వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

‘ఆయిల్‌ పామ్‌ రైతులకు సరైన ధర రావడంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక టెక్నాలజీతో ఎనిమిది ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతుల సమక్షంలో అక్కడ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేటు (ఓఈఆర్‌) ఎంత ఉందో తనిఖీ చేయిస్తాం. ఎక్కడ ఎక్కువ ఓఈఆర్‌ రేటు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుని ధర చెల్లించేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు అడ్‌హాక్‌గా రైతులందరికీ టన్నుకు రూ. 20,700లు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్‌కు మద్దతు ధర అంశంపై ఎమ్మెల్యే ఆర్‌.వి.ఎస్‌. కె.కె.రంగారావు ప్రశ్నించారు. పామాయిల్‌ పంటకు కనీస మద్దతు ధర పెంచే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని మంత్రి చెబుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మంచి ధర ఇస్తోందని అన్నారు. పెదవేగిలో పాత ఫ్యాక్టరీ ఉండటం వల్ల అక్కడ రేటు సరిగా గుర్తించకపోవడం వల్ల రైతులు ధర విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ‘ఈ ఆయిల్‌ పామ్‌కు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ ఇస్తోంది. అది రూ. 17,877గా ఉంది. ఇది స్థిరంగా ఉంటుంది. ఏపీలో టన్నుకు రూ.20,725 ఇస్తున్నాం. అందువల్ల రైతులు ఈ పథకం పరిధిలోకి వెళ్లవద్దని కోరడంతో మనం వెళ్లలేదు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా కేంద్ర పథకంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి వివరించారు.