పామాయిల్‌ ధర సమస్య పరిష్కరిస్తాం

వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

‘ఆయిల్‌ పామ్‌ రైతులకు సరైన ధర రావడంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక టెక్నాలజీతో ఎనిమిది ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతుల సమక్షంలో అక్కడ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేటు (ఓఈఆర్‌) ఎంత ఉందో తనిఖీ చేయిస్తాం. ఎక్కడ ఎక్కువ ఓఈఆర్‌ రేటు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుని ధర చెల్లించేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు అడ్‌హాక్‌గా రైతులందరికీ టన్నుకు రూ. 20,700లు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్‌కు మద్దతు ధర అంశంపై ఎమ్మెల్యే ఆర్‌.వి.ఎస్‌. కె.కె.రంగారావు ప్రశ్నించారు. పామాయిల్‌ పంటకు కనీస మద్దతు ధర పెంచే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని మంత్రి చెబుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మంచి ధర ఇస్తోందని అన్నారు. పెదవేగిలో పాత ఫ్యాక్టరీ ఉండటం వల్ల అక్కడ రేటు సరిగా గుర్తించకపోవడం వల్ల రైతులు ధర విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ‘ఈ ఆయిల్‌ పామ్‌కు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ ఇస్తోంది. అది రూ. 17,877గా ఉంది. ఇది స్థిరంగా ఉంటుంది. ఏపీలో టన్నుకు రూ.20,725 ఇస్తున్నాం. అందువల్ల రైతులు ఈ పథకం పరిధిలోకి వెళ్లవద్దని కోరడంతో మనం వెళ్లలేదు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా కేంద్ర పథకంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి వివరించారు.

Read More

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ కంపెనీల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలని, పురోగతి చూపించని కంపెనీలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు.
తీరుమార్చుకొని కంపెనీల అనుమతులు రద్దు చేసి, టిజి ఆయిల్‌ ఫెడ్‌కు కేటాయిస్తామని, వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ వారికి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేయాల్సిందే అని, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఆయిల్‌ పామ్‌ సాగుకు కొత్త రైతులు ముందుకు రావాలని మంత్రి అన్నారు.
పలు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తుమ్మల పామాయిల్‌ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని తెలియజేశారు. 
ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేశామని, అలాగే ప్రతి సంవత్సరం 40000 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగుచేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దానిని సాధించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు.  
2024-25 సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇప్పటివరకు 25,470 ఎకరాలలో ప్లాంటేషన్‌ పూర్తిచేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం కేటాయించిన లక్ష్యంలో  వాల్యూ ఆయిల్‌ కంపెనీ 36 %, పతాంజలి 33%, టిజి ఆయిల్‌ ఫెడ్‌ 31%, ఎకోపామ్‌ 28.5%, గోద్రెజ్‌ 26%, ప్రి యునిక్‌ 22%, మాట్రిక్స్‌ 21%, కె.ఎన్‌ బయో 19.72%, తిరుమల 16.4%, సువెన్‌ అగ్రో 16.2%, రాంచరణ్‌ 15.6%, లివ్‌ పామ్‌ 13%, విశ్వతేజ 11.5%, లోహియ 10.40 % ప్రగతిని సాధించాయని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 
ఆయిల్‌ పామ్‌ కంపెనీలు వారికి కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ తమ యొక్క ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఆయిల్‌ పామ్‌ కంపెనీ నర్సరీని కలిగిఉండాలని, లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన ఆయిల్‌ పామ్‌ మొక్కలు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, నర్సరీ స్థాయిలోనే జన్యుపరమైన సమస్యలు ఉన్న మొక్కలను తొలగించి, నాణ్యమైన మొక్కలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. అత్యధిక గెలల దిగుబడి మరియు నూనె శాతాన్ని ఇచ్చే వంగడాలను, గ్యానో డెర్మలాంటి వ్యాధులను తట్టుకొనే వంగడాలను, తక్కువ ఎత్తు పెరిగే పొట్టి రకాలకు సంబంధించిన నాణ్యమైన మొలకలను  తెప్పించుకొని నర్సరీలలో పెంచి రైతులకు సరఫరా చేయాలన్నారు. 
ఇదివరకే నాటిన తోటలలో మొదటినుంచే కాండంతడి తెగులు (గ్యానో డెర్మ) సోకకుండా, తెగుళ్ళ నివారణకు అవసరమైన సాంకేతికత శిక్షణను రైతులకు ఆయిల్‌ పామ్‌ కంపెనీలు అందించాలని ఆదేశించారు. 
రాష్ట్ర ప్రభుత్వ కృషి వలన ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెలల ధర టన్నుకు రూ. 19,144 కు పెరగడం జరిగిందని, ఈ సంవత్సర కాలంలోనే టన్నుకు పామ్‌ ఆయిల్‌ గెలల ధర రూ.6000 కు పైగా పెరిగిందని, త్వరలోనే టన్ను ధర రూ. 20,000 దాటే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. ఆయిల్‌ పామ్‌ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయిల్‌ పామ్‌ గెలల ధర కనీసం టన్నుకు 20,000 కు తగ్గకుండా ఉండేలా ధరల స్థరీకరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 
ఈ సమీక్షాసమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ భాషా, ఐ.ఎ.ఎస్‌, మరియు ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు. 

*వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ...*
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను విధిగా సందర్శించాలన్నారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారం తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
Read More