కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం తెదేపా ఎంపీ బీకే పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24వ సంవత్సరం మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లలో సాగయిన కొబ్బరి తోటలనుంచి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉన్నదని చెప్పారు. 2022-23లో రాష్ట్రంలో రూ.2,763.23 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని, అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. తెల్లదోమలాంటి తెగుళ్లు వచ్చినా వాటి నియంత్రణకు కొబ్బరి బోర్డు వివిధ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసి 8 రకాల నియంత్రణ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.

5 Feb, 2025
