జార్జియా వంట… ఇదో విదేశీ వండని వంట!

ఈ వంట ‘వండని వంటలు’ శీర్షిక క్రిందికి వస్తుందో రాదో కాస్తా అనుమానంగా ఉంది. ఇందులో బచ్చలి ఆకులను ఆఫ్ బాయిల్ చేస్తారు. మిగతావి అన్నీ పచ్చి పదార్థాలనే వాడతారు. అవన్నీ దాదాపు మనకు కూడా దొరుకుతాయి!

జార్జియన్ బచ్చలి కూర కొత్తిమీర మరియు వాల్‌నట్ సలాడ్ – ‘ఇస్పానాఖిస్ ప్ఖాలీ’
ఇస్పానాఖిస్ ప్ఖాలీ అనేది “ప్ఖాలీ” వర్గానికి చెందిన ఒక సాంప్రదాయ జార్జియన్ వంటకం, ఇది జార్జియాలో వివిధ కూరగాయల ఆధారిత స్ప్రెడ్‌లు లేదా సలాడ్‌లకు ఉపయోగించే పదం. ప్ఖాలీ వంటకాలు తరచుగా చల్లగా వడ్డిస్తారు, మరియు జార్జియన్ విందులు మరియు వేడుకల్లో ప్రముఖ భాగంగా ఉంటాయి.

Pkhali యొక్క ఇతర సలాడ్స్ కూడా ఉన్నాయి. అవి బీట్‌రూట్, వంకాయ, పుట్టగొడుగులు, క్యాబేజీ లేదా రెడ్ బీన్స్ నుండి తయారు చేస్తారు. కానీ ఇస్పానాఖిస్ ప్ఖాలీ యొక్క ఆకర్షణీయమైన ముదురాకు పచ్చ రంగు, మరియు ఘాటైన బచ్చలి కూర రుచి నోరూరించే వంటకాలలో ఒకటి.

జార్జియన్ బచ్చలి కూర వాల్‌నట్ కొత్తిమీర సలాడ్ – ఇస్పానాకిస్ ప్కాలీ సలాడ్ చేసుకునే విధానం చాలా సులభం.

కావలసినవి:

  • 700 గ్రా. తాజా బచ్చలి కూర ఆకులు
  • 1 కప్పు (120 గ్రా) వాల్‌నట్‌లు, పచ్చివి లేదా కాల్చినవి.
  • 3 మీడియం లవంగాలు మరియు వెల్లుల్లి.
  • 60 గ్రా కొత్తిమీర
  • 1/4 కప్పు పార్స్లీ
  • 3 టేబుల్ స్పూన్లు (45 ml) కూరగాయల లేదా వాల్‌నట్ నూనె
  • 2 టేబుల్ స్పూన్లు (30 మి.లీ) వెనిగర్
  • 1/2 టీస్పూన్ (2.5 గ్రా) ఉప్పు
  • 1 1/2 టీస్పూన్లు (4.5 గ్రా) ఖ్మేలీ సునెలీ అనగా జార్జియన్ మసాలా మిక్స్ అదేమీ బ్రహ్మ పదార్థం కాదు.
  • (-1/2 టీస్పూన్ (1.5 గ్రా) గ్రౌండ్ బ్లూ మెంతులు, 1/2 టీస్పూన్ (1.5 గ్రా) పసుపు, 1/2 టీస్పూన్ (1.5 గ్రా)తో భర్తీ చేయవచ్చు.
  • దనియాలు
  • 1/4 టీస్పూన్ (0.5 గ్రా) ఎరుపు కారపు మిరియాలు
  • 1/4 టీస్పూన్ (0.5 గ్రా) నల్ల మిరియాలు వీటన్నిటినీ రోట్లో దంచుకొని తయారు చేసుకోవచ్చు).
  • చివరగా దానిమ్మ గింజలు, గార్నిష్ కోసం.
    * * *
    బచ్చలి కూరను కడగాలి మరియు అది వడలిపోయే వరకు ఒక గిన్నెలో గోరువెచ్చని లేదా వేడినీటిలో ఉంచాలి (సుమారు 3 నిమిషాలు) (దీన్నే ఆఫ్ బాయిల్ అన్నాము)

తర్వాత చల్లని నీటిలో బచ్చలి కూరను వేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బచ్చలి కూర చల్లారాక, బచ్చలికూరలో ఉన్న నీటిని చేతితో పిండి బచ్చలి కూరను పక్కన పెట్టుకోవాలి.

వాల్‌నట్‌లను కాస్త బరకగా దంచుకోవాలి, పూర్తిగా పౌడర్ చెయ్యకూడదు. అదే రోట్లో మిగిలిన పదార్థాలను (బచ్చలి కూర మినహా) వేసి, కాస్త నెమ్మదిగా అన్ని కలిసే వరకు దంచుతుండాలి. రోట్లో నుండి ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు నీళ్ళని పిండేసి పక్కన పెట్టుకున్న బచ్చలి కూరను రోట్లో వేసి ముద్దగా దంచుకోవాలి.

అన్ని దినుసులు వెనిగర్ మసాలాలు వాల్‌నట్‌లతో నూరిన ముద్దని వేరే గిన్నెలోకి వేసి, దాంట్లోనే బచ్చలి కూర ముద్దని వేసి రెండు మిశ్రమాలను చక్కగా కలుపుకొని ఒక గిన్నె సహాయంతో చక్కగా ముద్దలుగా మరో ప్లేట్‌లో పేర్చుకొని, పైన కొన్ని దానిమ్మ గింజలతో అలంకరించుకుంటే వంట రెడీ..

ఇది ఇలాగే తినొచ్చు, కావాలంటే దీనికి సరైన కాంబినేషన్ మజ్జిగ. ఇది తింటూ మజ్జిగ తాగుతుంటే ఆ రుచే వేరు.

రచనః మాందాటి రఘు

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

సేంద్రియ సేద్యం – రైతుకు నవశకం

ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 

సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.

సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి?
కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం.
ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాన సాగు పద్ధతులు

పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చిమార్చి వేయడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.

పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.

వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్ౘ్ి పొలానికి అందించడం.

జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.

సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.

కలిగే ప్రయోజనాలు
రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయోÐఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.

ముగింపు:
మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951

Read More

ముంచుకొస్తున్న కరువు… పాడి రైతు గుండె చెరువు

ఎల్‌నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు  పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్‌డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు  31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు   13.34 మిలియన్లు
దూడలు       37.16 మిలియన్లు
మొత్తం      81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.

కార్యాచరణ ప్రణాళికః

  1. కరువును తట్టుకునే పశుగ్రాసాల పెంపకం బాజ్రా, మక్కలు చేపట్టాలి
  2. పశుగ్రాస విత్తనాల లభ్యత ఉండాలి.
  3. బహువార్షిక పశుగ్రాసాల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  4. మాగుడుగడ్డి వాడకం పెంచాలి.
  5. సహకార డెయిరీల ద్వారా ‘సైలేజ్’ సరఫరా చేయించాలి.
  6. టోటల్ మిక్స్‌డ్ రేషన్ (టిఎంఆర్) వాడకం పెంచాలి.
  7. ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
  8. ఎల్‌నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి.
    ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More

మొక్క పెరుగుదలకు దోహదపడే ‘చేప కునప జలం’

కావలసిన పదార్థాలు:
తాజా చేప ముక్కలు : కిలో
దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు, నల్లబెల్లం – కిలో
దేశీ ఆవు నెయ్యి : 50 గ్రా, తేనె – 50 గ్రా

చేప కునప జలం ఇంచుమించు ‘మీనామృతం’ మాదిరిగానే పంటలపై పనిచేస్తుంది.

తయారుచేసే పద్ధతి: ఒక కిలో తాజా చేపలను ముక్కలుగా కోయాలి. వాటికి ఒక కిలో నల్లబెల్లం పొడిని కలపాలి. 50 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కూడా కలిపి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక మట్టికుండలో గాని, ప్లాస్టిక్ పాత్రలో గాని 5 లీటర్ల ఆవు మూత్రం పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. పాత్ర మీద మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో బిగించి కట్టాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుతూ 20 రోజుల పాటు చల్లని గదిలో ఉంచి మురగబెట్టాలి. తయారైన చేప కునప జలాన్ని వడకట్టి వాడుకోవచ్చు. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని కలిపి మె°క్కలపై పిచికారీ చేయాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

వాడే విధానం : 3 నుండి 5 శాతం ద్రావణాన్ని ఏ పంటపైనయినా ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేయవచ్చు.

ఫలితాలు :

  • భూమికి అద్భుతమైన పోషకాలనందిస్తుంది.
  • మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనిని సులభంగా తయారు చేయవచ్చు.
  • మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది.
Read More

ఔషధ మొక్క…. అనాస

అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.

సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
  • అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
  • పక్వానికి రాని పండు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది.
  • ఇది మూత్రకోశవ్యాధులకు మంచి ఔషధం, బాగా పండిన పండు చలవ చేస్తుంది.
  • దీనిలోగల అధిక పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పండ్లరసం జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడటమే గాక మూత్రమును కూడా సులువుగా జారీ చేస్తుంది.
  • ఆకులు స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమబద్ధం చేస్తాయి. గుండె జబ్బులు, జ్వరం, కోరింత దగ్గు నివారణలో ఉపయోగపడుతుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కొత్తిమీర పచ్చడి

కొత్తిమీరని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. కూరల్లో, పచ్చళ్ళలో, పప్పులో, సాంబారులో చివరగా ఇంత కొత్తిమీర వేస్తే చాలు… ఆ ఘుమఘుమలు మనకు ఆ పదార్థం నచ్ౘ్కపోయినా రుచి చూసేట్టు చేస్తుంది. ఆనక తినేట్లుగా కూడా చేస్తుంది.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది.

కొత్తిమీర గుండెకు చాలా మంచిది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అల్సర్‌ని తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కొత్తిమీర రోటి పచ్చడి కావల్సిన దినుసులు :
పది పన్నెండు ఎండుమిర్చి, పదిదాకా పచ్చిమిరప కాయలు.
జీలకర్ర›, గోలీకాయంత చింతపండు
చిన్న ముక్క బెల్లం, సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు (ఇష్టం ఉంటే వేసుకోండి)

పైన చెప్పిన వాటిలో పచ్చిమిర్చి, ‘కొత్తిమీర సేంద్రియం కాకపోతే, కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పచ్చిమిర్చి తొడిమ తీసి వేసి పదినిమిషాలు ఉంచి, బాగా కడగండి. ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ ఇంకో రెండుసార్లు కడగండి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కొంతన్నా పోతాయి. కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్‌లో కడిగి, రెండూ తడి లేకుండా ఆరపెట్టుకోండి. తరువాత జీలకర్ర, పచ్చి, ఎండుమిర్చిని కలిపి మెత్తగా నూరి, అందులో ఉప్పు, వెల్లుల్లి వేసి మరింత నూరి, చివరికి కొత్తిమీర, బెల్లం వేసి మెత్తగా నూరి, గిన్నెలోకి తీసుకోవాలి.
పోపు అవసరం లేదు. వేడి అన్నంలో కలిపి, అవసరం అనుకున్న వారు నెయ్యి, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేసుకుని తినవచ్చు. అవి లేకున్నా రుచిగానే ఉంటుంది. తడి లేకపోతే, మీరు చేసిన పచ్చడి వారమైనా పాడవదు.

రచన : కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

పశువుల్లో బెబీసియోసిస్ లేదా ఎరుపు మూత్ర వ్యాధి

బెబీసియోసిస్‌ను టిక్ ఫీవర్ లేదా టెక్సాస్ ఫీవర్ లేదా పైరోప్లాస్మోసిస్ లేదా రెడ్ వాటర్ డిసీస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి రిపిసెఫాలస్ మైక్రోప్లస్ (పూర్వపు పేరు బూఫైలస్ మైక్రోప్లస్) అనే జాతికి చెందిన గోమార్ల ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి బెబీసియా బైజెమినా మరియు బెబీసియా బోవిస్ అనే ఏకకణ పరాన్నజీవుల (ప్రోటోజోవా) వలన పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి గేదెలలో కంటే విదేశీ జాతి పశువులు మరియు సంకరజాతి పశువులలో ఎక్కువగా సోకుతుంది.

వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన పశువులలో అధిక జ్వరం (105-107 డిగ్రీల ఫారెన్‌హీట్), మేత తినవు. నీరసంగా ఉంటాయి. కంటి పొరలు రక్తలేమితో ఉంటాయి. రక్తహీనత మరియు కామెర్లు వంటి లక్షణాలుంటాయి. మూత్రం కాఫీరంగులో ఉండడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం. వ్యాధి సోకిన పాడి పశువులలో పాలుతగ్గడం, దుక్కి దున్నే పశువులలో పని సామర్థ్యం తగ్గడం మరియు చూలు పశువులు ఈసుకుని పోవడం సంభవిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

చికిత్స:
వ్యాధి సోకిన పశువులకు ఇమిడోకార్బ్ అనే మందును 1 మి.గ్రా./కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. లేదా డైమినజిన్ అసిటురేట్ (బెరినిల్) అనే మందును 3.5 మి.గ్రా. / కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. వీటితో పాటుగా, టెట్రాసైకిన్స్ అనే యాంటిబయాటిక్‌ను, డెక్స్‌ట్రోస్, సెలైన్స్, బి-కాంప్లెక్స్ మరియు ఐరన్ ఇంజక్షన్స్ కూడా ఇవ్వాలి.

నివారణః
ఈ వ్యాధి ముఖ్యంగా గోమార్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావునా గోమార్ల నివారణకు డెల్టామెత్రిన్ లేదా సైపర్‌మెత్రిన్ అనే మందును 2 మి.లీ./1లీ. నీటితో పశువులపై పిచికారి చేసి, పశువుల శరీరంపై ఉన్న బాహ్యపరాన్న జీవులను నిర్మూలించాలి. పోరఆన్ (ఫ్లుమెత్రిన్) అనే మందును పశువుల శరీరంపై తలభాగం నుండి తోక వరకు వెన్నెముకపై ఒక గీత లాగా పోసినచో ఈ గోమార్లను నిర్మూలించవచ్చు.

డా॥ పొట్టబత్తుల మల్లేష్, సహాయ ఆచార్యులు, ఫోన్: 9030427110,
డా. యస్. రమేష్ భూమయ్య, సహఆచార్యులు మరియు విభాగాధిపతి, ఫోన్: 8897851699
పశువైద్య పరాన్నజీవ శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, జగిత్యాల జిల్లా

Read More

మొక్కల ఎదుగుదలకు, ఫలదీకరణ శక్తి పెరగడానికి చేప అమినో ఆమ్లం

రైతు వారీగా అతి తక్కువ శ్రమ, స్వల్ప ఖర్చుతో తయారు చేసుకోగలిగేది చేప అమినో ఆమ్లం. చేపలతో అమినో ఆమ్లాలను తయారు చేసుకునే పద్ధతిని కొరియా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాకృతిక రైతులు ఆచరిస్తున్నారు.

తయారు చేసే విధానం : ముందుగా చేప పొలుసులు, ఈకలు, తోకలు తొలగించాలి. తరువాత చేపను చిన్న, చిన్న ముక్కలుగా కోయాలి. చేప ముక్కలను తూకం వేసి దానికి సరిసమానంగా బెల్లం కలపాలి. వాటిని ఒక ప్లాస్టిక్ జాడి లేదా బకెట్‌లో మూడవ వంతు వరకు నింపుకుని పైన గుడ్డ కట్టి నీడలో పెట్టుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి కలియబెట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజుల్లో చిక్కటి ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం నుండి మధురమైన వాసన వస్తుంది. ఒకవేళ చేపల వాసన వస్తుంటే దానికి మరింత బెల్లం కలిపి మరో 4,5 రోజులుంచాలి.

తయారైన ద్రావణాన్ని లీటరు నీటికి 1 నుంచి 4 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. దీనిని అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు.
Read More

ఆధునిక వ్యవసాయానికి మొబైల్ యాప్‌లు – రైతులకు డిజిటల్ మార్గదర్శి

“వ్యవసాయమే భారతదేశానికి వెన్నెముక” అనే మాట నేటికీ సత్యమే. అయితే నేటి రైతు వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తరకం పురుగులు–తెగుళ్ల విజృంభణ, నేల సారం తగ్గుదల, పోషక లోపాలు, నీటి కొరత వంటి ఎన్నో సమస్యలు పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందడం అత్యంత అవసరం. డిజిటల్ సాంకేతికత విస్తరించిన ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ రైతుకు మరో వ్యవసాయ పనిముట్టుగా మారింది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పుడు రైతు తన పొలానికి సంబంధించిన అనేక విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. పురుగులు, తెగుళ్లను గుర్తించడం నుంచి వాతావరణ సూచనలు తెలుసుకోవడం వరకు, పంటల సాగు సలహాలు పొందడం నుంచి ఎరువులు, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం వరకు అనేక సేవలు మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు వ్యవసాయ నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలను కూడా నేరుగా రైతుల చేతికి చేరవేస్తున్నాయి. దీనివల్ల రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని నష్టాలను తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునే అవకాశం పొందుతున్నారు.

రైతులకు ఈ సేవలను మరింత చేరువ చేయడానికి భారత ప్రభుత్వంతో పాటు పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలు అనేక మొబైల్ అప్లికేషన్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు పరిశోధనలో రూపొందిన శాస్త్రీయ సాంకేతికతను నేరుగా రైతు పొలం వరకు తీసుకెళ్లే వారధిగా పనిచేస్తున్నాయి.

  1. Plantix (ప్లాంటిక్స్)
    ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లలో ప్లాంటిక్స్ (Plantix) ఒకటి. రైతులు దీనిని “పంటల డాక్టర్” అని కూడా పిలుస్తుంటారు. పంటలో కనిపించే సమస్యలను వేగంగా గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. రైతులు పంట ఆకులు, కాండం, కాయలు లేదా ఇతర భాగాలపై కనిపించే లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే సమస్యను విశ్లేషించి అది పురుగు ఉధృతా, తెగులా లేదా పోషక లోపమా అనే విషయాన్ని గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాకుండా సమస్యకు కారణాలు, నివారణ చర్యలు, సిఫారసు చేసిన పురుగుమందులు లేదా శిలీంద్రనాశకాలు, పోషక నిర్వహణ పద్ధతులను కూడా సూచిస్తుంది.

ఈ యాప్‌లో 700 కంటే ఎక్కువ పంటల పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. రైతులు ప్రపంచంలోని ఇతర రైతులతో తమ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇందులో కల్పించారు. అలాగే, GPS సాంకేతికత ఆధారంగా సమీప ప్రాంతాల్లో ఏవైనా పురుగులు లేదా తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లయితే ముందుగానే హెచ్చరికలు అందిస్తుంది. స్థానిక వాతావరణ సమాచారాన్ని కూడా అందించడం వల్ల పిచికారీ, కలుపు నివారణ, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను సరైన సమయంలో చేపట్టేందుకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో కనిపించే లక్షణాలు ఏ సమస్యకు సంబంధించినవో తెలియక రైతులు తరచూ అయోమయానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో ప్లాంటిక్స్ యాప్ తక్షణమే సమస్యను గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ద్వారా సరైన మందును, సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించేందుకు దోహదపడుతుంది. దీంతో అనవసరంగా మందుల వినియోగం తగ్గి సాగు ఖర్చులు ఆదా కావడంతో పాటు పంటను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. రైతు చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను “వ్యవసాయ సలహాదారుగా” మార్చే యాప్‌లలో ప్లాంటిక్స్ ఒకటి.

  1. RiceXpert (రైస్ ఎక్స్‌పర్ట్)
    వరి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐసీఏఆర్–జాతీయ వరి పరిశోధన సంస్థ- కటక్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ రైస్ ఎక్స్‌పర్ట్ (RiceXpert). వరి సాగుకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకే వేదికపై రైతులకు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్, వరి రైతులకు డిజిటల్ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తోంది.

పొలంలో కనిపించే పురుగులు, తెగుళ్లు, నులిపురుగులు (నెమటోడ్లు), కలుపు మొక్కలు, పోషక లోపాలు లేదా పోషకాల అధికత వంటి సమస్యలను రైతులు ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటో, సందేశం లేదా వాయిస్ రికార్డును పంపితే నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలు అందుతాయి. అంతేకాకుండా, సమస్యకు అనుగుణంగా సిఫారసు చేసిన పురుగుమందు, దాని సరైన మోతాదు, ఎరువుల లెక్కింపు (Fertilizer Calculator) వంటి వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది.

ఈ యాప్‌లో వివిధ వరి రకాలు, వ్యవసాయ యంత్రాలు, వాతావరణ సమాచారం, తాజా వ్యవసాయ వార్తలు, ఈ-సలహా (e-Advisory), ఈ-మార్కెటింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. రైతులు తమ సందేహాలను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపి తక్షణ పరిష్కారం పొందవచ్చు. అలాగే వరి ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తుంది.

రైతులకు ఉపయోగాలు
వరి సాగులో ఎదురయ్యే సమస్యలను త్వరగా గుర్తించి, సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టేందుకు రైస్ ఎక్స్‌పర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందులను ఖచ్చితమైన మోతాదులో వినియోగించడానికి మార్గనిర్దేశం చేయడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, పంట దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడతాయి. అంతేకాకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు నేరుగా రైతుల చేతికి చేరడం ద్వారా శాస్త్రీయ వరి సాగు మరింత సులభంగా మారుతుంది.

  1. Crop Doctor (క్రాప్ డాక్టర్)
    క్రాప్ డాక్టర్ (Crop Doctor) అనేది రైతులు తమ పంటల్లో వచ్చే సమస్యలను త్వరగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను పొందేందుకు రూపొందించిన మొబైల్ అప్లికేషన్. దీనిని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం (IGKV), రాయ్‌పూర్ మరియు నేషనల్ ఇఇన్ఫర్ మాటిక్స్ సెంటర్ (NIC) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించబడింది.

రైతులు పంటలో కనిపించే పురుగులు, తెగుళ్లు లేదా పోషక లోపాల లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, వాటిని విశ్లేషించి సంభావ్య సమస్యను గుర్తించి తగిన యాజమాన్య సూచనలను అందిస్తుంది. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు వంటి ప్రధాన పంటలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన శాస్త్రీయ సలహాలను అందించడం ఈ యాప్ ప్రత్యేకత. అదనంగా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, తాజా వ్యవసాయ సమాచారం వంటి ఉపయోగకరమైన వివరాలను కూడా రైతులకు చేరవేస్తుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో సమస్య కనిపించిన వెంటనే వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే ప్రాథమిక నిర్ధారణ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టవచ్చు. దీంతో పంట నష్టాన్ని తగ్గించడంతో పాటు, అనవసరంగా పురుగుమందులు లేదా ఎరువుల వినియోగాన్ని కూడా నివారించవచ్చు. రైతులకు శాస్త్రవేత్తల సలహాలను వేగంగా అందిస్తూ, పొలం మరియు వ్యవసాయ నిపుణుల మధ్య వారధిగా ఈ యాప్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

  1. Kisan Suvidha (కిసాన్ సువిధా)
    రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2016లో కిసాన్ సువిధా మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. రైతులు రోజువారీ వ్యవసాయ నిర్ణయాలను సులభంగా తీసుకునేందుకు అవసరమైన అనేక సేవలను ఈ యాప్ ఒకే చోట అందిస్తుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు ఐదు రోజుల వాతావరణ సూచనలను తెలుసుకోవచ్చు. దీనివల్ల పిచికారీ, కోత, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను వాతావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చు. అదనంగా, వివిధ పంటలకు సంబంధించిన స్థానిక మార్కెట్ ధరలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి వాటి నివారణకు అవసరమైన సమీకృత పురుగు యాజమాన్య సూచనలు కూడా ఈ యాప్ అందిస్తుంది. అంతేకాకుండా, రైతులు తమ సందేహాలను వ్యవసాయ నిపుణులకు పంపించి వ్యక్తిగత సలహాలు పొందే అవకాశం కూడా కల్పించబడింది. దీంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పంటలను సమర్థవంతంగా నిర్వహించడం సులభమవుతుంది.

రైతులకు ఉపయోగాలు
వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను ఒకే యాప్‌లో అందించడం కిసాన్ సువిధా ప్రత్యేకత. వాతావరణ సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. మార్కెట్ ధరల ఆధారంగా సరైన సమయంలో పంటను విక్రయించి మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. అలాగే, శాస్త్రీయ సలహాలు, పురుగులు–తెగుళ్ల నివారణ పద్ధతులు, వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట పొందడం వల్ల రైతులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు శాస్త్రీయంగా, లాభదాయకంగా వ్యవసాయం చేయడానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.

  1. ANGRAU DAATTC App
    ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలోని జిల్లా వ్యవసాయ సలహా మరియు శిక్షణ కేంద్రాలు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ANGRAU DAATTC Appను అభివృద్ధి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యాప్, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య సమర్థవంతమైన సమాచార వారధిగా పనిచేస్తోంది.

ఈ యాప్ ద్వారా రైతులు పంటల వారీగా సాగు సిఫారసులు, మెరుగైన వంగడాల వివరాలు, పురుగులు–తెగుళ్ల గుర్తింపు మరియు యాజమాన్య పద్ధతులు, పోషక నిర్వహణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వంటి శాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. అదనంగా, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి వ్యవసాయ నిపుణుల సలహాలు, తాజా వ్యవసాయ సాంకేతికతలు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా సూచనలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

ఈ యాప్‌లో రైతులు తమ పంటలో కనిపించే సమస్యలను ఫోటోల రూపంలో పంపించి శాస్త్రవేత్తల సలహాలు పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, జిల్లాల వారీగా రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం, హెచ్చరికలు మరియు అత్యవసర వ్యవసాయ సూచనలు సకాలంలో అందించడం ద్వారా పంట నష్టాలను తగ్గించేందుకు ఈ యాప్ దోహదపడుతోంది.

రైతులకు ఉపయోగాలు
ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ANGRAU DAATTC App ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన శాస్త్రీయ వ్యవసాయ సలహాలను సులభంగా పొందవచ్చు. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడం, సాగు వ్యయాన్ని తగ్గించడం మరియు లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

  1. Kapas Kisan (కపాస్ కిసాన్)
    పత్తి రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కింద సులభంగా విక్రయించేందుకు భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ కపాస్ కిసాన్. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మరియు రైతు స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.

ఈ యాప్ ద్వారా రైతులు ఇంట్లో నుంచే స్వీయ నమోదు చేసుకోవచ్చు. అనంతరం సమీపంలోని CCI కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించేందుకు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. పత్తి నాణ్యత పరీక్ష, ఆమోదించిన పరిమాణం, చెల్లింపు ప్రక్రియ వంటి వివరాలను కూడా రైతులు తమ మొబైల్‌లోనే రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, విక్రయించిన పత్తికి సంబంధించిన చెల్లింపు స్థితిని కూడా ఈ యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు.

రైతులకు ఉపయోగాలు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ MSP కొనుగోలు వ్యవస్థతో అనుసంధానమవుతారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మొత్తం కొనుగోలు ప్రక్రియ డిజిటల్ రూపంలో ఉండటంతో పారదర్శకత పెరిగి, చెల్లింపుల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు కనీస మద్దతు ధరను సకాలంలో పొందడంతో పాటు, పత్తి విక్రయ ప్రక్రియను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

  1. APAIMS 2.0
    ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరియు వ్యవసాయ శాఖకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి రూపొందించిన సమగ్ర మొబైల్ అప్లికేషన్ APAIMS 2.0. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఉపగ్రహ సమాచారం, భౌగోళిక సాంకేతికతలను ఉపయోగించి రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు శాస్త్రీయ సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ ద్వారా రైతులు ఈ-పంట నమోదు, భూమి వివరాలు, రైతు యూనిక్ ఐడీ, ప్రభుత్వ పథకాల అర్హత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, పంటల స్థితి, వాతావరణ సమాచారం వంటి అనేక సేవలను ఒకే వేదికపై పొందవచ్చు. అంతేకాకుండా, పొలం స్థాయిలో పురుగులు, తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలు, పంటల ఆధారంగా వ్యక్తిగత వ్యవసాయ సూచనలు, సమస్యలను ఫోటోల ద్వారా అధికారులకు పంపే సౌకర్యం కూడా ఇందులో ఉంది. రైతు సేవా కేంద్రాలు (RSKs), వ్యవసాయ అధికారులు మరియు రైతులను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించడం ద్వారా వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించే ప్రయత్నం ఈ వ్యవస్థ చేస్తోంది.

రైతులకు ఉపయోగాలు
APAIMS 2.0 ద్వారా రైతులు ప్రభుత్వ వ్యవసాయ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్‌లోనే పొందగలుగుతున్నారు. ఈ-పంట నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి, విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ వివరాలు, పంటలపై వ్యక్తిగత సలహాలు, వాతావరణ హెచ్చరికలు వంటి సేవలు ఒకే యాప్‌లో అందుబాటులో ఉండటం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి. అంతేకాకుండా, పొలం స్థాయిలో ముందస్తు పురుగు–తెగుళ్ల హెచ్చరికలు అందడం వల్ల రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టి పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయానికి నాంది పలికిన సమగ్ర వ్యవసాయ వేదికగా APAIMS 2.0 రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.

ముగింపు
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మొబైల్ అప్లికేషన్లు రైతుకు కొత్త బలంగా మారాయి. పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకు ప్రతి దశలో రైతుకు అవసరమైన సమాచారం, శాస్త్రీయ సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పురుగులు–తెగుళ్ల యాజమాన్యం, పోషక నిర్వహణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే వేదికపై అందిస్తూ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ప్లాంటిక్స్, రైస్ ఎక్స్‌పర్ట్, క్రాప్ డాక్టర్, కిసాన్ సువిధా, ఫార్మ్-ఓ-పీడియా, ఏఎన్‌జీఆర్‌ఏయూ డాట్టిక్, కపాస్ కిసాన్, ఏపీఏఐఎంఎస్ 2.0 వంటి మొబైల్ అప్లికేషన్లు రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. వీటి వినియోగం ద్వారా పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా నివారించడంతో పాటు, ఎరువులు మరియు పురుగుమందులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం వల్ల సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి, నాణ్యత, లాభదాయకత పెరుగుతాయి.
అయితే, ఈ మొబైల్ అప్లికేషన్లు రైతులకు సహాయక సాధనాలు మాత్రమే. వాటి ద్వారా అందిన సమాచారాన్ని స్థానిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణం, పంట దశలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సాంకేతిక సలహాలతో సమన్వయం చేసుకొని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్లు, సెన్సార్ ఆధారిత వ్యవసాయం, ఖచ్చితత్వ వ్యవసాయం వంటి ఆధునిక సాంకేతికతలు ఈ మొబైల్ అప్లికేషన్లతో మరింతగా అనుసంధానమవుతాయి. దీంతో రైతులకు ప్రాంతాలకనుకూలంగా, పంటనిర్దిష్టంగా, సమయానుకూలంగా మరింత ఖచ్చితమైన సలహాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయాన్ని ఉత్పాదకంగా, లాభదాయకంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ వ్యవసాయం అనేది భవిష్యత్తు కాదు… అది ఇప్పటికే వర్తమానమైంది. ఈ సాంకేతిక అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు–తెగుళ్ల వల్ల కలిగే నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కనీసం తన పంటకు ఉపయోగపడే ఒకటి లేదా రెండు విశ్వసనీయ వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లను వినియోగించడం నేటి అవసరం.

డా. ఏం. ఉదయ్ భాస్కర్, డా. ఏం. ఉషా
వ్యవసాయ విస్తరణ విభాగం, ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు
ఫోన్: 9494666359

Read More

ఔషధ మొక్క… జీడి మామిడి

జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
  • జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
  • గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • జీడిమామిడి పెంకు ద్రావణం ధాన్యం నిల్వలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని నివారిస్తుంది, నత్తల నివారణలో ఉపయోగపడుతుంది.
  • జీడికాయ, పెంకులు బంబారా వేరుశనగ నిల్వలలో ఆశించే కాల్లసోబ్రూకస్ సబిన్నోటేటస్‌ని నివారిస్తాయి (ఒపరేక్, బన్ని, 2006)
  • జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
  • జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
  • జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
  • జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
  • జీడిమామిడి పెంకు ద్రవం శనగ పచ్చ పురుగు లార్వాలను నివారించింది (మహాపాత్రో, 2010).
  • జీడి మామిడి గింజల పొడి, ద్రావణం అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ అలసంద బ్రూచిడ్)ని సమర్ధవంతంగా నివారించాయి (ఇలెకి, 2012).
  • జీడిమామిడి గింజల నూనె (3%) బెండ కాండం మరియు కాయతొలుచు పురుగు లార్వాలను 87.4% నివారించింది (ప్రవీణ; ఆమె అనుచరలు, 2012).
  • జీడి మామిడి గింజల పొడి ద్రావణం జొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు (సైటోఫిలస్ ఒరైజె)ని నివారించింది (ఇలెకి, అతని అనుచరులు, 2013)
  • జీడిమామిడి క్రూడ్ మిథనాల్ ద్రావణం క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్‌ని నివారించింది. (మున్సెమన & ఆల్బర్టో, 2017).
  • జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
  • జీడిమామిడి ద్రావణం క్షేత్రస్థాయిలో మాక్రోటెర్మస్ బెల్లికోసస్ (చెదపురుగు)ని పర్యావరణహిత పద్ధతిలో నివారించింది (ఓస్పిటాన్, ఒసెయెమి, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More