సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు
తెలంగాణా రాష్ట్రంలో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో పండించే ప్రసిద్ధి పొందిన సజ్జాపూర్ చామగడ్డకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ఇవ్వాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయంలో మంగళవారం దరఖాస్తు చేసుకుంది. ఈ చేమ దుంప ప్రపంచంలోనే అరుదైందని, అత్యంత పోషకవిలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగి ఉందని వివరించింది. జీఐ కోసం దరఖాస్తు చేసిన మొట్ట మొదటి దుంప రకంగా ఇది నమోదైంది. సజ్జాపూర్ చామదుంప విశిష్టతను గుర్తించిన ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్త పిడిగం సైదయ్య దీనిపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు టీజీవోఎస్టీ సహకారం అందించింది. ఈక్రమంలో చామదుంప పుట్టుక, దాని రకపు లక్షణాలు, జీవరసాయన ప్రొఫైలింగ్, సాగు పద్దతులు, డీఎనఏ, ఇతర విశిష్ట లక్షణాలకు భౌగోళిక సంబంధాలు వంటి కీలక సమాచారాన్ని సేకరించారు. సంకర లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రకాల మాదిరిగా కాకుండా.. సజ్జాపూర్ చామదుంపను స్థానిక రైతులు శతాబ్దానికి పైగా సంప్రదాయ శాఖీయ పద్ధతుల ద్వారా సంరక్షించి, వ్యాప్తి చేస్తున్నారు. ఈ వివరాల నివేదికతో జీఐ నిపుణుడు శుభజీత్ సాహా ద్వారా జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేశారు. దరఖాస్తును ఆమోదించిన రిజిస్ట్రీ.. పరిశీలనకు స్వీకరించినట్లు వెల్లడించింది.










