జిల్లేడు మొక్కలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అంతటా పొలాల్లోను, బీడు భూముల్లోను, రోడ్ల ప్రక్కనా కలుపు మొక్కలుగా పెరుగుతాయి. జిల్లేడు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఆకులు కణుపుకు రెండు చొప్పున అండాకారంలో ఉండి, తుంపితే పాలు కారతాయి. ఇవి కాడలు లేకుండా దళసరిగా ఉండి తెల్లని నూగుతో కప్పబడి ఉంటాయి. పువ్వులు తెల్లగాగానీ లేదా ఊదా రంగులో గానీ ఉండి కొమ్మల చివర గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు విడివిడిగాగానీ, జంటలుగాగానీ ఏర్పడతాయి. కాయలు ఒకవైపు నిలువుగా బ్రద్ధలై, విత్తనాలు గాలితోపాటు నెమ్మదిగా బయట పడతాయి. పూవులు, కాయలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఈ మొక్కలో “కెలోట్రాపిన”, “జైగాంటి యాల” వంటి అనేక ఆల్కలాయిడ్లు, రసాయనాలు ఉంటాయి.
సాధారణ నామం : మిల్క్వీడ్ శాస్త్రీయ నామం : కలోట్రాపిస్ జైగాంటియా కుటుంబం: ఆస్ల్కెపియడేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- జిల్లేడు మానవులు, పశువులు, పంటల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. పంటల్లో దిగుబడి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
- మానవులలో : విరేచనాలు, బోదకాలు, కుష్టు, గజ్జి, తామర, సిఫిలిస్, కీళ్ళనొప్పులు, న్యుమోనియా, పళ్ళనొప్పులు, దగ్గు, జలుబు, ఆస్త్మా, జ్వరం, పాముకాటు, కడుపులో నులిపురుగులు, అల్సర్లు, నరాల వ్యాధులు, చర్మవ్యాధులు, ఆస్త్మా, అబార్షన్ నివారణకుపయోగిస్తుంది.
- పశువులలో : ఎక్సిమా, వాపులు, చలిజ్వరం, కంట్లో పడిన నలకలను, పరాన్నజీవులను, వ్రణాలనూ, బోదకాలు, కుష్టు, మొండిఎక్ౙిమా, డయేరియా, డీసెంట్రీలను నివారిస్తుంది.
వ్యవసాయరంగంలో …
- పంటలకు ఎరువుగా, పురుగులు, తెగుళ్ళ నివారణలో ఉపయోగపడుతుంది.
అ) ఎరువుగా : జిల్లేడు ఆకులను, చిన్న చిన్న లేత మొక్కలను పచ్చి ఆకుఎరువుగా వినియోగించుకోవచ్చు. ఎకరానికి సుమారు 100 కి. జిల్లేడు రొట్ట అవసరమౌతుంది. కానుగ, గ్లెåరిసిడియా, తంగేడు, వేప వంటి మొక్కల పచ్చి ఆకులతో కలిపి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. జిల్లేడు ఆకులలో 2 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 0.3 శాతం పొటాష్ ఉంటాయి. పచ్చి ఆకుల ఎరువు వేయడం వలన భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది పోషకాలు మొక్కలకందుబాటులోకి వస్తాయి.
ఆ) పురుగు నివారణలో…
- చెరకు ముచ్చెలను 15%, 20% జిల్లేడు ఆకు కషాయ ద్రావణంలో ముంచి లేదా ముచ్చెలను నాటే ముందు జిల్లేడు ఆకులను 24 నుండి 48 గంటలు నీటిలో నానబెట్టి, వడకట్టిన ద్రావణాన్ని భూమిలో చల్లడం ద్వారా పాండిచ్చేరి, ఒరిస్సా, గుజరాత్ రైతులు చెరకు పంటలో చెదలను నివారిస్తున్నారు.
- 8 -10 కి. జిల్లేడు ఆకులను 24 గంటలు నీటిలో నానబెట్టి, మరగబెట్టి, వడపోసి చెదలు ఆశించిన భూమిలో చల్లి నివారించవచ్చు.
- గుజరాత్ రైతులు 50 జిల్లేడు కొమ్మలను ఆకులతో సహా వరి చేలల్లో 14.6 మీ. దూరంలో ఉంచి పేనుబంకని నివారించగలిగారు. కొమ్మలను పేనుబంక ఆశించే కాలంలో 3 సార్లు మార్చారు.
- కర్ణాటక రైతులు జిల్లేడు మొక్కలను నూరి కషాయాన్ని సాగు నీటి ద్వారా పారించి వరిలో కాండం, వేరు తొలుచు పురుగులను నివారించారు.
- గుజరాత్లోని భావనగర్ రైతులు 1 పాలు జిల్లేడు పాలను 15 పాళ్ళు నీటిలో కలిపి ప్రత్తి పంటపై పిచికారి చేసి గొంగళిపురుగులను 3 రోజుల్లో నివారించగలిగారు.
- తెలంగాణ రాష్ట్రంలో మెదక్, నల్గొండ రైతులు వేరుశనగ పొలంలో సరిహద్దుల్లో జిల్లేడు కొమ్మలను ఉంచి ఎర్రగొంగళిపురుగులను నివారించగలిగారు. ఆముదం, నువ్వులు, వేరుశనగ పొలాల్లో జిల్లేడు కొమ్మలను ఎరగావేసి ఎర్రగొంగళి పురుగును నివారించారు. దీపపు ఎరలు, ఫెరమోన్ ఎరలకన్నా ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.
- గుజరాత్లోని సబర్కంతా ప్రాంతంలో అల్లం పంటలో పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ జిల్లేడు మొక్కలను నాటుతారు.
- వేరుశనగలో జిల్లేడు ఆకు ద్రావణాన్ని (1 శాతం) వేరుశనగ మొలకెత్తిన 40 రోజులలో పిచికారి చేసి మొవ్వుకుళ్ళు తెగులుని తగ్గించగలిగారు.
- ఎండాకాలంలో బత్తాయి, నిమ్మ, జామ, ఉసిరి, మామిడి చెట్ల మొదళ్ళపై చెదలు కనిపించగానే మట్టినంతా దులిపేసి మొక్క మొదలుచుట్టూ 25 కి. జిల్లేడు ఆకులు పరచి మట్టిలో బాగా కలిసిపోయేలా తిరగత్రవ్వాలి. సంవత్సరకాలంలో 34 సార్లు ఇలా చేయాలి.
- వేరుశనగ పంటలో ఎర్రగొంగళి పురుగు నివారణకు పొలం చుట్టూ లోతైన మడక చాలుని ఏర్పాటు చేసి అందులో జిల్లేడు ఆకులను పరచి, వాటికి ఆశించిన పురుగులను చంపివేయాలి.
- పంటలపై వచ్చే పురుగుల నివారణకుపయోగించే వివిధ ఆకుల కషాయం (కీటకనాశిని) తయారీలో జిల్లేడు ఆకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
వివిధ ఆకుల కషాయం తయారు చేసే పద్ధతి
కావలసిన పదార్థాలు
- పశువులు, గొర్రెలు తినని ఆకులు (వావిలి, అడ్డసరం ఆకులు) : 3 కి.
- పాలుకారే ఆకులు (జిల్లేడు, గన్నేరు, మేడి) : 3 కి.
- చెడు వాసన నిచ్చే ఆకులు (రబ్బరు ఆకు, తూటికూడ ఆకు, లాంటానా) : 3కి.
- చేదుగా ఉండే చెట్లకాయలు (వేప, ముష్టి, కానుగ) 5 కి.
- ఆవుపేడ మరియు నీరు: పేడ 15 కి, నీరు 45 లీ.
- గోమూత్రం : 15 లీ.
- ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టికుండలో తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం :
- ముందుగా 15కి., ఆవుపేడను 45 లీ. నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ, మట్టికుండలోగానీ పోసి మూత పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు కర్రతో కలుపుతూ 4 రోజులు మురగబెట్టాలి. 5వ రోజున పైన పేర్కొన్న ఆకులు, కాయలు తెచ్చి ముందుగా కాయలు మెత్తగా కొట్టి ఆవుపేడ, నీరు మిశ్రమంలో పోయాలి. ఆ తర్వాత ఆకులను మెత్తగా నూరి డ్రమ్ములో వేసి 15 లీ. గోమూత్రం అందులో పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఆపైన డ్రమ్ము/కుండపై మూత బెట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బాగా కలియబెట్టాలి. మొదటి రోజు ఆకులు పైకి తేలతాయి. ఒక మోస్తరుగా ఆకులన్నీ మాగిన తర్వాత 5వ రోజు నుండి ఆకులన్నీ ద్రావణం క్రిందకు జారతాయి. ఈ విధంగా 10 నుండి 15 రోజులు ఉంచిన ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడపోసి ఉంచుకోవాలి. ఈ ద్రావణాన్ని అన్ని పంటల్లో వాడవచ్చు.
మోతాదు : ఒక లీటరు ద్రావణం 10 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు 100 లీటర్లు పిచికారి చేయాలి.
వరిలో కాండంతొలిచే పురుగు లేదా తెల్ల కంకి నివారణ
- ఈ పురుగు నివారణకు రైతులు ఎకరాకు 100 కి. జిల్లేడు ఆకులు, లేత కొమ్మలను వరిపొలంలో 30-45 రోజుల మధ్య సమంగా వేసి నీటిని పొలం నుండి తీయకుండా సుమారు 5 రోజులు ఉంచుతారు. పొలంలో వేసిన జిల్లేడు ఆకులు క్రమంగా మాగి తర్వాత కుళ్ళుతాయి. జిల్లేడు ఆకులోని ఆల్కలాయిడ్స్ వల్ల కాండంతొలిచే పురుగు ఉత్పత్తి తగ్గుతుంది. జిల్లేడు ఆకులు ఉపయోగించిన రైతు పొలంలో తెల్లకంకి బెడద చాలా తక్కువగా ఉంది. 5 రోజుల తర్వాత పొలంలో నీరు తీసివేసి మరల 23 సెం.మీ. లోతు మించకుండా నీరు కట్టాలి (రైతుల అనుభవం).
తెగుళ్ళ నివారణలో…
- జిల్లేడు ఆకులకు శిలీంద్రనాశిని గుణాలు కూడా వున్నాయని పరిశోధనలలో తేలింది. అనేక దేశాలలో మామిడితోటల సాగులో విపరీత నష్టాన్ని కలిగిస్తున్న ఫ్యుజేరియం మాంగిఫెరే అనే తెగులు కారక శిలీంద్రం జీవనియంత్రణలో ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకుల కషాయం భూమిలో నివసించి పం\ల్లో తెగుళ్ళను కలిగించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం సొలాని, రైజోక్టోనియా ఒరైజేసెటైవే శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది. (మండేపూడి డేవిడ్ మరియు అతని అనుచరులు, 2013). కాని ఈ శిలీంద్రాల పెరుగుదలనరికట్టే ట్రైకోడెర్మా విరిడె అనే జీవనియంత్రణకారక శిలీంద్రం పెరుగుదలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అందువలనే జిల్లేడు ఆకులను పచ్చి ఆకు ఎరువుగా నారుమళ్ళలో నారు మొక్కలను పెంచడానికి, కొబ్బరి తోటల్లో ఎరువుగా వాడుచున్నారు.
పంటల దిగుబడి పెరగడానికి…
- పోక, కొబ్బరి తోటల్లో దిగుబడులు పెంచడానికి కొన్ని గ్రామాల్లో రైతులు చెట్ల మొదళ్ళు చుట్టూ మట్టిని త్రవ్వి 25-45 కి. జిల్లేడు ఆకుల ముక్కలను వలయాకారంలో భూమిలో పాతిపెడతారు.
- వర్షాకాలంలో పోకచెట్టు లేదా కొబ్బరి చెట్లకు సహజంగా పాలు లేదా జిగురు కారే మొక్కల ఆకులను పచ్చి ఆకు ఎరువుగా వేస్తే దిగుబడులు పెరుగుతాయని రైతుల నమ్మకం.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.