నవంబరు 1 నుండి ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ 20.01 శాతం

తెలంగాణాలో ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అంగీకరించకపోయినా అధికారులు, రైతు సంఘ ప్రతినిధులు పట్టుబట్టడంతో ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌- నూనె దిగుమతి శాతం) 20.01 శాతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెలల నుంచి వచ్చే నూనె దిగుమతిపై 20.01 శాతం, గింజల బరువుపై 10.08 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్‌ యాస్మిన్‌ బాషా, సంయుక్త సంచాలకులు సరోజ, ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, రైతు సంఘ ప్రతినిధులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, మహేశ్‌, బండి భాస్కర్‌, ప్రభాకరవర్మ, జ్యోత్స్న పలువురు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గెలలు, గింజలపై నుంచే కాక.. కెర్నల్‌ ఆయిల్‌పై కూడా రైతులకు వాటా చెల్లించాలని రైతు సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. నూతన ఓఈఆర్‌ 20.01 శాతం 2025 నవంబరు 1 నుంచి.. 2026 అక్టోబరు 31 క వరకు అమలులో ఉంటుందని, ఈ రేటు దేశంలోనే అత్యధికమని టీజీ ఆయిల్‌ ఫెడ్‌ జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

తెలంగాణా నుంచి పెరగనున్న బియ్యం ఎగుమతులు పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

బియ్యం ఎగుమతులను తెలంగాణ నుంచి విదేశాలకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పౌరసరఫరాల శాఖలు తెలంగాణ బియ్యం స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. దీనిని రవీంద్ర ప్రారంభించారు. ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 118, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యాన్ని ఈ స్టాల్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఫిలిప్పీన్సుకు ఎగుమతి చేస్తున్నామని, త్వరలోనే ఆఫ్రికా తదితర దేశాలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవీంద్ర చెప్పారు. కువైట్‌ తదితర దేశాల ప్రతినిధులు, ఇండియన్‌ రైస్‌ ఎక్స్పోర్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యకక్షుడు ప్రేమ్‌ గార్గ్‌ స్టాల్‌ను సందర్శించారు.

Read More

‘తెలంగాణ రైస్‌’ ఎగుమతులు పెరగాలి

బియ్యం ఎగుమతుల నిపుణుడు, వరల్డ్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ పురస్కార గ్రహీత సమరేందు మహంతి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌లో మంగళవారం బియ్యం ఎగుమతులపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 2014-2024 మధ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పటికే ‘తెలంగాణ రైస్‌’ అనే బ్రాండ్‌ పేరుతో ఇక్కడి బియ్యం ఫిలిప్పైన్స్‌కి ఎగుమతి అవుతున్నాయి. దాన్ని మరింత పెంచాలి’ అని సూచించారు. దీనికై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, పౌరసరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్‌ కొండిబ, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

ధాన్యం తడిస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే బాధ్యత

తెలంగాణాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్‌ మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు, నిర్వహణ, రవాణా, లెక్కల నమోదులో అనుసరించాల్సిన నియమ నిబంధనల్ని స్పష్టం చేస్తూ జిల్లాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి.
కౌలు రైతులు తాము సాగుచేసిన భూమి వివరాల్ని ముందుగానే వ్యవసాయశాఖ ఓపీఎంఎస్‌ లాగిన్‌లో కౌలు రైతు కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశంలో రవాణాకు అనుకూలంగా ఉండాలి. సెంటర్లో ధాన్యం తడిస్తే నిర్వాహకులదే పూర్తి బాధ్యత.
సన్న ధాన్యం నింపే బస్తాలను గుర్తించేందుకు వీలుగా ఎర్రదారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను ఆకుపచ్చ దారంతో కుట్టాలి. సన్నధాన్యం బస్తాలపై ‘ఎస్‌’ అనే అక్షరం రాయాలి.
రైతులు మద్దతు ధర పొందాలంటే తేమ 17% మించొద్దు. చెత్త, తాలు 1%, మట్టిపెళ్లలు, రాళ్లు 1%, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం 5%, పూర్తిగా తయారుకాని ధాన్యం 3% దాటొద్దు.
ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లుకు పంపించాలి. ధాన్యం రవాణా చేసే ముందే ఓపీఎంఎస్‌ లో వివరాల్ని పీపీసీ సెంటర్‌ నిర్వాహకులు నమోదుచేయాలి.

  • దళారులు ధాన్యంకొంటే కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలుంటాయి.
Read More

డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పురుగుల మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గే విధంగా 'ఏఐ' సాంకేతికతను వినియోగించాలి
  • తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్‌ లా కాకూడదు
  • నాణ్యమైన ఉత్పత్తులు తీసే విధంగా తెలంగాణ వ్యవసాయ విధానములో సమూలంగా మార్పులు తెచ్చే దిశలో యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • శాటిలైట్‌ డేటాతో నేలలో పోషకాల లభ్యతను పరీక్షించే సాంకేతికతను వివరించిన జర్మనీ ప్రతినిధులు
  • నేడు సెక్రటేరియట్‌లో ACRAT ప్రతినిధులతో సమావేశమై చర్చించిన మంత్రి తుమ్మల డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి తేవాలని, పర్యావరణానికి మేలు చేసే స్మార్ట్‌ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయంలో జర్మనీకి చెందిన ACRAT ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ”డిజిటల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ రోడ్‌మ్యాప్‌” పత్రాన్ని మంత్రివర్యులకు అందజేశారు.
    మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ.. AI, IoT ఆధారిత డిజిటల్‌ వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి. పంజాబ్‌లా మరో క్యాన్సర్‌ బెల్ట్‌గా తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడే, రైతు ఆదాయాన్ని పెంచే, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం మన లక్ష్యం కావాలి” అన్నారు. జర్మనీ – భారత్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ITU ప్రమాణిత డిజిటల్‌ వ్యవసాయ యూజ్‌కేస్‌ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్‌, మరియు సెన్సర్‌ ఆధారిత ఈ మోడల్‌ ద్వారా నేలలోని N,P,K మరియు సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసు చేస్తున్నామని, AI ఆధారిత పంట గుర్తింపు మోడల్‌, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్‌ వ్యవసాయ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించి, రైతులు, పరిశోధకులు మరియు విద్యార్థులు, అందరూ ఉపయోగించుకోగల వేదికగా అభివృద్ధి చేయాలని మంత్రి గారు సూచించారు. ”ఈ సాంకేతికత రైతుల వ్యయాన్ని తగ్గించేలా, నేల ఆరోగ్యాన్ని కాపాడేలా మరియు పంట నాణ్యతను పెంచేలా ఉండాలన్నారు. ”రైతు ఆలోచన దిశగా వ్యవసాయ విధానాలు రూపకల్పన చేస్తేనే స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డా. గోపి డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ, డా రఘు చాలిగంటి (ITU-T SG20), డా. సెబాస్టియన్‌ బోసె (ఫ్రాన్హోఫర్‌ హెచెచ్‌ఐ), శ్రీ యాన్‌-క్రిస్టియన్‌ రెడ్‌లిచ్‌ (బాండ్‌ కన్సల్టింగ్‌ GmbH), ప్రొఫెసర్‌ జానయ్య గారు (వైస్‌ ఛాన్సలర్‌, పీజేటీఎస్‌ఏయూ), మరియు రమేశ్‌ రెడ్డి (చైర్మన్‌, పర్యాటక శాఖ) పాల్గొన్నారు.
Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ

  • దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం
  • ఫ్యాక్టరీలో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణ
  • ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
  • త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల

నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్‌ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్‌ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.

Read More

4 వేల మంది సాగుదారులకు కొత్తగా భూపట్టాలు

నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలివ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, పీసీసీఎఫ్‌ సి. సువర్ణ, నల్గొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”భూభారతి పైలట్‌ ప్రాజెక్టులో తిరుమలగిరి (సాగర్‌) మండలంలో 23 వేల ఎకరాల్లో సర్వే చేపట్టాం. 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించాం. దీనిలో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. 4 వేల ఎకరాలకు పాసుపుస్తకాలు ఉన్నాయి. మిగిలిన 4 వేల ఎకరాలకు కొత్తగా పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. 3,069 మంది పేరుతో 2,936 ఎకరాలకు బోగస్‌ పాసుపుస్తకాలు ఉన్నట్లు గుర్తించి రద్దు చేశాం. వీటికి రైతుభరోసా, రైతు బీమా కూడా రద్దు చేశాం. 7 వేల ఎకరాల అటవీ భూమి గుర్తించాం. పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ, అటవీ శాఖలు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి” అని మంత్రి ఆదేశించారు.

Read More