వేపకుండా, ఉడికించకుండా తయారుచేసే సహజాహార వంటకం ఈ ‘దోసకాయ-మామిడికాయ’ పచ్చడి దోసకాయను-మామిడికాయను బాగా కడిగి, చెక్కు తీసి కానీ, తీయకుండా కానీ, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ, పండుమిర్చి కానీ, బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. (కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు).
సముద్రపు రాళ్ళ ఉప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ తగినంత తీసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూరు కున్న పచ్చడిని, మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు. లేదంటే దోసకాయ ముక్కలు దానిలో కలిపి దోసకాయ ష మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు.
రెండు రకాలుగా చేసుకోవచ్చు.
అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీలలో కూడా బాగుంటుంది.
ఎండుమిర్చికంటే పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వాడుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది. పండుమిర్చిఎండిన తర్వాత కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి తక్కువ వాడుకుంటే మంచిది.
మామిడికాయ బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. కానీ చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకని మామిడికాయ వాడుకుంటే రుచిగా ఉంటుంది.
ఈ పచ్చడిని ఏ రోజుకు ఆరోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.
రచన : లతా కృష్ణమూర్తి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.
తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).
చేప వ్యర్థాలను పపైన్తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.
పులియ బెట్టడం 5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి. 15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి. పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ ఫార్మ్యులేషన్ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.
రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.
అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా, త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.
లక్షణాలు: మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.
మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.
మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.
పోస్ట్ మార్టెం చేసి చూస్తే: శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది. చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.
నివారణ :
పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.
డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ : 8121136184
ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు
ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం
ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.
ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.
దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.
రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001
ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.
సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని శాస్త్రీయ నామం : ఆల్స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి
తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఆల్స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్గ్బె, అతని అనుచరులు, 2007).
ఆల్స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
ఆల్స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
ఆల్స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
ఆల్స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
ముందుగా ఉల్లిపాయలలోని పోషకాల గురించి తెలుసుకుందాం ! ఉల్లిపాయలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ విటమిన్ ఎ, సి, ఇ, ఇంకా ఎన్నో ఉంటాయి. కేన్సర్ కణాలను నిరోధించటంలో ముఖ్యమైనది ఈ ఉల్లిపాయ. జుట్టు వత్తుగా, నల్లగా పెరగటానికి దోహదం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో షుగర్ తగ్గించుకునేందుకు ఉల్లిపాయ ఉపయోగకరమైనది. చెడు కొలెష్ట్రాల్ని తగ్గించటమే గాక గుండె వ్యాధులను కూడా నిరోధిస్తుందని సంబంధిత నిపుణులు అంటారు.
కావల్సిన దినుసులు: ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ (అన్నీ ఉల్లిపాయకు తగినన్ని)
ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్రలని రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక, చింతపండు కూడా వేసి బాగా కలిసేట్లు దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచి, పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీలో కంటే రోట్లో చేసిన పచ్చడికి రుచి ఎక్కువ. పచ్చడి చేసేటప్పుడు నీరు తగలకుండా ఉంటే, ఈ పచ్చడి వారమైనా బయట కూడా పాడవదు. ఇది దోశెల్లోకి, అన్నంలోకి, జొన్నరొట్టెల్లోకి చాలా బావుంటుంది. రైస్లో తినేటప్పుడు కొంచెం కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వేస్తే రుచి పెరుగుతుంది.
రచన : శ్రీమతి కొలను పద్మావతి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
గ్రామీణ ప్రాతాలలోని స్త్రీలు నిరక్షరాస్యత, పేదరికానికి తోడు సరైన పోషకాహారం తీసుకోలేక పోవడం వలన అనారోగ్యానికి గురి అవుతున్నారు. వీటిని అధిగమించాలంటే స్వాలంబనతో పాటు సమతుల్య ఆహారం ఎంతో అవసరం. గ్రామాలలోని ప్రజలు అధికంగా బియ్యంను ప్రధాన ఆహారంగా వాడుతారు. వీటిలో పిండి పదార్ధాలు అధికంగాను, మాంసకృత్తులు అత్యల్పంగానూ ఉంటాయి. అందువల్ల గ్రామాల్లోని ప్రజలు మాంసకృత్తుల లోపం మూలంగా సరైన ఎదుగుదల లేక ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరు సరైన పోషకాహారము తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయతే ఈ మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కోడి గ్రుడ్డులో మరియు కోడి మంసములో పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార నిపుణుల సూచన మేరకు కనీసం రెండు రోజులకి ఒక గ్రుడ్డు చొప్పున తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అందువల్ల కోళ్ళ ఉత్పత్తులను గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో అందుబాటులోకి తెస్తే అది వారి ఆహారలో ఒక భాగమై వారి ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహద పడుతుందున్న ఉద్దేశ్యముతో అధిక గ్రుడ్లు ఉత్పత్తి మరియు నాటు కోడి మాంసం రుచికి సమానంగా అనిపించే వనరాజ, గిరిరాజ, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, వనశ్రీ మరియు కడక నాథ్ కోళ్ళ జాతులను పెరటిలో పెంచుకోవడానికి అనువైనవిగా గుర్తించి గ్రామీణ ప్రాంత రైతులకు పరిచయం చెయ్యడం జరిగింది.
గ్రామీణ ప్రాంతంలో నాటు కోళ్ళ పెంపకం సర్వసాధారణము. అయితే నాటు కోళ్ళు తక్కువ కోడి గ్రుడ్లు పెడతాయి అలాగే తక్కువ మాంసం దిగుబడి ఇస్తాయి. అలాగే కుక్కలు, నక్కలు కోళ్ళని ఎత్తికొనిపోయి తినేయడం వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక్కోసారి కోళ్ళని దొంగలించడం వలన కూడా నష్టం జరుగును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ ని ఈ క్రింద తెలియ చేసిన కొలతల ప్రకారము వ్యవసాయ పరిశోధన కేంద్రం, విజయనగరం వారు రూపొందించడం జరిగింది.
డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కొలతలు వివరములు :
పొడవు 87 అంగుళములు, వెడల్పు 46 అంగుళములు, మధ్యలో ఎత్తు 66 అంగుళములు, ఒక ప్రక్క ఎత్తు 42 అంగుళములు మరియు ఇంకో ప్రక్క ఎత్తు 54 అంగుళములు.
పైన రూఫ్ జింక్ షీట్, బాక్స్ చుట్టు మరియు బాక్స్ క్రింద కూడా జింక్ షీట్ తో తయారు చెయ్యడం జరిగింది.
డూప్లెక్స్ బాక్స్ లో క్రింద ఫ్రీగా తిరగడానికి రెండు రకాలైన జింక్ మెష్ లను వేయడం జరిగింది.
మిగిలిన రాడ్స్ అన్నీ ఇనుముతో తయారు చేయడము జరిగింది.
డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళు క్రింది నుండి బాక్స్ లోనికి వెళ్ళడానికి జింక్ మెస్ మెట్లు లాగ ఏర్పాటు చెయ్యడము జరిగింది.
డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ లోనికి కోడి పిల్లలు, మేత, నీరు పెట్టడానికి మరియు తీయడానికి చిన్న తలుపు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
కోడిపిల్లలను మరియు కోళ్ళను ఎవరు తీయకుండా ఉండుటకు తాళం వేసుకొనే సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ఒక డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తయారీ చెయ్యడానికి సుమారుగా 25,000/- (ఇరువైదు వేలు) రూపాయలు అవుతుంది.
ఇలా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 16 చదరపు అడుగులు పైన బాక్స్ కోళ్ళు నిద్ర పోవుటకు మరియు గ్రుడ్లు పెట్టటకు ఉపయోగపడుతుంది. ఈ బాక్స్ లో రెండు అంగుళాలు లోతు ఏర్పాటు చేసి బెడ్డింగ్ మెటీరియల్ క్రింద వరి దాన్యం ఊకను రెండు అంగుళాలు నింపాలి.
ఇలా తయారీ చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 32 చదరపు అడుగులు క్రింద బాక్స్ కోళ్ళు ఫ్రీగా తిరగడానికి, మేత టబ్బు, నీళ్ళ టబ్బు పెట్టడానికి ఉపయోగపడుతుంది. పైన తెలిపిన కొలతలతో తయారు అయన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో మొదట్లో 20-25 కోడిపిల్లలు పెంచుకోవచ్చు. పెద్దవైతే 15-20 కోళ్ళను సులువుగా పెంచుకోవచ్చు.
ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కి తాళం వేసుకొని రైతు ఎక్కడికైనా వెళ్లి వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. రోజు ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా మేత మరియు నీరు పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లని ఐ.సి.ఎ.ఆర్. – ఐ.ఐ.యఫ్.యస్.ఆర్. వారి ఆర్ధిక సహాయముతో తయారు చేసి ఉచితముగా సాలూరు మండలంలో గంగాన్నదొరవలస, మెట్టవలస గ్రామాలలో 18 మంది రైతులకు మరియు మక్కువ మండలంలో చిమిడివలస, ఎర్రసామంతులవలస గ్రామాలలో 18 మంది రైతులకు 2020-2021 సంవత్సరములో సరఫరా చేయడం జరిగినది. ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తో పాటు, ఒక మేత పెట్టే టబ్, ఒక నీళ్ళు పెట్టే టబ్ మరియు 10 ఆడ పిల్లలు, 5 మగ పిల్లలు ఇచ్చి పరిశీలించడం జరిగింది. ఇలా రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన టేబుల్లో తెలిపిన విధంగా కోళ్ళు, గ్రుడ్లు విషయములో చాలా లాభాలు నమోదు చెయ్యడం జరిగినది.
రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన 46.67 శాతం కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడటము గమనించడమైనది. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 1247 గ్రుడ్లు పెడితే, సాధారణంగా పెంచే కోళ్ళు 568 గ్రుడ్లను మాత్రమే పెట్టాయి. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 52.50 కిలోలు మాంసం దిగుబడినిస్తే, సాధారణంగా పెంచే కోళ్ళు 22.40 కిలోలు మాంసం దిగుబడినిచ్చాయి. కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన సుమారుగా మొత్తం లాభం రూ. 21,985/- వచ్చింది. సాధారణంగా చేపట్టే కోళ్ళ పెంపకములో సుమారుగా మొత్తం లాభం రూ.9,560/- వచ్చింది. కావున కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడుకోవడము కాకుండా అదనంగా 54.45 శాతం గ్రుడ్లు మరియు 57.33 శాతం మాంసం వచ్చినట్లు గమనించడమైనది.
డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా. టి.యస్.యస్.కే. పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త(తెగుళ్ళు విభాగం) ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223
చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.
కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో
తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):
ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి. సూచనః
పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ఏడాకుల పొన్న 4-10 మీ. ఎత్తు వరకు పెరిగే వృక్షం. ప్రతి కణుపు నుండి 4-7 ఆకులు వస్తాయి. ఆకులు దాదాపు 9-12 x 2.5-3 సెం.మీ. పరిమాణంతో కోలగా ఉన్న దీర్ఘచతురస్రాకారంలో గాని, బళ్ళెం ఆకారంలో గాని ఉంటాయి. ఈనెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆకుల అడుగు భాగం పాలిపోయి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. గింజలు ఒంటరిగా లేదా జతగా ఉంటాయి.
సాధారణ నామం : డెవిల్స్ట్రీ, సప్తపర్ణి శాస్త్రీయ నామం : ఆల్స్టోనియా స్కాలారిస్ / ఆల్స్టోనియా బూనీ కుటుంబం: అపోసైనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పండ్లు మరియు చెట్టు బెరడుకు ఔషధగుణాలున్నాయి.
దీనిలో ఎఖిటమైన్, వినోటర్పిన్, గ్లూకోసైడ్, డిటేమిన్, ఎఖిటోనైన్, ఎఖిటైన్ అనే రసాయనాలు ఉంటాయి.
బాగా పండిన పండ్లు సిఫిలిస్, మూర్ఛ, పిచ్చి మొదలగు వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి.
బెరడు కషాయం జ్వరం, శ్వాసకోశవ్యాధులు, కుష్టు మరియు పుండ్లను నివారిస్తుంది.
వ్యవసాయరంగంలో
ఆల్స్టోనియా బూనీ ఆకు మరియు కొమ్మ ద్రావణం గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియా కలామిస్టిస్ పెరుగుదల నిరోధకంగా పనిచేస్తాయి.
ఏడాకుల పొన్న పెట్ ఈథర్ ద్రావణం షిగెల్లా బాయ్డీ, విబ్రియో పారాహెమోలైటికస్పై కొద్దిపాటి నిరోధక చర్యను ప్రదర్శించింది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణం విబ్రియో మిమికస్, విబ్రియో పారాహెమోలైటికస్లపై బలమైన నిరోధక చర్యను ప్రదర్శించింది. క్లోరోఫాం ద్రావణాలు విబ్రియో పారాహెమోలైటికస్ పెరుగుదలను బలంగా అరికట్టింది. ఎస్కెరిచియా కోలిపై కూడా నిరోధక చర్యను ప్రదర్శించాయి (బెల్లా, అతని అనుచరులు, 2017).
ఈ చెట్లు కాండం బెరడు ద్రావణం నత్త, లిమ్నేయియా అక్యూమినేటపై బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 2003).
ఈ మొక్క ద్రావణం దోమల లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (జిజి, అతని అనుచరులు, 2012).
ఏడాకుల పొన్న కాండం బెరడు పెట్రోలియం ద్రావణం లిమ్నేయీ అక్యూమినేట, ఇండోప్లానోర్బిస్ ఎక్ౙస్టస్ అను నత్తలపై అధిక విషప్రభావం చూపింది (చౌహాన్ అండ్ సింగ్, 2014).
ఏడాకుల పొన్న మిథనాల్, నీటి ద్రావణాలలో ఉన్న అత్యధిక ఫైటోకెమికల్ సముదాయాలు అత్యుత్తమ యాంటీబాక్టీరియల్ చర్యలను ప్రదర్శించాయి (షకీల్, అతని అనుచరులు, 2014).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
వండే పని లేకుండా అప్పటికప్పుడు సులభంగా చేసుకునే క్యారెట్ – పచ్చి కొబ్బరి ‘పచ్చి పచ్చడి’ తయారీ విధానం..
కావలసిన పదార్థములు: పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు క్యారెట్ ముక్కలు – ఒక కప్పు. కొత్తిమీర – అర కప్పు పచ్చిమిరపకాయలు – ఎనిమిది శుభ్రం చేసిన చింతపండు నిమ్మకాయంత! కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ. రుచికి సరిపడినంత ఉప్పు
తయారీ విధానం: క్యారెట్ దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకోవాలి.
ముందుగా – కొబ్బరి, క్యారెట్టు ముక్కలను కలిపి, కొంచెం దంచిన తర్వాత మిగిలిన పదార్థాలు వేసుకుని, రోటిలో గాని మిక్సీలో కానీ రుబ్బుకోవడమే! అంతే !!
పొయ్యి మీద పెట్టే పని లేకుండా, సింపుల్గా చేసుకునే క్యారెట్ – పచ్చికొబ్బరి పచ్చడి రెడీ!
వేడి వేడి అన్నంలోకే కాదు… కొన్ని టిఫిన్లలోకి కూడా రుచికరంగా ఉంటుంది.
రచన : శాంత కర్రి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి