పొగాకు ‘ధర’ కిలోకు రూ.418

వర్జీనియా పొగాకు ధరలు నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. గురువారం అమ్మకాలు ముగిసే సమయానికి కిలో ధర రూ.395కు చేరింది. శుక్రవారం వేలంలో రూ. 23 పెరిగి రూ.418తో రికార్డు ధర లభ్యమైంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెండో వేలం కేంద్రం, కొయ్యలగూడెం కేంద్రాల్లో శుక్రవారం జరిగిన వేలంలో కిలోకు రూ.418 ధర నమోదైంది. ఈ పొగాకు ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. గత సీజన్‌లో కిలోకు రూ.411తో మార్కెట్‌ ముగిసింది. మేలు రకం పొగాకుకు మంచి ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి ఎన్‌ఎల్‌ఎస్‌లోని ఐదు వేలం కేంద్రాల్లో 58.25 మిలియన్‌ కిలోల కొనుగోళ్లు జరిగాయి.

Read More

వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థకు పూర్వ వైభవం తేవాలి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థ ప్రస్తుత పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించి సంస్థకు పూర్వవైభవం తెస్తామని వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మలక్ పేటలోని ఆ సంస్థను తమ సభ్యులతో కలిసి సందర్శించారు.

Read More

భవిష్యత్‌ అంతా ఉద్యానపంటలదే – మంత్రి తుమ్మల

కొండా లక్ష్మణ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్‌ హాలును ఈ రోజు తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్‌ యూనివర్సిటీని తెలంగాణాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయరంగానికే అత్యంత ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే. గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదు. రైతు శ్రమ ఆగలేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది. హార్టికల్చర్‌ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనీ, విద్యార్థులు ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కన్నా, మీకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు మొత్తం కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పొలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని, రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలని తెలిపారు. హార్టికల్చర్‌ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్‌ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాలలో ఉన్న పామాయిల్‌ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరించినట్లయితే, డిమాండ్‌ను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం జరుగుతుందని, ఆయిల్‌ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోఉందని, రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామాయిల్‌ పంటను 10 లక్షల ఎకరాలకు విస్తరించడానికి ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు అంతా హార్టికల్చర్‌దే అని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యానపంటలు ఒక గ్రోత్‌ ఇంజన్‌గా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హార్టికల్చర్‌ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్‌ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌ రాజిరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్‌ రావు, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More

విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోండి

ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి, విత్తన కంపెనీలు నేరుగా పత్తి విత్తనోత్పత్తి రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో రైతులకు విడుదల చేయాలని, జాప్యం చేస్తే లైసెన్స్‌ల రద్దుకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల సమస్యపై సోమవారం సచివాలయంలో పర్యాటక, ఆబ్కారీశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ… ”50 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తితో దేశంలోనే గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పత్తి సాగు చేసినవారికి నిధులు వెను వెంటనే ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తన కంపెనీలు ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని వెనువెంటనే బిల్లులు చెల్లించాలి” అని సూచించారు.

Read More

వ్యవసాయ రంగ అభివృద్ధిలో నాబార్డ్‌ కీలక పాత్ర పోషించింది : మంత్రి తుమ్మల

నాబార్డ్‌’ వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, గ్రామీణ అభివృద్ధికి నాబార్డ్‌ చేసిన సేవలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) 44వ వార్షిక స్థాపన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, రైతులకు రుణాల రూపంలో అందిస్తున్న సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్‌ సంయుక్తంగా పనిచేసి మరిన్ని గ్రామీణ అభివృద్ధి పథకాల అమలుకు కృషి చేద్దామని మంత్రి కోరారు.

Read More

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల

  • దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్‌ స్టాప్‌ సెంటర్‌’గా మారాలి
  • ఎఫ్‌.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి
  • ఎన్‌.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్‌.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్‌.సి.డి.సి. మరియు కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్‌డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్‌ మెంట్‌ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్‌.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్‌.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్‌.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్‌ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్‌.సి.డి.సి. రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్‌ రవీందర్‌ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read More

తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

కేంద్ర పథకం కింద ఏర్పాటు

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌-ఎఫ్పీవో)ల ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా 10వేల సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తెలంగాణకు 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు, పెట్టుబడి రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, పంట ఉత్పత్తులశుద్ది, గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెట్‌ అనుసంధానానికి ప్రస్తుతం దేశంలోని ఎఫ్పీవోలు కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎఫ్‌పీవోలో ఇలా..: కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలలో కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. రూ.2 వేలు వాటాధనం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతులు ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్‌ కింద కేంద్రం రూ.15 లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్లు గ్రాంటు ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ రూ.1500 కోట్లు కేటాయించారు. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85 శాతం వరకు పూచీకత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)నే ఎఫ్‌పీవోలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థంగా నడుస్తున్న పీఏసీఎస్‌లను ఎంపిక చేయాలని సహకార యూనియన్‌ను ఆదేశించింది.

Read More

కంద.. చేమ.. క్యారెట్‌..!

దుంపల సాగు విస్తీర్ణం పెంపుపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి
నష్టాల నుంచి రైతులను గట్టెక్కించాలని నిర్ణయం

అకాల వర్షాలు, వరదలతో పంటలను కోల్పోతున్న రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తూ ప్రజలకు పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దుంపల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. రైతులను కంద, చేమ, బంగాళాదుంప, క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, కర్రపెండలం వంటి పంటల సాగువైపు మళ్లించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన, కురుస్తున్న అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు, మామిడి, నిమ్మ తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాల నివారణకు ప్రత్యామ్నాయాలను సూచించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వారి సూచనలతో ఎక్కువగా దుంప పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న దుంప పంటలు 3,700 ఎకరాల మేరకే సాగవుతున్నాయి. అత్యధికంగా 2,200 ఎకరాల్లో కందగడ్డ (మొరంగడ్డ/ చిలగడదుంప) సాగవుతోంది. బంగాళాదుంప వినియోగం ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్రంలో ఆ పంట కేవలం 452 ఎకరాల్లోనే సాగు అవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 6 లక్షల టన్నుల మేరకు దుంపల వినియోగం ఉంటుండగా.. ఇక్కడ తక్కువగా సాగు అవుతుండటంతో వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న ఖరీఫ్‌లో రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల మేరకు దుంప పంటలను సాగుచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తక్కువ నీరు.. ఎక్కువ నిల్వ: అకాల వర్షాలు, వరదలతో ఇతర పంటలు దెబ్బతింటున్నా.. దుంపలకు ఎలాంటి నష్టం కలగదని అధ్యయనాల్లో తేలింది. కోతకు వచ్చిన తర్వాత ఇతర పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దుంప పంటలను మాత్రం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే అవకాశముంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దుంపల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read More