రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలి జాతీయ చిరుధాన్యాల సదస్సులో ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌

రైతులు పారిశ్రామికవేత్తలుగా మారాలని, వారు పండించిన చిరుధాన్యాల ఉత్పత్తులను శుద్ధి చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలని, ఎగుమతులను చేపట్టాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ సంచాలకురాలు తారా సత్యవతి సూచించారు. రైతులు సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే మధ్యవర్తుల పాత్రను నిరోధించవచ్చని, వినియోగదారులకు చిరుధాన్యాలను విస్తృతంగా అందుబాటులోకి తేవచ్చన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ-జోడింపు సాంకేతికతలపై వ్యవసాయ వర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ”చిరుధాన్యాల సాగు అన్నదాతలకు అన్నివిధాలా లాభదాయకం. సులభంగా విత్తనాలు లభిస్తాయి. తక్కువ నీటి వినియోగం, చీడపీడలు, ఎరువుల శ్రమ లేకుండానే పంటలు పండుతాయి. ఐఐఎంఆర్‌ ద్వారా అధిక దిగుబడినిచ్చే చిరుధాన్యాల విత్తనాలను విక్రయిస్తున్నాం. పంట కోత, నూర్పిడి, శుభ్రపరచడం మొదలైన వాటి కోసం పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవి రైతులకు సాగు ఖర్చును, శ్రమను తగ్గిస్తాయి. చిరుధాన్యాల పరిశ్రమలతో రైతులు అనుసంధానమయ్యే అవకాశం కల్పిస్తున్నాం” అని తారాసత్యవతి వివరించారు. నెహ్రూ జూపార్కు డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ హిరేమఠ్‌ మాట్లాడుతూ… జూపార్కులో జంతువుల దాణా, పశు గ్రాసం కోసం చిరుధాన్యాల విత్తనాలను ఉపయోగిస్తున్నామని, వాటి ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. సదస్సులో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎస్కే స్వైన్‌, మహేశ్‌ పాటిల్‌ తదిత రులు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం చిరుధాన్యాల సాగులో ఉత్తమంగా నిలుస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు చెందిన రైతులకు తారాసత్యవతి, ఇతర ప్రముఖులు పురస్కారాలను అందజేశారు.

Read More

కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఏపీ. లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడి

కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం తెదేపా ఎంపీ బీకే పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24వ సంవత్సరం మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లలో సాగయిన కొబ్బరి తోటలనుంచి 153.29 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉన్నదని చెప్పారు. 2022-23లో రాష్ట్రంలో రూ.2,763.23 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని, అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. తెల్లదోమలాంటి తెగుళ్లు వచ్చినా వాటి నియంత్రణకు కొబ్బరి బోర్డు వివిధ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసి 8 రకాల నియంత్రణ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.
Read More