోట్లు
రాయితీ (40%): రూ. 5,184 కోట్లు
కేంద్రం వాటా (60%): రూ. 3,110 కోట్లు
రాష్ట్ర వాటా (40%): రూ. 2,074 కోట్లు

Read More

50 శాతం మొక్కజొన్న పంటకు మద్దతు ధర

తెలంగాణా చరిత్రలో తొలిసారిగా మొక్కజొన్న పండిన పంటలో 50 శాతం మేరకు… 14.89 లక్షల టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలుకు గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ.4,000 కోట్ల రుణం పొందడానికి బ్యాంకు పూచీకత్తు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో సుమారు 11,21,494 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. ఎకరాకు సగటు దిగుబడి 26.57 క్వింటాళ్లని అంచనాలు ఉన్నాయి. దీనిప్రకారం మొత్తం 29.79 లక్షల టన్నులు రావచ్చు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400గా మద్దతు ధర నిర్ణయించింది. మార్కెట్లలో రూ.1,760 వరకు మాత్రమే లభిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు మార్కెట్ యార్డులకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. మొక్కజొన్న ధరల మద్దతు పథకంలో లేనందున కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మొక్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. గత ఏడాది రూ. 902 కోట్లతో 3.76 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. ఇప్పటిదాకా అదే అత్యధికం. ఇప్పుడు పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని రైతులు పండించిన పంటలో సగం మేరకు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.4,000 కోట్లు అవసరం కాగా దానికి బ్యాంకు నుంచి రుణం పొందేందుకు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి మంత్రిమండలి ఆమోదించింది.కొనుగోలు కేంద్రాలు పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పంట భారీఎత్తున సాగయిన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు కోరింది. మార్కెట్ యార్డులతో పాటు సహకార సంఘాల్లోనూ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇప్పటి వరకు 209 కేంద్రాలు ఏర్పాటు చేసి 36 వేల మంది రైతుల నుంచి 1,67,715 టన్నులు కొనుగోలు చేసింది.

Read More

పశుసంవర్ధక శాఖలో మూలధన పెట్టుబడి కోసం కేంద్రం నుంచి నిధులు

అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులతో గురు వారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడారు. మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయక పథకం కింద రాష్ట్రానికి కేంద్రం రూ.75 కోట్లు కేటాయించిందని తెలిపారు. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాడి పరిశ్రమ బలోపేతం, సహకార సంఘాల స్థాపన, పశు సంపదకు బీమా కల్పించడంలో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు మాట్లాడుతూ.. ఈ పథకం లక్ష్యాన్ని 90 శాతం మేర సాధిస్తే కేంద్రం నుంచి ఏటా రూ.75 కోట్ల మేర నిధులు వస్తాయని తెలిపారు. సమావేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీ కొమ్మిశెట్టి మురళీధర్, సంస్థ సలహాదారు డాక్టర్ వెంకటరమణ, ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More