తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

నేలను సారవంతం చేసే ‘మత్స్య సంజీవని’

మీనామృతం తయారుచేసి వడపోసేటప్పటికి అందులోని చేప ముక్కలు పూర్తిగా కరగకుండా కొంతమేరకు మిగిలే ఉంటాయి. అటువంటి చేప ముక్కలను పారేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. వీటిలోని ఉపయుక్త సూక్ష్మజీవులు (ఇండిజినెస్ మైక్రో ఆర్గానిజమ్స్ – ఐ.ఎం.ఓ.లు) లేదా మత్స్య సంజీవని నేలను సారవంతం చేస్తుంది. వేరు వ్యవస్థకు రక్షణగా ఉండి వేరుకుళ్లు, ఎండు తెగుళ్లు వంటి వాటి నుంచి వేర్లను కాపాడుతుంది. వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుంది. వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

మత్స్య సంజీవని తయారీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు (మీనామృతం తయారీలో మిగిలిన వాటితో పాటు తాజా చేప ముక్కలను కూడా వాడవచ్చు) – కిలో, నల్లబెల్లం – 500 గ్రాములు, దేశీ ఆవు నెయ్యి / వెన్న – 50 గ్రాములు, తాటికల్లు – 1 లీటరు, తేనె – 50 గ్రాములు, కాచి చల్లార్చిన నీరు – 5 లీటర్లు

మత్స్య సంజీవనిని తయారుచేసే పద్ధతి: ఒక మట్టి పాత్రలో 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి లేదా వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అందులో కిలో చేప ముక్కలను, అర కిలో బెల్లం ముక్కలను వేసి బాగా ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అడుగంటి మాడిపోకుండా తగినంత తాటికల్లు కలుపుతూ ఉండాలి. మరొక పాత్రలో 5 లీటర్ల మంచినీటిని మరిగించి చల్లారనివ్వాలి. ఒక మట్టికుండను తీసుకొని, అందులో కాచి చల్లార్చిన నీటిని, ఉడకబెట్టి చల్లార్చిన చేపముక్కలను వేయాలి. అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల తేనె కూడా పోసి ఒక శుభ్రమైన తడిలేని కర్రతో బాగా కలియబెట్టాలి. కుండపై మూత ఉంచి దళసరి గుడ్డను రెండు పొరలుగా తీసుకొని బిగించి కట్టాలి. ఈ కుండను ఎండ తగలని చల్లని ప్రదేశంలో నేలలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. 5Ð7 రోజుల తర్వాత కుండను వెలికి తీయాలి. కుండలో ఉపయుక్త సూక్ష్మజీవులు పూత పూసినట్టుగా, తెట్టులా తేలుతూ సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఊదా రంగులు కలగలసి ఉంటాయి.
మత్స్య సంజీవని వాడే పద్ధతి: వంద కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుకు ఒక లీటరు చొప్పున మత్స్య సంజీవనిని కలిపి మొక్క పాదుల్లో చల్లాలి. వేప పిండి, ఆముదం చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రీయ ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు. 120 మైక్రాన్ల మెష్‌తో వడపోసి ఎకరానికి విడతకు 10 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా అందించవచ్చు. వంద లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవనిని కలిపి మె°క్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.

Read More

ఔషధ మొక్క… దుంపరాష్ట్రకం

సాధారణ నామం : శ్నాప్ జింజర్/కార్డమం జింజల్ / ఇండియన్ జింజర్ / గులంగాల్ శాస్త్రీయ నామం : ఆల్పినియా కాల్కరేట / ఆల్పినియా గాలంగ కుటుంబం: ఆజింజిబెరేసి.

దుంపరాష్ట్రకం సుమారు 30-50 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పసుపు ఆకుల కంటే తక్కువ వెడల్పు గలిగి ఉంటాయి. బల్లెం ఆకారంలో సన్నగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. దుంపలలో సినియోల్, మిథైల్ సిన్నమేట్, కెంపెఫెరిన్ అనే రసాయనాలు ఉంటాయి.
  • దుంపలు చేదుగా, కారంగా ఉంటాయి. వీటిని వాతం, నొప్పులు, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తారు.
  • వీర్యపుష్టి, నడుములకు సత్తువ కలుగజేస్తుంది.
  • దుంప పొడి (13 గ్రా.)ని శ్వాసకోశసంబంధిత, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకుపయోగిస్తారు.
  • దుంపపొడి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • దుంపరాష్ట్రకం క్రూడ్ ఇథనాల్ ద్రావణం మరియు నీటిలో కరిగే కారకం నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (పర్వీన్, అతని అనుచరులు, 2016).
  • ఆల్పినియా గాలంగ ద్రావణం బీన్‌వీవిల్, మాత్‌పై యాంటిఫీడెంట్ చర్యను, నల్లిపై అకారిసైడల్ చర్యను ప్రదర్శించింది (రియాంటో అండ్ అఫాప, 1998; యమహర, 1998).
  • దుంపరాష్ట్రకం ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ వరి నిల్వధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై వికర్షక, విషచర్యలను ప్రదర్శించింది (పరనగమ, అతని అనుచరులు, 2004).
  • ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ ఆసియన్ సబ్‌టెర్రీనియన్ చెదలు, కోప్టోటెర్మస్ గెస్ట్రాయ్, కోప్టోటెర్మస్ కర్విగ్నాస్ పై యాంటీ ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (అబ్దుల్లా, అతని అనుచరులు, 2015).
  • ఆల్పినియా గాలంగ దుంపల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పెద్ద పురుగులపై స్పర్శ విషచర్య, ఫ్యూమిగెంట్ విష చర్యను ప్రదర్శించింది (వు, అతని అనుచరులు, 2014).
  • దుంపరాష్ట్రకం సహజ ఉత్పత్తులు ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియె, సూడోమోనాస్ ఈరోజినోసా, ఎంటరోబాక్టర్ ఈరోజినెస్, సాల్మొనెల్ల పారట్రెఫి, విబ్రియో కలరా, బాసిల్లస్ సబ్‌టైలిస్‌పై గణనీయమైన యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (రాబిన్‌సన్, అతని అనుచరులు, 2009).
  • ఆల్పినియా గాలంగ హెక్సేన్ క్రూడ్ ద్రావణం బ్రాక్టోసిరా డోర్సాలిస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (సుకిరన్, అతని అనుచరులు, 2010).
  • ఆల్పినియా గాలంగ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా మరియు నిల్వ దాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ (రియాంటో, అతని అనుచరులు, 1998) మరియు సైటోఫిలస్ జియామెయిస్, ట్రైబోలియం కాస్టానియం (సుతిసట్, అతని అనుచరులు, 2011) నివారణలో ఉపయోగపడుతుంది.
  • ఆల్పినియా గాలంగ గింజల ద్రావణాలు టైరోఫోగస్ ప్యూట్రెసింషియె, డెర్మటోఫాగాయిడెస్ టెరోనిస్సినస్ అనే నల్లులను చంపాయి (యమహర, 1998).
  • ఆల్పినియా గాలంగ ఇథనాల్ మరియు పెట్రోలియం ద్రావణాలు 95-100% చెదలను (ఒడొంటెటెర్మెస్) చంపాయి (సౌమ్య, ఆమె అనుచరులు, 2016).
  • దుంపరాష్ట్రకం ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని రసాయనం 1,8 సినియెల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై ఫ్యూమిగెంట్ చర్యను, ఫ్యూమిగెంట్ మరియు స్పర్శ విషచర్యను ప్రదర్శించాయి (అబెయ్‌విక్రమ, అతని అనుచరులు, 2006).
  • ఆల్పినియా గాలంగ దుంపద్రావణం డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, లార్వాలు మరియు అడ్ౙుకి బీన్ వీవిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ పై కీటకనాశక చర్య ప్రదర్శించింది (డండాంగ్, అతని అనుచరులు, 1998).
  • ఆల్పినియా కంక్లూగెర మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ మరియు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై స్పర్శ మరియు యాంటీఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది (సుత్తిసుట్, అతని అనుచరులు, 2011).
  • ఆల్పినియా గాలంగ దుంప హెక్సేన్ మరియు ఇథనాల్ ద్రావణాలు బాక్ట్రోసిరా డోర్సాలిస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టాయి (సుఖిరన్, అతని అనుచరులు, 2011).
  • ఆల్పినియా గాలంగ దుంప ద్రావణం క్యాబేజి మాత్, క్రోసిడోలోమియా పవోనాని సమర్ధవంతంగా అరికట్టింది (రస్సామి, అతని అనుచరులు, 2016).
  • ఆల్పినియా గాలంగ మిథనాల్ క్రూడ్‌ద్రావణం, క్లోరోపాం క్రూడ్ ద్రావణం కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్ శిలీంద్ర పెరుగుదలను అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (జానీ, అతని అనుచరులు, 2010).
  • ఆల్పినియా గాలంగ దుంప ద్రావణాలు ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, ఆప్సర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది (మిశ్రా అండ్ డుబె, 1990; జాన్సన్ అండ్ ఫెషర్, 1985; అమిర్, 1990). ఈ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, ఎస్కెరిచియా కోలి, లిబ్రియో కలరా, డిప్లొకోకస్ న్యుమోనియే, మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ పై యాంటి బాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (చోప్రా, అతని అనుచరులు, 1957, స్ౙాపియుద్దిన్, 1981). దీని గింజల ద్రావణం టైరోఫాగస్ ప్రూట్రిసెంటయే, డెర్మటోఫాగాయిడెస్ టెరోనిస్సినస్‌పై అకారిసైడల్ చర్యను ప్రదర్శించింది (యమహర, 1998).
  • ఆల్పినియా గాలంగ దుంపలపొడి పెసరగింజల నాశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ ఆశించకుండా రక్షించింది (అస్మానిజర్, అతని అను,రులు, 2016).
  • ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ కోకోపాడ్‌బోరర్, కొనొపొమార్ఫ క్రామరెల్లాని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (బకార్, అతని అనుచరులు, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

‘మీనామృతం’తో మునగకు రక్ష!

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు: తాజా చేప ముక్కలు: 1 కిలో; దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు; నల్ల బెల్లం : 1 కిలో; తాటికల్లు : 1 లీటరు; దేశీ ఆవు నెయ్యి : 50 గ్రాములు; తేనె : 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి
మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే…
మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

Read More

ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే మార్గాలు – నూతన సాంకేతికతలు

పాడి పరిశ్రమలో లాభాలు ఆర్జించాలంటే పశువుల పాల దిగుబడి ఎంత ముఖ్యమో, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం (Breeding Efficiency) కూడా అంతకంటే ముఖ్యం. “ఏడాదికి ఒక దూడ” (One Calf Per Year) అనే లక్ష్యాన్ని సాధించినప్పుడే పాడి రైతు ఆర్థికంగా స్థిరపడగలడు. అయితే, ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం, సకాలంలో ఎదను గుర్తించకపోవడం, మరియు వాతావరణ మార్పుల వల్ల పశువులలో పునరుత్పత్తి సమస్యలు (Reproductive problems) పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతలను (Latest Technologies) ఉపయోగించడం ఎంతో అవసరం.

సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రాథమికాంశాలు
పశువులలో సంతానోత్పత్తిని పెంచడానికి సాంకేతికతలను వాడే ముందు, కొన్ని ప్రాథమిక యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి.

  1. పౌష్టికాహార యాజమాన్యం (Nutritional Management)
    పశువుల పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి శక్తి, ప్రోటీన్లు మరియు ఖనిజ లవణాలు (Minerals) ఎంతో అవసరం.
    •ఖనిజ లవణాల మిశ్రమం (Mineral Mixture): ఆవులు, గేదెలకు రోజుకు 50-60 గ్రాముల నాణ్యమైన మినరల్ మిశ్రమాన్ని మేతలో కలపాలి. విటమిన్ ఎ, ఇ, మరియు కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు పశువులు సకాలంలో ఎదకు రావడానికి, గర్భం నిలవడానికి సహాయపడతాయి.
    •గ్రీన్ ఫోడర్ (పచ్చిమేత): పచ్చిమేతలో ఉండే ‘కెరోటిన్’ (Carotene) హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  2. ఎదను సకాలంలో గుర్తించడం (Heat Detection)
    ఎదను సరిగ్గా గుర్తించకపోవడం అనేది సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా గేదెల్లో మూగ ఎద (Silent Heat) ఎక్కువగా ఉంటుంది. ఇవి రాత్రి వేళల్లో ఎద లక్షణాలను చూపిస్తాయి.
    •సాంప్రదాయ పద్ధతి: రోజుకు కనీసం 3-4 సార్లు (ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో) పశువులను నిశితంగా గమనించాలి. యోని నుండి తీగలు వేయడం, తరచుగా అరుస్తూ ఉండటం, ఇతర పశువులపై ఎక్కడం వంటి లక్షణాల ద్వారా ఎదను గుర్తించవచ్చు.

సంతానోత్పత్తిలో విప్లవాత్మక నూతన సాంకేతికతలు (Latest Technologies)
ప్రస్తుతం పశుగ్రాస రంగాన్ని మరియు పశువైద్యాన్ని ఆధునిక సాంకేతికత పూర్తిగా మార్చేస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే కొన్ని ముఖ్యమైన టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి:

  1. ఐఓటి ఆధారిత సెన్సార్లు మరియు స్మార్ట్ కాలర్స్ (IoT Sensors & Smart Collars)
    రైతు ప్రతి నిమిషం పశువును గమనించడం సాధ్యం కాదు. దీనికోసం ఇప్పుడు స్మార్ట్ నెక్ కాలర్స్ (Smart Neck Collars) లేదా కాలి పట్టీలు (Pedometer) అందుబాటులోకి వచ్చాయి.
    •ఈ పరికరాలు పశువుల కదలికలను, శరీర ఉష్ణోగ్రతను మరియు అవి నెమరు వేసే సమయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి.
    •పశువు ఎదకు వచ్చినప్పుడు దాని శరీరంలో వచ్చే మార్పులను బట్టి, ఇది రైతు మొబైల్ ఫోన్‌కు “ఎద అలర్ట్” (Heat Alert) మెసేజ్ పంపుతుంది. దీనివల్ల మూగ ఎదను కూడా 100% ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.
  2. సెక్స్డ్ సార్టెడ్ వీర్యం (Sexed Sorted Semen Technology)
    ఈ సాంకేతికత పాడి పరిశ్రమలో ఒక పెద్ద విప్లవం. సాధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ (AI) చేస్తే పెయ్య దూడ లేదా మగ దూడ పుట్టే అవకాశం 50:50 ఉంటుంది.
    •కానీ ‘సెక్స్డ్ సెమెన్’ సాంకేతికత ద్వారా కేవలం ఆడ దూడలను పుట్టించే X-క్రోమోజోమ్ కలిగిన కణాలను మాత్రమే వేరు చేస్తారు.
    •దీనిని ఉపయోగించడం వల్ల 90% పైగా కేవలం పెయ్య దూడలు (Female Calves) మాత్రమే పుడతాయి. దీనివల్ల మగ దూడల సంఖ్య తగ్గి, పాడి రైతుకు మేలు జరుగుతుంది.
  3. ఐవిఎఫ్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (IVF & Embryo Transfer Technology – ETT)
    ఉత్తమ జాతి ఆవు లేదా గేదె నుండి ఎక్కువ దూడలను పెంపొందించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
    •ఒక అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవు నుండి అండాలను సేకరించి, ప్రయోగశాలలో ఫలదీకరణం (IVF) జరిపి పిండాలను (Embryos) తయారు చేస్తారు.
    •ఈ పిండాలను తక్కువ పాల దిగుబడి ఇచ్చే సాధారణ ఆవుల (Surrogate mothers) గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీనివల్ల ఒకే ఉత్తమ జాతి పశువు నుండి ఏడాదికి 10-15 గరిష్ట నాణ్యత గల దూడలను పొందవచ్చు.

4.హార్మోన్ల వినియోగం మరియు ముగింపు, స్థిర సమయ కృత్రిమ గర్భధారణ (Fixed Time AI – FTAI)
చాలా కాలం పాటు ఎదకు రాని పశువుల కోసం హార్మోన్ల చికిత్స (Synchronization Protocols) ఉపయోగపడుతుంది.
•ప్రొజెస్టెరాన్, జిఎన్ఆర్ హెచ్ (GnRH), పిజిఎఫ్2ఆల్ఫా (PGF2α) వంటి హార్మోన్లను నిర్ణీత రోజుల్లో పశువుకు ఇంజెక్ట్ చేయడం ద్వారా, అవి ఒకే సమయంలో ఎదకు వచ్చేలా చేస్తారు.
•దీనివల్ల ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా, నిర్ణీత సమయానికి (Fixed Time) కృత్రిమ గర్భధారణ చేసి పశువు గర్భం దాల్చేలా చేయవచ్చు.

  1. గర్భ నిర్ధారణ పరీక్షల్లో ఆధునికత (Early Pregnancy Diagnosis)
    సాధారణంగా పశువు గర్భం దాల్చిందో లేదో తెలియడానికి 3 నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు:
    •అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasonography): కృత్రిమ గర్భధారణ చేసిన 28 నుండి 30 రోజుల్లోనే గర్భాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
    •రక్త/పాల పరీక్షలు (PAG Testing): పశువుల రక్తం లేదా పాలలో ఉండే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ గ్లైకోప్రోటీన్స్ (PAG) ఆధారంగా 28 రోజుల్లోనే గర్భాన్ని గుర్తించే కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ పశువు కట్టకపోతే, వెంటనే దానికి మళ్లీ చికిత్స చేసి త్వరగా ఎదకు తీసుకురావచ్చు.

ముగింపు (Conclusion)
ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కేవలం ఒక పద్ధతిపై ఆధారపడి ఉండదు. సరైన సమతుల్య ఆహారం, మెరుగైన కొట్టాల యాజమాన్యంతో పాటు స్మార్ట్ కాలర్స్, సెక్స్డ్ సెమెన్, ఐవిఎఫ్ వంటి ఆధునిక సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం ద్వారా పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి, పొదుగు రోగాలు మరియు గర్భకోశ వ్యాధులు తగ్గి, పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుంది.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

ఔషధ మొక్క… మచ్చల కలబంద

సాధారణ నామం : స్పాటెడ్అలో శాస్త్రీయ నామం : అలో జెబ్రినా కుటుంబం: ఆస్ఫోడిలేసి

అలో జెబ్రినా చిన్న, దట్టమైన, నీటిని నిల్వ ఉంచుకునే భాగాలున్న ఆకులు కలిగిన మొక్క. ఈ మొక్కలు నీటిని కాండాలు, ఆకులు, వేర్లలో నిల్వ ఉంచుకుని వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఆకులు దట్టంగా గుబురుగా ఏర్పడి సాధారణంగా ఆకుపచ్చ రంగులో పెద్ద అండాకారపు తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకుల అంచులు బలమైన గోధుమ రంగు మొనలు గల ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకుల చివర్లు ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత ఎరుపు రంగులో గొట్టపు ఆకారంలో వుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • బోట్స్వానాలో దీనిని బుట్టల తయారీలో ఉపయోగిస్తారు.
  • అంగోలాలో కునీన్ నది పొడవునా ఉన్న ప్రజలు అలో జెబ్రినా పూలను ఉడికించి కేకులు తయారు చేస్తారు.
  • మహిళలు ప్రసవం తరువాత కాండం, ఆకు మొదళ్ళ పొడిని లోపలికి తీసుకుంటారు. దీని రసాన్ని గాయాలను మాన్పడానికి, చర్మ సమస్యలకు, నులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ప్రత్తి పంటలో నష్టాలు కలిగించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అలో జెబ్రినా 20% ద్రావణం వికర్షక, కాంటాక్ట్ చర్యలతో సమర్ధవంతంగా అరికట్టింది (రంగరిరాజ్, అతని అనుచరులు, 2016). ఆకు ద్రావణం తయారు చేయడానికి ఆకులను సేకరించి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్‌లో 5 రోజులు ఆరబెట్టాలి. తర్వాత ఆరిన ఆకులను రోటిలో వేసి బండతో దంచాలి. మెత్తగా దంచిన పొడిని 1000 మి.లీ. బీకర్లో వేయాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేయాలి. 400 గ్రా. పొడిని 3 లీ. గాజు ఫ్లాస్క్‌లో తీసుకుని 2 లీ. డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ ద్రావణాన్ని చేతిలో 1 గంట సేపు కుదుపుతూ, తర్వాత 24 గంటలుంచాలి. 24 గంటల తర్వాత ద్రావణాన్ని గుడ్డతో వడపోసి తర్వాత వాట్‌మన్ నెం. 24 ఫిల్టర్ పేపర్‌తో వడపోయాలి. ఈ ద్రావణాన్ని 2 లీ. కోనికల్ ఫ్లాస్క్‌లో సేకరించాలి. 20% ద్రావణం తయారు చేయడానికి 200 మి.లీ. స్టాకు ద్రావణాన్ని 800 మి.లీ. శుభ్రమైన నీటికి కలపాలి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More