రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలని, వారు పండించిన చిరుధాన్యాల ఉత్పత్తులను శుద్ధి చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలని, ఎగుమతులను చేపట్టాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ సంచాలకురాలు తారా సత్యవతి సూచించారు. రైతులు సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే మధ్యవర్తుల పాత్రను నిరోధించవచ్చని, వినియోగదారులకు చిరుధాన్యాలను విస్తృతంగా అందుబాటులోకి తేవచ్చన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ-జోడింపు సాంకేతికతలపై వ్యవసాయ వర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ”చిరుధాన్యాల సాగు అన్నదాతలకు అన్నివిధాలా లాభదాయకం. సులభంగా విత్తనాలు లభిస్తాయి. తక్కువ నీటి వినియోగం, చీడపీడలు, ఎరువుల శ్రమ లేకుండానే పంటలు పండుతాయి. ఐఐఎంఆర్ ద్వారా అధిక దిగుబడినిచ్చే చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తున్నాం. పంట కోత, నూర్పిడి, శుభ్రపరచడం మొదలైన వాటి కోసం పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవి రైతులకు సాగు ఖర్చును, శ్రమను తగ్గిస్తాయి. చిరుధాన్యాల పరిశ్రమలతో రైతులు అనుసంధానమయ్యే అవకాశం కల్పిస్తున్నాం” అని తారాసత్యవతి వివరించారు. నెహ్రూ జూపార్కు డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమఠ్ మాట్లాడుతూ… జూపార్కులో జంతువుల దాణా, పశు గ్రాసం కోసం చిరుధాన్యాల విత్తనాలను ఉపయోగిస్తున్నామని, వాటి ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. సదస్సులో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎస్కే స్వైన్, మహేశ్ పాటిల్ తదిత రులు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం చిరుధాన్యాల సాగులో ఉత్తమంగా నిలుస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన రైతులకు తారాసత్యవతి, ఇతర ప్రముఖులు పురస్కారాలను అందజేశారు.

5 Mar, 2025
