ఊరూరా చిరుధాన్యాలు సాగు కావాలని.. ఇంటింటికీ వాటి ఆహారం చేరాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ సి. తారాసత్యవతి ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు చిరుధాన్యాలను ప్రాథమిక అవసరంగా గుర్తించి వినియోగించాలన్నారు. ఐఐఎంఆర్ పదో వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం రాజేంద్రనగర్లోని సంస్థ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”రైతులు పెద్దఎత్తున చిరుధాన్యాల సాగు చేపట్టి వాటికి పూర్వవైభవం తీసుకురావాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సాహం అందించాలి. ఐఐఎంఆర్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. సాగు విస్తరణతోపాటు ఆహార శుద్ధి, వినియోగం, ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఏపీ, తెలంగాణతోపాటు మరో అయిదు రాష్ట్రాల రైతులతో కిసాన్ మేళా నిర్వహిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగు ప్రణాళికలను వెల్లడిస్తాం” అని తారాసత్యవతి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నార్మ్ ఇన్ఛార్జి డైరెక్టర్ ఆర్సీ అగర్వాల్ మాట్లాడుతూ.. చిరుధాన్యాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. వీటిపై అంకురాల ద్వారా విస్తృత ప్రయోగాలు జరగాలన్నారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేషన్ జోనల్ విభాగాధిపతి ఆసిఫ్ ఇక్బాల్, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, అంకుర వ్యవస్థాపకులు పాల్గొన్నారు.

10 Feb, 2025
