రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలి జాతీయ చిరుధాన్యాల సదస్సులో ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌

రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలని, వారు పండించిన చిరుధాన్యాల ఉత్పత్తులను శుద్ధి చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలని, ఎగుమతులను చేపట్టాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ సంచాలకురాలు తారా సత్యవతి సూచించారు. రైతులు సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే మధ్యవర్తుల పాత్రను నిరోధించవచ్చని, వినియోగదారులకు చిరుధాన్యాలను విస్తృతంగా అందుబాటులోకి తేవచ్చన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ-జోడింపు సాంకేతికతలపై వ్యవసాయ వర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ”చిరుధాన్యాల సాగు అన్నదాతలకు అన్నివిధాలా లాభదాయకం. సులభంగా విత్తనాలు లభిస్తాయి. తక్కువ నీటి వినియోగం, చీడపీడలు, ఎరువుల శ్రమ లేకుండానే పంటలు పండుతాయి. ఐఐఎంఆర్‌ ద్వారా అధిక దిగుబడినిచ్చే చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తున్నాం. పంట కోత, నూర్పిడి, శుభ్రపరచడం మొదలైన వాటి కోసం పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవి రైతులకు సాగు ఖర్చును, శ్రమను తగ్గిస్తాయి. చిరుధాన్యాల పరిశ్రమలతో రైతులు అనుసంధానమయ్యే అవకాశం కల్పిస్తున్నాం” అని తారాసత్యవతి వివరించారు. నెహ్రూ జూపార్కు డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ హిరేమఠ్‌ మాట్లాడుతూ… జూపార్కులో జంతువుల దాణా, పశు గ్రాసం కోసం చిరుధాన్యాల విత్తనాలను ఉపయోగిస్తున్నామని, వాటి ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. సదస్సులో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎస్కే స్వైన్‌, మహేశ్‌ పాటిల్‌ తదిత రులు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం చిరుధాన్యాల సాగులో ఉత్తమంగా నిలుస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు చెందిన రైతులకు తారాసత్యవతి, ఇతర ప్రముఖులు పురస్కారాలను అందజేశారు.

Read More

నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మార్కెటింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బి. ఉదయ భాస్కర్‌ , ప్రతినిధులు, బ్యాంకింగ్‌ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

చిరుధాన్యాల సాగు, వినియోగం భారీగా పెరగాలి

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంపై ఎఫ్‌ఏవో నివేదిక

ఆకలి, పోషకాహార లోపం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య ప్రభావం, ఆహారభద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు... చిరుధాన్యాల సాగు, వినియోగం పెద్దఎత్తున విస్తరించాలని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సూచించింది. ఈ మేరకు సాగు మరింతగా అభివృద్ధి చెందాలని, విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని, కొత్త వంగడాలకు రూపకల్పన చేయాలని పేర్కొంది. ఉత్పత్తుల మార్కెటింగ్‌ మరింత విస్తృతం కావాలని సూచించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రాముఖ్యంపై తాజాగా ఎఫ్‌ఏవో నివేదికను విడుదల చేసింది. వివిధ దేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం తదితర అంశాలపై చేపట్టిన అధ్యయనం... నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం నివేదికను రూపొందించింది. నివేదికలో చిరుధాన్యాల సాగు, వినియోగం విస్తృతికి పలు సిఫార్సులు చేసింది. ముఖ్యాంశలివీ..
  • బాల్యం నుంచే పిల్లలకు చిరుధాన్యాల ఆహారం అందించాలి. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలను ప్రవేశపెట్టాలి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ఇతర ఉత్పత్తులకు బలమైన ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు మారాలి.
  • జన్యువైవిధ్యంతోపాటు సాంకేతికతను మెరుగు పరిచి విజ్ఞానమార్పిడి జరగాలి. స్థానిక సంస్థలు, రైతులు, మహిళలు, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
  • జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా చిరుధాన్యాల సాగు చేపట్టాలి. విత్తన సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. రైతులు తమకు అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. స్థిరమైన ఉత్పత్తికి సమీకృత పంటల విధానం అనుసరిణీయం.
  • చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అత్యుత్తమ ఫలితాలిస్తాయి. సంప్రదాయ ఆహారంతో పోలిస్తే వైవిధ్య, స్థితిస్థాపకంగా ఉండే చిరుధాన్యాలు రైతుల జీవనోపాధిని నిలబెట్టాలి. దీనికోసం స్థిరమైన విత్తన పరిరక్షణను బలోపేతం చేయాలి. చిన్న కమతాల రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నందున వారికి చేయూతనివ్వాలి. నీటి పొదుపు ద్వారా సాగు సజావుగా సాగే ప్రణాళిక ఉండాలి. నేరుగా వంగడాలను రూపొందించడంతో పాటు కలుపు తీయడం, కోత, నిల్వ, ఉత్పత్తుల శుద్ధి శిక్షణకు సులభతర అవకాశాలను కల్పించాలి.
    మరింతగా మార్కెటింగ్‌…
  • స్థిరమైన ఉత్పత్తి, యాంత్రీకరణతోపాటు రైతులకు పంటలు లాభదాయకంగా మారేలా మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలి.
  • చిరుధాన్యాల కోసం ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. పంట శుద్ధి అనంతరం పిండి, రవ్వ, ఇతర పదార్థాలుగా మార్చి ప్యాకేజింగ్‌ ద్వారా పంపిణీ జరగాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వారాంతపు సంతల్లోనూతత… సూపర్‌ మార్కెట్లు, కిరణా దుకాణాల్లోనూ విక్రయాలు సాగాలి.
  • ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లు, ఈ-కామర్స్‌ వేదికల ద్వారా ఇళ్లకే నేరుగా సరఫరా చేయడం ద్వారా విక్రయాలు సులభతరం చేయాలి.
  • చిరుధాన్యాల ఉత్పత్తి ప్రదర్శనలు నిర్వహించాలి. యాంత్రీకరణ, ఆహారశుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు గ్రాంట్లను ఇవ్వాలి.

ఉత్పత్తిలో మేటి భారత్‌
చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్‌, దేశంలో ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని చిరుధాన్యాలు సాగవుతాయి. తరి, ఖుష్కి, భూముల్లోనూ పెరుగుతాయి. చీడపీడలను సమర్ధంగా ఎదుర్కొంటాయి. నీటి వినియోగం తక్కువ. వీటి సాగువల్ల నేల సాంద్రత పెరుగుతుంది. పోషకాల పరంగా చిరుధాన్యాలతో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, మినరల్స్‌, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమకూరుతాయి. పూర్వకాలం నుంచి చిరుధాన్యాల సాగు, వినియోగం జరుగుతోంది. ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దక్షిణాసియా, సబ్‌సహారా ప్రాంతాల్లో 85 శాతం కంటే ఎక్కువ వినియోగమవుతున్నాయి. భారత్‌, నైజీరియా, నైగర్‌, చైనా, మాలి చిరుధాన్యాల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

Read More